14, డిసెంబర్ 2008, ఆదివారం

అసలు నేరస్తులు

28 కామెంట్‌లు
వరంగల్లు విషాదంలో రెండు సంఘటనలున్నాయి: ఒకటి యాసిడు పోసిన ఘటన, అందుకు దారితీసిన పరిస్థితులు, రెండోది పోలీసులు చేసిన ఎన్‌కౌంటరు.

6, డిసెంబర్ 2008, శనివారం

మన భద్రతే మనకు ముఖ్యం

73 కామెంట్‌లు
దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు.

29, నవంబర్ 2008, శనివారం

ప్రధానికో లేఖ

63 కామెంట్‌లు
కంథమాల్లో జరిగినదాని గురించి తలెత్తుకోలేకపోతున్నామని, బయటి దేశాల్లో పరువు పోయిందని, ఫ్రాన్సు అధ్యక్షుడో మరొహడో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయానని వాపోయిన ప్రధానమంత్రి గారూ..

27, నవంబర్ 2008, గురువారం

దిగులుగా ఉంది

24 కామెంట్‌లు
మనం రోడ్డు మీద వెళుతూంటేనో, రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో, ఏ కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో, ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు.

16, నవంబర్ 2008, ఆదివారం

రండి, రండి! Welcome

14 కామెంట్‌లు
Can't see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer... you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, ఈ బ్లాగుపై ఆంధ్రజ్యోతి సమీక్ష చదివి ఇక్కడికి వచ్చినవారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

14, నవంబర్ 2008, శుక్రవారం

వంశ గర్జన

33 కామెంట్‌లు
యువగర్జన అంటూ తెదేపా మంచి హడావుడే చేసింది. బహిరంగ సభలకు, రోడ్డు షోలకు జనం రావడమే బలానికి కొలబద్దైతే తమ బలాన్ని బహు చక్కగా ప్రదర్శన చేసింది. ఇతర పార్టీల్లో తమ పట్ల విశ్వాసాన్ని, తమ శక్తియుక్తుల పట్ల గౌరవాన్నీ కలిగించేలా బలనిరూపణ చేసుకుంది. అయితే, ఆ వేదిక మీద బాలకృష్ణ చెప్పిందేమిటి?

1, నవంబర్ 2008, శనివారం

ఇడుపులపాయ ఎస్టేటు - ఆంధ్రప్రదేశ్ ఎస్టేటు

10 కామెంట్‌లు
ఈ రెండూ శివదేవుడివే!

ఇడుపులపాయలో ఆసామికి తెలవకుండా ఒక్ఖ మొక్కజొన్న కండెను కాపలావాడు తెంపుకెళ్ళగలడా? నాలుగు మామిడికాయలను కోసుకెళ్ళి ఆవకాయ పెట్టుకోగలడా? ఆ సంగతి ఆసామికి తెలిస్తే వాడి కథేమవుతుంది? "అయ్యా ఫలానా మునిరత్నం దొంగతనంగా మామిడికాయలు కోసుకెళ్ళాడు" అని మరో వెంకటప్ప ఆరోపిస్తే ఏం జరుగుతుంది? పంచాయితీ జరుగుతుంది నిజమేమిటో తేలుతుంది. దొంగ అని తేలితే మునిరత్నం, ఆరోపణ తప్పని తేలితే వెంకటప్పల సంగతి తేలిపోతుంది. వాళ్ళిక పని చాలించి ఎస్టేటు బయటికి నడవాల్సిందే!

25, అక్టోబర్ 2008, శనివారం

ఇక వోటరు నమోదు కొన్ని నొక్కుల్లో

5 కామెంట్‌లు

ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.

22, అక్టోబర్ 2008, బుధవారం

ప్రయాణం మొదలైంది - చంద్రయాన్-1 (Chandrayaan-1)

15 కామెంట్‌లు
చంద్రయాన్ (Chandrayan) ప్రయాణం మొదలైంది, విజయవంతంగా మొదలైంది. మన గుండెలు ఉప్పొంగిస్తూ, మన కళ్ళలో ఆనంద బాష్పాలు తెప్పిస్తూ, మనపై మనకున్న నమ్మకాన్ని మరో కక్ష్యను దాటిస్తూ ఇస్రో పీయెస్సెల్వీని, దాంతోటి చంద్రయాన్‌ను ప్రయోగించింది.

11, అక్టోబర్ 2008, శనివారం

కంధమాల్ కథేమిటి?

18 కామెంట్‌లు
ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. "రెండేళ్ళ కిందట మీ పారిస్‌లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?" అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్‌లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, "ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి" అని చెప్పుండాల్సింది. కనీసం "అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే" అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?

అసలు కంధమాల్‌లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...

9, అక్టోబర్ 2008, గురువారం

దూడగడ్డి యాత్రలు

14 కామెంట్‌లు
తాడిచెట్టెందుకెక్కావురా అంటే....దూడగడ్డి కోసమన్నాడని సామెత. ఈ మధ్య కొందరు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త, దేశ వ్యాప్త యాత్రలు చూస్తుంటే ఈ సామెత గుర్తుకు రాకమానదు.కొండొకచో ప్రపంచయాత్రలు కూడా చేస్తూంటారు.

3, అక్టోబర్ 2008, శుక్రవారం

రక్తపాత రహిత కుట్ర !

60 కామెంట్‌లు
ఈ జాబుకు ప్రేరణ నాగప్రసాదు రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే జాబు. నిజానికి ఈ జాబు అంతా అక్కడే వ్యాఖ్యగా రాయాల్సింది.. పెద్దదై పోయింది, పైగా కాస్త అసందర్భం అవుతుందేమోనన్న శంక.. అంచేత ఇదిగో ఇక్కడ..

27, సెప్టెంబర్ 2008, శనివారం

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాల ప్రయోగాత్మక ఏర్పాటు

6 కామెంట్‌లు
పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాలనేర్పాటు చెయ్యాలనే విషయమై లోక్‌సత్తా ఎప్పటినుండో అడుగుతోంది కదా... దీనిమీద ఈమెయిలు గోల కూడా చేసాం. ఈమధ్య జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రధాన కమిషనరుతో జరిపిన చర్చల తరవాత దీన్ని ప్రయోగాత్మకంగా హై. లో అమలు చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. 

22, సెప్టెంబర్ 2008, సోమవారం

వోటరు నమోదు కేంద్రాలను పోస్టాఫీసుల్లో ఏర్పాటు చెయ్యండి!

13 కామెంట్‌లు
మీకు వోటు హక్కుందా? ఉండే ఉంటుంది. మరి, వోటరుగా నమోదయ్యారా? అయ్యుండకపోతే, నమోదు చేయించుకోండి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మన భవితను నిర్ణయించుకునే అవకాశమది -ఎలాగోలా నమోదు చేయించుకోవాలి మరి. అయితే, ఈ నమోదు వ్యవహారం పెద్ద తతంగంగా కనిపిస్తోంది. కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు లాగా వీలైనంత కష్టతరంగా చేసిపెట్టారు ఈ కార్యక్రమాన్ని. నమోదు చేయించుకోడానికి ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఎప్పుడు చేయించుకోవాలో తెలీదు, ఏవేం కాగితాలు తీసుకెళ్ళాలో తెలీదు. దీన్ని సులభం చేస్తూ.. 'పోస్టాఫీసుల్లో నమోదు కేంద్రాల నేర్పాటు చెయ్యండి మహప్రభో' అంటూ లోక్‌సత్తా ఎన్నేళ్ళుగానో గోల పెడుతోంది.

14, సెప్టెంబర్ 2008, ఆదివారం

మరో 'పిరికి' చర్య

23 కామెంట్‌లు
ఇంకోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీ. ఊరు మారింది, స్థలాలు మారాయి.  బాంబులేసినవాళ్ళు వాళ్ళేనట -మేమేనని బోర విరుచుకుని మరీ చెబుతున్నారు.

5, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ప్రభుత్వ భూ కబ్జాను ఎదుర్కోవడం ఎలా?

3 కామెంట్‌లు
ప్రత్యేక ఆర్ధిక మండలాలు, కోస్టల్ కారిడార్, ఇంకా ఇతర ప్రాజెక్టుల కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా రైతుల భూములు సేకరిస్తోంది. ఒక పద్ధతీ పాడూ లేకుండా జరుగుతున్న ఈ భూసేకరణ వల్ల రైతులు దారుణంగా మోసపోయి రోడ్డున పడుతున్నారు. 
ఇక ముందైనా అలా జరగకూడదనే సదుద్దేశ్యంతో మానవ హక్కుల వేదిక (HRF) వారు ఇటీవల "ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే..." అనే ఒక చక్కని పుస్తకాన్ని ప్రచురించారు. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన వారు తమ బ్లాగులో కూడా దీన్ని ప్రచురించారు.

30, ఆగస్టు 2008, శనివారం

కందానికో నూలుపోగు

17 కామెంట్‌లు
ఏ యుగంలోనైనా అందం నాలుగు పాదాల మీదా నడిచే పద్యం, కందం. ఈ మధ్య బ్లాగుల్లో మళ్ళీ కంద పద్యం కాంతులీనింది -ముఖ్యంగా రెండు బ్లాగుల కారణంగా. కందపద్యం ఎలా చెప్పాలో రాకేశ్వరరావు సచిత్రంగా సోదాహరణంగా వివరించారు. కందపు గ్లామరును, గ్రామరునూ వివరిస్తూ చంద్రిమలో ఓ చక్కని జాబు వచ్చింది. ఈ రెండు చోట్లా బహు చక్కని వ్యాఖ్యలూ, వాటిలో అందమైన ఆశుకందాలూ వచ్చాయి. ఓపక్క అక్కడ వ్యాఖ్యలు రాస్తూనే రానారె తన బ్లాగులో ఒక సర్వలఘు కందాన్ని రాసారు. ఈ పద్యసంరంభం చూసాక నాకూ రాద్దామని ఉత్సాహం వచ్చింది. సూదీ దారం తీసుకుని పద్యాలు కుట్టేద్దామని కూచున్నా.. ఇదిగో ఇప్పటికయ్యింది. సరే, రాసిన రెండూ పద్యాలూ నా బ్లాగులోనే పెట్టేసుకుందామని, ఇదిగో ఇలా..

28, ఆగస్టు 2008, గురువారం

ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు

24 కామెంట్‌లు
ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.

18, ఆగస్టు 2008, సోమవారం

అన్నయ్యల పోటీ

8 కామెంట్‌లు
రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా' అనుకున్నారు. 'ఈడు రామారావు కాదు, డ్రామారావు' అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.

17, ఆగస్టు 2008, ఆదివారం

చిరంజీవి చెప్పిందేమీ లేదు, అంతా బహిరంగ సభలోనే నట!

19 కామెంట్‌లు
చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో!

తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల ప్రశ్నలు కూడా చాలావరకు అనుకున్నవే వచ్చాయి. వాటికి కూడా తయారై వచ్చాడు. మొదట్లో కొద్దిగా నెర్వస్‌గా కనబడ్డాడు గానీ, తరవాత బానే నడిపించాడు. అన్నీ తనకనుకూలమైన ప్రశ్నలు, తాననుకున్న ప్రశ్నలే. ఉదాహరణకు 'రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు?' అని ఎవరో అడిగితే, దానికి 'నాకు రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయో తెలీదు. సమయానికి రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని మాత్రం తెలుసు. అలాగే...' అంటూ చక్కగా చెప్పాడు.

ఎక్కడో ఒకచోట ఒక ప్రశ్న ఎదురైంది. అది విని కాస్త కోపగించుకున్నట్టు కనబడింది. ఎటొచ్చీ సమావేశమంతా గందరగోళంగా ఉండడంతో ఆ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు వినబడలేదు. చిరంజీవే సమాధానం చెప్పేముందు ఫలానా వాళ్ళు ఫలానా ప్రశ్న అడిగారు, దానికి నా సమాధానం ఇది అంటూ చెప్పాడు.

డబ్బులెక్కడినుండి వస్తాయి, రాజకీయాలల్లో మీకు స్ఫూర్తి ఎవరు, లాంటి కొన్ని ప్రశ్నలకు "ప్రజలే" అంటూ సమాధానం చెప్పాడు. ఇలాటి గ్యాలరీ సమాధానాలు చాలానే ఉన్నాయి. బంధువులు రాజకీయాల్లోకి రావచ్చా అనే ప్రశ్నకు 'సత్తా, ఆసక్తి, శక్తి ఉంటే రావచ్చు, అర్హత ఉంటే పదవులూ అలంకరించవచ్చు' అని అన్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ ప్రశ్న, సమాధానం అనిపించింది.

ప్రజాసమస్యలపై తన అవగాహన గురించి ప్రశ్న వచ్చింది. దానికి, 'సమస్యల గురించి చెప్పేందుకు మీరున్నారు గదా' అని అన్నాడు. చాలా హాస్యాస్పదమైన సమాధానం అది. సమస్యలపైన అవగాహన లేకుండా రాజకీయాల్లోకి దిగుతున్నాడా ఏంటి అనిపిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనేది విలేకరులు చెబితేనే తెలుసుకుంటాడా!!

ఇక, ఒకటి రెండు రొడ్డకొట్టుడు సమాధానాలు..
తెలంగాణ వంటి వివిధ సమస్యలపై మీ విధానాలు ఏమిటి అని అడిగినపుడు, అందరితోటీ చర్చింది, తగు సమయంలో, అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, ఇలాంటి సున్నిత సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకుపోయాడు. ప్రస్తుతానికైతే 'విధానం లేకపోవడమే ఆయన విధానం' లాగా అనిపించింది.

అవినీతి రహితమైన పార్టీ అంటున్నారు కదా.. ఇతర పార్టీల నుండి అవినీతి చరితులను ఎందుకు రానిస్తున్నారు అనే ప్రశ్నకు, 'తమ తమ పార్టీల్లో తామనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదని భావించినపుడు, మా విధానాలు నచ్చితే మావద్దకు రావచ్చు' అని అన్నాడు. 'ఇతర పార్టీల్లో కూడా నీతిమంతులు ఉటారు గదా' అనీ అన్నాడు.

అందరితోటీ మంచిగా ఉంటాను అంటూ తను ఎప్పుడూ చెప్పుకుంటూండే ధోరణిలోనే ఇప్పుడూ మాట్టాడాడు. విలేకరులతో స్నేహం చేసుకునే ధోరణిలో వ్యవహరించాడు. మాటలూ అలాగే చెప్పాడు, శరీర భావాలూ అలాగే ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ప్రత్యర్థులెవరు అని అడిగితే నాకు శత్రువులు, ప్రత్యర్థులు లేరు. నాకు శత్రువులల్లా సమస్యలే, పేదరికమే అంటూ చెప్పాడు. గ్యాలరీ సమాధానాల్లో ఇదొకటి.

మొత్తం మీద ఈ సమావేశం ద్వారా చిరంజీవి అసలు విషయం గురించి చెప్పింది తక్కువ, చెప్పనిది ఎక్కువ అనిపించింది.
తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ఒక్క మాట మాత్రం చెప్పాడు. రాజకీయాల్లోకి కొత్తదనం ఏదైనా తేదలచుకున్నాడో లేదో గానీ, సమావేశ ప్రసంగంలోగానీ, విలేకరుల ప్రశ్నలకిచ్చిన సమాధానాల్లోగానీ కొత్తదనమేమీ లేదు.

13, ఆగస్టు 2008, బుధవారం

శతకోటికొక్కడు !

4 కామెంట్‌లు
2012 ఒలింపిక్ పోటీల్లో మువ్వన్నెల జండాని చేబట్టి భారత జట్టుకు ముందు నడిచేదెవరో తేలిపోయింది. అతడే, వందకోట్ల మందిలో అతనొక్కడే -అభినవ్ భింద్రా!

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడి ఒలింపిక్సుకు ముందు "అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని ఆశలు పెట్టుకోకండి." అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో మన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకొచ్చిన అభినవ్ భింద్రా మాత్రం అద్భుతమే సాధించాడు. అతనికి నా అభినందనలు కూడా!

వందకోట్ల మంది ఉన్న దేశంలో బంగారాన్ని గెలుచుకు రాగల మొనగాడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి బంగారం తెచ్చుకోడానికి వందేళ్ళు పట్టింది. కానీ.. జనాభాకీ ఆటల్లో పతకాలకీ సంబంధం ఉందా అనేది ప్రశ్న. లేదని కొన్ని వాస్తవాలను చూస్తే అనిపిస్తోంది. జనసంఖ్యలో మనతో పోలిస్తే పిపీలికాలనిపించుకునే దేశాలకు కూడా బోలెడన్ని పతకాలు వస్తూంటాయి. అర్మేనియాలు, అజర్బైజాన్లూ, బుర్కినాఫాసోలు, ఇంకా బోలెడు పేర్లు వినని దేశాలు కూడా బంగారు, వెండి పతకాలు పట్టుకుపోతూ ఉంటాయి. బయటి దేశాల సంగతే ఎందుకు.. మన దేశంలోనే జాతీయ ఆటల పోటీలు పెడితే కేరళ, హర్యానా, పంజాబులే ముందు! ఇంకా విశేషమేంటంటే మణిపూరు, అసోంలు, వాటి మిగతా సోదరీమణులు కూడా కొన్నిసార్లు మనకంటే ముందే ఉంటాయి. (చంద్రబాబు హయాంలో జరిగిన జాతీయ ఆటల పోటీల్లో బయటి రాష్ట్రాల నుండి ఆటగాళ్ళను పట్టుకొచ్చి, మనల్ని బాగా ముందుకు తీసుకుపోయాడు, అది వేరే విషయం!) అంచేత..

తేడా జనాభాలో లేదు, మరెక్కడో ఉంది.

ఆటలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. మనం హాకీలో వెనకబడిపోవడానికి ఒక ముఖ్య కారణం చాన్నాళ్ళపాటు మనకు ఏస్ట్రో టర్ఫు లేకపోవడమేనని చెబుతారు (తరవాత్తరవాత గిల్లుడు కూడా కారణమని తేల్చారనుకోండి). అలాగే ఆటగాళ్ళకు ఆటమీద ఏకదీక్ష, తాదాత్మ్యం ఉండాలంటే వాళ్లకు జీవిక గురించిన చింత ఉండకూడదు. రేపెలా గడుస్తుందా అనే ఆలోచన ఉంటే ఆటలేం ఆడతారు!? వాళ్లకు అలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామా? ఉద్యోగాలిచ్చినా, మరోటిచ్చినా.. మన ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలన్నీ ఆటల్లో ఒక స్థాయికి వచ్చినవారికే! తగు చేయూతనిస్తే ఆ స్థాయికి చేరగలవాళ్ళు అనేకమంది ఉంటారు. తన స్మృతి బ్లాగులో ప్రవీణ్ ఇదేమాట చెప్పారు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను చేరదీసి, ఆటగాళ్ళుగా తీర్చిదిద్దే ప్రణాళికలుండాలి. వాళ్ళకు జీవన భద్రత కల్పించాలి. ఆటల సంస్కృతి ఒకటి అవసరం మనకు!

ఆటల్లో రాజకీయుల ప్రత్యక్ష జోక్యం ఉండకూడదు. ఎంతటి గొప్ప సంస్థనైనా తెల్లారేలోగా గబ్బు పట్టించగల సామర్థ్యం వాళ్ళ సొత్తు. వాళ్ళు లేకపోతే ఈ సంస్థల్లో రాజకీయాలు కూడా తగ్గుతాయి. (రాజకీయాలు అసలే లేకుండా ఉండవనుకోండి).
ఇంతటితో ఈ జాబును ముగించి..


---------------------------------------

పతకాలపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దన్న సురేష్ కల్మాడి గురించి రెండు ముక్కలు.. అతడో కాంగ్రెసు ఎంపీ! ఎన్నేళ్ళుగా ఉంటున్నాడో తెలీదుగానీ చాన్నాళ్ళుగా - కొన్ని ఒలింపిక్కులుగా - అతడే భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు. ఆటల పేరెత్తగానే గుర్తొచ్చేది గడ్డం పెంచుకున్న కల్మాడియే! అతని అర్హతలేమిటో తెలీదుగానీ, ఆటల పోటీలంటే చాలు ఆ పేరే వినిపిస్తుంది. ఒలింపిక్, కామన్‌వెల్త్, ఏషియన్, ఆఫ్రో ఏషియన్,ఏషియో ఆఫ్రికన్, ఏషియో అమెరికన్, అమెరికో ఏషియన్, ఏషియో ఆర్కిటిక్, ఆర్కిటికో ఏషియన్,.. ఇలా ఎన్ని రకాల ఆటలుంటే అన్నిట్లోనూ అతడే! (ఒకవేళ నేనిక్కడ రాసిన ఆటల పోటీలు లేకపోతే.. వాటిని మొదలుపెట్టినపుడు మాత్రం అధ్యక్షుడుగా అతడే ఉంటాడని చెప్పగలను) భారత అథ్లెటిక్ సమాఖ్యకు అతడు జీవితకాల అధ్యక్షుడు కూడా! 2010లో కామన్‌వెల్తు ఆటలు జరుగుతాయట.. దానికీ నేత ఆయనే! ఇన్నేళ్ళుగా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు చెప్పేమాట ఏంటంటే.. "ఓ.. పతకాలు వచ్చేస్తాయనీ, అద్భుతాలు జరిగిపోతాయనీ భ్రమ పడకండి" అని. ఇదీ ఇతగాడి నిర్వాకం! ఇలాంటివాడే క్రికెట్టుకి జయవంత్ యశ్వంత్ లెలే అని ఉండేవాడు. మనాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళేముందు "చిత్తుగా ఓడిపోయి తిరిగొస్తారు" అని అన్నాడు. ఇలా ఉన్నారు మన ఆటల నిర్వాహకులు!

11, ఆగస్టు 2008, సోమవారం

అమరనాథ దేవాలయ స్థల వివాదం

10 కామెంట్‌లు
సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే..

ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.

ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది...

5, జులై 2008, శనివారం

వీళ్ళు మనకోసమే పోరాడుతున్నారా?

8 కామెంట్‌లు
అంతమంది పోలీసులు హతులైతే హక్కుల నేతలెవరూ మాట్టాడరే, అని నేను రాసాను. దానికి స్పందనగా దిలీప్ గారు తన బ్లాగులో రాస్తూ నక్సల్ ఉద్యమ ప్రస్థానంలో జరిగిన చాలా విషయాల గురించి చెప్పారు. ఆయన రచనాశైలికి తగినట్టుగానే వ్యాసం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది.

ఆ జాబులో ఆయన లేవనెత్తిన అంశాలపై నా ఆలోచనలను కూడా రాద్దామని అనిపించింది. అయితే ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాహన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు తెలిపితే పద్ధతిగా ఉంటుందని నాక్కూడా అనిపించి అక్కడ రాయలేదు.

ముందుగా ఒక్క విషయం.. పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. నేనన్నదల్లా - రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!

నక్సలైట్లపై జరిగిన అమానుష హింస గురించి మనం తెలుసుకోవాలి, నిజమే! అలాగే నక్సలైట్ల ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.


ముందుగా.. నక్సలైట్లపై చట్టబద్ధంగా చర్యలెలా తీసుకోవాలి -
ఏకే47లూ, రాకెట్లతో యుద్ధం చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించడమెలాగ? (ఆ ఆయుధాలను పట్టుకుని మనపై తెగబడినవారినే అనేకానేక సంఘటనల్లో కాల్చిచంపేసింది - వాటిలో పార్లమెంటుపై దాడి ఒకటి) వాళ్ళని పట్టుకుని, సంకెళ్ళు వేసి తెచ్చేందుకు పోలీసులు ఏ ఆయుధాలు తీసుకెళ్ళాలి? ఏ విధంగా పట్టుకోవాలి? మందుపాతరలు పెట్టి అటుగా వచ్చే పోలీసులను (మనుషులను) పేల్చేసిన వారిని పట్టుకునేదెలా, శిక్షించేదెలా?

అలాగే నక్సలైట్లు ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.

రైల్వే స్టేషన్లు, పోలీసు స్టేషన్లు, టెలిఫోను ఎక్స్ఛేంజీలు, ఆర్టీసీ బస్సులు, సెల్ టవర్లు మొదలైన అనేక ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిందెందుకో కూడా మనం తెలుసుకోవాలి.

ఇన్నేళ్ళుగా వాళ్ళు వాడిన ఆయుధాలు, మందుపాతరలు, మందుగుండు సామాగ్రి ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకోవాలి. తమ సాయుధ పోరాటాన్ని నడపడానికి అవసరమైన డబ్బును వాళ్ళు ఎక్కడినుండి ఎలా సమకూర్చుకున్నారో కూడా తెలుసుకోవాలి. ప్రజాప్రతినిధుల లాగానే వీళ్ళు కూడా కాంట్రాక్టర్ల దగ్గరి నుండి రౌడీమామూళ్ళు తీసుకుంటారన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్సలైట్ల పేరు చెప్పుకుని ప్రజల దగ్గరినుండి డబ్బులు గుంజిన (ఎక్స్‌టార్షన్) నకిలీ నక్సలైట్లకు ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో, చాలా సందర్భాల్లో ఆ మోసాలు ఎందుకు సఫలమయ్యాయో కూడా తెలుసుకోవాలి. నక్సలైట్లు ఆయుధాల డంపులతో పాటు డబ్బు డంపులు కూడా ఎలా సమకూర్చుకున్నారో తెలుసుకోవాలి. డబ్బులు పట్టుకుని దళాన్నొదిలి పారిపోయినవారి గురించి, డబ్బుల కోసం అయిన గొడవల గురించి కూడా తెలుసుకోవాలి. దళంలోని ఆడవారిపై దాడులు చేసిన సంగతులు కూడా మనం మననం చేసుకోవాలి.

పోలీసులు జీపుల్లో వెళ్ళటానికి భయపడి ఆర్టీసీ బస్సులో వెళ్ళబోతే ప్రజలు అడ్డుచెప్పిన సంఘటనలెందుకు ఎదురయ్యాయో, పోలీసులు అంటరానివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగులు 'పోలీసులు మావెంట రక్షణగా వస్తే మేం వెళ్ళం' అనే పరిస్థితి ఎందుకొచ్చిందో, పోలీసులు వెంటరాకూడనివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. 'ఎన్‌కౌంటరు జరిగిన ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడ మృత్యువాసన గుప్పున కొట్టింద'ని అంటూ ఉంటారు విప్లవ కవులు కొందరు, శ్రేష్టులలోకెల్లా శ్రేష్టులు కొందరు - మరి అంటరాని, వెంటరాకూడని ఆ పోలీసుల కళ్ళలో మృత్యువు నీడలు కనబడలేదో ! మందుపాతరల్లో మారుమోగిన మృత్యుఘోష వినబడలేదో!!

దిలీప్ గారన్నారు.. ఆ డబ్బులు ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే నక్సలైట్ల అవసరం ఉండేదే కాదు అని. ఈ నక్సలైట్లు ఉండీ ఉపయోగమేం జరిగిందో నాకు అర్థం కాదు.. ఇవ్వాళ్టికి కూడా చింతపండు అమ్ముకునే దగ్గర గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా - గిరిజనులను దోచుకుంటే ఊరుకునేది లేదని వ్యాపారులను బెదిరించి పోయారట! ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసినా ఎంతో కొంత సాధించి ఉండేవారేమో!

ఇన్నేళ్ళ సాయుధ పోరాటం తరవాత, వాళ్ళు సాధించిన కొన్ని కీర్తి కిరీటాలు: టి.హయగ్రీవాచారి, దుద్దిళ్ళ శ్రీపాదరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, పాల్వాయి పురుషోత్తమరావు, ప్యానెల్ స్పీకరు సి.నర్సిరెడ్డి - ఆయనతోపాటు మరో పది పన్నెండు మంది. (ఇవి నాకు తెలిసినవి, తెలియనివెన్నో!) వీళ్ళెవరూ పోలీసులు కారు.

ఇన్నేళ్ళ వర్గపోరాటం ద్వారా ఏం సాధించారో, ప్రజలకు వీళ్ళెంత ఉపయోగపడ్డారో కూడా తెలుసుకోవాలి. నేపాలు నుండి దండకారణ్యం దాకా (లేక, నల్లమల దాకానో మరి.) ఎర్ర బాట (రివల్యూషనరీ కారిడార్ - RC) పరిచారు కదా! నేపాల్లో చెయ్యాల్సిన హింస అంతా చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని పాలనలో కొచ్చారు. అక్కడంటే ఇన్నాళ్ళూ ప్రజాస్వామ్యం లేదు సరే, కానీ మనకుందే! మరి ఈ హింసా, విధ్వంసం అన్నీ మానేసి, ఎన్నికల్లో పాల్గొనవచ్చుగదా!ఆ బాటలో నడచే కామ్రేడ్లే గదా, వీళ్ళూను!! పోటీ చేసి, అధికారంలోకి వచ్చి, వర్గ నిర్మూలన చెయ్యొచ్చు కదా! వర్గ నిర్మూలన తుపాకీతో సాధ్యపడేదైతే ఈ 40 ఏళ్ళలోనూ జరగలేదే!!

వర్గనిర్మూలన, సమసమాజ స్థాపన అనేది ఉదాత్తమైన ఆశయమే కానీ నలభై ఏళ్ళ తరవాత అది ఉత్త ఆశయం ఐపోయినట్టు కనబడుతోంది.

3, జులై 2008, గురువారం

వాళ్ళు మనకోసం ప్రాణాలర్పించారు

12 కామెంట్‌లు
అది యుద్ధం. గెరిల్లా యుద్ధం. 65 మంది పోలీసులు, ఇతర సిబ్బందీ నదిలో, నడిమజ్జన ఉండగా మావోయిస్టులు రాకెట్లూ తుపాకులతో దాడి చేస్తే పాపం చెల్లాచెదురయ్యారు. 29 మంది మాత్రం బ్రతికి బయట పడ్డారిప్పటికి. మిగిలినవారి జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసుల అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన జరిగిందని ఒక వంక చెబుతున్నారు. ఆ పడవ నడిపే అతను మావోయిస్టులతో కుమ్మక్కయ్యాడని మరో వాదన కూడా వినవస్తోంది. ఒక పోలీసు శవం నదిలో దొరికింది. అతడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయని అంటున్నారు. అతడు మావోయిస్టులకు దొరికితే, చేతులు కట్టేసి నదిలోకి తోసేసి ఉంటారు. ఎంత క్రూరత్వం!

ఈ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులను బాగా అణచివేసారు. దాదాపు ప్రతిరోజూ వినబడుతూ ఉండే ఘాతుకాలు ఇప్పుడు ఆగిపోయాయి. బహుశా మితిమీరిన ఆత్మవిశ్వాసం పోలీసుల పాలిట మృత్యు వయ్యుండొచ్చు. అదను చూసి మావోయిస్టులు మాటేసి, కాటేసారు.

భలే జరుగుతోంది యుద్ధం!
-మావోయిస్టులు గెరిల్లా దాడులు చేస్తూ ఉన్నారు.
-పోలీసులు ప్రాణాలకు తెగించి వాళ్ళను వేటాడుతున్నారు.
-రాజధానిలో మాత్రం రాజకీయ నాయకత్వం మావోయిస్టు నాయకత్వంతో కులాసా కబుర్లు చెబుతోంది.వాళ్ళు జైల్లో ఉంటే జైలుకు, ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రికీ వెళ్ళి మరీ చర్చలు చేస్తోంది. అడవుల్లో పోలీసులు రక్తం ధారపోస్తుంటే. రాజకీయ నాయకులు ఆసుపత్రులకెళ్ళి అన్నలను పరామర్శిస్తున్నారు.

ఏ రాజన్ననో, రాజక్కనో అరెస్టు చేసారనే పుకారొస్తే చాలు మానవ హక్కులవారు గగ్గోలెడతారు, హడావుడి చేసేస్తారు. వాళ్ళను కోర్టుకప్పజెప్పాలి అంటూ చదును చదును చేస్తారు. (ఓసారిలాగే సుధాకరునో మరో దివాకరునో అరెస్టు చేసారనే వార్తలొచ్చాయి -అంతే ఈ వాదులు నిదర్లు పోలేదు. ఓ రోజో రెండ్రోజులో పోయాక సదరు వీరుడే ఒరిస్సా నుంచి ప్రకటన చేసాడు, అబ్బెబ్బే నేను వాళ్ళకి చిక్కలేదు, బానే ఉన్నానంటూ -అప్పుడాగింది వీళ్ళ హడావుడి.)

ముప్పైఐదు మందికి పైగా కుర్రాళ్ళు మనకోసం పనిచేస్తూ గల్లంతయ్యారు. రెండు రోజులైనా ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. వాళ్ళ సహచరులు.- ఏఁ, మేం మనుషులం కామా, మాకు మానవహక్కులు లేవా? అని అడుగుతున్నారు, ముందు మనుషులం ఆ తరవాతే పోలీసులం అని ఆక్రోశిస్తున్నారు.

ఔను మరి, వాళ్ళకు లేవా హక్కులు?

1, జులై 2008, మంగళవారం

బ్లాగరులో కొత్త అంశాలు

8 కామెంట్‌లు


బ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. - వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది - అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.



ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.

28, జూన్ 2008, శనివారం

దేశం తలపట్టుకుంది

13 కామెంట్‌లు
నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. 'చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం' అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు.

26, జూన్ 2008, గురువారం

కండకావరం

12 కామెంట్‌లు
నిరసన ప్రదర్శనల్లో దిష్టిబొమ్మలకు చెప్పులదండ వెయ్యనిదెవ్వరు? చెప్పుదెబ్బలు కొట్టనిదెవ్వరు? తగలబెట్టనిదెవ్వరు? నోటికొచ్చినట్టు బూతులు తిట్టనిదెవ్వరు?

శవయాత్ర నిర్వహించి, శాస్త్రోక్తంగా దహనకాండ జరిపించడం కూడా చూసామే!

మనకిది చాలా సహజమైపోయింది. సమాజంలో సర్వ సాధారణమైపోయిన వికృత చర్యలివి. ఆంధ్రజ్యోతి పాత్రికేయులు తమపై జరిగిన దాడికి నిరసనగా దాడి జరిపించిన నేత దిష్టిబొమ్మను తగలపెట్టారు. దళితులపై జరిగే అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని ఉపయోగించాల్సినంతటి నేరమట అది. అసలా దాడి చేయించిన వారిపై, దాడులు మళ్ళీ చేస్తాం అని బహిరంగంగా చెప్పిన, చెబుతున్న హింసోన్మాదులపై చర్యలేవీ?

సంఘటనలో పాత్రధారులైన ఈ ఇద్దరిలో ఒకరేమో ఆ రెండు పత్రికల్లో ఒకటి -అంచేత తప్పు వాళ్ళదే -మరో ఆలోచన లేదు. కాబట్టి చర్యలు వాళ్ళ మీదే! దళితులపై అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన చట్టాన్ని, వేరొకరిపై అత్యాచారం చేసేందుకు ఉపయోగించింది ప్రభుత్వం. తననెదిరించినవాడిని వేటాడేందుకు ఎంతకైనా తెగించగలనని మరోసారి నిరూపించాడు ముఠాకోరు.

"తప్పుల మీద తప్పులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఓవర్‌టైము పని చేస్తోంద"ని ఎల్‌కే అద్వానీ కేంద్రప్రభుత్వం గురించి అన్నాడు అప్పుడెప్పుడో. ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయనే ఆత్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రింబవళ్ళు పనిచేసి మరీ తాను చెయ్యదలచిన తప్పుడు పనులను చేసేస్తోంది. ఎన్నికల తరవాత ఇలాంటి అవకాశం రాదని కాబోలు!

23, జూన్ 2008, సోమవారం

తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది

17 కామెంట్‌లు
దేవేందర్ గౌడ్ రాజీనామా చేసాడు. తెలుగుదేశానికి దెబ్బ తగిలినట్టే! (దీన్ని పార్టీ చీలిక అనొచ్చా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో తెలియవచ్చు) అయితే, అంతకంటే పెద్ద దెబ్బ తెరాసకు తగలొచ్చు.

ఇక గౌడ్ ఏంచేస్తాడు? ఏదైనా పార్టీలో చేరొచ్చు. లేదా తానే ఒక పార్టీని పెట్టొచ్చు.

ఏ విధంగా చూసినా గౌడ్ తెరాసతో చేరే ప్రసక్తి లేదు. కేసీయారు నియంతృత్వం సంగతి తెలిసీ గౌడ్ ఆయనతో చేతులు కలపడు. ఇప్పటికే కేసీయారు కాస్త నీరసపడ్డాడు. తెరాస ప్రభ తగ్గింది. ప్రజల్లో కేసీయారు పట్ల వ్యతిరేకత మొన్న బయటపడింది. వేరే ఏదైనా పార్టీలో చేరతాడేమోగానీ.. తెరాసలో మాత్రం చేరడు. అందులో చేరి కోపైలట్‌గా ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు. రాజకీయంగా, వ్యక్తిగత ప్రతిష్ట పరంగా కేసీయారు కంటే గౌడ్ బలవంతుడు. పైగా కులవంతుడు కూడాను -బీసీ నాయకుడిగా ఆయన మంచి స్థానంలో ఉన్నాడు. తెరాసపై ప్రజలకున్న అసంతృప్తి గౌడ్‌కు బాగా లాభిస్తుంది. కాంగ్రెసు, బీజేపీలతో చేరడు.పుట్టబోయే పార్టీలో చేరే అవకాశమూ తక్కువేననిపిస్తోంది. కాంగ్రెసు, తెరాస అసమ్మతివాదులకు గౌడ్ పార్టీ ఆశ్రయమివ్వవచ్చు. ఆ విధంగా కాంగ్రెసుకూ దెబ్బే!

ఇవన్నీ కాకపోతే తానే స్వంతంగా పార్టీ పెట్టొచ్చు -(తెలంగాణా దేశం?). ఏదేమైనా ఇక తెలంగాణా అంశాన్ని గౌడ్ ప్రభావితం చేస్తాడు. తెరాసది ఇక రెండో స్థానమే! తెలంగాణాకు అనుకూలంగా ఏర్పడిన మంచి పరిణామం ఇది.

17, జూన్ 2008, మంగళవారం

లోకలు వార్మింగు

22 కామెంట్‌లు
కొత్తపాళీ గారు అదిలించడంతో గ్లోబలు వార్మింగు పట్ల నేనూ కాస్త హడావుడి పడదామని త్వరపడ్డాను. నిజం చెప్పొద్దూ.. ఈ దీపాలార్పడంలో (ప్రతిపదార్థంలోనే తీసుకోండి సుమా!) నాకంత నమ్మకం లేదండీ. కానీ ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిసాక, ఇలా అవగాహన కలిగించడం కోసం నేనూ ఏదైనా చెయ్యాలని తలపోసాను. పోసాక, ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాను. కున్నాక, పని మొదలెట్టాను. ఇక్కడో ముక్క చెప్పాలి:

13, జూన్ 2008, శుక్రవారం

దశావతారం

11 కామెంట్‌లు
ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? "పది అవతారం" !!!

8, జూన్ 2008, ఆదివారం

మేటి దివిటీలు - 2

8 కామెంట్‌లు
బాపు
బామ్మ (బాపు బొమ్మ) గురించి తెలీని తెలుగువారుండరు. మన మేటి చిత్రకారుడు బాపు. మన మేటి సినిమా దర్శకుడు బాపు. మేటి కార్టూనిస్టు బాపు. మేటి రామభక్తుడు బాపు. మేటి దివిటీల్లో బాపు ఒకడు.

స్నేహానికి మేటి ప్రతీకల్లో బాపు ఒకడు. బాపు, రమణల స్నేహం జగద్విదితం. వీరిద్దరి స్నేహాన్ని పురస్కరించుకుని వీరిని ద్వంద్వ సమాసమని ప్రేమగా పిలుచుకుంటాం. ఆ
ద్వంద్వ సమాసాన్ని ఇక్కడ విడదీసిన పాపం నాదే! బాపు తన సినిమాలకు గాను అనేక మంది సాంకేతికులతో కలిసి పనిచేసాడట. ఒక్క మాటలు కుట్టే పనికి మాత్రం రమణను తప్పించుకోలేకపోయాడు. "ఆ సంకెళ్ళకూ జై" అంటూ స్వయంగా ముళ్ళపూడి వెంకట రమణ చెప్పిన మాటే అది. రచనలోని గొప్పదనాన్ని తన బొమ్మలతో బాపు మింగేస్తాడని రావిశాస్త్రి వాపోయాడట.

బాపు బొమ్మల గురించి చెప్పిన మాటల్లో చిరస్మరణీయమైనది మరొకటుంది..
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో పద్యాభిషేకం చేసాడు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఆ చేతిరాత ఒక ఫాంటై అలరిస్తోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆ మేటి దివిటీకి నా హారతి..
బాపు గీసిన బొమ్మ
చూసినంతనె బ్రహ్మ
కండ్ల మెరిసెను చెమ్మ
తెలుగు బిడ్డా!
ఎనిమిది కళ్ళు చెమ్మగిల్లిన కారణం..
మహిమలున్నను చెంత
మలచలేనని సుంత
ఈర్ష్య తోడను కొంత
ఓ తెలుగు బిడ్డా!
ఈర్ష్యతోనట! కానీ ఆ కారణం కొంతే.. మరి మిగతా కారణమేంటో...
అం..త బాపును కూడ
తానె చేసినవాడ
ననెడి గర్వము తోడ
తెలుగు బిడ్డా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఆ మహానుభావుడికి, ఆ సత్తిరాజు లక్ష్మీనారాయణకు, ఆ బాపుకు పద్మ పురస్కారాన్ని ప్రదానం చేసే అవకాశాన్ని, తద్వారా తమ్ము తాము గౌరవించుకునే అవకాశాన్నీ పొందలేని అజ్ఞానులపై నాకు సానుభూతి కలుగుతోంది.

ప్రజల గుండెల్లో పటం కట్టుకుని ఉన్నవాడికి ఏ పురస్కారాలూ అవసరం లేదులే!

25, మే 2008, ఆదివారం

నేను లోక్‌సత్తాకు వోటెందుకేస్తానంటే..

20 కామెంట్‌లు
కాంగ్రెసూ, తెలుగుదేశం, భాజపా, తెరాస, అదీ, ఇదీ - అన్నీ పాలించడంలో విఫలమయ్యాయి.
  • సభను రాజకీయాలమయం చేసారు: ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోవడం, ఎత్తులూ పైయెత్తులు వేసుకోవడం తప్ప, సభలో అర్థవంతమైన చర్చ జరపరు.

5, మే 2008, సోమవారం

లేటుగా వెలిగిన లైటు

3 కామెంట్‌లు
పొద్దు నిర్వహించిన అభినవ భువనవిజయం కవి సమ్మేళనంలో నావీ కొన్ని పద్యాలుండటం నాకెంతో సంతోషం కలిగించింది. ఆ సమ్మేళనానికై సమస్యలను కొత్తపాళీ గారు ఇచ్చారు. ఆయనిచ్చిన సమస్యలలో నాకు బాగా కష్టమనిపించింది - "గ్లోబలు వార్మింగు యనుచు గోముగ పలికెన్".

తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సమస్యను అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అన్వయించి చక్కటి పూరణ రాసి పంపించారు. కొన్ని ఘోరమైన తప్పులతో నేనూ ఓ పద్యం రాసి పంపించాను. సహజంగానే అది అనుమతికి నోచుకోలేదు.

అంతా అయిపోయాక, సమ్మేళనం సందడి సద్దుమణిగాక, తీరుబడిగా ఒక పద్యం రాసి కొత్తపాళీ గారికి పంపించాను. బానేవుందన్నారు.. అంచేత దాన్ని ఇక్కడ, ఇలా..

నోబెలు పొందిన గోరును
ఆ బహుమతి ఎట్టులొచ్చె యని ప్రశ్నించన్
నోబులుగా నవ్వి యతడు
గ్లోబలు వార్మింగు యనుచు గోముగ పలికెన్

30, ఏప్రిల్ 2008, బుధవారం

మేటి దివిటీలు - 1

18 కామెంట్‌లు
తెలుగు వారి చరిత్ర రెండువేల యేళ్ళ నాటిది. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా మన ప్రసక్తి వచ్చిందట. ఎన్ని వేల యేళ్ళవాళ్ళమో ఖచ్చితంగా తెలీకపోయినా మొత్తానికి కొన్ని వేల యేళ్ళ వాళ్ళమే!

కొన్ని వేల యేళ్ళలో కొన్ని కోట్ల మంది పుట్టి, బ్రతికి, పోయారు. కొన్ని లక్షల మంది పుట్టి, బ్రతికి, బ్రతికించి, పోయారు. కొన్ని వందల మంది మాత్రం.. పుట్టి, బ్రతుకుతూ ఉన్నారు. ప్రజల మనసుల్లో వీరు చిరంజీవులు. తెలుగు జాతి ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో నుండి నాకు నచ్చిన పది దివిటీల పేర్లు ఇక్కడ రాయదలచాను. వాళ్ళు మనకు ప్రాతస్మరణీయులు. పదే రాయదలచాను కాబట్టి పదే ఉన్నాయి. పదిలో ఉండాల్సినవయ్యుండీ ఇక్కడ పేర్లు లేకపోతే.. అది నా తెలివితక్కువతనమే తప్ప చిరస్మరణీయులను తక్కువ చెయ్యడం కానే కాదు. ఆ సంగతి మీకు తెలియనిదేం కాదు!

అ వెలుగు దివిటీల గురించి రాయగలిగేంత విషయం ఉన్నవాడినేం కాదు నేను. నాకు తోచినంతలో ఒకటో రెండో పద్యాలు రాసి పూజ చేస్తున్నాను. పనిలో పనిగా నా పద్య కండూతి కూడా తీరుతోంది.

ఇక నేనెంచుకున్న వరస.. ఇది వారి జీవిత కాలాలను బట్టి తీసుకున్న వరస కాదు. వారి గొప్పతనాన్ని బట్టి నేనిచ్చిన ర్యాంకింగూ కాదు. దీనికో వరస లేదు. ఎవరిపై పద్యం సిద్ధమైతే వారి పేరు పెట్టేస్తానన్నమాట!
---------------------------------------------

వేమన:
తెలుగు వాడికి వేమన తొలిగురువు. మనకో వేదాన్ని ఇచ్చి, మన గుండెల్లో నిలిచిపోయాడు. ఉప్పు కప్పురాల తేడాయైనా, అల్పుడెలా పలుకుతాడన్నా.. వేమన వేదంలో మనకు దొరుకుతుంది! తెలుగుజాతికి ప్రాతస్మరణీయుడైన వేమన చరిత్ర అస్పష్టంగా ఉండటం మన దురదృష్టం. రెండేళ్ళ కిందనుకుంటా.. రాతప్రతుల సేకరణ అనే యజ్ఞం చేస్తే కొన్ని లక్షల పత్రాలు పోగుపడ్డాయట కేంద్ర ప్రభుత్వం దగ్గర. అలాంటి బృహత్ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వమూ చేస్తే వేమన గురించిన మరిన్ని వివరాలు తెలియవచ్చేమో!


వేమనకో నూలుపోగు:
అరటిపండునొలిచి అరచేతిలోనుంచి
ఆరగింపుమంటి వాదరమున
ఆంధ్ర జాతికీవె ఆదిగురుడవయ్య
అఖిలజనులవినుత అమర వేమ

వేమ నీతి యదియె వేమగీత యదియె
వేదసమముగాని వేరు గాదు
వేయిగళములెత్తి వేమారు పాడరా
వేద స్ఫూర్తి తోడ వేమ సూక్తి

26, ఏప్రిల్ 2008, శనివారం

రికార్డు డ్యాన్సులు, క్రికెట్టు కాంట్రాక్టర్లు

13 కామెంట్‌లు
అదసలు క్రికెట్టేనా అని!!
- అదే అయితే ఈ ఛీర్‌లీడర్లెందుకు?
- సరే.. ఉండాలీ అంటే, ఆడాళ్ళే ఎందుకు?
- సరే.. వాళ్ళే కావాలీ అంటే, ఆ కురచగుడ్డలెందుకు?

అన్నీ ఒకందుకే..
డబ్బుల కోసం! వందల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నది డబ్బుల కోసం. జనాలు రావాలి, టీవీల్లో చూడాలి - లేకపోతే డబ్బులెక్కడి నుంచొస్తాయ్? జనాలూ, తద్వారా డబ్బులూ ఇబ్బడిముబ్బడిగా రావాలంటే ఇలాంటి రికార్డింగు డ్యాన్సుల్లాంటివి పెట్టాలి. ఇలాంటి వేషాలేస్తే ఎక్కడైనా జనం పోగవుతారు. అలా పోగౌతారనేగా.. వీటిని పెడుతున్నది! పోగైనప్పుడు మనిషి లోని అసలు మనిషి బయటికి వస్తాడు. మంద మనస్తత్వం (మాస్ మెంటాలిటీ) గురించి తెలియనిదేముంది!

బజాట్టో బట్టలిప్పుకుని తిరుగుతూ "నన్నట్టాగన్నాడు", "మీదచెయ్యేసాడు" అంటూ ఏడవటంలో అర్థం లేదు. ఏఁ.., ఆట చూట్టానికి వచ్చిన వందలాది మంది స్త్రీల తోటి అలా అసహ్యకరంగా ఎందుకు ప్రవర్తించడం లేదు, వాళ్ళు? స్త్రీని గౌరవించటానికీ, ఈరకం జనాలతో వ్యవహరించడానికీ సంబంధముందని నేననుకోను.

కొత్త సంవత్సరం రోజున ముంబైలో గత రెండేళ్ళు జరిగినది విన్నాం కదా.. అర్ధరాత్రి, చిత్తుగా తాగి, రోడ్లమీద చిందులేస్తూ తిరిగే మూకల మధ్యకి (వందలాది మంది; పైగా ఆ సమయానికి వాళ్ళు పశుప్రాయులు) తామూ పోతే, తప్పు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ తాగుబోతులూరుకుంటారా? బట్టలు లాగెయ్యడాన్ని నేను సమర్ధించడం లేదు.. పిచ్చి కోతితో కలిసి కల్లు తాగి, ఆనక అది మీద పడి రక్కిందని ఏడవగూడదు అని చెబుతున్నాను. ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి. స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవానికీ దీనికీ సంబంధం ఉందని నేననుకోను!

హై.లో బీచి వాలీబాలు చూసేందుకు జనం ఎగబడ్డారట. ఎల్బీ స్టేడియమ్ లో జరిగే మామూలు వాలీబాలు చూసేందుకు ఎగబడతారా? ఆట కోసమనేనా ఆ తహతహ? ఆ రకంగానైతే జనం బాగా వస్తారనేగదా, డబ్బులు బాగా వస్తాయనే కదా.. ఇసకపోసి మరీ హై.లో ఆ ఆటాడించింది!

కోరికలుండటం సహజం. హద్దుల్లో ఉంచుకోలేకపోవడం, ఉత్సుకత చూపించడం సహజమైన బలహీనత. ప్రజల్లోని ఈ బలహీనతను సొమ్ము చేసుకుందామనే.. వాళ్ళీపని చేస్తున్నారు. ఇంకా ఈ దొంగ ఏడుపులెందుకు? ఈ వ్యాఖ్యానించే బలహీనత ఆ కొందరిదే కాదు.., చాలామందిది, మెజారిటీది. అవకాశం దొరక్క కొందరు, గుర్తుపడతారేమో, దొరికిపోతానేమో లాంటి భయాలతో మరి కొందరు,.. ఇలా రకరకాలు.

మనమిక్కడ అనాల్సింది అలా అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవాళ్లని కాదు.. ఆ డ్యాన్సర్లనీ, ఆ వేషాలేయించే వ్యాపారస్తులనీ! స్త్రీని గౌరవించంది వాళ్ళు - ఆ స్త్రీలు, ఆ వ్యాపారస్తులే! డబ్బుల కోసం నైతికంగా దిగజారిపోయింది వాళ్ళే! మహారాష్ట్ర, బెంగాలు మంత్రులు చేస్తున్నది రైటే! ఆ గంతులు మన సభ్యతకు, మర్యాదకు భంగకరం. పబ్లిక్ న్యూసెన్స్!

25, ఏప్రిల్ 2008, శుక్రవారం

ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

9 కామెంట్‌లు
ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది.

మొదటిది:
తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి పంపారంట. ఏదన్నా గానీండి.. తెలుగు నాయకులకు తెలుగు భాష పట్ల ఉన్న శ్రద్ధకు ఇదో ప్రతీక. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వార్త ఇది.

ఇదంతా మనకు మామూలే. ఈ రకం రాజకీయ నాయకులు మన చుట్టూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ ఉంటే మన కాళ్ళకూ చేతులకూ తగులుతూ, అడ్డం పడేంత మంది ఉన్నారు. కానీ.., మనకు మామూలు కాని వార్తొకటుంది, చూడండి:

తమిళనాడు శాసనసభలో తెలుగు గురించి మాట్టాడుతూ గోపీనాథ్ అనే సభ్యుడు కన్నీళ్ళ పర్యంతమై పోయాడు. ఆ రాష్ట్రంలో తమిళ మాధ్యమంలోనే
చదువు చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందట. దాని కారణంగా తన నియోజకవర్గంలో లక్ష మందికిపైగా తెలుగు మాట్లాడే పిల్లలు ఇబ్బంది పడతారని ఆయన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన మాట్టాడుతూండగా మధ్యలో ఆపి, స్పీకరు ఇక చాలు కూచ్చోమన్నాడట. దానికి ఆయన కన్నీళ్ళ పర్యంతమైపోయాడు. స్పీకరు మళ్ళీ మాట్టాడే అవకాశం ఇచ్చాడట గానీ, దుఃఖంతో సరిగ్గా మాట్టాడలేకపోయాడట. మనకంతగా పరిచయంలేని నాయకత్వమిది. ఊహించని వ్యక్తిత్వం.

గోపీనాథ్‌తో బొత్స ఝాన్సీని పోల్చి చూడాలి మనం. మామూలుగా ఝాన్సీ అడిగిన ప్రశ్నపై సభలో చర్చ జరిగే అవకాశం లేదట. ఇతర ప్రశ్నలను అడిగినవారు ధర్నాలతో బిజీగా ఉండటంతో ఆమెకు మాట్టాడే అవకాశం వచ్చిందట; దాన్నామె కాలదన్నుకుంది. "ఏదీ ఈమె ఇప్పటిదాకా ఇక్కడే ఉందే.." అని స్పీకరు కూడా వెతుక్కున్నాడట. ఇదీ ఆమె నిర్వాకం. మరి గోపీనాథ్ ఏంచేసాడు..? స్పీకరు ఆపమన్నా మాట్టాడబోయాడు. తన వాదన అంత సమంజసం కాకున్నా..
(ఏమాటకామాటే చెప్పుకోవాలి: తమిళనాడు ప్రభుత్వం చేసిన పని ఒప్పే. అక్కడుంటే తమిళంలో చదివి తీరాల్సిందే అని అనడంలో తప్పేఁవుంది.) తన భాష మాట్టాడేవారి కోసం తన పదవినీ తద్వారా తనకొచ్చిన అవకాశాన్నీ గోపీనాథ్ సద్వినియోగం చేసాడు.

శభాష్ గోపీనాథ్!

5, ఏప్రిల్ 2008, శనివారం

మన ప్రాధాన్యతలెక్కడున్నాయి

2 కామెంట్‌లు
లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు - బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది..

"...నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు లెక్కలోకి రారు. అక్కడున్నవాళ్లలో ఎవరికీ తెలియదు ఆమె జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిందని..."

జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయపోటీలు ఆడి కూడా, సరైన ప్రోత్సాహం లేదని గ్రహించి ఆ తరువాత వాలీబాలు ఆడటం మొదలుపెట్టి, జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటి అనితారెడ్డి ఇక్కడ, ఈ ఆటలో.. బంతులందిస్తోంది. జాతీయ స్థాయికి చెందిన ఒక క్రీడాకారిణికి మంచి గుర్తింపే!!! వాలీబాలు, బీచి వాలీబాలుల పట్ల మన ప్రాధాన్యతలవి.

అయినా అనితారెడ్డి దాన్ని చిన్నతనంగా భావించటం లేదు.. అది ఆమె హుందాతనం.

శభాష్ అనితా!

4, ఏప్రిల్ 2008, శుక్రవారం

అవిశ్వాస బీచి వాలీబాలు

9 కామెంట్‌లు
హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తానని రాజకీయులు వాగ్దానాలు చెయ్యడం గతంలో జోకు. అది నిజమయ్యే రోజు దగ్గర పడుతుందేమోనని మిత్రుడొకడన్నాడు. అదేంటని అడిగితే.. "అవును, బీచి వాలీబాలు ఆడుతున్నారుగా.. బీచి వచ్చేసినట్టే మరి! ఇహ సముద్రాన్ని లాక్కురావటమెంతసేపు?" అని అన్నాడు.

అసలు బీచే లేని హై.లో కూడా కాస్త ఇసక పోసి బీచి వాలీబాలు (బీవా) ఆడేసెయ్యొచ్చని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తీరా అసలు సంగతి ఇది.. జనాలని ఆకట్టుకోడానికి ఈ ఆటలో బోల్డంత గ్లామరుంది. అంచేత సముద్రం లేకపోయినా, బీచి లేకున్నా ఆడిస్తారు. డబ్బులిచ్చేవాడుంటే ఇదే ఆట సియాచిన్ గ్లేసియరులో కూడా ఆడించగలరు. అంతా మార్కెటింగు మాయ! అందాల సుందరి ఎంపికలు, పిల్లి నడకలు (వాటితో పాటు.. ముందే ఏర్పాటు చేసిన క్యాట్‌వాక్ మిస్‌హ్యాపులు),.. అన్నీ మార్కెటింగు మాయలే! ఏదేమైనా, ఈ బీవా పుణ్యమా అని పత్రికలోళ్ళకి పెద్ద శ్రమ పడకుండానే పేజీలు నింపుకునే అవకాశమొచ్చింది. మామూలుగా ఆటల పేజీల్లో వెయ్యాల్సిన ఈ బొమ్మలు విస్తరించి, ముందు పేజీల్లోకి కూడా వ్యాపించాయి. పేపర్లమ్ముకోవాలి కదా మరి!

ఆవిధంగా.. హై.కి బీచొచ్చేసింది. అయితే హై. లో ఈ పాటికే ఇంకో బీచుంది. అక్కడ ఆడేది, రాజకీయ నాయకులు. వాళ్ళు ఓ బంతాట (రాజకీయుల బంతాట - రాబం) ఆడుతూ ఉంటారు. ఈ రాబం కూడా బీవాలాగే ఉంటుంది. కాకపోతే బంతి.. మనం! అవిశ్వాస, విశ్వాస, శ్వాస,.. ఇలా రకరకాల పేర్లతో పోటీలు పెట్టేసుకుంటూ ఉంటారు.

బీ.వాలో ఎంచక్కా బట్టలు విడిచేసి ఆడతారు. ఆ ఆటకు అదో ముఖ్యమైన నిబంధన. సిగ్గు పడకుండా (లేకుండా), ఒళ్ళు దాచుకోకుండా ఆడాలన్నమాట! రాబం లో కూడా అంతే.. సిగ్గుపడకుండా విలువల వలువలిప్పి ఆడేస్తారు. బీవాలో రెండు ముక్కలన్నా అడ్డం పెట్టుకుంటారు.. రాబంలో అవీ ఉంచరు.

బీవాలో ఆటనెవరూ పట్టించుకోరు. ఆటలో ఎవరు బాగా ఎగిరారు, ఎవరు బాగా ఊగారు, ఎవరు హొయలతో బాగా అలరించారు ఇవే ముఖ్యం. ఎవరు గెలిచారు ఎవరు ఓడారనేది ఎవరికీ పట్టదు - ఆడేవారికీ చూసేవారికీ కూడా. ఎవరు బాగా ఆడారు అనేదాన్ని పట్టించుకునే వారి కంటే.., మన సినిమాల్లో హీరోయిను బాగా నటించిందా లేదా అనేది గమనించేవారే ఎక్కువ!

అలాగే మన రాజకీయులు చేసే చర్చల్లో - ఎవరు ప్రజాసమస్యల గురించి మాట్లాడారు, ఎవరు బాగా మాట్లాడారు, ఎవరు తర్కబద్ధంగా వాదించారు, ఎవరు నిజాయితీగా మాట్లాడారు అనేది ఎవరికీ అక్కరలేదు. ఎవరు గట్టిగా అరిచారు, ఎవరు బాగా బూతులు తిట్టారు, అవతలోణ్ణి మాట్టాడనివ్వకుండా ఎవరు ఎక్కువ గోల చేసారు.. ఇలాంటివే ముఖ్యం. డెసిబల్ స్థాయే కావాలి, అంతే! అదే కొలత. అక్కడ కూడా ఫలితం ముఖ్యం కాదు -గోలే ముఖ్యం.

బీవాలో లేని ప్రత్యేకత ఒకటి రాబంలో ఉంది.. బీవాలో ఆట తప్ప అన్నీ మనం పట్టించుకుంటాం. రాబంలో మాత్రం దేన్నీ పట్టించుకోం. ఎవడెట్టా పోయినా మనకు అనవసరం. బీవాకీ, రాబం కీ అదే తేడా.

అయితే..

బీవాలో కూడా రిఫరీ ధృతరాష్ట్రుడి లాగా, చేతకానివాడి లాగా, బక్కకోపంతో, ఒక పక్షం వారి కనుసన్నలలో డ్యాన్సాడుతూ ఉంటాడా అనేది నాకు తెలీదు. అంచేత ఆ పోలిక చెయ్యలేను.

2, ఏప్రిల్ 2008, బుధవారం

ఏప్రిల్ 1 వచ్చింది.. పోయింది!

3 కామెంట్‌లు
ఎమ్మెల్యేల ఆర్జనలపై విచారణ అన్నారు. ఇప్పటి వాళ్ళే కాదు.., 1978 నుండి ఎన్నికైన వారందరిపైనా అని అన్నారు. ఏప్రిల్ 1 న తేల్చేస్తామని అన్నారు. ఏప్రిల్ 1 వచ్చింది.., పోయింది కూడా! కానీ ఏం జరగలేదు. ఒక్కళ్ళు కూడా దాని గురించి ఎత్తలేదట.


స్పీకరు గారింకో మాటన్నారట.. ఆంధ్రజ్యోతిలో రాసారు..
అటు న్యాయ వ్యవస్థ, ఇటు పాలనావ్యవస్థ - రెండూ సరిసమానమైనవేనట,
అందువల్ల ఒకరిని ఒకరు గౌరవించుకోవాలట,
ఇప్పుడు ప్రజా ప్రతినిధుల ఆస్తిపాస్తుల గురించి విచారణ జరపవలసిందిగా తీర్మానం చేసి కోర్టును ఆశ్రయించడం అంత ఉచితం కాదట
తప్పులున్నాయేమోనని వెతకబోతే గౌరవానికి భంగమెలా అవుతుంది? చట్టం తనపని తాను చేసుకుపోనివ్వటమే గదా వీళ్ళు చేస్తోంది! కాబట్టి ఈ సందేహాలను పక్కనబెట్టి, శాసనసభ తీర్మానం చేసి, కోర్టుకు ఉత్తరం రాయాలి.

చూద్దాం.., ఇవ్వాళైనా ఆ తీర్మానం సంగతి తేలుస్తారేమో!

26, ఫిబ్రవరి 2008, మంగళవారం

పాలాభిషేకం!

14 కామెంట్‌లు
మీరు గమనించే ఉంటారు.. ఇది పాలాభిషేకాల సీజను. మనమెవరినన్నా విమర్శించామనుకోండి.. వెంటనే ఆ బాధితుడికి పాలాభిషేకం చేస్తారన్నమాట!

తెలుగువాళ్ళం మనం - సాధారణంగా అవతలి వాణ్ణి అనుకరిస్తూ ఉంటాం. స్వతహాగా మనదైన దాన్ని ఛీత్కారంగా చూట్టం మనకలవాటు. అదే అవతల వాడు చేసే చెత్త పని కూడా మనం నెత్తినెట్టుకుని పూజిస్తాం, అణకువతో పాటిస్తాం. మరి, ఈ పాలాభిషేకాన్ని ఎక్కడ నుండి పట్టుకొచ్చాం? కొంపదీసి మనమే కనిపెట్టామా ఏంటి? ఒకవేళ మనమే కనిపెట్టి ఉంటే ఇది త్వరలోనే చస్తుంది లెండి. అది కలకాలం మనాలంటే దానికి పేరు మార్చి ఏదో ఒక ఇంగ్లీషు పేరు - "మిల్క్ పోరింగ్ సెరిమనీ" లాంటిదన్నమాట- పెట్టేస్తే కలకాలం అలా పడుంటుంది.

సరే.. విషయానికొస్తా. దివంగతులైన నాయకులు కాబట్టి, విగ్రహాలకు పాలు పోస్తున్నారు. బతికున్న వాళ్ళను విమర్శిస్తే ఏం చేస్తారో? అప్పుడు కూడా పాలాభిషేకాలు చేస్తారా? అలా చెయ్యాలని నేను పిలుపునిస్తున్నాను. అప్పుడే కదా మనకు వాళ్ళ మీద ఉన్న మహాభిమానం యావదాంధ్ర దేశానికీ తెలిసేది? ఉదాహరణకు, రాజశేఖరరెడ్డిని, చంద్రబాబునూ ఎవరన్నావిమర్శించారనుకోండి.. వెంటనే మనం పాల బూతుకెళ్ళి ఓ వందో వెయ్యో లీటర్ల పాలు కొనేసి వాళ్ళింటి కెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు..

చంద్రబాబు: బావుంది, కానివ్వండి. ఎవ్వరు ఎవ్వరిని విమర్శించినా ఇలాగే పాలాభిషేకాలు చేసుకుంటూ ముందుకుపోండి. అన్ని పార్టీలవారూ ఈ పద్ధతి పాటించాలని, హెరిటేజ్ పాలు ఇందుకు శ్రేష్టమనీ మనవి చేసుకుంటా ఉన్నాను.

రాజశేఖరరెడ్డి: ఎవడబ్బ సొమ్మని పాలాభిషేకం చేస్తారు? లాగులేసుకున్నప్పటి నుండి నన్ను తిడుతూనే ఉన్నారు.. ఎప్పుడన్నా పాలు పోసారా నాకు? ఇప్పుడు కొత్తగా ఏంటిది? ఇదంతా చంద్రబాబు కుట్ర! తన పాల కంపెనీ బాగు పట్టం కోసం వేసిన ఎత్తిది. నేను మేళ్ళు చేసేది ప్రజలకు.., అంతే! ఈ పాలాభిషేకాలు జరగనిచ్చే ప్రశ్నే లేదు.

ఎమ్మెస్: ఆయన తన ఇంట్లో తలుపులన్నీ వేసేసుకుని, కుర్చీలో వెనక్కు వాలి, కాళ్ళు చాపుకుని, కుర్చీలోనే దాదాపుగా పడుకున్నట్టుగా కూచ్చుని ఉన్నాడు. టీవీ విలేకరొకడు ఎలాగో ఇంట్లోకి జొరబడి ఆయన్ని విసిగిస్తున్నాడు..

"ఏంటి సార్.., ఇలా ఇంట్లో కూచ్చుని తలుపులేసుకున్నారేంటి?"
"ఏం జెప్పమంటావయా? ఆ కేసీయారేమో మమ్మల్ని సన్నాసులు, చవటలు, దద్దమ్మలు అని తిట్టిండు కదా.. మా పార్టీ కార్యకర్తలకు బాధేసిందట. పాలాభిషేకం చేస్తామని వెంటపడుతుర్రు. ఒద్దురా, పాలు పోసుకుంటే ఆ జిడ్డు పోదురా, అట్టలు కట్టేసి, చీమలు పట్టేస్తాయిరా అని మొత్తుకున్నా వినటం లేదు. ఏం చెయ్యనూ? అందుకని ఇలా! అక్కడికీ.. 'కేసీయారు మనోడేలే, అతడో మాటన్నా మనం పట్టించుకోకూడదు' అని చెప్పా! వాళ్ళు వింటేగా.. పాల క్యాన్లు తీసుకుని వెంటపడ్డరు!"


మరి సినిమా అభిమానులు పార్టీల కార్యకర్తలకేమైనా తీసిపోయారనుకున్నారా?

'మహాస్టారు' జిడ్డు బాబు నటించిన "ముష్టి వెధవ" సినిమా విడుదలై రెండ్రోజులైంది. రాష్ట్రం మీద కొదిలిన 350 పెట్టెల్లోనూ 250 దాకా తిరుగు ప్రయాణపు ఏర్పాట్లలో ఉన్నాయి. ఇలా లాభం లేదని పెద్దయెత్తున సక్సెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి హడావుడి చేసారు. మాజీ గవర్న రొకరినీ, రిటైరైపోయిన నిర్మాతొకణ్ణీ, మరో పది మంది భట్రాజుల్నీ పోగేసి, గొప్ప సభ ఏర్పాటు చేసి, తమ సినిమా విజయగాథను వినిపించారు. మరసటి రోజు పేపర్లలో ప్రముఖంగా వచ్చిందా వార్త. అయితే కొత్త కెరటం అనే ఒక పత్రికలో మాత్రం దాంతోపాటు ఆ సినిమాపై సమీక్ష కూడా వచ్చింది. ఈ కొత్త కెరటానికో తిక్క ఉంది.. నిజాలు రాసేస్తూ ఉంటుంది (వింతగా ఉంది కదా! తిక్క మరి, ఏం చేస్తాం!!). దాంతో పాపం సమీక్షను నిజాయితీగా రాసేసారు. ఇహ చూస్కోండి.. కలతచెందిన మహాభిమానులు ఊరూ వాడా ఏకం చేసి, పాల క్యాన్లు పట్టుకుని హైదరాబాదుకు వెళ్ళారు. 'అన్నయ్యా, నిన్ను విమర్శించిన కొత్త కెరటానికి తగిన శాస్తి చెయ్యాలి.. రా నీకు పాలాభిషేకం చేస్తాం' అని గోల చెయ్యసాగారు. బాబు బేజారెత్తిపోయి, సెక్రటరీతో '..ఇదేం గొడవయ్యా? పిచ్చి..లు తయారయ్యారు. ఏదో ఒకటి సర్ది చెప్పి పంపెయ్యి' అని బతిమిలాడాడు. ఆ సెక్రెటరీ అసాధ్యుడు.. తుఫాన్ను కూడా తన ఇంటి మీదకు రాకుండా పక్కింటోడి మీదకు మళ్ళించగల ఘనుడు; ఇలా అన్నాడు వాళ్లతో.. "కొత్త కెరటం తిట్టింది సినిమాను కదా.. అంచేత ఆ దర్శకుడికి అభిషేకం చెయ్యండి." అని ఎగేసాడు. ఇదీ నిజమేననుకుని అందరూ పొలోమని దర్శకుడి దగ్గరికి పోయారు.

అతడికప్పటికే సంగత్తెలిసి, రాష్ట్రమొదిలిపెట్టి పోడానికి బట్టలూ అవీ సర్దేసుకుని సిద్ధంగా ఉన్నాడు. పాపం కాస్త ఆలస్యమై వీళ్ళకి చిక్కిపోయాడు. వెంటనే రూటు మార్చి, "ఇదిగో ఇప్పుడే నిర్మాత దగ్గరికి పోతున్నాను. మన సినిమా గురించి నిజాలు రాసేసారు కదా, నాకెంతో బాధేసింది. అందుకని నేను ఆయనకు పాలాభిషేకం చెయ్యటానికి పోతున్నాను, మీరూ రండి" అని వాళ్ళను వెంటేసుకుని నిర్మాత దగ్గరికి పోయాడు. (ఈ మాత్రం సృజనాత్మకతను ఆ సినిమా క్కూడా వాడుంటే, అది మరో నాల్రోలు ఆడి ఉండేది)

ఆ నిర్మాత కూడా తక్కువోడేం కాదు. అసలే సినిమా పెట్టెలు తిరుగు ప్రయాణంలో ఉన్నాయని తెలిసి తిక్కలో ఉన్నాడు, ఆ పెట్టెలిక ఎలాగూ పనికిరావు. పైగా, వాటిని దాచి పెట్టడానికి స్థలం దండగ. ఇదంతా ఆలోచించి ఒక ప్లాను వేసాడు.. 'అభిషేకం నాకెందుకయా.. తిట్టింది సినిమాను కదా.. పొయ్యి ఆ సినిమా రీళ్ళకు చెయ్యండి, ఆ కొత్త కెరటం తిక్క కుదురుద్ది' అని చెప్పాడు. మహాబాబు గారి యువసేన అది విని బుర్రూపుకుంటూ పాల క్యాన్లు తీసుకుని సినిమా క్యాన్ల కోసం పరుగో పరుగు!

నీతేవిటంటే - మిమ్మల్నెవడూ తిట్టకుండా చూసుకోండి.. లేకపోతే మీ వీరాభిమానులు మీకు పాలాభిషేకాలు చేసీగల్రు!

2, ఫిబ్రవరి 2008, శనివారం

జోగయ్యా, ఇదేం గోలయ్యా?

9 కామెంట్‌లు
అసలు చిరంజీవి పార్టీ పెడతాడో లేదో, పెట్టినా జోగయ్యనందులో చేర్చుకుంటాడో లేదో గానీ ఈయన మాత్రం ఇంకా పెట్టని ఆ పార్టీలోకి జొరబడి పోయాడు.

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలికి ఉత్తరం రాసి, ఆమెను నిదర లేపుదామనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఉత్తరాన్ని కాపీ టు సీయెమ్, కాపీ టు పీయెమ్ లాగా ప్రతీ వాడికీ ఇవ్వటంతో , ఆయన అసలు ఉద్దేశం చిరంజీవికి దగ్గరవడం తప్ప పార్టీ శ్రేయస్సేమీ కాదని తేలిపోయింది.

ఈ అత్యుత్సాహంలో చిరంజీవి కూతురి పెళ్ళి సంగతి కూడా తెచ్చి, పుండును మళ్ళీ రేగగొడుతున్నాడు. ఆమె "నన్నీ గొడవల్లోకి లాగొద్ద"ని అంటోంది. అటూ ఇటూ చేసి, చిరంజీవిక్కూడా కోపం తెప్పించి, రెంటికీ చెడేట్టున్నాడు జోగయ్య.

29, జనవరి 2008, మంగళవారం

రాబోయే పార్టీకి కాబోయే కార్యకర్తల దౌర్జన్యం!

11 కామెంట్‌లు
కొట్టిందెవరో తెలీదు. గుంటూరు, సత్తెనపల్లి, హై.ల్లో దాడులు/దాడి ప్రయత్నాలు జరగడాన్ని బట్టి అభిమానులే చేసారనుకోవాలి. చిరంజీవి కూడా అభిమానులే చేసారనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడు.. అందుకే తాను క్షమాపణలు చెప్పుకున్నాడు.

చిరంజీవి అభిమానుల ప్రవర్తన ఆశ్చర్యం గొలిపేది కాకపోవచ్చు. ఈరోజుల్లో హీరోలందరి అభిమానులూ ఇలాగే ఉన్నారు. సినిమాల్లోని హీరోయిజమే నిజజీవితానికీ ఆపాదించి తమ హీరో ఏదో మానవాతీతుడని భావిస్తారు. వాళ్ళని వెనకేసుకు వస్తున్న హీరోల ప్రవర్తనా ఊహించనిదేం కాదు.

11, జనవరి 2008, శుక్రవారం

కారు చౌక, చవక కారేం కాదు!

1 కామెంట్‌లు
టాటా నానో! లక్ష కారు వచ్చేసింది. లక్షణంగా ఉందట. వెలకే నానో గానీ, ఆకారానికి నానో కాదట! భేష్, టాటా!
------------------

ఈ కారు ప్రభావం హై.లో ఎలా ఉండబోతోందని ఆలోచిస్తున్నారు. హై.లో మొదటేడు ఇరవై వేల నానోలు కొంటారని ఓ అంచనా అట. కార్ల రద్దీని తట్టుకునేందుకు గాను, రవాణాశాఖ వాళ్ళేవో ప్రణాళికలు వేస్తున్నారని ఈనాడు రాసింది. అవి ఇవీ:

10, జనవరి 2008, గురువారం

రెండో ఎస్సార్సీ - ఎప్పుడో చెయ్యిచ్చిన కాంగ్రెసు, తెరాస!

6 కామెంట్‌లు
తెలంగాణ ప్రస్థానంలో మరో మలుపు కాబోయే ఎస్సార్సీ ఏర్పాటు దాదాపు ఖాయమైనట్టే! ఎస్సార్సీ వద్దని దాదాపుగా అన్ని పార్టీలూ గోల చేస్తున్నాయి. కాంగ్రెసు మాత్రం అదే మా విధానమని అంటోంది.

ఇక ప్రజలకు చేస్తున్న మోసం విషయం .. నిజమే మోసం జరుగుతోంది.. అయితే ఆ మోసం ఇప్పుడు కాదు.., కాంగ్రెసు, తెరాస - రెండు పార్టీలూ కలిసి 2004 ఎన్నికలప్పుడే చేసాయి. ఒప్పందాన్ని స్పష్టంగా రాసుకోకుండా తమకిష్టమైన రీతిలో దాన్ని మలచుకునేలా రాసుకుని మనల్ని మభ్యపెట్టారు.

సంబంధిత టపాలు