30, ఆగస్టు 2006, బుధవారం

రాంగురోడ్డు బాధితులు

2 కామెంట్‌లు
ప్రభుత్వంలో పలుకుబడి కలిగినవారు, మాన్యులు తమ ఇష్టం వచ్చినట్లు రింగురోడ్డును మెలికెలు తిప్పినపుడు సామాన్యులు మొదటిసారి నష్టపోయారు. ఆగస్టు 30 న శాసనసభలో అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి వాళ్ళని మరోమారు దెబ్బకొట్టారు. శాసనసభలో భూసేకరణ విషయమై చర్చలో పాల్గొన్న తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ మంచి మంచి పాయింట్లు లేవనెత్తుతూ, ప్రభుత్వం, అధికారులు కలిసి సామాన్యుడిని ఎలా వంచించారో గణాంకాలతో సహా వివరిస్తూ ఉన్నారు. ఒక అరగంట పాటు సాగిన ఆ ప్రసంగం చూసిన వారికెవరికైనా అనిపిస్తుంది.. శాసనసభలో ఈ మధ్య కాలంలో జరిగిన అర్థవంతమైన ప్రసంగాల్లో ఇది ఒకటి అని. ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు ఉన్నాయి ఆయన ప్రసంగంలో!

ఇక అప్పుడు మొదలైంది రభస! స్పీకరిచ్చిన అవకాశంతో, మైకందుకుని మాట్లాడే వారిని మాట్లాడనివ్వకుండా అడ్డగోలుగా అడ్డుతగిలే రకాలు రెండు పక్షాల్లోను ఉన్నారు. కాంగ్రెసు సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి దేవేందర్ గౌడ్‌ను 'నువ్వు అక్రమంగా భూములు సంపాదించావు', 'చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెబుతావేంటీ' అంటూ మాట్లాడారు. చిరాకొచ్చిన గౌడ్, ఆవేశంతో 'ఏఁ, మాకు సంపాదించుకునే హక్కు లేదా' 'మేమేమీ మీలాగా గూండా గిరీ, రౌడీయిజం చేసి సంపాదించలేదే' అంటూ ఊగిపోయారు. ఇక గోల మొదలు. నన్ను వ్యక్తిగతంగా దూషించారు, క్షమాపణ చెప్పాలంటూ రామకృష్ణారెడ్డి డిమాండు. దానికి వంత పాడుతూ కాంగ్రెసు ఛీఫ్ విప్పు కిరణ్ కుమార్‌రెడ్డి అడ్డు తగలడం. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడడం తప్పని అనడం.. ఇలా సాగింది ఒక గంట. ఈలోగా రోశయ్య గారు లేచి, సభను కాస్సేపు వాయిదా వేసి, అసలు గౌడ్ ఏమన్నారో రికార్డుల్లో పరిశీలించి, ఆపై నిర్ణయం తీసుకొమ్మని స్పీకరుకు సూచించాడు. రోశయ్య అన్న మాటతో స్పష్టమైపోయింది, ప్రభుత్వానికి ఈ విషయంపై చర్చించడం ఇష్టం లేదని, అందుకే వాయిదా కోరుతున్నారని. చిత్రమేమిటంటే, అదే రోశయ్య గారు (శాసనసభా వ్యవహారాల మంత్రి) రెండు నిమిషాల్లోనే ఆ రికార్డును ప్రింటు తీయించి మరీ చదివారు, గౌడ్ ఏమన్నారో. ఈ మాత్రం దానికి సభను వాయిదా వెయ్యమని అడిగాడా పెద్దమనిషి!

పోనీ, కాంగ్రెసు చర్చను పక్కదారి పట్టిస్తోందనే జ్ఞానం ఉందా ప్రతిపక్షానికీ? ఎబ్బే.. అదేఉంటే వెంటనే సారీ చెప్పి చర్చను కొనసాగించి ఉండే వారే కదా! సారీ ఎందుకు చెప్పాలని వాళ్ళ పట్టుదల. అనవసరమైన పట్టుదలకు పోకుండా చర్చను ముందుకు నడిపి ఉంటే, బాధితుల గోడు కనీసం సభలో వినిపించి ఉండేది. దాదాపు పన్నెండింటికి మొదలైన రభస, ఒకటిన్నర దాకా సాగింది. ఇక స్పీకరుకు చిరాకొచ్చి, నాలుగ్గంటలదాకా సభను వాయిదా వేసారు.

ఇలాగ, శాసనసభ్యులకు మనం అప్పజెప్పిన పనిని మళ్ళీ ఎగ్గొట్టారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం అనే ఆటను తమలో తాము ఆడుకుంటూ రాజకీయులు, ప్రజల్ని మరీ ముఖ్యంగా రింగురోడ్డు బాధితుల్ని మరోసారి ఓడించారు.

26, ఆగస్టు 2006, శనివారం

వీరేశలింగం పంతులుగారి వారసత్వం

2 కామెంట్‌లు
వీరేశలింగం పంతులు గారి గురించి, ఆయన సంఘ సంస్కరణ గురించి, సాహిత్య సేవ గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. కానీ కొత్తగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆయన వారసత్వాన్ని మనమెలా కాపాడుకుంటున్నామనే దాని గురించి.

ఆగస్టు 26 మధ్యాహ్నం టీవీ9 వార్తల్లో దీని గురించి ఒక ప్రత్యేక వార్త చూసాను. ఆయన ఇల్లు ప్రస్తుతం ఒక ట్రస్టు అధీనంలో ఉంది. ప్రస్తుతం అది ఒక పేకాట గృహంగా మారిపోయిందట (టీవీ9 కెమెరాలో పడకుండా ఆ పేకాటరాయుళ్ళు ముఖాలు దాచుకోడం చూస్తే నవ్వొచ్చింది). ట్రస్టు అధిపతి మాత్రం ఇలా చెబుతున్నాడు..అక్కడ ఆటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, ఆ ఇంటి బాగోగులకే ఖర్చు పెడుతున్నారు. వీరేశలింగం పంతులుగారు కూడా పేకాట ఆడేవారు. - ఇలా చెప్పుకుంటూ పోయాడా పెద్దమనిషి. (ఏమిటో ఆసికాలు!)

ఇక మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే.. పంతులుగారు రాసిన ఎన్నో రచనలు ఓ మూలెక్కడో ఉన్నాయట. వాటి ఆలనా పాలనా చూసేవారు లేక పడి ఉన్నాయట. మన సాహిత్యాభిమానులు, నెట్లో తెలుగు బ్లాగరులూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.. ఔత్సాహికులు పూనుకుని, వాటిని యూనికోడు లోకి ఎక్కిస్తే,, మనమో మంచి పని చేసినవారమౌతాం. మహాభారతం లాగానే ఇదీ ఓ మహత్కార్యం కాగలదు. ఏమంటారు?

ప్లూటో హోదా ఏమిటి?

2 కామెంట్‌లు
ఈ మధ్య గ్రహాల సంఖ్య ఒకటి తగ్గి ఎనిమిదే అయినట్లుగా తేల్చారని పేపర్లలో వచ్చింది. ఇకనుండీ ప్లూటో గ్రహం కాదట. ఎందుకని? అది గ్రహం కాకున్నా గ్రహమని పొరబడుతూ వచ్చామా? అంతర్జాతీయ ఖగోళ సంఘం వాళ్ళ వెబ్‌సైటు చూస్తే మనక్కొన్ని విషయాలు తెలుస్తున్నాయి..
ఇప్పుడు గ్రహపు నిర్వచనాన్ని మార్చారు. కొత్త నిర్వచనం ప్రకారం ప్లూటో గ్రహం కాకుండా పోయింది. ప్లూటో గ్రహం కాకపోతే మరేంటి? మరుగుజ్జు గ్రహమట!

ఖగోళ సంఘం వాళ్ళు కొత్త నిర్వచనాలను ఇలా ఇచ్చారు.. ఈ నిర్వచనాల తయారీకి వాదనలూ, తర్జన భర్జనలూ జరిగాయట! (వారి డెఫినిషన్లకు ఇవి నిర్వచనాలు, అంతే!)

1. గ్రహం

  • సూర్యుడి చుట్టూ తిరిగేది
  • గోళాకారాన్ని నిలబెట్టుకునేందుకు కావలసినంత గురుత్వ శక్తి కలిగిఉండడం కోసం అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేది.
  • దాని కక్ష్య యొక్క ఇరుగు పొరుగులను ఖండించకుండా ఉండేది.

2. మరుగుజ్జు గ్రహం/బుల్లి గ్రహం
  • సూర్యుడి చుట్టూ తిరిగేది
  • గోళాకారాన్ని నిలబెట్టుకునేందుకు కావలసినంత గురుత్వ శక్తి కలిగిఉండడం కోసం అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేది.
  • దాని కక్ష్య తన ఇరుగు పొరుగు కక్ష్యలను ఖండిస్తూ ఉండేది.
  • ఉపగ్రహం కానిది
(ప్లూటో కక్ష్య కొంత మేర నెప్ట్యూన్ కక్ష్యను ఖండిస్తూ ఉంటుంది, అందుకే పాపం దాని హోదా తగ్గిపోయింది.)

3. ఇతర సౌర వ్యవస్థా వస్తువులు
  • సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కాని మిగతా వస్తువులన్నిటినీ కలిపి ఇతర సౌర వ్యవస్థా వస్తువులు అంటారు. ఏస్టెరాయిడ్లూ, తోకచుక్కలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
ఇక్కడ కొద్ది సందిగ్ధత.. కొత్తగా ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ అనే ఖగోళ వస్తువులను మూడో వర్గంలోకి చేర్చారు. దాని నిర్వచనం ప్రకారం ప్లూటో ఇందులోకి కూడా వస్తుంది. ఏదేమైనా ప్లూటో ప్రస్తుతం గ్రహం కాదు. కానీ హిందూ నవగ్రహాలకు మాత్రం ఏ ఢోకా లేదనుకుంటాను.

25, ఆగస్టు 2006, శుక్రవారం

తెలంగాణ ధ్వనులు

2 కామెంట్‌లు
తెలంగాణ ధ్వనులు ఇలా వినవస్తూ ఉన్నాయి:
చిన్నారెడ్డి: టీఆర్‌సీసీసీ ఏర్పాటులో ఈయనది ప్రముఖపాత్ర. ఒకప్పుడు వైఎస్‌కు సన్నిహితుడైనా, తెలంగాణ అంశంపై ఆయనతో విభేదించిన వ్యక్తి. (ఒక సందర్భంలో అప్పటి సీఎల్పీ నాయకుడు వైఎస్ తో చిన్నారెడ్డి ముభావంగా ఉంటే, ఆయనే "ఏంటి చిన్నా, నాపై కోపమా?" అని అడిగారు వైఎస్.) అలాంటి 'చిన్నా' ఇప్పుడు 'తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోంది, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్నట్లు'గా అభిప్రాయపడుతున్నారు. అధికార వ్యామోహం ఎన్ని పిల్లిగంతులైనా వేయిస్తుంది! రాబోయే విస్తరణలో చిన్నారెడ్డికి మంత్రిత్వం వచ్చినట్లేననుకుంటాను.
ప్రణబ్‌ముఖర్జీ: తెలంగాణపై ఏర్పాటైన కమిటీకి నాయకుడీయన. యాభై ఏళ్ళుగా రాని తెలంగాణ ఆర్నెల్లలో వస్తుందా అని అడుగుతున్నారు. ఈ ఆలోచన మనసులో పెట్టుకుని తెరాసతో ఇన్నాళ్ళుగా వ్యవహారం నడిపారంటే, ఆశ్చర్యం కలుగుతుంది. నిన్నటి దాకా ఇదుగో అదుగో అన్నారు కదా, అలా అనకుండా ఇదేమాట అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. కాంగ్రెసు పైపై కబుర్లు చెబుతూ కాలం నెట్టుకొచ్చింది. తెరాస పైపై కబుర్లు వింటూ (అవి నిజమని నమ్మినట్లు మనల్ని నమ్మిస్తూ) కాలం నెట్టింది.
టీవీ9: చత్తీస్‌గఢ్ ఏర్పాటయ్యాక అక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారయిందో చూపిస్తూ ఒక విశేష వార్తను ప్రసారం చేసారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అక్కడ నక్సలైటు పేట్రేగిపోయినట్లే తెలంగాణ ఏర్పడ్డాక కూడా అలాగే కావచ్చని భయప(పె)డుతున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు ఎడాపెడా చెప్పేస్తున్నారు.

24, ఆగస్టు 2006, గురువారం

వాయిదా వెయ్యడమెందుకు?

7 కామెంట్‌లు
తెలంగాణపై తెరాసకు మొడిచెయ్యి చూపించినందుకు గాను వాళ్ళు రెండు రోజులుగా శాసనసభను పనిచెయ్యనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేస్తోందిదీ..

పొద్దున్నే వాయిదా తీర్మానానికై నోటీసు ఇస్తారు. వాయిదా తీర్మానమంటే - ముందనుకున్న పనిని ఆపేసి, వీళ్ళడిగిన అతి ముఖ్యమైన వ్యవహారాన్ని చర్చించాలి అని. స్పీకరు గారు దానికి ఒప్పుకోరు. దాంతో గోల చేస్తారు. సభను కాస్సేపు వాయిదా వేస్తారు. మళ్ళీ గోల చేస్తారు. మళ్ళీ వాయిదా.. ఈసారి మరుసటి రోజుకు.

ఏ పనీ చెయ్యకుండా సభను వాయిదా వేసేబదులు, వాళ్ళడిగిన విషయాన్ని చర్చిస్తే పోతుంది కదా! కనీసం దాని గురించిన చర్చన్నా జరుగుతుంది. స్పీకరు గారు ఎందుకలా చెయ్యడం లేదు? అసలేపనీ చెయ్యకుండా సభను వాయిదా వెయ్యడం ఎందుకు? శాసనసభ నిబంధనలు తద్విరుద్ధంగా ఉన్నాయా?

23, ఆగస్టు 2006, బుధవారం

రావోయీ అనుకోని అతిథీ!

1 కామెంట్‌లు
ఒక విషయం గమనించారా? బ్లాగుస్పాటులో పైన లింకుల పట్టీలో చివరన ఉన్న NEXT BLOG అనే లింకును చూసారా? అది నొక్కితే అప్పుడే తాజాకరించిన బ్లాగు మనకు కనిపిస్తుంది. నేను స్టాటుకౌంటరు గణాంకాల్లో చూస్తూ ఉంటాను, ఏ సంబంధమూ లేని బ్లాగుల నుండి నా బ్లాగుకు లింకులు వస్తూ ఉంటాయి. గమనించగా తేలిందిది.. నా బ్లాగులో నేను కొత్త జాబు పెట్టీ పెట్టగానే వచ్చిన ఈ అనుకోని అతిథులు (తిథి లేకుండా వచ్చేవారే కదా అతిథులు) ఆ లింకు ద్వారానే వచ్చారని! వాళ్ళు తమ బ్లాగుల్లో NEXT BLOG నొక్కిన సమయానికి నేను నా బ్లాగును తాజాకరించి ఉంటాను. ఏదేమైనా మన బ్లాగుకు ట్రాఫిక్కు పెరుగుతోంది, సంతోషమే కదా!

అనుకోని అతిథీ! స్వాగతం!!

ఏంటి, మీకీ సంగతి తెలుసా!? అయినా పర్లేదు, నే రాస్తాను. నేను వికీపీడియా వాడిని.. ఏదీ చిన్న విషయం కాదు, తెలుసు కాబట్టి మనకది చిన్నది, తెలియని వారికి.. అది పెద్దదే, తెలుసుకోవలసిన విషయమే.

22, ఆగస్టు 2006, మంగళవారం

రాజీనామా ఎందుకు చేసారబ్బా!?

2 కామెంట్‌లు
తెరాస కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చేసింది

ఏదో ఒక రోజున జరగాల్సిందే! కాస్త ముందు జరిగినట్లు అనిపిస్తోంది. ఇప్పుడెందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చింది? కారణాలు వెతకగలమా!?.

1. ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం: ఇది కారణం అని అనిపించడం లేదు. నమ్మకం సడలుతున్న మాట వాస్తవమే గానీ అది కేవలం తాత్కాలికం. తెలంగాణను కాగితాల మీద నుండి వాస్తవ రూపానికి తెచ్చే క్రమంలో విజయానికి అతి చేరువగా వచ్చింది, తెరాస. పైగా తెలంగాణ కోరుతున్న నాయకుల్లో కె.సి.ఆర్ అంతటి వాగ్ధాటి, ప్రజాదరణ, రాజకీయ చాతుర్యం ఉన్న నాయకుడు మరొకరు లేరు. ఈ ఎరుక ప్రజలకు ఉంది.

2. మేథోవర్గం వత్తిడి: కేసీఆర్‌కు ఇప్పటి వరకు వెన్నుదన్నుగా ఉన్న మేథోవర్గం ఆయన్ను వీడి, ప్రత్యేకంగా ఉద్యమించే అవకాశాలు కనిపించి ఉండొచ్చు. వాళ్ళు ప్రజానాయకులు కాకపోవచ్చు గానీ, ప్రజల్లో గౌరవం ఉన్నవారు! మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లోనూ, ఎన్నారైలలోను మద్దతు కూడాగట్టడంలో వీరు ప్రముఖ పాత్రే పోషించారు. ఈ సైద్ధాంతిక బలాన్ని తెరాస వదులుకోజాలదు. ఇది ఒక కారణం కావచ్చు.

3. కాంగ్రెసు తెరాసను వదిలించుకునే సూచనలు: దీనికి అవకాశం లేదు. బలహీనపడిన తెరాసను వదిలించుకోవాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెసుకు ఇలాంటి పనులు ఆత్మహత్యా సదృశమే!

4. కేంద్రానికి మధ్యంతర ఎన్నికల సూచనలు: ఒకవేళ అటువంటి సూచనలే గనక కనిపించి ఉంటే, కేసీఆర్ ప్రాప్తకాలజ్ఞతతో ఈ పని చేసినట్లే! ఇప్పటికే స్థానిక ఎన్నికలలో తగిలిన దెబ్బలకు బొప్పి కట్టిన తెరాస మరో ఎన్నికలకు కాంగ్రెసుతో కలిసి పోజాలదు. తప్పనిసరిగా సొంత బలంపైనే ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ.. 'మధ్యంతర' సూచనలు ఏమీ కనిపించలేదే! ఒక్క ఆ సర్వే తప్ప (మధ్యంతర ఎన్నికలు పెడితే కాంగ్రెసు లాభపడుతుందని ఓ సర్వే తెలిపింది)

5. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో తెరాస మద్దతుకు గండి కొడుతోంది: "తెలంగాణ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేసి, కాంగ్రెసు ప్రజల అభిమానాన్ని పొంది ప్రజలను పూర్తిగా తనవైపు తిప్పుకుంటోంది. దాంతో తెరాస ప్రాబల్యం తీవ్రంగా దెబ్బతింటోంది." ఈ వాదనను కాంగ్రెసు వాళ్ళు కూడా నమ్మరు. కేసీఆర్ నమ్మే ప్రశ్నే లేదు.

6. తెలుగు దేశం బలపడుతోంది: నిజమే, ఆందోళన చెందవలసిన విషయమే! ఆందోళన చెందాల్సింది ఇప్పటికే జరిగిన దాని గురించి కాదు, ముందు ముందు దేశం మరింత బలపడటం గురించి. ముందే మేలుకుని ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించుకోక పోతే దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇది ఒక కారణం కావచ్చు.

7. ఎన్నికల సమాయత్తం: మధ్యంతర ఎన్నికలు వచ్చి ఎన్నికలు ముందుకు జరిగితే తప్ప, హడావుడి పడాల్సిన పనిలేదు. మరో రెండున్నర ఏళ్ళ పాటు ఉద్యమాన్ని నడపాలంటే మాటలు కాదు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే నమ్మకం ఉంటే తప్ప ఇది కారణం కాబోదు.

8. జయప్రకాశ్ నారాయణ కొత్త పార్టీ: ప్రస్తుతానికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. పైగా అది తెలంగాణేతరుల పార్టీ కాదని ప్రజలు నమ్మాలంటే ప్రముఖ తెలంగాణా వాదులు అందులో చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడప్పుడే దాని గురించిన భయం లేదు.

ఇప్పుడేం చేస్తారు: మరి తెరాస ఇప్పుడేం చెయ్యబోతోంది? హింసాత్మక ఉద్యమమా? లేక ఇదివరకటిలా శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్మించుకు రావడమా? రెండోదే చేస్తారని అనిపిస్తోంది. హింసాత్మక ఉద్యమం తాటాకు మంట లాంటిదే ననీ, ఎక్కువ కాలం మనజాలదనీ కేసీఆర్ కు తెలియనిది కాదు.


సవాళ్ళు
:
  • రాబోయే మూడు నాలుగు నెలలు కేసీఆర్‌కు చాలా కీలకం. ప్రజల్లో తనకున్న ఆదరణను మళ్ళీ ఈ కాలంలో నిరూపించుకోలేకపోతే, పార్టీ నాయకులను తన వెనక నడిపించుకోవడం చాలా కష్టం. పైగా తెరాసను ముక్కలు చేసేందుకు కాంగ్రెసుకు ఇక ఏ అడ్డూ లేదు. ఇది కేసీఆర్ కు అతిపెద్ద సవాలు.
  • ఎన్నికలు మామూలు సమయానికే జరిగితే, అప్పటి దాకా ఉద్యమాన్ని నిర్వహించడం మరో సవాలు.
  • తమకూ కాంగ్రెసుకూ మధ్య ఒప్పందం వివరాలేమిటో చెప్పి కాంగ్రెసు మోసం చేసిందని, తన తప్పేమీ లేదనీ, ప్రజలకు తెలియజెప్పాలి. ఇది ఒక చిన్న సవాలు.
  • ప్రస్తుతం కేసీఆర్ బలం తగ్గింది, నరేంద్ర బలం పెరిగింది (సాపేక్షికంగా). నరేంద్రను జాగ్రత్తగా సమర్ధించుకుంటూ వెళ్ళాలి... మరీ ముఖ్యంగా పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో! అదీ ఓ సవాలే! అధికారం లేని వేళ అది పెద్ద సవాలు!! అయితే ప్రజల్లో తనకున్న ఆదరణను నిరూపించుకుంటే అదోపెద్ద సమస్య కాకపోవచ్చు.
మొత్తమ్మీద ఎన్నికల వేళ కుదిరిన ఒప్పందం విషయంలో కాంగ్రెసు మనకోమాట, తెరాసకోమాట చెప్పిందనిపిస్తోంది. లేదా కనీసం "అశ్వత్థామ హతః కుంజరః" అని తెరాసతో అని ఉండాలి. ఈ సంగతి తెలిసి కూడా తెరాస ఇన్నాళ్ళు మిన్నకుండి ఉండాలి. ఈ విషయాలు త్వరలో తెలవొచ్చు. లేదూ, సోనియా గాంధీ ప్రధానమంత్రి ఎందుకు కాలేదో ఇప్పటికీ తెలియనట్లే ఇది కూడా తెలీకపోవచ్చు.

ఏదేమైనా రాబోయేది కేసీఆర్ కే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా గడ్డుకాలమే! మాధ్యమాలకు బోల్డంత సరుకు!

20, ఆగస్టు 2006, ఆదివారం

వికీపీడియా ఎందుకు చూడాలి?

0 కామెంట్‌లు
అష్టవిధ వివాహాలు ఏమేంటో మీకు తెలుసా?
దశావతారాలేమేంటి?
"చూపితివట నీనోటను.., బాపురే! పదునాల్గు భువనభాండంబుల.." పాట వినని తెలుగువాడుండడు. ఏమిటా 14 భువనాలు?
పంచభక్ష్యాలతో, షడ్రసోపేతమైన భోజనం గురించి విన్నాం, తిన్నాం. ఏమిటా పంచ భక్ష్యాలు, షడ్రసాలు?

వీటన్నిటి గురించి తెలుసుకోవడం ఇప్పుడిక బహు తేలిక! తెలుగు వికీపీడియా చూడండి. ఏకోనారాయణ దగ్గరనుండి, అష్టాదశపురాణాల దాకా, ఎనలేనివి ఎన్నదగినవీ అయిన వ్యాసాలెన్నో ఉన్నాయి అక్కడ. ఆ వ్యాసాలు చూడండి, మీకు తెలిసిన విషయాలు రాయండి. వికీ యజ్ఞంలో పాలుపంచుకోండి.

ఈ వ్యాసాలకు కర్తలు త్రివిక్రమ్ , వైఙాసత్య , కాసుబాబు లకు అభినందనలు. ఓ చెయ్యేసిన ఇతర వికీజీవులకూ అభినందనలు. వీరంతా వికీపీడియా ప్రాముఖ్యతను మరో మెట్టు ఎక్కించారు. శభాష్!

పదాలు, దపాలు

5 కామెంట్‌లు
ఓ పదం.. ఆ పదంలోని హల్లులను అటూఇటూ మారిస్తే మరో అర్థవంతమైన పదం. హల్లులు స్థానాలు మారతాయి గానీ, గుణింతం మాత్రం యథాస్థానంలోనే ఉంటుంది. దాంతో ఆ రెండు పదాలను పలికే తీరు (శబ్దం) ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకు మోహము, హోమము. రెండింటిలోని హల్లులు - మ, హ, మ - అటూ ఇటూ అయ్యాయి. గుణింతం మాత్రం స్థానం మారలేదు. (ఇంగ్లీషులో అనాగ్రం అనే పదముంది. ఒక పదంలోని అక్షరాలన్నిటితో కూర్చిన మరో పదం లేదా పదబంధాన్ని అనాగ్రం అంటారు.) కానీ ఈ పదాల్లో హల్లుకు ఉండే గుణింతం మారిపోతుంది. అంచేత ఇవి అనాగ్రం లు కావు. వీటినేమనాలో!!? (అనాగ్రంలు కానివి - అగ్రంలు :-) ) అయితే ఈ పదాల RTS స్పెల్లింగు (hOmamu - mOhamu) మాత్రం అనాగ్రమే!

15, ఆగస్టు 2006, మంగళవారం

వెంటాడే జ్ఞాపకాలు

3 కామెంట్‌లు
కొన్ని విషయాలుంటాయి. ఎప్పుడో ఓసారి యథాలాపంగా వాటి గురించి తెలుసుకుంటాం. అప్పటికి వాటిని వదిలేస్తాం. కానీ, తరువాత ఆ విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ ఓసారి వాటి గురించి తెలుసుకుందామని అనుకుంటాం గానీ తెలుసుకోలేం. ఎక్కడా వాటి గురించిన సమాచారం దొరకదు. దాంతో అవి తెలుసుకోవాలన్న యావ పెరిగిపోతుంది. అలాంటిది నాకు ఒకటుంది.

ఎప్పుడో కనీసం ఓ పాతికేళ్ళ కిందటి విషయమై ఉంటుంది. రేడియోలో ఓ పాట విన్నాను. సినిమా పాట కాదు. ముసలి , నిరుపేద దంపతులు తమ కొడుకును తలుచుకుంటూ అతన్ని ఉద్దేశించి పాడే పాట అది. ఆరుగాలం శ్రమించి కొడుకును పెద్ద చదువులు చదివిస్తే, అతడు 'పెద్దవాడై' వీళ్ళను పట్టించుకోడు. ఆ బాధతో వాళ్ళు పాడే పాట అది. గుండెను మెలిదిప్పే పాట. ఓ రెండు వాక్యాలు మాత్రం గుర్తున్నాయి -

"కళ్ళజోడూ పెట్టుకోనీ నల్ల బూడుసు తొడుక్కోని,
కొడుకో బంగారు తండ్రీ... నిను కలకటేరు అనుకుంటిరో"

ఇలా సాగుతుంది, ఆపాట.

ఇలాంటిదే ఇంకో పాటుంది.. తన సొంత ఊరి గురించి ఒకతను పాడుకునే పాట అది.. చాలా బాగుంటుంది. అక్కడక్కడా ఓ రెండు పాదాలు గుర్తున్నాయి.

ఏటి గట్టు మీద ఉంది మాఊరు..
...
...
మాఊరు ఒకసారి వెళ్ళి రావాలి.

ఈ పాటలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే నాకో ముక్క రాయండి, నేనూ కొనుక్కుంటాను. నాకు తెలిస్తే ఇక్కడ రాస్తాను. (ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోవు.)
మీకూ ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా?

14, ఆగస్టు 2006, సోమవారం

నేడే స్వాతంత్ర్య దినం.. వీరుల త్యాగఫలం

0 కామెంట్‌లు

జయ జయ జయ భారత జనయిత్రీ దివ్యధాత్రీ...

జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

అవినీతి జాడ లేని భారతంలో
అందరికీ చక్కటి విద్య దొరికే భారతంలో
మనమంతా సుఖశాంతులతో జీవించాలని ఆశిస్తూ
స్వతంత్ర భారతం 59 నిండి అరవయ్యో ఏట అడుగుపెడుతున్న వేళ, తోటి భారతీయులందరికీ శుభాకాంక్షలు.

13, ఆగస్టు 2006, ఆదివారం

పొంతన లేని ఆంగిక వాచికాలు

4 కామెంట్‌లు
కొన్నేళ్ళ కిందటి సంగతి. అరవంలో ఒక టీవీ నాటకమో, సినిమానో వచ్చిందట. అందులో మూలాంశం ఏమిటంటే.. కరెంటు పోయినప్పుడు ఒక ఇంట్లోని భార్యాభర్తలు ఎలా ప్రవర్తిస్తారు అనేది. ప్రేక్షకుల్లో దానికి చాలా మంచి స్పందన వచ్చిందని చదివిన గుర్తు. కరెంటు పోయేది నాటకం లోని పాత్రలకే. ప్రేక్షకులకు అన్నీ శుభ్రంగానే కనబడుతూ ఉంటాయి. పాత్రలకు మాత్రమే కనపడవన్నమాట. (అచ్చు మన సినిమాల్లో హీరో వేసే మారు వేషాల్లాగా. మారు వేషం వేసింది హీరోయేనని పసి వెధవక్కూడా తెలిసిపోతుంది గానీ, సినిమా పాత్రలెవరికీ తెలియదు!) మగ పాత్ర కమలాసను చేసినట్లు చదివిన గుర్తు. నేనది చూడలేదు, ఎక్కడో చదివాను.

అదే పద్ధతిలో మన సినిమాల్లోని పాటలను ధ్వని పూర్తిగా తీసేసి, కేవలం అభినయాన్నే చూస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? భలే గమ్మత్తుగా, తమాషాగా ఉంటుంది. పిచ్చి వెధవల్లాగా గెంతుతున్నారేమిటి వీళ్ళిద్దరూ అని అనిపిస్తుంది. (ఆ గెంతులు చూసే మన సంగతి ఇక చెప్పేదేముంది లెండి!)

మరి.. మన రాజకీయ నాయకులు మాట్లాడేటపుడు ఇలాగే మోత లేకుండా ఉత్త వాళ్ళ ఆంగికాన్ని మాత్రమే చూస్తే ఎలా ఉంటుంది? నిజానికి మామూలుగా కూడా వాళ్ళ మాటల్లో వినడానికి సరుకేమీ ఉండదు కాబట్టి వినకపోయినా పరవాలేదు, అది వేరే సంగతి! (అయితే ఈమధ్య వాళ్ళు మనల్ని తిడుతున్నారు కాబట్టి, ఏమని తిడుతున్నారో తెలీడం కోసమన్నా వినాలేమో!)

చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి నమూనా మనకు. ఆయన మాట్లాడేటపుడు చేతులూపుతూ తర్జని చూపిస్తూ మాట్లాడతారు. ధ్వని లేదు కాబట్టి మనకెలా అనిపిస్తుంది? తర్జని చూపిస్తున్నాడు కాబట్టి .. 'మిమ్మల్నందరినీ తుక్కు కింద కొట్టిస్తాను ఏమనుకుంటున్నారో' అని ప్రతిపక్షాలను, స్పీకరును బెదిరిస్తిన్నుట్లు ఉంటుంది. అరచేతిని తెరిచి అడ్డంగా ఊపడం చూస్తే.. 'మీరెంత ఏడ్చి మొత్తుకున్నా మిమ్మల్ని వదిలేది లేదు' అన్నట్లుగానూ ఉంటుంది. నిజానికి ఆయన మాట్లాడేది ఇలా ఉంటుంది.. (ముఖ్యమంత్రిగా శాసనసభలో మాట్లాడేటపుడు)

"అధ్యక్షా, నేనొకటే చెప్తున్నాను..మేము చాలా ఆలోచిస్తున్నాం..ఏదీ వదలడం లేదు అధ్యక్షా..కాంగ్రెసు వాళ్ళు అనుకుంటున్నారేమో..మేము దేన్నీ వదలం..ప్రతీ దాన్నీ ఆలోచిస్తాం.. ఇప్పటికే ఈ విషయంలో చాలా ముందుకు పోయాం..ఇంగా ముందుకు పోతాం..మీరొక్కటాలోచించమని మనవి జేసుకుంటున్నానధ్యక్షా..మేం టోటల్గా ఆలోచిస్తున్నామధ్యక్షా.. ఇంగా ఆలోచిస్తాం..", తర్జని చూపిస్తూ.."దేన్నీవదలం అధ్యక్షా..ప్రతిదీ ఆలోచిస్తాం..రాజశేఖరరెడ్డి గారు నవ్వుతున్నారు..నవ్వండి..నవ్వండి..మీరలా నవ్వుతూనే ఉండండి..మేం మాత్రం ఆలోచిస్తూనే ముందుకు పోతాం. ఇలా విపరీతంగా ఆలోచించి, ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నానధ్యక్షా" (ఆయన పని చేస్తామని చెప్పడం లేదు, ఆలోచిస్తామనే చెబుతున్నారు. ఎందుకు చెయ్యలేదు అని అడిగే హక్కు మనకున్నా జవాబు చెప్పాల్సిన ఖర్మ ఆయనకు లేదు.ఆయనే కాదు మంత్రులకూ నేర్పారు అలా మాట్లాడ్డం)

ఇక రాజశేఖరరెడ్డి గారు.. మొహమ్మీద చిరునవ్వు చెరగనీయరీయన. చంద్రబాబుకు చిర్రెత్తింపజేసే చిర్నవ్వది! మోత లేకుండా చూస్తే ఆయనేదో మంచి కులాసా కబురు చెబుతున్నాడల్లే ఉందే అనుకుంటాం. చేతివేళ్ళన్నిటినీ ఒకచోటికి చేర్చి ప్రతిపక్షాలను ముద్దు చేస్తున్నట్లుగా (చిన్నపిల్లలను చుబుకం పట్టుకుని ముద్దులాడినట్లు, అన్నం ముద్దలు చేసి తినిపిస్తున్నట్లు) అనిపిస్తుంది, చూసేవాళ్ళకు. కానీ ఆయన ప్రసంగం ఇలా సాగుతుంది...

"ఏంటయ్యా ఫాక్షనిస్టు అని ఏప్పుడు నామీద పడి ఏడుస్తారు? ఏమయ్యా బాబూ, నువ్వేమన్నా పత్తిత్తువా? నీ మావను వెన్నుపోటు పొడిచి చంపించావు, నేనేమన్నా అన్నానా? నువ్వు సింగపూరులో, మలేషియాలో ఆస్తులు కూడబెట్టావు, నేనేమన్నా అన్నానా? నేను మాట్లాడేటపుడు నువ్వు మధ్యలో రాకు నాగం, నోరు మూసుకుని కూర్చో! 'అయ్యా, రైతులు ఇబ్బందులు పడుతున్నారూ, వాళ్ళను పట్టించుకోవయ్యా' అని అంటే పట్టించుకున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా? ఇప్పుడు మేము ఇవన్నీ చేస్తుంటే కుళ్ళుకుంటున్నావు. ఈ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తాము, మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం. ఏదో అవినీతి, అవినీతి అని నోరు పారేసుకుంటున్నారు, మీరేమైనా తక్కువ తిన్నారా? బియ్యం అమ్ముకున్నది మీరు కాదా? వాడికీ, వీడికీ అప్పనంగా భూములను పంచేసింది మీరు కాదా! ఇప్పుడు.. అవినీతిపై విచారణ జరపాలా? విచారణ జరిపించే ప్రశ్నే లేదు, ఏంచేసుకుంటారో చేసుకోండి."

ఈ రెండు ఉదాహరణల ద్వారా నే చెప్పొచ్చేదేమంటే రాజకీయులు చెప్పేదానికీ, చేసేదానికి పొంతన ఉండనట్లే.. వాళ్ళ ఆంగికానికీ, వాచికానికీ కూడా పొంతనుండదు అని.

అన్నట్టు, మన రాజకీయాలపై కె.ఎన్.వై పతంజలి గారు ఒక కథ రాసారు, పేరు గుర్తు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికై రాజకీయులు వేసే ఎత్తులు, జిత్తుల గురించిన కథ అది. చాలా హాస్యస్ఫోరకంగా రాసారు. శాసనసభ సమావేశాల అంకం కూడా ఉన్నదందులో. అది చదువుతూ కడుపుబ్బ నవ్వుకుంటాం. ఆ కథతో పాటు మరి కొన్ని ఆయన కథలు, నవలికలను కలిపి ఒక సంకలనంగా వేసారు. ఖాకీవనం కథ, వేటకథలు కూడా అందులో ఉన్నాయి. బాగుంటాయా కథలు. చదవకపోతే, తప్పక చదవండి.

12, ఆగస్టు 2006, శనివారం

ఎన్నోవాడు?

5 కామెంట్‌లు
ఆ ఫోటోలో మీవాడు ఆ చివరి నుండి ఎన్నోవాడు?
ఈ వాక్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించండి. "ఎన్నోవాడు" ను ఎలా అనువదిస్తారో చూడాలనుంది, అంతే!
ఎన్నోవాడు, ఎన్నోరోజు ఇలాంటివి ఇంగ్లీషులోకి అనువదించలేమట.
ఇలాంటివి ఇంకా ఉన్నాయా?

11, ఆగస్టు 2006, శుక్రవారం

శబ్ద కాలుష్యం

4 కామెంట్‌లు
హుస్సేనుసాగరు కాలుష్యానికి కోస్తా, రాయలసీమ వాసులే కారణమట, నరేంద్ర గారు వాక్రుచ్చారు. వాళ్ళిక్కడికి వచ్చి, కాలనీలు కట్టుకుని, పరిశ్రమలు పెట్టుకుని కాలుష్యాన్ని, మాలిన్యాల్నీ సాగరులోకి పంపి దాన్ని కలుషితం చేసారట! సాగరు కాలుష్యానికి నగరీకరణ, పారిశ్రామికీకరణ కారణమనడంలో అవాస్తవమేమీ లేదు. కానీ దీనికి ఫలానా వాళ్ళే కారణమనడం.. అన్యాయం.

ఇంకా నయం.. ఆయన జుట్టు తెల్లబడటానికి కారణం కూడా వాళ్ళే ననలేదు.

అసలు సాగరు కాలుష్యానికి అందరి కంటే ఎక్కువ బాధ్యులైన ఓ నలుగురు వ్యక్తులను ఏరాల్సి వస్తే ఆ జాబితాలో ఖచ్చితంగా ఆయన గారుంటారు. వినాయక నిమజ్జనం సాగరులోనే చెయ్యాలని వాదించి, వేధించిన వారిలో వీరే కదా ప్రముఖులు!
(ఏమైతేనేం, కోర్టు ఈసారికి ఒప్పుకుంది, వచ్చే ఏటి నుండి ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పింది)

ఈయన అన్‌ఫిట్!

3 కామెంట్‌లు
వారికది జీవధార, జీవనాధారం. అమ్మ, దైవం కూడా. అలాంటి గోదారి పొంగి, పొర్లి, కూడూ గుడ్డా గూడూ ఎత్తుకెళ్ళిపోయింది. చుట్టూ నీళ్ళే.. కానీ తాగేందుకు చుక్క పనికిరాదు. ఎటు చూసినా నీళ్ళే, నీళ్ళంటేనే భయపడేలాగా. రోజుల తరబడి తాగేందుకు సరైన మంచినీళ్ళు కూడా దొరకలేదు. ఇక తిండి సంగతి సరేసరి. ఈ పరిస్థితిలో ప్రజలెలా ఉంటారు? దీనంగా ఉంటారు, ప్రభుత్వ సాయం కోసం, మన అనుకున్న వాళ్ళ ఓదార్పు కోసం మొహం వాచి ఉంటారు. రోజులు గడుస్తున్నా పట్టించుకునే వాడే లేడన్న ఆవేదనతో కడుపు మండి ఉంటారు. సాయం చెయ్యాల్సిన బాధ్యత ఉన్న పెద్దమనిషి కనపడినపుడు నిలదీసి, అడిగేసి, కడిగేస్తారు.


వాళ్ళనెలా చూసుకోవాలి? తిండీ నీళ్ళూ ఇవ్వాలి. తలదాచుకునేందుకు చోటివ్వాలి. ఏం పర్లేదు నేనున్నానంటూ ధైర్యం చెప్పాలి. మరి వీళ్ళ ఎమ్మెల్యే ఏమన్నారు? వీళ్ళనాదుకోవాల్సిన వీళ్ళ ప్రతినిధి వీళ్ళనెలా గౌరవించారు? ప్రభుత్వం ఇచ్చే సాయం వీళ్ళకి అందేలా చూడాల్సిన కుడుపూడి చిట్టెబ్బాయి గారు ఏమన్నారు?

మీ అంతు తేలుస్తానన్నారు! నా కులం పేరెట్టి మాట్లాడతారా, మీ ఊరి నేంచేస్తానో చూడండన్నారు! ఎగబడి కొట్టబోతే, నలుగురైదుగురు కలిసి వెనక్కి లాగాల్సొచ్చింది. టీవీల్లో ఆ వీరంగం చూసి నివ్వెరపోవడం ప్రజల వంతు అయింది.

అంతా అయిపోయాక చిట్టబ్బాయి సిసలైన మాటొకటన్నారట.. "ఇదొక దురదృష్టకర సంఘటన" అని.

అవున్నిజమే, దురదృష్టం ప్రజలది. మిమ్మల్నెన్నుకున్నారు గదా! ఇప్పుడు ముంచెత్తిన ఈ వరద పెద్ద లెక్కలోది కాదు. వరద తగ్గాక ఇదే గోదారి చలవతో మళ్ళీ పంటలూ, జీవితాలూ పండించుకుంటారు, వీళ్ళు. ఈ కష్టాలు మరచిపోతారు. కానీ.. కాని కాలంలో కాని మాటలన్నారే.. మీ ఈ మాటలను మరచిపోగలరా?!

చిట్టబ్బాయీ! "ఈయన అన్‌ఫిట్" అంటూ అరుస్తున్న ఆ గ్రామస్తుల అరుపులు చెవుల్లో రింగు మనడం లేదూ!?

8, ఆగస్టు 2006, మంగళవారం

భావ దారిద్ర్యం, భావ దాస్యం

4 కామెంట్‌లు
చిన్న విషయంగా అనిపించవచ్చు. కాస్త ఆలోచిస్తే ఏమిటి మనకింత అవివేకం అనిపిస్తుంది. బొంబాయిలో జూలై 11 న పేలుళ్ళు జరిగితే.. దాన్ని 7/11 అన్నారు. నిజానికి మన పద్ధతి ప్రకారం అది 11/7. మరి అలా ఎందుకన్నారు? అమెరికా వాళ్ళు ముందు నెల పెట్టి ఆపై తేదీ పెడతారు కాబట్టిన్నీ, 9/11 అనేది, వాళ్ళ దేశంలో ఇలాంటిదే ప్రముఖ దాడి జరిగిన తేదీ కాబట్టిన్నీ, దానికి ప్రాస కుదురుతున్నది కాబట్టీ దాన్ని మనం 7/11 అన్నాం! దీనికి ప్రధాన కారకులు కొందరు మాధ్యమాల వాళ్ళు, మరీ ముఖ్యంగా కొత్త పుంతలు తొక్కుతున్నామనుకుంటూ పెడదోవలు తొక్కే టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికిల్, టీవీ9 లాంటి ప్రసార సాధనాలే!

6, ఆగస్టు 2006, ఆదివారం

ప్రజలతో జయప్రకాష్ నారాయణ ఫోనాఫోని

0 కామెంట్‌లు

ఇవ్వాళ - ఆగస్టు 6 ఆదివారం - సాయంత్రం 6 నుండి 7 వరకు టీవీ9 లో జయప్రకాష్ నారాయణతో ఫోను లో మాట్లాడే కార్యక్రమం జరిగింది. ప్రజలు నేరుగా టీవీ9కి ఫోను చేసి ఆయనతో మాట్లాడే కార్యక్రమం ఇది. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన ప్రజల ప్రశ్నలకు చక్కగా సమాధానమిచ్చారు. తమ పార్టీ ప్రసక్తిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఆయన దీన్ని బాగా వాడుకున్నారు.

జేపీ చెప్పిన ముఖ్యమైన విషయాలివి.

  • పార్టీపై ప్రజల స్పందన చాలా బాగుంది.
  • ప్రజాస్వామ్యంలోను, పార్టీలోను నాలుగు విషయాలకు ప్రాధాన్యం..
    • యువత
    • మహిళలు
    • చదువు పొందలేని వర్గాలు
    • మధ్యతరగతి
  • ప్రజల చుట్టూ రాజకీయం తిరగాలి.
  • విద్య, ఆరోగ్యం కేంద్రంగా పాలన జరగాలి. సమాజంలో ఉపాధ్యాయుడు, ఆరోగ్య కార్యకర్త ముఖ్యమైన వారు.
  • పార్టీకి మూలాధార సూత్రాలు..
    • అతర్గత ప్రజాస్వామ్యం
    • చందాలు కేవలం చెక్కుల ద్వారానే
    • ఎన్నికల ఖర్చు కమిషను నిర్దేశించిన దానికంటే పైసా కూడా ఎక్కువ పెట్టం
    • ఎన్నికల్లో సారా, డబ్బూ వంటి అవినీతికర పద్ధతులకు పాల్పడం
    • ఒకవేళ మావాళ్ళే ఎన్నికల అవినీతికి పాల్పడితే, వాళ్ళను ఓడించమని మేమే ప్రచారం చేస్తాం.
  • అయ్యేయెస్సులూ, మంత్రులూ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రీ వీళ్ళు కాదు పెద్దవాళ్ళు.., ప్రజలు పెద్దవాళ్ళు. వీళ్ళంతా ప్రజలు చెప్పినపని చెయ్యాలి, చెయ్యమన్నప్పుడు చెయ్యాలి, వద్దన్నప్పుడు మానెయ్యాలి. రాజకీయాలను ప్రజల చుట్టూ తిప్పాలన్నదే లోక్సత్తా ఉద్దేశ్యం.
  • రిజర్వేషన్లు: కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు మరి కొన్నాళ్ళపాటు ఉండాలి. అయితే వాటిని క్రమబద్ధీకరించాలి. కుల, వర్గ విచక్షణ లేకుండా అందరికీ నాణ్యత గల చదువును ఇవ్వాలి.
  • అక్టోబరు మొదటి వారంలో పార్టీ ఏర్పాటు.
  • ఆగస్టు 9 పార్టీ విధానాల ప్రకటన.
  • పార్టీలో చేరాలన్న ఔత్సాహికులు ఆగస్టు 9 తరువాత, కింది చోట్ల సంప్రదించవచ్చు...
    • ఉచిత ఫోను: 1 800 425 2979
    • ఈ అడ్రసుకు ఉత్తరాలు రాయవచ్చు: పోస్టుబాక్సు: 100, హైదరాబాదు– 4
  • జయప్రకాష్ నారాయణ ఇంకా ఇలా అన్నారు...
    • పాలకులు సేవకులే.
    • రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలందరికీ తెలుసు. కానీ అది వస్తుందనే నమ్మకమే వారికి లేదు.
    • చెడ్డవాళ్ళ దుర్మార్గం కన్నా మంచివాళ్ళ మౌనం ప్రమాదకరం.
    • చర్చలిక ఆపేసి, చర్యలు మొదలుపెడదాం.
  • కార్యక్రమం చివర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఏవీయెస్ రెడ్డి ఫోను చేసారు. ఎన్నికల కమిషను చేతకానిది అంటూ నిర్దాక్షిణ్యంగా అనేక అభాండాలు నాపైన వేసారు కదా, మీకది భావ్యమా? అని అడిగారు. దీనికి జయప్రకాష్ నారాయణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. అయితే వోటరు పేర్లపట్టిక తయారీలో రాష్ట్ర ఎన్నికల కమిషను అధికారాలు పరిమితం అని మాత్రం చెప్పారు.
నేనివి అడగాలనుకున్నాను. ఎంత ప్రయత్నించినా లైను దొరకలేదు.
  1. అధికార భాషగా తెలుగు అమలు విషయంలో, మాతృభాషలో విద్యాబోధన, తెలుగు భాషాభివృద్ధి విషయాల్లో మీ విధానం ఏమిటి?
  2. అవినీతి విషయమై మీ అభిప్రాయాలు సుస్పష్టం. అయితే అవినీతి అంటని పార్టీలు ఇప్పటి రాజకీయాల్లో లేనే లేవు. మరి, ప్రస్తుత సంకీర్ణ యుగంలో మీ పార్టీ పొత్తుకు వెళ్ళాల్సి వస్తే.., ఈ అవినీతిమయ పార్టీలతో పొత్తు విషయంలో మీ విధానం ఏమిటి?
జయప్రకాష్ నారాయణ రాజకీయ ప్రవేశంపై తమ అభిప్రాయాలు ఎస్సెమ్మెస్సుల ద్వారా పంపమని టీవీ9 వాళ్ళు ప్రజలను అడిగారు. 93% మంది అనుకూలంగా స్పందించారు.

మంచి కార్యక్రమం. టీవీ9 కు అభినందనలు.

3, ఆగస్టు 2006, గురువారం

ఏమిటీ ధోరణి!

0 కామెంట్‌లు
ప్రత్రిపక్షాల పట్ల కక్ష, అలక్ష్యం చూపించే పాలకులను చూసాం.
పత్రికల్లో వచ్చిన వార్తలను అడ్డగోలుగా ఖండించే వాళ్ళను చూసాం.
శ్రీరంగనీతులు చెబుతూ, తామనుకున్నది చేసుకుపోయే ప్రబుద్ధులనూ చూసాం.
ప్రజలను నిలువునా మోసం చేసిన దగాకోరులనూ చూసాం.

కానీ..

నువ్వెంత అంటూ ప్రతిపక్షాలను, పత్రికలను,ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థలను, కోర్టులను కూడా తేలిక చేసి బహిరంగంగా మాట్లాడిన ఘనత మాత్రం ఈ కాంగ్రెసు ప్రభుత్వానిదే! ప్రజలను ఎగతాళి చేసేందుకు కూడా వెనకాడని మంత్రులున్నారు మనకు. మందుకు డబ్బులు తగలేసే బదులు కెపాసిటరు కొనుక్కోండన్న మంత్రి ఒకరు.

వీళ్ళు లంచాలు మేస్తున్నారోయ్ అంటూ ప్రతిపక్షం అరిస్తే ఏం మీరు తినలేదా అని అడిగే దొరలు వీరు.

వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపితే ఎవర్నీ వదలరు. ప్రతిపక్షాలు, పత్రికలు, ఎన్నికల కమిషను ఇలాగ, చివరికి కోర్టులను కూడా.

  • "ఆ రెండు పత్రికలనూ మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి."; "అసలా పత్రికను నేను చదవను." అని ఏకంగా ముఖ్యమంత్రే అన్నారు. పత్రికలపై దాడిలో ముఖ్యమంత్రే స్వయంగా దారి చూపించారు కదా, ఆ దారినే వెళ్తున్నారు మంత్రులూను.
  • వ్యతిరేక వార్తలు రాస్తోందని ఈనాడు పత్రికను, దాని అధిపతిని బండబూతులు తిట్టిన మంత్రి - జక్కంపూడి రామ్మోహనరావు గారు - మనకున్నారు.
  • దివాకరరెడ్డి గారు విలేకరులను తిడితే వాళ్ళు ఆయనపై ఫిర్యాదు చేసేదాకా వెళ్ళారు.
  • ఎన్నికల కమిషను విశాఖ ఉప ఎన్నికను రద్దు చేస్తే, కాంగ్రెసు పార్టీ రాష్ట్రాధ్యక్షుడే స్వయంగా ఇలా అన్నారు.. "ఇది వాళ్ళ జాగీరా ఏంటి ఏకపక్షంగా రద్దు చేసెయ్యడానికి"? ఈ ఎన్నికలోనే కాంగ్రెసు ఎమ్మెల్యే గండి బాబ్జీ తుపాకితో జనాలను బెదిరిస్తే, అతనిపై కేసు పెట్టినపుడు, పోలీసులను తప్పించుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఆ తరువాత ఆ కేసు గతి ఏమైందో తెలీదు.
  • స్థానిక ఎన్నికలపై కోర్టు ఇచ్చిన తీర్పు పైనా, అదే కేసులో పై కోర్టు చేసిన వ్యాఖ్యలపైనా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వీరి అసహనాన్ని సూచిస్తాయి. కోర్టు వ్యాఖ్యలు ఎన్నికల్లో మాకు చెడు చేసేవి గానూ, ప్రతిపక్షానికి మేలు చేసేవిగాను ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి.
  • గన్యా జ్వరంపై ప్రభుత్వ నిర్లిప్తత, స్పందన వీరి నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. "గన్యా పట్ల ప్రజలకు అవగహన లేదు" అని ఆరోగ్య మంత్రి రోశయ్య గారు అన్నారు. వారికి అవగాహన కలిగించడం మీ పనే కదా, మరి మీరేం చేస్తున్నట్లు?! మీ నిర్వాకాన్ని విమర్శిస్తున్న పత్రికలూ, పతిపక్షాలను ఎదుర్కొనేందుకు కత్తులు నూరుతున్నారా? విమర్శకు ప్రతివిమర్శ జవాబు కాదండీ, విమర్శలో సద్విమర్శను స్వీకరించి తప్పులు దిద్దుకోవాలి, అదీ పెద్దల లక్షణం. పోనీ పత్రికలది తప్పు - మీపై కక్ష గట్టారు. తెలుగుదేశానిది తప్పు - మి మంచిపనుల్ని (!) విమర్శించడమే దాని లక్ష్యం. మరి, నల్లకుంట లోని ఆ అమ్మ మిమ్మల్ని అడిగేసి, కడిగేసింది కదా, ఆమెకూ మీమీద కక్షేనా? (ఆరోగ్య మంత్రి రోశయ్య నల్లకుంట వెళ్ళినపుడు.. గన్యాతో మేమంతా చస్తుంటే, అధికారులు మా గోడు పట్టించుకోకుంటే, ఎందుకొచ్చావు ఇక్కడికి అంటూ తిరగబడింది ఒకామె) అది కక్షో ఆగ్రహమో గమనించండి. ప్రజాగ్రహాన్ని గ్రహించలేకే గత పాలకులు గత పాలకులయ్యారు.

    రోశయ్య గారి పర్యటనలో కొసమెరుపు: ఆ అమ్మకు జవాబివ్వలేక వెళ్ళిపోతూ అక్కడి యువకులతో మీరే వీళ్ళను చైతన్యవంతులను చెయ్యాలని సెలవిచ్చారట. (చంద్రబాబు గారు కూడా ఇలాగే అనేవారు.. మీరు మైండ్‌సెట్ మార్చుకోవాలని)
  • ఎన్నికలైన మరునాడే దేశం ప్రతినిధులను పార్టీ మార్పించి, అడ్డగోలుగా కాంగ్రెసును అనంతపురం జడ్పీ పీఠమెక్కించిన నాయకులు ఇలా అన్నారు.. "మా నాయకత్వంలోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని నమ్మి వాళ్ళు మావైపుకు చేరిపోయారు. వాళ్ళా మాట చెబుతుంటే నాకెంతో సంతోషం వేసింది" అని రఘువీరారెడ్డి గారు అన్నారు. "తాడిచెట్టెక్కింది దూడ గడ్డి కోసమని" అన్నట్టుంది, ఆ మారిన వాళ్ళు మార్చిన వాళ్ళూ చెప్పేది.
  • 60 వేల పైచిలుకు ఉద్యోగాలను పీకేసే జీవోను తెచ్చి, ప్రజలు, ప్రతిపక్షాలు, పత్రికలు గోల చేసేటప్పటికి ప్రభుత్వం మాట మార్చింది. మార్చి, వాళ్ళు ఏమన్నారు?
    "అది ఉత్తుత్తి జీవోయే! ఊరికినే జనాన్ని బెదిరిద్దామని విడుదల చేసాం అంతే!"
    "విడుదల చేసిన ప్రతి జీవోనీ అమలు చేస్తారా ఏంటీ? " ఇవి ఆర్థిక మంత్రి రోశయ్య గారి వాక్కులు. ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి!?

    ఇక ముఖ్యమంత్రి గారు.. మాటంటే తప్పేవాణ్ణి కానంటూ ఒక బహిరంగా ఉత్తరమే రాసేసారు. అది మీకూ తెలుసుకదా అని కూడా అన్నారు.
  • ఇక రాజకీయులు అధికారులను "యూస్‌లెస్ ఫెలో" అని తిట్టిన వార్తలు కనీసం మూడు చూసాను ఈమధ్య కాలంలో.
  • రాజకీయులకు, అధికారులకు మధ్య విభజన రేఖ మసకబారి పోయిన రోజులివి.
    ఎన్నికల్లో జరిగిన హింస గురించి మాట్లాడుతూ డీజీపీ ఇలా అన్నాడు.. "2001 ఎన్నికలలో కంటే తక్కువే జరిగింది." (డీజీపీ గొంతులో రాజకీయ ధ్వని!) పత్రికలలో వచ్చిన ఓ వార్తను లేదా ఓ వ్యాఖ్యను ఖండించడం వేరు.. "గాలిపటాలెగరేస్తుం"దంటూ ఓ పత్రికనే తూర్పార బట్టేసాడు. వారి శ్రీమతి గారి పిల్లల అమ్మకాల కేసు విషయమై అప్పటి అధికారులపై ఇప్పుడు ఆయన చేపట్టిన కక్ష సాధింపు మనకు తెలిసిందే! ఈ మధ్య కాలంలో కోర్టు చేత ఇన్ని సార్లు వాతలు పెట్టించుకున్న అధికారి మరొకరు లేరేమో. అది డీజీపీ గారి మరో ఘనత

    ప్రస్తుత విషయానికి సంబంధించినది కాకున్నా రాస్తున్నాను. ఈ డీజీపీ మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఉంది. అదేమిటంటే.. ఈ మనిషి తెలుగులో మాట్లాడగా నేను చూడలేదు. తెలుగు రాకా? తెలుగంటే లెక్కలేకా? తెలుగువాళ్ళంటే లెక్కలేకా? మన రాష్ట్రంలో ఇన్నేళ్ళు పని చేసిన తరువాత కూడా తెలుగు మాట్లాడడం లేదంటే.. ఆయన ఎటువంటి మనిషో చూచాయగా తెలుస్తూంది. (ఇదివరకటి డీజీపీ సుకుమార్ గారు కన్నడిగుడైనా చక్కటి తెలుగు మాట్లాడేవారు. ఈయన సంగతి ఇది.) "ఏమయ్యా తెలుగు వారి రాష్ట్రంలో ఇన్నేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు తెలుగు మాట్లాడకపోతే ఎట్లా" అని అడగలేరా!?

    (అడగలేరు. ఈ మనిషికి మేడం దన్నుందట మరి!)

సంబంధిత టపాలు