11, డిసెంబర్ 2006, సోమవారం

సీతాకోక చిలుక ప్యూపా దశకు పోతూంది

8 కామెంట్‌లు
దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉందట. హఠాత్తుగా దీన్ని ఎలా కనుకున్నాడో తెలియదు గానీ, చాలా గొప్ప సూత్రాన్ని ప్రజల్లోకి వదిలాడు, మన ప్రధానమంత్రి. రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసారో ఏంటో తెలీదు గానీ, ఇంతకు ముందెవరూ చెప్పని కొత్త విషయమిది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలో రానుండడం, అక్కడ ముస్లిము వోట్లు ఎక్కువగా ఉండడం ఈ ప్రకటనకు ముఖ్య కారణమని ప్రతిపక్షాల గోల. రాజకీయుడి గుట్టుమట్లు రాజకీయుడికి ఎరుకే గదా!


పిల్లగా ఉన్నపుడు గాడిద అందంగానే ఉంటుందట. పెద్దయ్యాకే.. వంకరకాళ్ళు, బానపొట్ట, ఇంతబారు చెవులు, చెవులదిరే స్వరమూ వస్తాయట. వంకర మాటలు, వోటుబ్యాంకు రాజకీయాల లాంటివాటిని వంటబట్టించుకుని మన ప్రధాని ఆర్థికవేత్త నుండి పూర్తిస్థాయి రాజకీయుడిగా మారినట్లే కనిపిస్తోంది.

9, డిసెంబర్ 2006, శనివారం

తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు = కరీంనగర్

4 కామెంట్‌లు
కరీంనగర్లో తెరాస గెలుపు కారణంగా తెలంగాణ వస్తుందో రాదో తెలీదు గానీ, తెలంగాణ కావాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారనేది మాత్రం తేటతెల్లమై పోయింది.
కాంగ్రెసు మోసాన్ని, కుటిలనీతిని, మాటలు మార్చే తత్వాన్ని ప్రజలు గ్రహించారు, ఆగ్రహించారు. వారి ధర్మాగ్రహమే నేటి తెరాస విజయం.
కేసీయారు పై ప్రజలకు వల్లమాలిన అభిమానం ఉందో లేదో గానీ, తెలంగాణ కాంక్షించి మాత్రం ఆయనకీ మెజారిటీ ఇచ్చారనేది సుస్పష్టం.
బీజేపీపై అపనమ్మక ముందో లేదో గానీ, తెరాస గెలవకపోతే తెలంగాణ ఏర్పాటు కష్టమౌతుందని బీజేపీని మూలన కూచ్చోబెట్టారు.

గత ఎన్నికల తరువాత కేసీయారు ఏం చేసాడయ్యా అంటే..
- రెండేళ్ళపాటు మంత్రి పదవిలో ఉండి ప్రజలనేమాత్రం పట్టించుకోలేదు
- ఇదుగో తెలంగాణ అదుగో తెలంగాణ అంటూ గడువులూ తేదీలు పెట్టి చివరికి పెదవి విరిచాడు
- నిరాహారదీక్ష అంటూ ప్రహసనం చేసాడు
పత్రికల్లో, టీవీల్లో ఒక్కరికి కూడా కేసీయారుపై సానుకూలత లేదు
ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత గత స్థానిక ఎన్నికల్లోనే తెలిసింది.

మరి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా కేసీయారు ఇంత అద్భుతంగా ఎలా గెలిచాడు?
కేసీయారుకు వోటెయ్యకపోతే తెలంగాణ కు వ్యతిరేక వోటు అవుతుందని ప్రజలు తలచారు. కేసీయారే కాదు, ఇంకెవరినైనా ఇలాగే గెలిపించేవారేమో!!
ప్రజల విజయమిది. తెలంగాణ కావాలని ప్రజలింత గట్టిగా గత ఎన్నికలలో కూడా అడగలేదు!

కరీంనగరే యావత్తెలంగాణా అభిప్రాయానికి కొలబద్దా అనే ప్రశ్నకు.. కరీంనగర్లో ప్రజలనుకుంటున్నది మిగతా తెలంగాణలోనూ అనుకోవడంలో అసహజమేముంది? కొన్ని ప్రాంతాల్లో ఇంత బలంగా అనుకోకపోవచ్చు, కొన్ని చోట్ల ఇంతకంటే బలవత్తరంగా కాంక్షించనూ వచ్చు. ఏదేమైనా, ఈ ఎన్నిక ఫలితం ప్రజల్లో తెలంగాణ కావాలన్న కోరికను మరింతగా పెంచుతుందనేది మాత్రం సత్యం.

తెరాస తెలంగాణ తెస్తామని అంటోంది, అదొక్కటే మా ఎజెండా అని అంటోంది. మంచిదే!
తెలుగుదేశం, కమ్యూనిస్టులు తెలంగాణకు వ్యతిరేకమంటున్నారు. ఆచరణలోనూ చేస్తున్నారు. తమ విధానం ఇదీ అని బయటికి చెప్పేస్తున్నారు, బానే ఉంది !
కానీ కాంగ్రెసో..?
తెలంగాణ కావాలంటోంది, కానీ ఇవ్వడంలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు కలిసిరావడం లేదంటూ దొంగమాటలు చెప్పింది. వాళ్ళసలు కలిసివస్తామని ఎప్పుడు చెప్పారు? కలుస్తానంటున్న బీజేపీని కాదంటోంది. ఇప్పుడు, కరీంనగర్లో కన్ను లొట్టబోయాక, దిగ్విజయ్ ఏమంటున్నాడు.. తెలంగాణ కావాలంటే రెండో ఎస్సార్సీ వెయ్యాల్సిందే. (నిజానికి 2004 ఎన్నికలకు ముందు వాళ్ళు తెరాసతో చేసుకున్న ఒప్పందమిదే, కానీ ఇంత గట్టిగా ఎప్పుడూ చెప్పలేదు, నానుస్తూనే ఉండేవారు) పైగా ఎస్సార్సీ వెయ్యాలన్నా ఏకాభిప్రాయం కావాలని అంటున్నాడు!

కాంగ్రెసు ఏనాడూ నమ్మదగ్గ పార్టీ కాదు. జవహర్‌లాల్ నెహ్రూ గురించి తెరాస నాయకులు ఓ విషయం చెబుతూ ఉంటారు.. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేటపుడే నెహ్రూ ఇలా అన్నాడట, "గడుసు ఆంధ్రకు అమాయక తెలంగాణను ఇచ్చి పెళ్ళి చేస్తున్నాను, ఎప్పుడు నచ్చకున్నా తెలంగాణ విడాకులు తీసుకోవచ్చు" అని. అది నిజమో కాదో తెలీదు (ఎందుకంటే, ఉద్యమ ప్రస్థానంలో తెరాస నాయకులూ, వారి వంతగాళ్ళూ ఎన్నో అబద్ధాలను వ్యాపింపజేసారు) నిజమే అయితే..
పెళ్ళి రోజే, స్వయానా పెళ్ళి పెద్దే విడాకుల దీవెనలిస్తాడా? అసలదేం నీతి? బ్రిటిషు వాళ్ళు దేశాన్ని చీల్చి వెళ్తే, ఈయన రాష్ట్రాన్ని చీల్చదలచిన వారికి ఓ కారణాన్ని ఇచ్చిపోయాడు. అసమానతలు ఏర్పడకుండా ఖచ్చితమైన నిబంధనలు ఏర్పాటు చెయ్యొచ్చు కదా. చెయ్యాల్సిన బాధ్యత, చెయ్యగల అధికారమూ గల పదవిలోనే ఉన్నాడు కదా. రాష్ట్రం ఏర్పడ్డాక, ఎనిమిదేళ్ళ పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆ నిబంధనలు సరిగా అమలు జరిగేటట్లు చూడొచ్చు కదా. పైగా ఇక్కడ ప్రభుత్వం చెలాయిస్తున్నది ఆయన పార్టీయే! అయినా కూడా, సంయుక్త రాష్ట్ర తొలిముఖ్యమంత్రే ఉప ముఖ్యమంత్రిని నియమించక, పెద్దమనుషుల ఒప్పందాన్ని అతిక్రమించినపుడు ప్రధానమంత్రిగా ఉండీ, ఆయనేం చేస్తున్నట్లు?

నెహ్రూ గురించి ఎందుకు చెబుతున్నానంటే, కాంగ్రెసు నాయకుల సంగతులిలా ఉంటాయని చెప్పేందుకే. మోసం వారి నైజం. గత రెండున్నరేళ్ళుగా వాళ్ళు తెలంగాణకు, తెరాసకు చేసిందిదే! ప్రజలకీ మోసం కళ్ళక్కట్టింది. కోపగించారు. తెలంగాణ సెంటిమెంటు ఎంతుందో యాంటీ కాంగ్రెసు సెంటిమెంటూ అంతుంది! కాంగ్రెసు వాళ్ళీ రకంగా పచ్చి మోసం చెయ్యకపోయి ఉంటే కేసీయారు నేడింత అద్భుతంగా గెలిచి ఉండే వాడు కాదు.

7, డిసెంబర్ 2006, గురువారం

మార్గదర్శి

4 కామెంట్‌లు
మార్గదర్శిది తప్పని రిజర్వు బ్యాంకు తేల్చేసింది. అందులో డబ్బు పెట్టిన వారికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేం లేకపోవచ్చు. కానీ, మార్గదర్శి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినట్లుగా ఋజువైంది. ఒకటీ రెండూ కాదు, 2200 కోట్ల రూపాయలు ప్రజల దగ్గరి నుండి సేకరించింది. నిబంధనలకు వ్యతిరేకంగా చెయ్యడం అనైతికతే కాదు, నేరం కూడా.

సేకరించిన డబ్బులను సకాలంలో తీర్చెయ్యాలని ఆదేశించింది, బానే ఉంది. కానీ అసలు సేకరించడం తప్పు గదా, దానిపై చర్యలేం తీసుకుంటుందో చూడాలి. అసలిన్నాళ్ళుగా ఈ విషయం బ్యాంకు దృష్టికి రాకపోవడమే ఆశ్చర్యం. ఇదివరలో ఒకాయనెవరో ఫిర్యాదు చేసారట కూడాను. అయినా చర్యలేం తీసుకోలేదు. అప్పుడెందుకు తీసుకోలేదు? అంతా మాయ, రాజకీయ మాయ.

ఒకటి మాత్రం వాస్తవం, మార్గదర్శి మన దగ్గరి నుండి డబ్బులు తీసుకోకూడదు. కానీ తీసుకున్నారు, తప్పు చేసారు. ఇంత ఇరకాటపు పరిస్థితుల్లో కూడా మార్గదర్శులు జోకులేసి, కామెడీ చేసారు చూడండి..
  • రిజర్వు బ్యాంకు వాళ్ళు 'ఏమయ్యా మీరు ఇలా డబ్బులు తీసుకోకూడదు కదా, ఎందుకు తీసుకున్నారు' అని అంటే 'సారీ, మాకు తెలియక చేసాం' అని అన్నారట. (మార్గదర్శికి మార్గం తెలియలేదు!!)
  • రిజర్వు బ్యాంకు మమ్మల్ని డిపాజిట్లు తీసుకోవద్దని ఆదేశించలేదు, సూచించారంతే అని అంటోంది మార్గదర్శి (దానికి బ్యాంకు వాళ్ళు.. సూచనో ఆదేశమో ఎలా అనుకుంటారో వాళ్ళిష్టం. దాన్ని మాత్రం పాటించాల్సిందే అని అన్నారట)

తన ఉద్దేశ్యం ఏదైనా, ఉండవల్లి చేసిన పని వలన ఒక తప్పు బయట పడింది. లేకపోతే బహుశా రిజర్వు బ్యాంకు రిజర్వుడు గానే ఉండి పోయేదేమో!

మరి, ఈనాడును నియంత్రించాలన్న కాంగీయుల కాంక్ష నెరవేరేనా!? అనుమానమే, రామోజీ గ్రూపు బయటి పెట్టుబడులను తీసుకోబోతోందని దట్స్ తెలుగు అంటోంది.

సామాన్యుడి కాంక్ష.. ఈటీవీలో సుమనోత్సాహాన్ని కూడా నియంత్రించే సంస్థ ఒకటుంటే బాగుంటుంది.

5, డిసెంబర్ 2006, మంగళవారం

సడిసేయకో గాలి సడిసేయబోకే..

6 కామెంట్‌లు
జోల పాటలు, లాలి పాటలు, మేలుకొలుపు పాటలూ ఉన్నాయి. ఇది జోలకూ మేలుకొలుపుకూ మధ్య లోని పాట.. మెలకువ రాకుండా పాడే పాట!

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..

రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..


నాకెంతో ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి; రాజమకుటం సినిమాలోది. అలికిడైతే తన స్వామికి మెలకువ వచ్చేస్తుందేమోనని గాలిని కదలొద్దని అదిలిస్తోందీవిడ! నిదుర చెదరిందంటే నేనూరుకోనే అంటూ హెచ్చరిస్తోంది! "మణి కిరీటము లేని మహరాజు గాకేమి" తరువాత, "పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే" తరువాతా వచ్చే సన్నాయి వాదన.. పాటకెంత సొగసునద్దిందో! మంచి పాట!!


powered by ODEO

సంబంధిత టపాలు