గురువారం 5 నవంబర్ 2009

మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..

అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?

మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.

ఐదో తరగతి దాకా చదువు తెలుగులో చెప్పకుండా, పరాయిభాషలో చదువు చెప్పడం వాళ్ళకు వేస్తున్న అసలు శిక్ష అనేది మనం గమనించాలి. దానికితోడు తెలుగులో మాట్టాడినందుకు ఈ శిక్ష!

ఓ సంగతి చూడండి.. సాఫ్టువేరు ఉద్యోగాలు చేసే మన కుర్రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతలేదన్నా కనీసం ఓ మూణ్ణాలుగు లక్షల మందైనా ఉంటారు. "మన కుర్రాళ్ళు" అంటే 20-30 సంవత్సరాల మధ్య ఉండే తెలుగు వాళ్ళు! దాదాపుగా అంతా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళే! ప్రతీ రోజూ కనీసం ఏడెనిమిది గంటలు జాలంలో ఉంటారు. ఇంతమంది తెలుగువాళ్ళు జాలంలో తిరుగుతూంటే తెలుగు బ్లాగులను చూసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి? ఏనాడన్నా మీ బ్లాగుకు వెయ్యి మంది వచ్చారా? బ్లాగులకు సందర్శకులను సరఫరా చేసే కూడళ్ళకు కూడా వెయ్యిమంది రారు నా ఉద్దేశంలో! ఈ కుర్రాళ్ళలో బ్లాగులున్నాయని తెలవనివాళ్ళు, బ్లాగులంటే ఆసక్తి లేనివాళ్ళు కొంతమంది పోయినా, కనీసం ఒక్..క శాతం కూడా బ్లాగులను చదవడం లేదెందుకు?

తెలుగు చదవడం, రాయడం రాకే! ఇంగ్లీషు మీడియమ్ చదువులు వీళ్ళకు తెలుగును నేర్పనివ్వకుండా చేసాయి. (ఇప్పుడు బ్లాగులు చదివేవాళ్ళలో కూడా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళు బాగా తక్కువ మంది ఉండొచ్చు.) చిన్నప్పుడు తెలుగులో చదవడం, పెద్దయ్యాక (కనీసం ఇంటరుదాకా) తెలుగు చదవడం - ఈ రెండు పనులు చేస్తే తెలుగు చదవలేక/రాయలేకపోవడం అనేది ఉండదు. 

తెలుగులో మాట్టాడితేనే తప్పయ్యే పరిస్థితి బడుల్లో ఉంటే, మన పిల్లలకు తెలుగు చదవడం రాయడం వస్తుందా? వాళ్ళ పిల్లలకు మాట్టాడ్డం వస్తుందా? అంచేతే.. ఐదు దాకా పిల్లలకు చదువు తెలుగులోనే చెప్పాలి. పునాదిలో తెలుగుంటే ఆ పైన ఏ భాషలో చదివినా నెగ్గుకొస్తారు. ఆరో తరగతి నుంచి ఇంటరు దాకా ఏ భాషలో చదివినా, తెలుగు సబ్జెక్టు మాత్రం చదివి తీరాలి. ఈ పనులు చేసిన ముఖ్యమంత్రి మరో రాయలే!

~~~~~~~~~~~~~~~~~~~

సరే..
పెద్దలు కొందరు (మేధావులు) అసలు సంగతిని పక్కనబెట్టి, దీనికి సామాజిక కోణాన్ని ఆపాదిస్తూంటారు.  కులాన్ని, మతాన్ని సమస్యలోకి లాక్కొస్తారు. లాక్కొస్తున్నారు కూడా. 'పిల్లలకు శిక్ష వెయ్యడమనేది అసలు సమస్య. అంతేగానీ, తెలుగులో మాట్లాడొద్దనడం కాదు' అంటూ ఉపదేశాలిస్తున్నారు. ఆ శిక్ష వేసినవాళ్ళకు తగు శిక్ష విధించాలి అని వాదిస్తున్నారు. నిజమే ఆ పంతుళ్ళను బడినీ శిక్షించాల్సిందే, అందులో మరో అభిప్రాయం ఉండటానికి లేదు. కానీ, అదేనా పరిష్కారం? మెడలో పలక వేసిన సంగతి మనకు తెలవగానే నోరెళ్ళబెడుతున్నాంగానీ, అంతలా కాకపోయినా.. ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన మాత్రం అనేక బడుల్లో ఉంది. ఫైన్లు వేస్తారు. ఒక పీరియడ్లో నిలబెడతారు, ఐడోంట్ స్పీక్ తెలుగు అనీ వంద సార్లు రాయిస్తారు.. ఇలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళను ఏంచేస్తాం? 30 యేళ్ళ కిందటే నెల్లూరులో ఒక బడిలో "అయామె తెలుగు డాంకీ" అని రాసున్న పలకలు మెడలో తగిలించేవారని ఓ డాక్టరు గారు చెప్పారు, చూడండి. "తెలుగులో మాట్టాడకూడదనే ఆంక్షలు ఏ ఇంగ్లీషు బడిలోనైనా ఉంటాయి, ఇక్కడేదో పెద్ద హింస జరిగిపోయినట్టు చేస్తున్నారేంటి " అని కంచె అయిలయ్య అన్నాడు. నిజమే చెప్పాడు. కానీ, అందులో తప్పేమీ లేదన్నట్టు మాట్టాడ్డమే ఆయన ప్రత్యేకత!

కంచె అయిలయ్య ఇంకా ఏమన్నాడో చూడండి..
తెలుగు భాష మాట్లాడొద్దని అన్నందుకు, ఆ ప్రిన్సిపల్‌ను పిలిచి అఫిషియల్సు ఎంత హ్యుమిలియేట్ చేస్తున్నారో చూడండి.  పిల్లలకు ఆహారం లేకపోతే అఫిషియల్సు పట్టించుకోట్లేదు, మీడియా పట్టించుకోట్లేదు, సోషల్ వెల్ఫేరు స్కూల్స్ నడవకపోతే పట్టించుకోట్లేదు. బోర్డులు కట్టారనే కారణంతో ఇం..త పెద్ద నన్‌ను, ప్రిన్సిపల్‌ను హెరాస్ చేసే ప్రక్రియ మనం చేస్తున్నామే!
అని బాధపడిపోయాడాయన!

ఇంకోమాట కూడా .. ఇదేదో పెద్ద నేరమైనట్టు ఆ బడిమీద చర్య తీసుకోవడం లాంటివి చెయ్యకూడదు. పిలిచి ఓమాట చెప్పి వదిలేస్తే సరిపోద్ది అని అన్నాడు. ఆయన ప్రాథమ్యాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తోంది గదా!  మరికొందరు మేధావులు కూడా ఇలాగే సమస్యను ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.

~~~~~~~~~~~~~~~~~~~

ఇంతకీ.. అయిలయ్య ఈ సమస్యకో పరిష్కారం చూపించాడు.. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటరు  దాకా పిల్లలందరికీ మూడు సబ్జెక్టులు మాతృభాషలోను, మూడు ఇంగ్లీషులోను చెప్పాలంట. అలాగైతే రెండు భాషలూ వస్తాయంట.  ఉన్న సబ్జెక్టులు ఆరు - తెలుగు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్సు, సోషలు - ఇవేగా?
అందులో మూడు తెలుగులో చెప్పమంటున్నాడు. మాతృభాషలో చదువు చెప్పడమంటే అదే కదా ! -లెక్కలు, సైన్సు, సోషలు తెలుగులో చెబుతారు. ఈయన లెక్కేంటో అర్థం కాలేదు అని అనుకుంటూండగా, ఇంకో ముక్క అన్నాడు..
- 'సగం సిలబస్సు మాతృభాషలోను, సగం ఇంగ్లీషులోను చెప్పాలి, ఆ దెబ్బతో రెండు వచ్చేస్తాయం'ట. ఇంకోటేంటంటే.. ఇలా చదివిన పిల్లకాయలు దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా చక్కగా చదివెయ్యగలరంట !!!

అయిలయ్య చెప్పినది ఇలా ఉండగా..

~~~~~~~~~~~~~~~~~~~

ఏ తికమకా లేకుండా కొందరు పెద్దలు ఇలా చెబుతున్నారు..
"ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు చదువు ప్రవేశించి, తెలుగును మరణశయ్య మీదకి ఎక్కిస్తోంది" ఈ ముక్క ఎవరన్నారో తెలుసా.. రంగనాయకమ్మ!

"అధికార భాషగా తెలుగును అమలుచెయ్యని ప్రభుత్వానికి తెలుగు ప్రాచీనతను అడిగే నైతిక హక్కు లేదు." జ్వాలాముఖి

"గత ఇరవై యేళ్ళుగా ఇంగ్లీషు మాధ్యమ చదువులు విపరీతంగా పెరిగాయి. దాదాపు రెండు తరాల విద్యార్థులు తెలుగు రాకుండానే తెలుగును నామమాత్రంగ చదువుతూనో, అసలు చదవకుండానో పాఠశాల చదువులు, కాలేజీ చదువులూ వెలగబెట్టారు. డాక్టర్లు, ఇంజనీర్లూ అయ్యారు. వీళ్ళంతా పరభాషా సంస్కృతులకు పరాయీకరణం చెంది ఇంట్లో తెలుగు పత్రికను కనబడనీయరు, కనబడ్డా ముట్టరు. వీళ్ళు తెలుగుకు దూరమైతే వీళ్ళ పిల్లలకు రానిస్తారా? ఇలా మరో రెండు తరాలు గడిస్తే వీళ్ళంతా తెలుగు మాటకు కూడా దూరమవుతారు. ఓ సమాజంలో 20 శాతం మంది ఆ భాషను చదవకుండా చదువు ముగిస్తే ఆ భాష మృతభాష అయ్యే ప్రమాదముంది అని యునెస్కో హెచ్చరించింది."- కాలువ మల్లయ్య. ఈయన రాసిన వ్యాసం పూర్తిగా చదివి తీరాలి. మనం చూస్తున్న కొందరు ఇంగ్లీషు భక్తుల నైజాన్ని ఆ పేజీల్లో పరిచాడాయన.

వీళ్ళే కాదు, వేలమంది పెద్దలు - విద్యావేత్తలు, భాషావేత్తలు, రచయితలు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు -  తెలుగులో బోధన చెయ్యాలనీ, తెలుగును విధిగా నేర్పాలనీ చెబుతున్నారు. వీళ్ళు మనకు రాజకీయ నాయకులు కాకపోవచ్చు, కానీ నాయకులే -సాంస్కృతిక నాయకులు!

మనమంతా కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసి, పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది.

~~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~

ఈ విషయంపై పొద్దులో జరుగుతున్న చర్చ చూడండి.

Read more...

సోమవారం 2 నవంబర్ 2009

సాయంకాలమైంది!

అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది.  సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు.

పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ పొత్తే గనక 2014 ఎన్నికలలోనూ కొనసాగినా, లేక ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెసులో మునిగిపోయినా.. కాంగ్రెసు చేస్తే తప్ప ఇక అతడు హీరో కాలేడు. పాపం చిరంజీవి!

నిరుడు ఆగస్టులో బంతిలా పైకెగసింది ప్రజారాజ్యం. పార్టీ స్థాపనే దానికి ఉచ్ఛస్థితి! -ఎంత దుస్థితి! అక్కడి నుండి పతనం మొదలై గురుత్వ త్వరణంతో వేగం పుంజుకుని, ఇప్పుడు వినాశకర వేగానికి (టర్మినల్ వెలాసిటీ) చేరుకుంది. - ..పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్!

అయితే, 2012 డిసెంబరు 21 నాడు ప్రపంచం అంతమైపోద్దని చెబుతున్నారు కాబట్టి, చిరంజీవి కొంచెం తొందరపడి, పార్టీని వెంటనే కాంగ్రెసులో కలిపేసి, సోనియాను బతిమాలుకుని ముఖ్యమంత్రి అయితే మంచిది. యుగాంతంలోగా బులపాటం తీరుతుంది. లేకపోతే.., వ్రతమెలాగూ చెడింది, ఫలం కూడా దక్కకుండా పోతుంది.

---------------------

కానీ కాంగ్రెసు చెయ్యందుకోవడం తప్ప చిరంజీవికి వేరే మార్గం కూడా ఏమీ లేనట్టుంది. నానాటికి తీసికట్టు అయిపోతున్న పార్టీ పరిస్థితిని కాస్త బాగు చేసుకోడానికి కాంగ్రెసు ఆసరా అవసరమే ప్రస్తుతం. తన డజనున్నర శాసనసభ్యులను కాంగ్రెసు నుండి రక్షించుకున్నట్టే. ఇక వాళ్ళకు కాపలా కాయనక్కరలేదు.

పొత్తు కారణంగా గ్రేటరు ఎన్నికల్లో ప్రజారాజ్యానికి ఎంత ఉయోగముంటుందో గానీ, కాంగ్రెసుకు మాత్రం ఎంతో లాభం. గ్రేటరు ఎన్నికల్లో గెలిపించగల మొనగాడెవడో చూస్తామన్న అసమ్మతి వర్గానికి ఇప్పుడు మంచి సమాధానమే చెప్పింది. ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ను కట్టుగొయ్యకు కట్టేసింది. కాంగ్రెసు గొప్ప ఎత్తే వేసింది.

రోశయ్య సామాన్యుడు కాడు సుమండీ!

Read more...

శనివారం 24 అక్టోబర్ 2009

ఆ.. ట ఆగిందా!

ఒకరి సీ...టు గోవిందా! ఓ పక్క శవాన్ని పెట్టుకోని, అంత బాధనూ దిగమింగుతూ కూడా జగను బ్యాచ్చీ అంత రాజకీయం చేసారే! అంతటి కష్టంలోనూ రాజకీయం చెయ్యక తప్పని వాళ్ళ పరిస్థితిని అధిష్ఠానదేవత  ఇసుమంతైనా పట్టించుకుందా? మరీ సెంటిమెంట్లు లేనట్టుగా వ్యవహరించింది.

మా జగను కుర్రాడు-రోశయ్యేమో ముసలాడు, యువతను ప్రోత్సహించాల్సిన తరుణమిది, జగన్ను కుర్చీ ఎక్కించాల్సిన సమయమిదే అంటూ ఊదరగొట్టేసిందే జగను బ్యాచ్చీ! టీవీ కెమెరాలకు మొహాలనతికించేసుకోని వాళ్ళరుస్తూంటే, టీవీలకు కళ్ళతికించుకోని మనం చూసామే. సినిమాలు కట్టేసాం, డిస్కవరీలు, న్యాట్‌జియోలను మూసేసామే. రాజకీయ నాటకాలు చూస్తూ ఉషారు చేసుకున్నామే! జగను ముఖ్యమంత్రి కాకపోతే ఏ విప్లవమో వస్తది, మిన్ను విరిగి మీద పడుద్ది, ఇక మనకు సందడే సందడి అని అనుకున్నామే! తీరా జరిగిందేంటి?

రెణ్ణెల్ల తరవాత అధిష్ఠానం పిల్చింది. నీసంగతి నువ్వు మర్చిపో, నేజూసుకుంటాగా అని చెప్పిందని చెబుతున్నాడు, కథానాయకుడు. చెబుతూ చెబుతూ.. పాపం, ఎట్టాగోట్టా మొహమ్మీద నవ్వు పుట్టించగలిగాడు. రెణ్ణెల్లపాటు అనుచరుల చేత టీవీ కెమెరాల ముందు నాటకాలాడించి, ఇవ్వాళేమో నేనేనాడైనా పదవి కావాలని అడిగానా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎట్టైనా సరే రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలనేది తన ఆశయమంట -కొండంత రాగం తీసి, పిచ్చికుంట్ల పాట పాడినట్టుంది ఈ వ్యవహారమంతా. ఇక మామూలు కాంగ్రెసు నాయకుల్లాగే ఇతడు కూడా చాటుమాటుగా అసమ్మతి పనులు చేసుకుంటూ ఉండాల్సిందే! మా నాన్న చెప్పిన -రోజుకు 9 గంటల కరెంటు ఇవ్వడం లేదు, 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం లేదు అంటూ మొదలెట్టాడప్పుడే!

జగను బ్యాచ్చీ ఈ పనికిమాలిన దొంగచాటు అసమ్మతి పనులు చెయ్యడం మానేసి వెరైటీ కోసం మరోలా చెయ్యొచ్చు.. ఇక నుండి రోశయ్యకు రోజుకో సవాలు విసురుతూండాలి. రోశయ్య చెయ్యలేనివి, జగను చెయ్యగలిగినవీ జాగర్తగా ఎంచుకోని దమ్ముంటే రమ్మని తొడగొట్టాలి. ఉదాహరణకు, మాల్దీవుల మంత్రివర్గ సమావేశం సముద్రంలో పెట్టినట్టు, మన మంత్రివర్గ సమావేశాన్ని హుస్సేను సాగర్లో పెట్టగల సత్తా ఎవరికి ఉందో వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి అని రోశయ్యకు ఒక సవాలు విసరొచ్చు..(అయితే, ముందు జగనుకు ఈతొచ్చో రాదో కనుక్కోవాల్సిన అవసరం ఉంది.)

అలాగే.. ఇంకో పోటీ పెట్టొచ్చు - దివంగత మహానేతైనటువంటి (ఈ ముక్క నేనన్నది కాదు సుమండీ..సాక్షి టీవీలో చెబుతూంటే అటుగా పోతూ విన్నాను. సాక్షిని ఆనుకునే ఉన్న ఇంకో దిక్కుమాలిన చానెలుకు పోతూ, తప్పనిసరై సాక్షిలో ఈ ముక్క వినాల్సి వచ్చింది. ఎందుకలా అన్నారో తెలుసుకునేంత ఓపిక లేక చూళ్ళేదు) మానాన్న పోలికలు ఎవరికి ఎక్కువుంటే వాళ్ళకే ముఖ్యమంత్రి అని జగను రోశయ్యకు సవాలు విసరొచ్చు. ఈ పోటీలో ఖచ్చితంగా జగనుదే గెలుపు.ఇలాంటి ఆటలు ఇంకెన్నైనా పుట్టించొచ్చు.

------------------------------

సరే, ఇక తరవాతేంటి?
ముందుగా రాజీనామాలు: అవును రాజీనామాలే! మా జగన్ను ముఖ్యమంత్రి చెయ్యకపోతే రాజీనామా చేసి పారేస్తామన్న మంత్రులు మంత్రిణులూ పదవులకు రాజీనామాలు చేసి ఇక అవతలికి పోవడమే. నియోజకవర్గంలో తిరగలేకపోతున్నాం అని చెప్పిన, జగన్ను ముఖ్యమంత్రి చేసాకే రండి, అప్పటిదాకా రావద్దు అని ప్రజల చేత అనిపించుకున్న శాసనసభ్యులంతా ఇక రాజీనామాలు చేసేస్తే వేరేవాళ్ళను ఎన్నుకుంటాం. ఎంచేతంటే జగను ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి వీళ్ళెలాగూ ఇక నియోజకవర్గాల్లో తిరగలేరు. తిరగగలిగిన వాళ్ళనే ఎన్నుకోవాలి మరి.

రోశయ్య ఇక మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడమే! మంత్రివర్గ సమావేశాలను ఎగ్గొట్టినవాళ్ళను, సమీక్షా సమావేశాలకు రానివాళ్ళను, రాజీనామా చేసి పారేస్తామని చెప్పి పారెయ్యనివాళ్ళనూ.. పారేసి, కొత్త మంత్రులను చేర్చుకోవాలి.

రోశయ్య ఇక బేల పలుకులు పలకడం, బీద అరుపులు అరవడం మానెయ్యాలి. ముఖ్యమంత్రికి అవి శోభించవు. అంతేకాక, సుశిక్షితుడైన సైనికుణ్ణి అనేమాట మాట్టాడ్డం కొన్నాళ్ళపాటు మానెయ్యాలి. వినీవినీ చిరాకొచ్చేసింది.

-----------------------

ఆనక.. మనమిక టీవీల్లో పొద్దుటిపూట కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు నడిపే పరగడుపున రచ్చ రచ్చ, పొద్దుగాల పెద్దగోల వంటి కార్యక్రమాలను చూట్టం ఆపొచ్చు.

Read more...
ఈ మూసను తయారు చేసినవారు అవర్‌బ్లాగ్‌టెంప్లేట్స్.కామ్. శీర్షంలోని బొమ్మను వికీమీడియా కామన్స్ నుండి సేకరించాను.