25, సెప్టెంబర్ 2006, సోమవారం

స్వపరిపాలన కోసం తెలంగాణ

12 కామెంట్‌లు

నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అనేది తెలంగాణ కోరుతున్నవారి వాదన. అయితే "తెలంగాణ కావలసింది అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం" అని కేసీయార్ అంటున్నారు.


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఇతరులు కించపరుస్తున్నారు, మాండలికాన్ని హేళన చేస్తున్నారు అనే వాదన ఉంది. బతుకమ్మ, బోనాలు మొదలైన తెలంగాణ పండుగలకు ప్రస్తుతం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నది ఈ వాదనలోని భాగం. తరాలు మారే దశలో, సాంప్రదాయాలు క్రమేణా కనుమరుగు అవుతూ ఉండడం సహజం. దానికి ఇతరులను నిందించడం సరికాదు. ఇప్పటి ప్రభుత్వాలు సంస్కృతీ సాంప్రదాయాలను గాలికి వదిలేసాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విషయంపై శ్రద్ధ వహిస్తే అంతకంటే కావలసిందేమీ లేదు. ఇక మాండలికానికి సంబంధించినంత వరకు ఇది కొంత సహేతుకంగానే కనిపిస్తుంది. తెలంగాణ మాండలికానికి అధికారిక హోదానిచ్చి, గట్టిగా అమలు చేస్తే, కొత్త రాష్ట్రం వలన కలిగే గొప్ప ప్రయోజనం అవుతుందది. తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది. కానీ నిజంగా అది చేస్తారా?



ఇక స్వపరిపాలన .. ఏమిటి స్వపరిపాలన అంటే.. ఇప్పటిది కాదా? ప్రస్తుత పాలన పరాయి పాలన ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి కాకపోతే అది పరాయి పాలనేనా? అయితే పులివెందుల తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? గత ముఖ్యమంత్రి పాలనలో నారావారిపల్లె తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? లేక.. కేసీయార్ పాలిస్తే స్వపరిపాలన, లేకుంటే పరాయి పాలన అని అంతరార్థమా?

"ఆంధ్ర ప్రాంతం నుండి తరలివచ్చిన వారు ఇక్కడి పొలాలు కొని బాగుపడ్డారు, ఇక్కడ వ్యాపారాలు చేసి సంపాదించారు, మా ఉద్యోగాలు కొట్టేసి స్థిరపడ్డారు" అని ఈ తెలంగాణవాదులు అంటారు. తెలంగాణ ఏర్పడ్డాక వాళ్ళందరి అస్తులనీ, పొలాలనూ, ఉద్యోగాలను లాక్కుని తరిమేయలేరు కదా! మరి తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడికి ఎలా న్యాయం చేయబోతున్నారు? ఈ విషయమై తాము ఏమేం చెయ్యబోతున్నారో వీళ్ళింతవరకు చెప్పలేదు.

ఏమొచ్చినా రాకున్నా కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా వచ్చేవి కొన్నున్నాయి.. ఓ ముఖ్యమంత్రి, ఓ ఇరవై మంది మంత్రులు, ఓ రెండొందల కొత్త అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు, ఓ రెండువేల కొత్త ఉద్యోగాలు.



నికరంగా తేలేదొకటే.. తెలంగాణ వస్తే బాగుపడేది రాజకీయులే. సామాన్యుడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సామాన్యుడికి కొత్తగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు, కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగావకాశాలు తప్ప. తక్షణ రాజకీయ ప్రయోజనం ఆశించే వారికి మాత్రం ఉపయోగమే!

23, సెప్టెంబర్ 2006, శనివారం

ఉరుకుల పరుగుల వికీపీడియా

0 కామెంట్‌లు
ఆన్‌లైనులో విజ్ఞాన వనరులలో వికీపీడియా మొదటి స్థానం ఆక్రమించింది. ఇప్పటికే పాతుకుపోయిన విజ్ఞాన గనుల్ని వెనక్కు నెట్టేసి ప్రజాదరణలో చాలా ముందుకు దూసుకుపోయింది. లక్షలాది మంది స్వచ్ఛందంగా అక్కడ కృషి చేస్తారు. వీరు కొత్త కొత్త వ్యాసాలు రాస్తూ, ఉన్నవాటికి మెరుగులు పెడుతూ ఉంటారు కాబట్టే లక్షలాది పేజీల, వందల గిగాబైట్ల సమాచారం ఉంది అక్కడ. క్షణక్షణానికీ పెరిగిపోతున్న విజ్ఞాన సర్వస్వమిది, నిరంతరం మెరుగుపడుతూ ఉంటుంది.

వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు. ఒకరు రాసినదాన్ని ఎవరైనా మార్చవచ్చు. అక్కడ ఉన్న విషయాన్ని ఎవరైనా తమ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా 38 లక్షల పైచిలుకు సభ్యులు, 229 భాషల్లో రాసిన వ్యాసాలెన్నో తెలుసా! 52 లక్షల 37 వేలు!!
ఆ 229 భాషల్లో మన తెలుగూ ఒకటి
ఆ 38 లక్షల మందిలో మనమూ ఓ 600 మందిమి ఉన్నాం
వ్యాసాల్లో మన వాటా 10 వేలు!
ఇది రాసే సమయానికి వ్యాసాల సంఖ్యలో భారతీయ భాషల్లోకెల్లా మనమే ముందంజలో ఉన్నాం. ఈ గణాంకాల పూర్తి వివరాలు చూడండి. కంప్యూటరు తెలుగు నేర్చుకున్న తరువాత నెట్లో ఎన్నో తెలుగు సైట్లు వచ్చాయి. వాటిలో కూడా వికీపీడియా మొదటి వరుసలో ఉంటుంది!

కానీ సభ్యుల సంఖ్య విషయంలో మనం వెనకబడే ఉన్నాం. తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల వికీపీడియాలలో సభ్యుల సంఖ్య మనకంటే ఎక్కువగా ఉంది. సభ్యుల్లో చురుగ్గా పాల్గొనే వారి సంఖ్య కూడా తక్కువే!

తెలుగు వికీపీడియాలో వస్తున్న వ్యాసాలు ప్రధానంగా తెలుగువారికి సంబంధించినవి గానే ఉంటున్నాయి. ఇది సహజం. వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలు వస్తూ ఉన్నాయి. మంచి మంచి వ్యాసాలు చాలా వచ్చాయి. ప్రతిఒక్కరూ తమతమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యాసాలను రాయవచ్చు. చరిత్ర, గ్రామాలు, పట్టణాలు, సినిమాలు, ప్రసిద్ధులు, పుణ్యక్షేత్రాలు, కంప్యూటర్లు, జలవనరులు, రాజ్యాంగ వ్యవస్థ, భాష, సామెతలు, నుడికారాలు.. ఇలా ఎన్నో రకాల వ్యాసాలపై పని చెయ్యవచ్చు.

మీరూ మీ అభిరుచి మేరకు అక్కడ రచనలు చెయ్యండి. ఓ మొక్క నాటడం ఎలాగో వికీపీడియాలో రచనలు చెయ్యడమూ అంతే! మీరు నాటిన మొక్క ఫలాలు మీ బిడ్డలకు, వారి బిడ్డలకు ఉపయోగపడతాయి. అలాగే వికీలో మీరు రాసిన వ్యాసం మీ బిడ్డలకు, మా బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు, తరతరాలకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక మీకూ కింది విధంగా ఉపయోగపడుతుంది.
1. వ్యాసం రాయడానికి మీరు వికీకి వచ్చినపుడు ఇతర వ్యాసాలు చదివి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
2. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నపుడో, లేక డబ్బులకోసం నాన్నకు ఉత్తరం రాసినపుడో రాసిన తెలుగు.. దానికి మెరుగులు పెట్టి, మీ కలానికి పదును పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు తెలుగు నేర్పేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు.

'అయ్యో నాకు తెలుగు రాయడం సరిగా రాదు కదా.. తప్పులు పోతాయి కదా ఎలాగా' అని అనుకోవద్దు, సిగ్గుపడొద్దు, వెనకాడొద్దు. భాషా దోషాలు సహజం.. వాటిని సరిదిద్దేందుకు ఇతర సభ్యులు ఎలాగూ ఉంటారు. రాస్తూ ఉంటే క్రమంగా మీ దోషాలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక సంవత్సరంగా వికీపీడియాలో రచనలు చేస్తూ నేనేంతో నేర్చుకున్నాను. నా తెలుగు ఎంతో మెరుగు పడింది. మీరూ రాయండి. మీ ఊరి గురించి రాయడంతో మొదలు పెట్టండి. జరుగుతున్న చరిత్రను రాయండి (ప్రస్తుత ఘటనలు). మీకు నచ్చిన సినిమా గురించి రాయండి. మీరభిమానించే ప్రసిద్ధ వ్యక్తి గురించి రాయండి.

కంప్యూటర్లో తెలుగు విప్లవానికి కొలబద్ద, వికీపీడియా!

21, సెప్టెంబర్ 2006, గురువారం

రాష్ట్ర విభజనతో నీళ్ళూ, నియామకాలు వస్తాయా?

3 కామెంట్‌లు

నిధుల కోసం తెలంగాణ, నీళ్ళ కోసం తెలంగాణ, నియామకాల కోసం తెలంగాణ అని అంటారు తెలంగాణ వాదులు. తెలంగాణ ఏర్పడితే నీళ్ళు, నియామకాలు విరివిగా వస్తాయా? చూద్దాం...



ముందుగా నియామకాలు:

ఎక్కడినుండి వస్తాయి కొత్త ఉద్యోగాలు? రాష్ట్రానికి అవసరమైన ఉద్యోగులు ముందే ఉన్నారు కదా! కొత్తగా అవసరమైన నాలుగైదు వేల మంది ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఐదు వేల ఉద్యోగాల కోసమేనా, తెలంగాణ? ఒకవేళ తెలంగాణ ఏర్పడితే, జీవో 610 ప్రకారం వెనక్కు పంపాల్సిన ఇతర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపిస్తారా? పంపిస్తే మరో 20 వేల కొత్త ఖాళీలు వస్తాయి. కానీ..



రాష్ట్ర విభజన అంటే భౌగోళిక విభజనా, లేక ప్రజలూ, ఉద్యోగుల విభజనా? విభజన సమయంలో ఇదో వివాదం కానుంది. అసలు ఆస్తి పంపకమంటేనే వివాదాల పుట్ట. బోలెడన్ని షరతులు, సర్దుబాట్లతో కూడిన వ్యవహారం! విభజన ఇష్టపడని వాళ్ళు బెట్టుగా ఉన్నా.., అది కోరుతున్నవారు సర్దుబాటుకు ముందుకు వస్తారు, అది సహజం. పంపకాల రోజున.. ఇదుగో రాష్ట్ర పంపకం ఎలాగూ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగుల ప్రస్తుత స్థితిని కొనసాగించాల్సిందే ఎవర్నీ వెనక్కి పంపరాదు అని షరతు పెడితే, ఈ వేర్పాటు వాదులు ఒప్పుకోరా? రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉన్నవారికి అది ఒక చిన్న సర్దుబాటు! ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి.. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యే క్రమంలో ఆంధ్రులు మద్రాసును వదులుకోవాల్సి వచ్చింది. మద్రాసు పేరెత్తకపోతేనే ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచిస్తామని అప్పటి నాయకులు అన్నారు ( http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82_%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81#), మనవారు విన్నారు. ప్రత్యేక రాష్ట్రమనే పెద్ద లక్ష్యం ముందు, మద్రాసు చిన్నదిగా కనిపించింది, వదులుకున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ అనే పెద్ద లక్ష్యంకోసం ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అంచేత, ఈ సర్దుబాట్ల క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, ఒక్క ఉద్యోగి కూడా వెనక్కి పోరు, ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటే తప్ప! కాబట్టి కొత్తగా నియామకాలు వచ్చే అవకాశం తక్కువ. వచ్చే కాసిని అవకాశాల కోసం పంపకాలు అవసరమా? నియామకాల విషయంలో మరో కోణం -తెలంగాణలో ఏర్పడే కొద్దో గొప్పో ఖాళీలను కూడా ఆంధ్రులే ఆక్రమించుకుంటున్నారనే వాదన ఉంది. ప్రత్యేక రాష్ట్రంలో ఆ అవకాశం ఉండదు కాబట్టి ఆ మేరకు కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ప్రస్తుత ప్రైవేటీకరణ యుగంలో కొత్తగా ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశాలెన్ని? ప్రైవేటు రంగంలో వచ్చే అవకాశాలను తెలంగాణేతరులు అందిపుచ్చుకోకుండా అడ్డుకుంటారా కొత్త రాష్ట్ర నేతలు?



ఇక నీళ్ళు.. తెలంగాణ ఏర్పడే వేళ.. చాలా పెద్ద వివాదం కాబోతున్నది ఇదే! హైదరాబాదు కంటే పెద్ద వివాదం అవుతుంది. మూడు ప్రాంతాలు కూడా గట్టిగా పట్టుబట్టేది ఈ విషయంలోనే.. హైదరాబాదు విషయంలో కాదు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు జరిగింది ఆంధ్ర ప్రదేశ్ కే గాని, అందులోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన రోజున దీన్ని ఇదమిత్థంగా తేల్చుకోవాలి. మూడు ప్రాంతాలు తమతమ నీళ్ళ కేటాయింపులను కట్టుదిట్టంగా పరిరక్షించుకున్న తరువాతే రాష్ట్రం వేరు పడుతుంది. ఇది అంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదు. నీటి పంపకాల్లో ఒక సార్వత్రిక నియమం ఉంది.., అంతర్జాతీయంగా పాటిస్తారు దీన్ని - "ఇప్పటికే ఏర్పాటైన అయకట్టును పరిరక్షిస్తూ, మిగిలిన నీటినే కొత్తగా పంపకం చేయాలి". కృష్ణ నీటిని తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన 811 టీఎంసీ నీటిని ఇప్పటికే వాడిన భాగం పోగా మిగిలిన నీటినే పంపకం చెయ్యాలి. ఇప్పటికే ఏర్పడ్డ ఆయకట్టును పరిర్తక్షిస్తూ నీటి పంపకం చేస్తే, తెలంగాణకు వచ్చే వాటా ఎంత? రాష్ట్ర విభజన సమయానికి కృష్ణ ప్రాజెక్టులలో ఎవరెవరి భాగం ఎంత, నిర్వహించేది ఎవరు, ఎవరెవరు ఎంతెంత నీటిని వాడుకోవాలి, వాడుకోవాల్సింది నికర జలాలనా లేక వరద నీళ్ళనా.. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఇలాగే గోదావరి నీళ్ళు.. ('అన్నదమ్ముల్లాగా విడిపోదామ'ని అంటున్న రాజకీయులు తెలుసుకోవాల్సింది ఒకటుంది.. వేర్లు పడ్డాక, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య సంగతేమో కానీ నీళ్ళ దగ్గర కొట్లాటలు రాకుండా ఉంటాయా అనేది సందేహమే!)


ఇలాంటి వేర్పాటు వివాదాల్లో కాస్తో కూస్తో సర్దుబాటుకు ముందుకొచ్చేది, సహజంగానే వేర్పాటు కావాలని గొడవ చేస్తున్న వారు! కాబట్టి నికరంగా నష్టపోయేది తెలంగాణాయే! రాజకీయులు రాష్ట్రం కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. కానీ మేథోవర్గం దానికి ఒప్పదు. తెలంగాణ కోరుతున్న రాజకీయులు, మేథావుల మధ్య ఈ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు.

ఏదేమైనా మూడు ప్రాంతాల ప్రజలూ గట్టిగా వత్తిడి చెయ్యాల్సింది ఒకటుంది.. "విభజన సమయంలో మీరు ఏమేం ఒప్పందాలు చేసుకుంటున్నారో బహిరంగ పరచాలి. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెసు, తెరాస చేసుకున్న ఒప్పందం లాంటి దొంగ వేషాలు కుదరవు" అని. లేకపోతే ఈ రాజకీయులు మనల్ని ముంచి పారేస్తారు, పాతరేస్తారు!

మొత్తమ్మీద రాష్ట్ర విభజన జరిగితే నీళ్ళు, నియామకాల విషయంలో కూడా తెలంగాణ పరిస్థితి మెరుగుపడేదేమీ ఉండదనిపిస్తోంది. మరెందుకీ విభజన? ఎవరికోసం ఈ విభజన? కేసీయార్ కొత్త కారణాలు రెండు మూడు చెబుతున్నారు.. "ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ" అని. వాటి సంగతి కూడా చూద్దాం!

20, సెప్టెంబర్ 2006, బుధవారం

రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?

6 కామెంట్‌లు

రాష్ట్ర విభజన విషయమైఈ జాబు రాస్తున్నాను. తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా అనే విషయం జోలికి పోవడం లేదు. రాష్ట్రం విడిపోవాలా లేదా అనే విషయం జోలికీ పోవడం లేదు. అవన్నీ అధికారం కోసం ఆవురావురంటున్న వారు, తహతహలాడుతున్నవారు చెప్పాలి, మనం వినాలి. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడితే వీళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయా అనేది ఆలోచిస్తున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పడే పక్షంలో ఏం జరుగుతుంది అనే నా ఊహకు రూపమే ఈ వ్యాసం. (కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్ర అనడం రివాజుగా వస్తూంది. అది అంత సబబు కాకున్నా నేనూ ఇక్కడ అలాగే వాడుతున్నాను.)

తెలంగాణ ఎందుకు కావాలంటే.. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం అని తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ అంటున్నారు. ఇది నిజాయితీతో కూడిన కోరిక. కేసీయార్ దాన్ని కాస్త విస్తరిస్తూ, తెలంగాణ కేవలం అభివృద్ధి కోసమే కాదు.., ఆత్మ గౌరవం కోసం, స్వయంపాలన కోసం అని కూడా అన్నారు. ఆమధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం ఫోనాఫోనీ కార్యక్రమం లో కూడా ఇదేమాట చెప్పారాయన.

నిధులూ, నీళ్ళు, నియామకాల సంగతి చూస్తే, ప్రత్యేకరాష్ట్రంలో ఈ మూడు 'న'కారాలూ నకారం కాబోతున్నాయి. ముందుగా నిధుల సంగతి చూద్దాం.



రాష్ట్ర విభజన అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పడడమా? కాదు! తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలు ఏర్పడడం. రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ఏ గొడవలూ లేనట్లే! మొట్ట మొదటి గొడవ రాజధాని విషయంలోనే! హైదరాబాదు ఇద్దరికీ కావాల్సిందే అని ఆంధ్ర నాయకులు అడుగుతారు. కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడంలేదు. కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే అలా ఉండొచ్చు. (ఎవరి రాజధాని వాళ్ళకు ఉంటేనే దీర్ఘకాలంలో మంచిది. విభజన సమయంలో బేరసారాలకు ఒక ఆయుధంగా ఆంధ్ర నాయకులు హైదరాబాదును వాడుకుంటారు.) తెలంగాణ రాజధాని ఉన్నచోటే ఉంటుంది. ఆంధ్రకు మాత్రం కొత్తగా ఓ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాష్ట్రానికి మౌలికంగా ఏం కావాలి? శాసనసభ కావాలి, సచివాలయం కావాలి, హైకోర్టు కావాలి, రాష్ట్ర స్థాయి పరిపాలనా యంత్రాంగం కావాలి. డైరెక్టరేట్లు కావాలి, కేంద్ర పోలీసు వ్యవస్థ కావాలి. మొత్తమ్మీద ఓ పరిపాలనా వ్యవస్థతో కూడిన రాజధాని కావాలి. తెలంగాణకు హైదరాబాదు ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఆంధ్రకే! ఆంధ్రకు ఓ కొత్త రాజధాని నిర్మాణం కావాలి. దానికి నిధులు కావాలి. ఇప్పుడు చెప్పండి.. రాష్ట్ర విభజన జరిగితే నిధులెవరికి కావాలి? ఇప్పటికే ఇవన్నీ ఉన్న తెలంగాణకా? అసలేమీ లేని ఆంధ్రకా? ఆంధ్రకే!

పైగా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందిన హైదరాబాదును వదులుకున్నందుకు, అక్కడి నుండి వస్తున్న ఆదాయాన్ని వదులుకున్నందుకు బదులుగా, సాపేక్షికంగా తమ నగరాలను అభివృద్ధి చేసుకునేందుకు కూడా కోస్తా, రాయలసీమలు నిధులు అడుగుతాయి. ఇదంతా కొత్త ఖర్చే కదా. విభజన జరక్కపోతే ఆ నిధులను ఇతరేతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టొచ్చు. కాబట్టి ఆ దామాషాలో తెలంగాణకు వచ్చే నిధులు తగ్గినట్లే!

పైగా కొత్త రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేస్తే రాయలసీమవాళ్ళు, రాయలసీమలో ఏర్పాటు చేస్తే కోస్తా వాళ్ళు తగు రక్షణలు కోరుతారు. రక్షణలంటే మరోటేమీ కాదు.., నిధులు, మౌలిక వసతులు! నిజానికి ఇది అవసరం కూడా.. ఎందుకంటే మళ్ళీ మరో విభజన జరిగి, ఇప్పుడు హైదరాబాదును వదిలి పోవాల్సి వచ్చినట్లే రేపు ఒక ప్రాంతం వాళ్ళు రాజధానిని వదులుకోవాల్సి వస్తే ఇప్పటి వ్యథ మళ్ళీ లేకుండా ఉండేందుకు. దురాశాపరులైన రాజకీయులు అన్నికాలాల్లోను, అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు.

ఇక్కడొక విషయం గమనించాలి.. తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రతో పోల్చి చూసేటపుడు తెలంగాణ నాయకులు హైదరాబాదును పరిగణనలోకి తీసుకోరు. 'హైదరాబాదు అందరిదీ, దాన్ని వదలి, మిగతా తెలంగాణలో అభివృద్ధిని చూడండి' అని అంటూంటారు. మరి రాష్ట్ర విభజన జరిగాక, హైదరాబాదు పూర్తిగా తెలంగాణకే చెందాక, అప్పుడు అభివృద్ధిని పోల్చి చూస్తే..! ఇప్పటి తేడా అప్పుడు ఉండదు, పోలిక తిరగబడొచ్చు కూడా! కోస్తా రాయలసీమలకు మరిన్ని నిధులివ్వాల్సింది అందుకు కూడా!

కాబట్టి రాష్ట్ర విభజన జరిగితే నిధులు కావలసింది ఆంధ్రకే గాని, తెలంగాణకు కాదు. తెలంగాణకు అదనపు నిధులు దొరకడం కష్టం! హైదరాబాదు నుండి వచ్చే ఆదాయం మాత్రం పూర్తిగా తెలంగాణకే చెందుతుంది కనుక, ఆ మేరకు తెలంగాణకు అదనపు నిధులు వచ్చినట్లే! ఆంధ్రకు ఆ మేరకు నష్టం జరిగినట్లే!

నిధుల సంగతిది. ఇక నీళ్ళు, నియామకాల సంగతి..

19, సెప్టెంబర్ 2006, మంగళవారం

ఆదివారం టీవీ కార్యక్రమాలు

2 కామెంట్‌లు
మామూలు రోజుల్లో లాగానే ఆదివారం నాడు కూడా టీవీల్లో సినిమాల గురించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త సినిమాల నటులు, దర్శకులు, నిర్మాతలతో ఇంటర్వ్యూలు పెట్టి వాటికి ప్రచారాలు కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. జెమినీలో జోకర్ల లాంటి ఇద్దరు లంగర్లు (మనుషులు బాగానే ఉంటారు, వాళ్ళ ప్రవర్తనే.. జోకర్లలాగా ఉంటుంది. ఒకరి పేరు సత్తెన్న.. ఇంకోళ్ళెవరో గుర్తు లేదు) కొత్త సినిమా జనుల ఇళ్ళలో లంగరు దించి, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ఈ మధ్య వస్తున్నట్లు లేదు (మరో పిచ్చి కార్యక్రమమేదో పెట్టి ఉంటారు!).

18, సెప్టెంబర్ 2006, సోమవారం

వేడెక్కుతోన్న వాతావరణం

0 కామెంట్‌లు
  • కేకేపై అధిష్టానం సీరియస్
  • ఎమ్మెస్సార్‌పై మండిపడ్డ అధిష్టానం
  • దిగ్విజయ్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం
  • కేకేపై చిర్రుబుర్రులాడిన దిగ్విజయ్
  • చిన్నారెడ్డిపై మధుగౌడ్ చురకలు
  • మధుగౌడ్ వ్యాఖ్యలపై చిన్నబుచ్చుకున్న చిన్నా
  • కేకేపై తెలంగాణ నాయకుల కోపం
  • కేకేను తప్పుబట్టిన పాల్వాయి
  • మధుగౌడ్, సర్వే సత్యనారాయణలకు చురకలేసిన లగడపాటి
  • ఖబడ్దార్ లగడపాటీ అన్న సర్వే
  • తెలంగాణ ఎంపీలు నోరిప్పకూడదా అంటూ లగడపాటిని విమర్శించిన కేసీయార్
  • మధుగౌడ్‌ను విమర్శించిన రేణుకాచౌదరి
  • ఆమె మర్యాదగా మాట్లాడాలి అని ప్రతి విమర్శ చేసిన మధు గౌడ్
  • లగడపాటిని ఘెరావ్ చేసి, కొట్టిన తెలంగాణ విద్యార్థి సంఘ సభ్యులు
మాటలు పదునెక్కుతున్నాయి, "సెంటిమెంటు" చిక్కనవుతోంది, చేతలు చేతులు దాటుతున్నాయి. కాంగ్రెసులో పగుళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. అయినా, అధిష్టానవర్గం పెదవి విప్పలేదు. సమస్య సమస్యగా ఉన్నప్పుడే పరిష్కరించాలి. అది ముదిరి సంక్షోభంగా మారకముందే బాధ్యత కలిగిన వాళ్ళు, బాధ్యత తెలిసిన వాళ్ళు మేలుకోవాలి.

17, సెప్టెంబర్ 2006, ఆదివారం

పోపు గారు.. క్షమించ గోరారు

1 కామెంట్‌లు
మతమార్పిడులపై పోపుగారు ఈసారి మాట మార్చారు.

13 వ శతాబ్దంలో మహమ్మదు ప్రవక్తపై బైజాంటైన్ రాజు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని, బయటికి తీసి, ఓ వివాదాన్ని సృష్టించారు.
మధ్యయుగాల్లో ముస్లిములు జరిపిన బలవంతపు మత మార్పిళ్ళపైనే పోపుగారి ప్రస్తుత విమర్శల జోరు.

కొన్ని నెల్ల కిందట ఇదే బలవంతపు మతమార్పిళ్ళపైనే పోపుగారు మనపైనా కొన్ని విసుర్లు విసిరారు .
అయితే ఆనాటి వారి వాదన వేరు.
మూకుమ్మడి మతమార్పిడులకు వ్యతిరేకంగా భారత్‌లో చట్టాలు చేయరాదని అప్పుడు వారు మనకు చెప్పారు.
(అప్పటి వారి విమర్శలపై ఈ పేజీల్లోనే వచ్చిన నా పాత జాబు ఇది.)
మరి ఇప్పుడేమో ఇలా చెబుతున్నారు.

మధ్యయుగాల్లో కత్తి చూపి మతమార్పిడి చేయించారు,
అది ఆ కాలం తీరు.
ఇప్పుడేమో ప్రచారం తెగ చేసి, ఎరవేసి, ఆశలు చూపి, మొహమాటపెట్టి మూకుమ్మడిగా చేస్తున్నారు,
ఇది ఇప్పటి తీరు.
చేసే పని మాత్రం అదే.., బలవంతపు మతమార్పిడే! తీరే వేరు.
అయితే పోపుగారు మాత్రం..
"ఇప్పుడు మేం చేసేది ఒప్పు, దాన్ని అడ్డుకోరాదు, అప్పుడు ముస్లిములు చేసింది తప్పు, దాన్ని మర్చిపోరాదు" .. అని అంటున్నారు.

ముస్లిములపై మాట మీరారు, చివరికి క్షమించ గోరారు!

15, సెప్టెంబర్ 2006, శుక్రవారం

నక్సలైట్లు, రాకెట్లు, పౌరహక్కుల సంఘాలు

3 కామెంట్‌లు
తపంచాలు, తుపాకులు, మిషను గన్లు దాటేసి, ఇపుడు రాకెట్లూ, వాటి లాంచర్ల వరకు వచ్చారు, నక్సలైట్లు. పోలీసుల కూంబింగులు, దాడులు సరైనవేనని రుజువు చేస్తోంది ఈ ఆయుధాల సేకరణ. ఈ రాకెట్టును చాలా దూరంనుండి ప్రయోగించవచ్చు. 20 దాకా ప్రాణాలను తీయవచ్చు.

పౌరహక్కుల నాయకులు ఇప్పుడేమంటారో? ఎన్‌కౌంటర్లను ఖండించడం తప్పుగాదు. నక్సలైట్లు పోలీసులను చంపేసినపుడు గొంతు పెగలకపోవడం మాత్రం తప్పే! జనహననం కోసం రాకెట్లు, లాంచర్లు పోగు చేసుకునే వాళ్లను ఏం చెయ్యాలో వీళ్ళిపుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి పారేస్తున్నారని గోల చేస్తున్నారు.. మర తుపాకి పట్టుకు తిరిగేవాణ్ణి పట్టుకోవడానికి, సంకెళ్ళు ఊపుకుంటూ వెళ్తారా? వెళ్ళినా.., 'దా నన్ను బంధించు' అంటూ సంకెళ్ళ కోసం చేతులు చాపుతాడా? కాల్చి అవతల పారేస్తాడు! వాణ్ణి ఎదుర్కొనేందుకు మర తుపాకే కావాలి. తుపాకులున్నది కాల్చేందుకే! ముల్లును ముల్లు తోటే తీయాలి.

నక్సలైట్లు పోలీసులనే కాక, ఎంతో మంది మామూలు పౌరులను కూడా ఇంటి దగ్గరనుండి పట్టుకుపోయి, హింసించి, కాల్చి చంపారు- ఇన్‌ఫార్మర్లనో, కోవర్టులనో, మరో పేరుతోటో. మరి అలా పట్టుకుని చంపడం రైటా? పోలీసులను మాటేసి, మైనేసి చంపుతున్నారు కదా, అది ఒప్పేనా? ఇవి జరిగినపుడు నోరు విప్పని వాళ్ళు ఎన్‌కౌంటరు అనగానే మాత్రం గోల చేసేస్తారు. పోలీసులు అసలు తప్పే చేయరని ఎవరూ అనరు, కానీ తప్పు రెండువైపులా జరుగుతున్నపుడు ఒకర్నే నిందించడం ఏమిటి?

13, సెప్టెంబర్ 2006, బుధవారం

నిరుత్తర కుమారులు

3 కామెంట్‌లు
గాజుగదిలో కూర్చుని బయటివాడిపై రాయేస్తే ఏమవుతుంది?
నిరాయుధుడు కదా అని చేతిలో కర్రొకటి పట్టుకుని కవ్విస్తూ పోగా, వాడు ఏకే47 బయటికి తీసి గురిపెడితే ఎలా ఉంటుంది?

కాంగ్రెసు పరిస్థితి ఇదీ! రాజీనామా చేసి చూసుకుందాం రా అని ఎమ్మెస్ అన్నాడు. బానే ఉంది, రాజకీయాల్లో అది మామూలే! కేశవరావు చూడండి, కేసీయార్‌ను రాజీనామా చెయ్యమనండి, నేను నెల రోజుల్లో ఎన్నికలు పెట్టిస్తాను అంటూ ఎగదోసాడు. అయితే, అవతలి వ్యక్తి వ్యూహ నిపుణతను కేకే అంచనా కట్టలేక పోయాడు. (అసలు అవతలి వాళ్ళ మాటలను, చేతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు కేకేలాగా లొడలొడా మాట్లాడడు.) అంది వచ్చిన అవకాశాన్ని కేసీయార్ భలే చక్కగా వాడుకున్నాడు.. ప్రతి సవాలు విసర్లేదు, ఏకంగా రాజీనామా విసిరేసి, రా తేల్చుకుందాం అని తొడ గొట్టాడు.

ఇంత జరిగింతరవాత, వీళ్ళేంచేస్తున్నారు? దాక్కునేందుకు స్థలాలు వెదుక్కుంటున్నారు! ఏదో అంటూ ఉంటాం, అలాగే నేనూ ఏదో అన్నాను, అంత పట్టించుకోనక్కరలేదు అని కేకే అంటున్నాడు. సవాళ్ళు విసరడం చపలత్వం అయితే, అబ్బే నేనేదో చెతురుకన్నాను, పట్టించుకోనక్కరలేదు అని అనడం చవటత్వం!

తెరాస:అన్నీ అనుకూలాలే!అనూహ్యమైన ఎత్తేసి, కేసీయార్ ఉత్తర కుమారులను నిరుత్తరుల్ని చేసాడు. సిద్ధిపేట సభతో జడత్వాన్ని కాస్త వదుల్చుకున్న తెరాసకు ఈ రాజీనామా వ్యవహారం ఒక ఊపు నిస్తుందనడంలో సందేహమేమీ లేదు. వ్యక్తిగతంగా కేసీయార్ పరపతి బాగా పెరుగుతుంది. ఈ సంఘటనతో కేసీయార్ కు అన్నీ ఉపయోగాలే! రాజీనామా చేసిపారేసి, తెలంగాణ పట్ల నిబద్ధుణ్ణనే సందేశమిచ్చాడు. ప్రజల్లో తనపట్లా, తెరాస పట్లా విశ్వసనీయతను మరింత పెంచుకున్నాడు. రాజీనామాను స్పీకరు ఎలాగూ ఒప్పుకోడు కాబట్టి (ఫాక్సుల్లోనూ, ఫోనుల్లోను టాటా చెబితే కుదరదట, స్వయంగా కలిసే చెప్పాలట! ఈయన పోడు, ఆయన ఒప్పుకోడు), తన లోక్‌సభ సభ్యత్వానికి ఢోకా ఏమీ లేదు. లోక్‌సభ అడిగింది కాబట్టి నిరాహారదీక్ష విరమించిన వాడికి, స్పీకరు కుదరదన్నాడు కాబట్టి రాజీనామా వెనక్కి తీసుకోడంలో కష్టమేముంది! ఈలోగా ఎలాగూ కాంగ్రెసు వెనక్కి తగ్గుతుంది కాబట్టి, నైతిక విజయం సాధించినట్లే! కేసీయార్‌కి అన్నీ ప్లస్సులే! ఒకవేళ స్పీకరు రాజీనామాను ఒప్పుకున్నా పోయేదేమీ లేదు, అది ఆయనకు మరింత లాభమే!

కాంగ్రెసు: దిమ్మెరపోయింది అనే మాట కాంగ్రెసుకు బాగా సరిపోతుంది. స్వయంగా కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడే ఇవ్వాళ కాంగ్రెసు పార్టీని చిన్నబుచ్చాడు.
  • ఎమ్మెస్: రాజీనామా సవాలు విసరడంలో తప్పేమీ లేదు. ఎటొచ్చీ ఊహించని జవాబుతో తల బొప్పి కట్టింది. అయినా గంభీరంగానే రాజీనామాకు సిద్ధపడ్డాడు. కాస్త పరువు నిలబెట్టుకున్నాడు.
  • ఇక కేకే.. లొడలొడా మాట్లాడ్డమే తప్ప ఆలోచించడం ఉండదు. (ఇంటర్వ్యూలిచ్చేటపుడు చూడండి.. అడిగేవాణ్ణి ప్రశ్న పూర్తిగా అడగనివ్వడు, సగంలోనే అందుకుని సమాధానం ఇచ్చేస్తాడు. ఆ మధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం సాయంత్రపు ఫోనాఫోనీ కార్యక్రమంలోనైతే, ప్రశ్నలడిగేవాళ్ళపై ఎదురుదాడి చేసాడు! విషయ పరిజ్ఞానం ఉన్నవాడు అలా చెయ్యడు.)
మొత్తమ్మీద, కాంగ్రెసు తనకు తానుగా అంటించుకున్న ఈ బురదను కడుక్కున్నా, మరక పోదు. చొక్కాను మార్చేసి వేరేది తొడుక్కుంటారా? కావచ్చు!

12, సెప్టెంబర్ 2006, మంగళవారం

అరాచకీయుడిని ఎదిరిద్దాం!

0 కామెంట్‌లు
పుట్టపర్తి వారి విగ్రహానికి ఓ అరాచకీయుడు చేసిన అపచారంపై ఈ పిటిషన్ను (http://www.petitiononline.com/Puttapar/petition.html) చూసారా? చూసి, మీ వోటు వెయ్యండి. మీ స్నేహితులకు చెప్పండి.

10, సెప్టెంబర్ 2006, ఆదివారం

ఆత్మ లేని బతుకులు

5 కామెంట్‌లు
  • ప్ర ముఖ రచయిత, సాహిత్యకారుడు, శివతాండవం గ్రంథకర్త దివంగత పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహ స్థానంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నట్లు శాసనససభ్యుడు వరదరాజులరెడ్డి చేసిన ప్రకటన విమర్శకు తెరలేపింది. ఈనాడు
  • ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం కూడలిలో ఉన్న సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం రాత్రి11.15 గంటల సమయంలో తొలగించారు. ఆంధ్ర జ్యోతి
  • ఈ విషయాన్ని తెలుగు బ్లాగులోకపు దృష్టికి తెచ్చిన త్రివిక్రమ్ గారి బ్లాగు,
  • క్రిస్పీన్యూస్

కొందరు.. కొత్తబాటలు వేసుకుంటూ తమ వెనకున్న వారికి మార్గదర్శనం చేసే దార్శనికులు
మరికొందరు.. తప్పో ఒప్పో.. ముందు నడిచే వారి అడుగుజాడల్లోనే నడుస్తూ వెళ్ళే అనుచరులు.
ఇంకొందరు.. తమ ముందు నడిచిన వారి అడుగుల జాడలు చెరిపేసుకుంటూ వెళ్తారు.
ఈ మూడో రకానికి చెందిన వారే ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని తొలగింపజేసిన వాళ్ళు. తాలిబన్లు అని వీళ్ళకో పేరు కూడా ఉంది.

డబ్బే ప్రధానం, అధికారమే పరమావధిగా ఏదైనా చేసే నేలబారుతనం
నాయకుడి చల్లని చూపుల కోసం గడ్డి కరిచేందుకు కూడా వెనకాడని చవకబారుతనం
కుర్చీ కోసం పై కుర్చీలోని అయ్యనో, అమ్మనో మెప్పించేందుకు వాళ్ళ చెప్పులు నెత్తినెట్టుకుని ఊరేగే చవటతనం
తల తెల్లగా ముగ్గుబుట్టైనా, దాని లోపల లేశమైనా లేని జ్ఞానకోశం
మనవాళ్ళపై మనకుండాల్సిన కనీస అభిమానం కరవైన ఆత్మాభిమానం లేని బతుకులు
ఆత్మను అమ్ముకున్న బతుకులు
అసలు ఆత్మే లేని బతుకులు

కలిసి చేసిందే..
ప్రొద్దుటూరులో సరస్వతీపుత్రుని స్మృతి చిహ్నానికి జరిగిన అపచారం, ఆంధ్ర సరస్వతికి జరిగిన అవమానం


ఏమాశించి వీళ్ళీ పని చేసారో, అది నెరవేరకుండుగాక!

9, సెప్టెంబర్ 2006, శనివారం

శంఖారావం - తెలంగాణ కాంగ్రెసు నాయకులెక్కడ? ఎక్కడ??

2 కామెంట్‌లు
తెరాస తన ఉద్యమ మూడో దశను ఉరుములు మెరుపులతో మొదలెట్టింది. మొదటి దశ 2001 నుండి, 2004 మే వరకు జరిగింది. తెరాస శరవేగంగా ఎదిగిన దశ అది. 2004 మే నుండి మొన్నటి రాజీనామాల దాకా జరిగినది రెండో దశ, సుషుప్తి దశ. ఢిల్లీలో ఏం చేసారో తెలీదు గానీ, ఉద్యమం అచేతనంగా కనిపించింది. కేసీయార్ దీన్ని వ్యూహాత్మక మౌనం అంటారు. కావచ్చు! ఇప్పుడిక మూడో దశ ఆర్భాటంగా మొదలైంది. మూడో దశ ఎలా మొదలెట్టాలని తెరాస ఆశించిందో సరిగ్గా అలాగే చేసింది. నిరాహారదీక్షపై వచ్చిన విమర్శలను తిప్పిగొడుతూ జరిగిన ఈ సభ తెరాసకు, కేసీయార్‌కూ చాలా కీలకమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇదో మేలిమలుపు. ఈ సభలో కేసీయార్ ధోరణిలో కొద్ది తేడా వచ్చినట్లుగా కనిపించింది. ముఖ్యంగా గమనించినవి ఇవి.

  1. తెలంగాణ పట్ల తన నిబద్ధతను ప్రజలకు చెప్పాడు.
  2. పూర్తిగా తెలంగాణ కాంగ్రెసు నాయకుల పైనా, వైయెస్ పైనే ఆయన గురి. సోనియాను పల్లెత్తి మాట అనలేదు. కేంద్రం త్వరలోనే తెలంగాణ అనుకూల ప్రకటన చేస్తుందని తెరాస ఆలోచిస్తున్నట్లు దీన్ని బట్టి అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ రాదు అని వాళ్ళకు ఖచ్చితంగా తెలిస్తే, బహుశా సోనియానూ వదిలేవారు కాదు.
  3. కేసీయార్ ప్రసంగం ఇదివరకటిలా కాక, సంయమనంగా ఉన్నట్లు అనిపించింది. ఇదివరలో ఉన్న ధోరణి వలన తెలంగాణ వ్యతిరేకుల సంఖ్య పెరగడం తప్ప వేరే ప్రయోజనం లేదని గ్రహించినట్లున్నారు. నరేంద్ర ప్రసంగం గురించి ఎప్పట్లాగానే పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.
మొత్తమ్మీద సిద్ధిపేట శంఖారావంలో మనకు వినబడేవి ఇవి:
  1. తెరాసకు ప్రజల మద్దతు ఉంది.
  2. తెరాసకు కేసీయార్ తిరుగులేని నాయకుడు.
  3. మేథోవర్గం తెరాస వెన్నంటే ఉంది.
  4. కాంగ్రెసుకు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఇక కష్టాలే.
  5. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదో కాంగ్రెసు జవాబు చెప్పుకు తీరాల్సిన పరిస్థితి కల్పించబోతున్నారు. 'సోనియాకు వదిలేసాం, ఏ సంగతీ ఆమె తేల్చి చెప్పేదాకా మేమేం మాట్లాడం' లాంటి సొల్లు కబుర్లు కాంగ్రెసు వాళ్ళకిక కుదరక పోవచ్చు. దసరా తరువాత తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియా వద్దకు బారులు తీరవచ్చు.
  6. పాపం, తెరాస తిరుగుబాటు నేతలది దిక్కుతోచని స్థితి

మలిమలుపు: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తరువాతి మలుపు, మంత్రివర్గ విస్తరణ. దసరాకు జరగొచ్చంటున్నారు. విస్తరణలో పదవులు దొరికిన తెలంగాణ కాంగ్రెసు నాయకులు పదవీ వ్యామోహ విముక్తులవుతారు, దొరకనివారు పదవీ విరక్తులవుతారు. ఇప్పటి మంత్రులు కొందరు పదవీ విముక్తులైనా కావచ్చు! పదవులు దొరికిన వారికి పెదవులు ఎలాగూ విడివడవు, పదవీ విరక్తులను వైఎస్ ఎలా కాపాడుకుంటారో చూడాలి.

ఇక, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు వివాదంపై వైఎస్ ఏదో ఒకటి చెయ్యకుంటే, అది పుంజుకునే అవకాశం కనబడుతోంది. తెరాసకు అదో అస్త్రం కాబోతోంది. అలాగే ఇతర ప్రాజెక్టులు కూడా.

తెలంగాణ వస్తుందా రాదా అనేది ఎప్పటిలానే శేషప్రశ్నే! కానీ ఒకటి మాత్రం విస్పష్టం.. తెలంగాణ వస్తే మా ద్వారానే రావాలి అనే కాంగ్రెసు కోరిక ఇక తీరదు. ఆ అవకాశం తెరాస కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడే ఉండేది. ఇకపై తెలంగాణ అంటూ వస్తే అది తెరాస ఘనతే!

7, సెప్టెంబర్ 2006, గురువారం

భావ దారిద్ర్యం, భావ దాస్యం - మలి పర్వం

6 కామెంట్‌లు
భావదాస్యంపై నా గత జాబుకు కొనసాగింపు ఇది.

మన భావ దాస్యానికి మరో గుర్తు మన ప్రజా సదుపాయాలకు మనం పెట్టుకున్న పేర్లు. చాలావాటికి జాతీయ నాయకుల పేర్లే. అక్కడక్కడా, పెద్దగా ప్రాముఖ్యం లేని వాటికి మాత్రమే తెలుగువారి పేర్లు పెట్టుకుంటాం. జాతీయ నాయకులపై నాకేమీ చిన్న చూపు కాదు. 'ఏఁ, మనకాపాటి నాయకులు లేరా' అని బాధ అంతే! జాతీయ స్థాయి కెదిగిన మన వారన్నా మనకు అలక్ష్యమే! ప్రతీ దానికీ గాంధీలు, నెహ్రూల పేర్లేనా? పీవీలు, ప్రకాశాలు, సంజీవ రెడ్డిలు, బూర్గుల, సురవరం, పట్టాభిలు కనపడరే?
ఇందిరా సాగరు, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, రాజీవ్ రహదారి, లాల్ బహదూర్ స్టేడియం, నెహ్రూ జూలాజికల్ పార్కు, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు, రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం, రాజీవ్ పల్లెబాట, మహాత్మా గాంధీ బస్సు స్టేషను, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను అని పేర్లు పెట్టుకున్నాం.
నెల్లూరు జిల్లాకు అమరజీవి పేరు పెట్టే విషయమై కొట్టుకు చచ్చారు మనవాళ్ళు. చివరికి అరవ్వాళ్ళు పెట్టుకున్నట్లు వింతగా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టాలని తీర్మానించినట్లున్నారు. అదే ఏ ఎల్లయ్యగాంధీ అనో పుల్లయ్యనెహ్రూ అనో ఫలానాపటేల్ అనో పెడదామంటే చంకలెగరేసుకుంటూ సరే సరే అనేవాళ్ళే!
అల్లూరి సీతారామరాజు పేరిట ఏమన్నా ఉన్నాయేమో గమనించారా ? కన్నెగంటి హనుమంతు, కొమరం భీము, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య.. అందరూ విస్మృత వీరులే! కందుకూరి, చిలకమర్తి, గురజాడ, గిడుగు, సురవరం వంటివారు మనకు ఆనరు. రవీంద్ర భారతి పెట్టిన మనవారికి వేమన, కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గుర్తు రాలేదు. (నన్నయ విశ్వవిద్యాలయం పెట్టడం సంతోషించదగ్గ విషయం). తమిళులు సుబ్రహ్మణ్య భారతి పేరిట విశ్వవిద్యాలయం పెట్టుకున్నారు. వాళ్ళ శిలప్పాదికారం గురించి, తిరుక్కురళ్ గురించి మామూలు తెలుగువాణ్ణైన నాకూ తెలిసింది. మరి మన కళాపూర్ణోదయం గురించి, వేదసమానమైన వేమన పద్యాల గురించి వాళ్ళకు తెలుసా? (మనకే సరిగ్గా తెలీదు!) తలగుడ్డతో, మెలిదిరిగిన మీసాలతో ఉండే సుబ్రహ్మణ్య భారతి బొమ్మ మనకు సుపరిచితమే. తెలుగు గురించి ఆయన చెప్పిన తమిళ మాటలు మనకు వచ్చు కూడాను. మరి మన శ్రీశ్రీ , గురజాడల బొమ్మలు వాళ్ళకు తెలుసా? వాళ్ళకు తమవాడి గురించి చెప్పుకోడం తెలుసు, మనకు తెలవదు. మనవాళ్ళంటే మరీ చులకన, పైవాడంటే పరమ గౌరవం. అంతే!
ఇక్కడో విషయం.. ఆకలిరాజ్యం సినిమా తీసేటపుడు బాలచందర్‌కు వాడీ వేడీ కలిగిన కవితలు అవసరమయ్యాయి, హీరో నోట పలికించేందుకు. అదేదో తమిళ సినిమాలో (తమిళ ఆకలిరాజ్యమేమో మరి) భారతి పాటలు పెట్టుకున్నాడట, ఆ స్థాయిలో ఉండే పాటలు కావాలి అని ఆయన వెతుకులాట! శ్రీశ్రీ కవితలు విన్నాక పరవశించి పోయాడట. (ఏమాటకామాటే.. ఆ కవితలకు కమలాసనుడు న్యాయం చెయ్యలేకపోయాడు, గొంతు కుదరలేదు!)

మనవాళ్ళంటే మనకెంత నిర్లక్ష్యమంటే - "మాకొద్దీ తెల్లదొరతనము" అని పాడిన గరిమెళ్ళ అవసానదశలో దుర్భరమైన జీవితం గడిపాడట. ప్రభుత్వం ఆయనకు సాయం చెయ్యలేదు. పూట గడవని దయనీయమైన స్థితిలో అడుక్కున్నాడట.

మన పరాధీన మనస్తత్వానికి, చిన్నదే, మరో నిదర్శనం..
ఓం ఎలా రాస్తాం? సంస్కృతంలో రాస్తాము తప్ప అచ్చ తెలుగున ఓం అని రాయడం బహు అరుదు! అయ్యప్ప భక్తి మన రాష్ట్రాన ప్రబలినాక, సంస్కృత ఓం తో పాటు మలయాళ ఓం కూడా చూస్తున్నాం.

భగత్ సింగు, చంద్రశేఖరు ఆజాదుల గురించి తెలీని తెలుగు వాడుండడు. రాష్ట్ర సరిహద్దుల బయట మన అల్లూరి సీతారామరాజు గురించి ఎందరికి తెలుసు? అనుమానమే! (ఇహ కన్నెగంటి హనుమంతును గురించి, పుల్లరి సత్యాగ్రహం గురించైతే మనకే సరిగ్గా తెలీదు.) చదువూ సంధ్యల్లేని ప్రజలతో చిన్నపాటి సైన్యాన్నే ఏర్పాటు చేసి, ఓ రెండేళ్ళ పాటు తెల్లవాడితో అల్లూరి స్థాయిలో సాయుధ పోరాటం చేసిన మొనగాడు భారత స్వాతంత్ర్య చరిత్రలో బోసు కాక మరొకరున్నారా? తానొక్కడే పోరాడడం కాదు, వందలాది మంది గిరిజనులతో చెయ్యీ చెయ్యీ కలిపి వాళ్ళ చేత పోరాటం చేయించాడు. రెండేళ్ళ పాటు తెల్లోణ్ణి అల్లాడించాడు. అదీ అల్లూరి గొప్పదనం! పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు పెట్టే విషయం కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నలుగుతూ ఉంది. ఇదే అల్లూరి ఏ సింగో, బోసో అయ్యుంటే దేశం మొత్తం కళ్ళకద్దుకుని పూజించి ఉండేది కాదా? అప్పుడు మనమూ అల్లూరిని నెత్తినెట్టుకుని ఊరేగేవాళ్ళమే!

6, సెప్టెంబర్ 2006, బుధవారం

వందేమాతరం!

5 కామెంట్‌లు
మహాత్మా గాంధీ తర్వాత అంత ప్రజాదరణ పొందినది, వందేమాతరం.
స్వాతంత్ర్య రథానికి చోదక శక్తి, వందేమాతరం!
స్వాతంత్ర్య యోధుల దేహాలపై తెల్ల లాఠీలు చేసిన గాయాలకు మందు, వందేమాతరం!
తుపాకుల తోటీ, ఉరితాళ్ళతోటి తెల్లవాడు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నవేళ వారి చివరి కేక, వందేమాతరం!
మన జాతీయ గేయం, వందేమాతరం!

జాతీయ గేయం పాడననడం హేయం!
వందేమాతరం ను పాడమని చెబుతూ తోటి భారతీయుల మనసుల నుండి దూరం జరిగిపోతున్నామన్నది గ్రహిస్తున్నట్లు లేదు, వీళ్ళు.

పాడకపోవడాన్ని సమర్ధించడం ద్రోహం!
రేపు మరో మతస్తుడు 'నేను జాతీయ జండాను ఎగరెయ్యను, అది మా మతాచారాలకు విరుద్ధం. లేదా మా మతజండా కంటే తక్కువ ఎత్తులో మాత్రమే ఎగరేస్తాను' అంటే కూడా సమర్ధిస్తారేమో ఈ ద్రోహులు.

అవున్లే, సమర్ధించడం సమర్ధించకపోవడం అన్నది ఆ మతస్తులకు ఎన్ని వోట్లు ఉన్నాయనేదాన్ని బట్టి ఉంటుంది కదా!

5, సెప్టెంబర్ 2006, మంగళవారం

లోక్‌సత్తా పార్టీ అవసరమా?

6 కామెంట్‌లు
అవసరమే!

లోక్ సత్తా పార్టీ ఏర్పడబోతోంది. పార్టీ పెట్టే విషయంపై రకరకాల అభిప్రాయాలు వినవచ్చాయి. నాకూ నా అభిప్రాయం రాయాలనిపించింది. ఓటేసే ప్రతీ ఒక్కరికీ ఈ విషయంపై అభిప్రాయం ఉండి తీరుతుందని నా ఉద్దేశ్యం.

లోక్ సత్తాకు వ్యతిరేకంగా వినవచ్చిన అభిప్రాయాలు : (నీలాలు నా వ్యాఖ్యలు)
  1. సంఘ సేవ అంటూ మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగడం ఏంటి? పైకి కబుర్లు చెబుతున్నారు గానీ, వీళ్ళు పైనుంచి దిగివచ్చిన వారేం కాదు. నిజమే సంఘసేవ అంటూ మొదలెట్టారు. కాని వాళ్ళ కార్యక్షేత్రం మాత్రం మొదట్నుండీ రాజకీయాలే గదా! అయినా.. సంఘసేవ చేస్తామని మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగితే తప్పేంటి?
  2. జయప్రకాశ్ నారాయణా, ఆయన చుట్టూ ఉన్నవారు అంతా ఒక కులానికే చెందిన వారు. ఇది ఒక కుల పిచ్చి పార్టీ కాబోతోంది. జయప్రకాశ్ నారాయణ చుట్టూ ఉన్నవారు ఆయన కులస్తులే అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆ పార్టీ నడవడికను గమనించేందుకు, వారి విధానాలను పరిశీలించేందుకు ఆపై నిర్ణయం చేసుకునేందుకు మనకింకా దాదాపు మూడేళ్ళు సమయముంది. చూద్దాం ఎలా ఉండబోతున్నారో! ఇప్పుడే వద్దనడమెందుకు?
  3. డబ్బు లేని రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, నేర మరకలు లేని రాజకీయాలు అంటూ ఉపదేశాలు చెప్పిన వాళ్ళు వీళ్ళు. నిజంగా అలాగే రాజకీయాలు నడపబోయినపుడు, వీళ్ళకు తెలిసి వస్తుంది, అవి లేకుండా రాజకీయాలు నడపడం ఈ రోజుల్లో కుదరదని. నిజమే, కష్టమే! కానీ నడుపుతానంటున్నాడు గదా, ఎలా చేస్తాడో చూద్దాం. చేస్తే అంతకంటే కావలసిందేముంది? చెయ్యలేకపోతే మనకు పోయేదేమీ లేదు కదా!
  4. రామారావు లాంటి సమ్మోహకుడు ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ జయప్రదం అయింది. అంతటి ప్రజానాయకుడు లోక్ సత్తాకు లేరు కాబట్టి అది విఫలమౌతుంది. అది లోటే! కానీ అంతమాత్రాన రాజకీయాలకు పనికిరారని కాదు గదా!
  5. ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకు సామాన్యుల బాధలు తెలవ్వు ఇలాంటి వ్యాఖ్య ఒకే ఒక్కరు చెయ్యగా విన్నాను. ఆయన పీసీసీ అధ్యక్షుడు. మరెవరూ ఇటువంటి విమర్శ చెయ్యగా నేను వినలేదు. (అందుకే ఆయన కేశవరావు అయ్యారు.) దీని గురించి మాట్లాడ వలసిన అవసరం లేదు. ఇదొక పసలేని వాదన.
  6. స్వయంగా తనే రాజకీయాల్లోకి దిగి, జయప్రకాశ్ నారాయణ తన విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నాడు. "రాజకీయాలనేవి మంచివారు ఉండదగినవి కావు, అదో మురుగ్గుంట, పందులకు మాత్రమే అనుకూలం" అనే భావనతో మనమున్నాం. అంచేతే ఈ విశ్వసనీయత విషయం తలెత్తింది.
నా ఉద్దేశ్యంలో అన్నిటి కంటే ముఖ్యమైన అంశం ఒకటుంది..
ప్రస్తుతం మనకు రెండే శక్తులున్నాయి.. అయితే కాంగ్రెసు, లేదంటే తెలుగుదేశం. విధానాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి అవలక్షణాల్లొ ఈ రెంటికీ పెద్ద తేడా లేదు. ఇక కాస్తో కూస్తో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు బలమైన శక్తి కాదు. ఈ పరిస్థితుల్లో మనకు ఒక మూడో శక్తి కావాలి. మూడో పార్టీ కాదు, ఒక శక్తి కావాలి. ఓటేసేందుకు మనకు మరో వికల్పం కావాలి.

నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని ఒకపక్షమంటే, ఏఁ, నువ్వు చెయ్యలేదా అని రెండోది అంటున్న రోజులివి. కాదు అని ఖండించాల్సిన అవసరం కూడా వాళ్ళకు కనిపించడం లేదు. అంతలా బరితెగించి పోయారు. వీళ్ళకు ప్రజలంటే లెఖ్ఖేలేదు. 'ఈ ఐదేళ్ళ తరువాత మనమెలాగూ ఉండము, ఆపై ఐదేళ్ళ తరువాత ఎలాగూ తిరిగి వస్తాము' అనే ధీమా అధికార పక్షానిది కాగా, ఈ ఐదేళ్ళ తరువాత మనదే రాజ్యం అనేది ప్రతిపక్షం ధీమా! మూడో శక్తి ఉంటే ఆ ధీమా ఉండదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

లోక్‌సత్తా చెబుతున్న సిద్ధాంతాలను ఆచరణలో పెడితే అది మూడో శక్తి కాగలదనే నా నమ్మకం. అప్పుడు మన రాజకీయాలు మంచికి మళ్ళుతాయి. చూద్దాం, లోక్‌సత్తా మూడో శక్తిగా ఏర్పడుతుందేమో!

2, సెప్టెంబర్ 2006, శనివారం

సినిమా పాటలూ మన పాట్లూ

5 కామెంట్‌లు
శ్రీశ్రీ స్నేహితులతో కలిసి ఒక నాటకం చూస్తున్నారట. నటులు తమ తమ మాటలు, పాటలు, అభినయాలతో శాయశక్తులా బాదేస్తున్నారు. ఒక నటుడు పాతాళ లోకం గురించి పద్యమేదో పాడుతూ.. చెయ్యి పైకెత్తి చూపించాడట. శ్రీశ్రీని స్నేహితుడు అడిగాడు.. "ఏంటండీ, పాతాళం అని పాడుతూ చెయ్యి ఆకాశం కేసి చూపిస్తాడేమిటీ" అని. శ్రీశ్రీ ఇలా జవాబిచ్చారు.. "ఈ ప్రదర్శన స్థాయి పాతాళాని కంటే దిగువకు పడిపోయింది. అందుకే పాతాళం అంటే పైకి చూపిస్తున్నాడు"

మన తెలుగు సినిమా పాటల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అదే!

పాటలెలా ఉండాలి..
మంచి సాహిత్యం ఉండాలి, బూతు కూతలు కాదు
విన సొంపుగా ఉండాలి, వాయిద్యాల హోరు కాదు
కథలో భాగంగా ఉండాలి, అతికినట్లుగా కాదు
నటులేసే గెంతుల కోసం కాదు, నటుల అభినయం కోసం ఉండాలి

పాటలెలా ఉన్నాయి:
గోల గోలగా ఉన్నాయి, భాషను చంపుతూ ఉన్నాయి.
చాలా పాటల్లో వాయిద్యాల మోతల మధ్య సాహిత్యం వినబడదు.
రచయితలు చేస్తున్న భాషా హత్యను సంగీత దర్శకులు ఇలా మోతల మాటున దాస్తున్నారా!?
ఇక గాయకులు.. ఘంటసాల, బాలు, సుశీల, జానకి లాగా చక్కగా పాడేవారేరీ? ఒకడు ముక్కుతో పాడతాడు, ఇంకోడు చెవుల్తో పాడతాడు. శ పలకమంటే ష అంటారు. అసలు తెలుగే రాదాయె, ఇవెలా వస్తాయి. "రామా చిలకమ్మ" అని రాస్తే "రామ్మా చిలకమ్మా" అని పాడేసాడో ముక్కు తిమ్మన! శ్రీ రామదాసు సినిమాలో ఓ పాటలో తండ్రీ అనమంటే తన్రీ అని పాడిందొక గాయనీమణి. ఫ్యాషననుకుందేమో మరి! మన దిగ్దర్శకులకు ఇలాంటివి ఎలా నచ్చుతాయో!?
ఎందుకిలా ఉన్నాయి:

బాగా రాసేవారు, రాయగలిగే వారు లేక కాదు.. రాయించుకునే వారు లేక! సినిమా వాళ్ళు నలిగిన బాటలో నడిచేందుకు ఇష్టపడతారు. ఓ సినిమా బాగా ఆడితే, పేరు దగ్గర్నుండి, ప్రతీ విషయంలోనూ దాన్ని అనుకరిస్తారు, విజయం తెస్తుందన్న నమ్మకంతో! అంచేతే, స్వతహాగా సృజనాత్మక మాధ్యమమైన సినిమా కేవలం చవకబారు వినోద సాధనంగా అయిపోయింది. మహా అయితే సాంకేతిక నైపుణ్య ప్రదర్శనలా ఉంటోంది. సృజనాత్మకతాలేమికి మొదటగా బలయ్యేవి మాటలూ, పాటలే!

ఎక్కడో తమ సృజనాత్మక శక్తిపై నమ్మకం ఉన్నవారి నుండి మాత్రం చక్కటి సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో పాటలు కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది.

చెత్త పాటలకు మరో కారణం.. మన హీరోలు తమ చుట్టూ కట్టుకున్న మిధ్యా లోకం. ఇమేజీ అనే సంకెళ్ళు తగిలించుకున్న వీళ్ళ సినిమాల్లో పాటలు వాటి కథల్లాగే అదే చచ్చు పుచ్చు ధోరణిలో సాగుతాయి కాబట్టి, అవి అలాగే నేలబారుగా ఉంటాయి.

(ఇలాంటి పాటలు ఎందుకు పెడుతున్నారయ్యా అంటే, కొందరు చవటాయిలు "ప్రేక్షకులు అవే కోరుతున్నారు, మేమూ అవే ఇస్తున్నాము" అని అంటారు.)

ఇక..
నా ఇష్టాయిష్టాలను రాస్తానిక్కడ. సినిమా పాటల్లో మంచి సాహిత్య విలువలు కలిగినవెన్నో ఉన్నాయి. పాటల్లో నేనిష్టపడే అంశాలివి, ప్రాధాన్యతానుసారం..
  1. భావం అందంగా, హృద్యంగా, గిలిగింతలు పెట్టేలా ఉండాలి: "నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట.. నా నావ మీద కాలుపెడితే ఏటౌతాదో తంట" ఇలాంటి భావాలు గుండెకు హత్తుకుంటాయి. "తికమక మకతిక పరుగులు ఎటుకేసీ".. శ్రీ ఆంజనేయం లోని పాట ఇది. ఈ పాటలోని "శ్రీరామ చందురుణ్ణీ.. కోవెల్లొ ఖైదు చేసీ, రాకాసి రావణుణ్ణీ గుండెల్లొ కొలువు జేసీ.." అనేది నాకు బాగా నచ్చిన వాక్యం.
  2. పదాలతో చమత్కారాలు నచ్చుతాయి: ఇందులో వేటూరి ఉద్దండుడు. "శంకరా నాద శరీరా పరా.." పాట రెండో చరణంలో 'గంగ' తో ఆయన ఆడుకున్న అంత్య ప్రాసల ఆటలాంటివి నాకు బాగా ఇష్టం. అదిక్కడ రాసి నా ముచ్చట తీర్చుకుంటాను..

    పరవశాన శిరసూగంగ
    ధరకు జారెనా శివగంగ
    నా గానలహరి నువు మునుగంగ
    ఆనంద వృష్టి నే తడవంగ

  3. పద గాంభీర్యం నచ్చుతుంది: "చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన.." పాట, పద గాంభీర్యతకు ఓ మచ్చు తునక. నాకు నచ్చినది.
  4. సంగీతం: వీటి తరువాతి స్థానం సంగీతానిది.
ఏ రకమైన పాటలు నాకిష్టం..
భక్తి పాటలు: సినిమా పాటలే కాక కీర్తనలు, పదాలు కూడా ఇందులో చేరాయి. కొన్ని పాటలుంటాయి.. దేవుడి అనేకానేక పేర్లను ఒక పద్ధతిలో కూర్చి పాటగా రాసేస్తారు. నాకలాంటివి నచ్చవు. నాకు బాగా నచ్చిన పాటలు చాలానే ఉన్నాయి గానీ, ఇక్కడ ఒక్క రామదాసు కీర్తనను ఉదహరిస్తాను.. " ఓ రఘువీరా.. యని నే పిలిచిన, ఓహో యనరాదా" బాలమురళీకృష్ణ పాడిన ఈ కీర్తన (శ్రీ రామదాసు ప్రాజెక్టు, ఖమ్మం వారి విడుదల) నాకమిత ఇష్టం. ఇక ఘంటసాల భగవద్గీత గురించి చెప్పేదేముంది.. నారాయణుడు చెప్పగా విని, నరుడు తరించి పోయాడు. ఘంటసాల బోధించగా విని నరులు తరించి పోతున్నారు. ప్రస్తుతం సురులను తరింప జేస్తున్నాడాయన! గీతను ఇంతకంటే బాగా ఎవరూ పాడలేరేమో! అలాగే, ఎమ్మెస్ రామారావు గారు మనయెద పలికించిన సుందరకాండము నాకు ఎంతో ఇష్టమైన గేయ కావ్యం. శ్రీకృష్ణుడు ఘంటసాల చేత భగవద్గీత చెప్పించాడు, హనుమంతుడు రామారావు గారి చేత సుందరకాండను చెప్పించాడు. తెలుగువారి లంకె బిందెలివి.

శృంగార పాటలు (దుష్ట సమాసమేమో గానీ, నాకు అలా అనడమే ఇష్టంగా ఉంది): సున్నితమైన శృంగారంతో కూడిన పాటలు ఇష్టం. "ఎంతటి రసికుడవో తెలిసెరా.." లాంటి పాటలు ఇష్టం. గుంభనంగా లేకున్నా.., వెకిలిగా లేని శృంగార రసమూ ఇష్టమే! ఉదాహరణకు.. "మన్నేల తింటివిరా కృష్ణా.." అంటూ స్మిత పాడే పాట. ఛత్రపతి సినిమా అనుకుంటాను. సినిమా చూడలేదు, పాటను మాత్రం యాదృచ్ఛికంగా విని, దానికి అభిమానినైపోయాను.

తాత్విక, విషాద గీతాలు: వీటిలో ముందు వరుసలో ఉండేవి బాలమురళీకృష్ణ తత్వాలే! వాటిలో "గూడు.. చిన్నబోయెరా!" నాకెంతో ఇష్టమైనది. "యాతమేసి తోడినా ఏరు ఎండదు" - జాలాదిని చిరస్మరణీయుడిని చేసిన ఈపాట నాకు బాగా ఇష్టం.

చివరగా..
మంచి మంచి పాటలు వినడం కంటే ఇష్టమైనది నాకొకటుంది. అది..
ఆ పాటలు పాడుకోవడం! పాడుకుంటుంటే ఉండే తృప్తి వింటే రాదు.

1, సెప్టెంబర్ 2006, శుక్రవారం

భేష్, రాష్ట్ర ప్రభుత్వం

0 కామెంట్‌లు
మేకల రాజ్యలక్ష్మి! కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక. ఎమ్సెట్ పరీక్షలో ర్యాంకు తెచ్చుకుని, మెడికల్ కాలేజీలో సీటూ పొందింది. దురదృష్టం.. అంత చదువులు చదివే ఆర్థిక తాహతు లేదీమెకు. (ఒకరోజు టీవీలో చూపించారు, ఆమె పొలంలో పనిచేసుకుంటూండగా!) సీటు కోసం తపించే వాళ్ళు, సీటు రాక లక్షలూ కోట్లూ పోసి చదివే వాళ్ళు, చైనాలు, జపానులూ వెళ్ళి మరీ చదువుకునే వాళ్ళు ఉన్న కాలమిది. మన రాష్ట్రంలోనే సీటొచ్చీ.., చేరలేని నిస్సహాయత తలుచుకుంటే ఏ సంబంధమూ లేని మనలాంటి వారికి కూడా ఉసూరనిపించక మానదు. అలాంటిది, ఇక ఆమె వేదన ఊహించరానిదేమీ కాదు.

సరైన సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆదుకుంది. "
ఆమె డాక్టర్‌ కావాల్సిందే. స్టెతస్కోప్‌ పట్టాల్సిందే. ఆమె సేవలు సమాజానికి ఉపయోగపడాల్సిందే'" అని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారట. ఆమెలాంటి వారికి సహాయం అందించేందుకు ఏదో పథకాన్ని కూడా తయారు చేస్తారట.

ఇంత మంచి పని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు!

సంబంధిత టపాలు