5, అక్టోబర్ 2006, గురువారం

ఈనాడు x ముఖ్యమంత్రి

6 కామెంట్‌లు
ఈనాడుతో ముఖ్యమంత్రి వ్యవహారం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పత్రికలు అవినీతి ఆరోపణలు చేసినపుడు ప్రభుత్వ వైఖరి రక్షణాత్మకంగా ఉంటుంది. అందునా పేర్లతో సహా వచ్చినపుడు, మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు. అదేదో సూటిగా చెయ్యక వెనకదెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రింగురోడ్డుకు సంబంధించి ఈనాడు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి సరైన పనే చేసారు. కానీ పత్రికపై ఎదురుదాడి చెయ్యడం, దాన్ని సంకేతంగా తీసుకుని కాంగ్రెసు కార్యకర్తలమని చెప్పుకుంటున్న రౌడీలు పత్రిక కాపీలను తగలబెట్టడం.. ఇవన్నీ ముఖ్యమంత్రి గౌరవాన్ని దిగజార్చేవే గానీ, ప్రభుత్వానికి ఏమాత్రం ఉపకరించవు. రాజశేఖరరెడ్డి అసహనాన్ని సూచిస్తున్నాయి, ఈ చర్యలు. ముఖ్యమంత్రి స్థాయికి తగవీ పనులు.


ముందుగా ఒక విషయం.. సమాజంలో ఎవరు తప్పు చేసినా అరికట్టేందుకు, సరిదిద్దేందుకు ప్రభుత్వం ఉంది. మరి.. పాలకులే తప్పు చేస్తే? మనమెన్నుకున్నవారే మన వెనుక గోతులు తవ్వితే? మన డబ్బు కొల్లగొట్టేస్తే? మనకేమిటి రక్షణ? అందుకోసం వాళ్ళపై ఒక నిఘా ఉండాలి. ప్రతిపక్షాలు ఆ పని చెయ్యాలి. మన ప్రధాన ప్రతిపక్షం అలా చేస్తున్న జాడ లేదు. చెయ్యగలిగిన శక్తియుక్తులూ దానికి ఉన్నట్లు లేవు. కొండొకచో చేసినా, ఈ ప్రభుత్వం లెక్క జేస్తున్నట్లు లేదు. అందుకు ముఖ్య కారణం అందరూ దొంగలే కాబట్టి! మరిక నిఘా ఎవరు పెట్టాలి? పత్రికలే! అవి ఆ పని చేస్తున్నంత కాలం మనం పత్రికలను బలపరచాల్సిందే!

పత్రికలే తప్పు చేస్తే? ఈనాడు రాసింది తప్పైతే? పక్షపాత ధోరణితో రాసి ఉంటే?
రాంగురోడ్డు విషయంలో ఈనాడు పేర్లతో సహా రాసింది తప్పై ఉంటే.. ఈ పాటికి రాసినవాడూ, రాయించినవాడు ఇద్దరిపైనా కోర్టు కేసులు కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి. ఆరోపణల్లో పేర్లున్న వారెవ్వరూ ఇంతవరకూ కేసులెందుకు వెయ్యలేదు? వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఎం రాఘవులు ఆరోపణలు చేస్తే ఆయనకు లాయరు నోటీసు పంపిన విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. (ఇకముందు వేస్తారేమో చూడాలి.)

ఇంకో విషయం ఏమిటంటే పత్రికలు, ఈనాడుతో సహా, చాలా ఆరోపణల్లో తగు సాక్ష్యాధారాలు లేకపోతే గోడ మీది పిల్లివాటంగా రాస్తాయి. ఉదాహరణకు మాదాపూర్లో ఘటకేసర్ ట్రస్టు భూముల్లో "ముఖ్య నేత సోదరుడైన ఎంపీ " గారి అక్రమ కట్టడమంటూ ఈనాడు ముసుగు తొడిగి రాసిన వార్త. కాస్త లోక జ్ఞానం ఉన్నవాడెవడికైనా అది వై యెస్ వివేకానందరెడ్డి గురించని తెలిసిపోతుంది. కానీ తమకు తాముగా పేరు మాత్రం బయట పెట్టలేదు. కానీ రాంగురోడ్డు ఆరోపణలు మాత్రం పేర్లతో సహా రాసింది ఈనాదు. సెప్టెం 29 నాటి మొదటిపేజీ ప్రత్యేక సంపాదకీయంలో రాసింది చూస్తే ఆరోపణలపై తగు ఆధారాలు ఉన్నట్లే తెలుస్తోంది. ఓ పత్రిక బహిరంగంగా ముఖ్యమంత్రికి విసిరిన సవాలు అది; ఫ్రంటల్ ఎటాక్ !

ఈనాడు ఆరోపణలకు కాంగ్రెసు స్పందన ఎలా ఉంది? అవినీతి ఆరోపణలు చేస్తే తెలుగుదేశానికి ఎలా జవాబిస్తుందో అచ్చం అలానే స్పందించింది. 'తెలుగుదేశం బోలెడు తప్పులు చేసినప్పుడు మీరేం మాట్లాడలేదు, మా విషయంలో మాత్రం విరుచుకుపడుతున్నారు. మీ సొంత భూములు పోయాయని మీ ఏడుపు, అందుకే మామీద ఆరోపణలు చేస్తున్నారు ' -ఇదీ వరస!

రామోజీరావో మరొకరో అంటే మనకు ప్రత్యేక అభిమానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వపు తప్పొప్పుల్ని బయట పెడుతున్నపుడు మాత్రం మనం వాళ్ళ వెంటుండాలి.. అది ఈనాడయినా, వార్తయినా! ఒకే ఒక్క విషయం.. ప్రభుత్వంపై నిఘా అనేది ఉండాలి, మనకది అత్యావశ్యకం. ఈ నిఘా ఎవరు పెడితే వాళ్ళను బలపరచాలి.

ప్రభుత్వం తప్పు చెయ్యలేదు, ఈనాడు రాసేదంతా అబద్ధం అనే నిర్ణయానికి ఎవరైనా వచ్చేసి ఉంటే, వాళ్ళు నిక్షేపంగా ఈనాడుని చదవడం మానెయ్యొచ్చు, లేదా ఈనాడును విమర్శించవచ్చు. కానీ ఇతరులు ఈనాడుని చదవకుండా పత్రిక కాపీలను కాల్చెయ్యడం ఏంటి?

4, అక్టోబర్ 2006, బుధవారం

గురజాడపై విమర్శ

0 కామెంట్‌లు
గురజాడ గురించి గొప్పగా వింటూ వచ్చాం! విమర్శ చాలా అరుదు. కానీ ఈ లింకు చూడండి, ఎంత తీవ్ర విమర్శ ఉందో! కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ రాయనే లేదనే సుప్రసిద్ధ విమర్శలో కూడా దాన్ని ఆయన రాయలేదని అన్న్నారే గానీ, (దాన్ని ఆయన ఇంగ్లీషులో రాస్తే ఆయన స్నేహితుడు తెనిగించారనే వాదన ఉంది. పెద్ద చర్చే జరిగింది. ఇదంతా గురజాడ చనిపోయాకే!) ఇంత ఘోరంగా విమర్శించలేదు. నిజానిజాలు దేవునికెరుక! రచయిత నవరసాల అట.

అదే పేజీలో ఒక "సవర" కవి తెలుగులో రాసిన కవిత చూడండి, బాగుంది. 'వెన్నెముక లేని జంతువుల'ను తరిమేసి 'అకశేరుకాల'ను తెచ్చుకున్నారు అంటూ, సంస్కృత భాషపై మన మోజును కలమెత్తి చూపిస్తున్నాడు.

2, అక్టోబర్ 2006, సోమవారం

కేసీయార్ రాజీనామా తార్కికమైనదేనా!

5 కామెంట్‌లు
కేసీయార్ రాజీనామా అంకాన్ని పూర్తి చేసాడు. కేసీయార్ దృక్కోణం నుండి చూస్తే ఎందుకో నాకిది తార్కికంగా అనిపించలేదు. రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి కాంగ్రెసును వీలయినంత ఇబ్బంది పెట్టేసాడు. తెరముందు తన వాదనను బాగా వినిపించి ప్రజల్లోకి మళ్ళీ దూసుకెళ్ళాడు. తాను పొందాల్సిన లాభాన్ని పొందేసాడు. ఇక ఏదో ఒకటి చెప్పి, రాజీనామా వెనక్కు తీసుకుంటాడనుకున్నాను. కానీ, తెగే దాకా లాగాడెందుకో!? రాజీనామా ఉపసంహరణ కోసం కాంగ్రెసు కొంత ప్రయత్నం చేసింది గానీ, కేసీయార్ 'ఆశించినంత ' చేసినట్లు లేదు. ఒక రకంగా కేసీయార్ కు రాజీనామా వెనక్కు తీసుకోలేని పరిస్థితి కల్పించినట్లయింది. ఇక దృశ్యం కార్యక్షేత్రానికి మారింది.

ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు తెరాసకే ఎక్కువగా ఉన్నప్పటికీ అది నల్లేరు మీద నడకయితే కాదు. తెరాస ఓటమికై కాంగ్రెసు ఎంతకైనా తెగిస్తుందనేది కాదనలేని విషయం. తెలుగు దేశం పుంజుకోవడం తెరాసకు కష్టము, నష్టమూ కలిగించే విషయం.

కాంగ్రెసుకు కరీంనగర్ ఉపఎన్నిక అగ్ని పరీక్షేమీ కాదు. ఓడిపోతే చెప్పుకోడానికి కాంగ్రెసుకు ఒక వంక ఉంది. - ఇప్పటికే తెరాస స్థానమిది. పైగా అధినేత కేసీయార్ స్థానం కూడాను. గెలుపు కోసం కాంగ్రెసు సర్వ సన్నాహాలు చేస్తుంది, సర్వశక్తులూ ఒడ్డుతుంది అనేది సర్వ విదితం. అధికారంలో ఉన్నవారి ఎన్నికల ఆగడాలు మనకు కొత్తేం కాదు. తెరాసకిదో పెద్ద సవాలు

తెరాస గెలిస్తే సరే, గెలవకపోతే మాత్రం అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. మిగతా పార్టిలకంటే కూడా తెరాసకే ఈ ఎన్నిక కీలకం. గెలిస్తే తమ ఉద్యమానికి ఊపు వచ్చేమాట నిజమే. కానీ ఆ ఊపు ఇప్పటికే కొంత వచ్చింది. ఎన్నికలు జరిగి అందులో గెలిస్తే వచ్చే లాభం కొంత ఇప్పటికే వచ్చింది. దాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇతర పద్ధతులను చూసుకోవాల్సింది. ఖర్మకాలి ఈ ఎన్నికల్లో ఓడితే, స్వయానా కేసీయారే చేజేతులా ఉద్యమాన్ని దెబ్బతీసిన వాడవుతాడు. కాబట్టి రాజీనామా తెరాస దృక్కోణంలో అంత తార్కికంగా లేదు!

కేసీయార్ రాజీనామా తార్కికమైనది కాదనేందుకు మరో సాక్ష్యం.. బీజేపీతో సయోధ్య కోసం వారి ప్రయత్నాలు. గెలుపు చేజారకుండేందుకు చెయ్యవలసిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. (అసలు తెరాసదో చిత్రమైన వ్యక్తిత్వం! (పార్టీత్వం అనాలేమో!) ఓ పక్కనుండి ఇష్టమొచ్చినట్లు తిడతారు, మరో పక్కనుండి సాయం కావాలంటారు. పైగా తమకు సాయం చెయ్యడం అవతలవాడి ధర్మమన్నట్లు మాట్లాడతారు.) రాజకీయ పార్టీలకు ఎవరో ఒకరి తోక పట్టుకుని ఈదడం, అవసరం తీరాక తోక జాడించడం కొత్త కాదు కాబట్టి వాళ్ళిద్దరూ కలవవచ్చు. లేని పక్షంలో, బీజేపీ తమ అభ్యర్థిగా విద్యాసాగరావును నిలబెడితే తెరాసకు గడ్డుకాలమే!

ఇక రాజీనామా చెయ్యడంలోని సంబద్ధతనే ప్రశ్నించేవారు ఎలాగూ ఉన్నారు. ఐదేళ్ళపాటు సేవ చెయ్యమని ఆదేశిస్తే తమ పంతాలకోసం మధ్యలోనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టమనడం ఏమిటి? ప్రజలను వంచించడం కాదా? ఇది అనవసరమైన ఖర్చు కాదా? అనేవారు ఉన్నారు. రాజీనామాను వంచనగా ప్రజలు భావిస్తే వోటుచ్చుక్కొడతారు. ఇక ఖర్చంటారా? నిజమే, అది అనవసరమైన ఖర్చే! దాన్ని నివారించే మార్గం రాజ్యాంగంలో ఏర్పరచాలి. ప్రజలు తెరాసకు వోటేస్తారో, వోటుచ్చుక్కొడతారో చూడాలి.

సంబంధిత టపాలు