26, నవంబర్ 2006, ఆదివారం

వినుడు వినుడు వీనుల విందుగా..

11 కామెంట్‌లు
ఇక నా బ్లాగును చదవడమే కాదు, విననూ వచ్చు. దీని గురించి తెలియజెప్పి నేర్పించిన శోధన సుధాకర్, అమెరికా నుండి.. వైజాసత్య కు కృతజ్ఞతలతో.. వాళ్ళ లింకుల్లో ఈ ఆడియో బ్లాగు ఎలా పెట్టాలో చాలా వివరంగా ఉంది. అవి చదువుకుని ఎవర్నీ అడక్కుండా మనమే మోత మోగించవచ్చు.

ఇదిగో నా మొదటి పాట. మరిన్ని పాటలు త్వరలో.. (మీరు వినాలే గానీ ప్రస్తుతం రాసేదంతా మాట్లాడి, ఆడియో బ్లాగుగా పెట్టేయనూ!?)

powered by ODEO

మీరూ మోగించండి, మరి!

25, నవంబర్ 2006, శనివారం

కొన్ని హాస్య వార్తలు

4 కామెంట్‌లు

నవంబరు 24 న ఓ రెండు హాస్య వార్తలొచ్చాయి. నవ్వు తెప్పించే వార్తలు రోజూ వస్తూనే ఉంటాయి గానీ, అవి ప్రధాన వార్తలు కావడమే ఆనాటి విశేషం .

మన క్రికెట్టు టీము దక్షిణాఫ్రికాతో చిత్తుగా ఓడిపోవడం మన ఎంపీలకు మింగుడు పడలేదు. ఇదివరలో ఇలా భయంకరంగా ఓడిపోయినా ఎంపీలు నోరు మెదిపేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రం తలో మాటా అందుకున్నారు. నోరు తెరిచేందుకు ఒక్కొక్కళ్ళకు ఒక్కో కారణం ఉంది. వాళ్ళేమన్నారో చూద్దాం..

గంగూలీని తీసుకుంటే ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదా అని సీపీఎం గోస. (ఎప్పుడో వచ్చేది కామోసు!)
చాపెల్ రాజీనామా చెయ్యాలి. (ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు ఒక్కడే రాజకీయుడు... అప్పుడు కోచిగా కూడా రాజకీయుడే అవ్వచ్చని వీళ్ళ ఎత్తు!)
శరద్ పవార్ రాజీనామా చెయ్యాలి. (సరే, ఇది మామూలు డైలాగే ననుకోండి)
ఇక ఈ డిమాండ్లన్నిటికీ బాబులాంటిది రాందాస్ అథవలే గారిది.. భారత క్రికెట్టు జట్టులో రిజర్వేషన్లు పెట్టాలి అని
అర్జున్ సింగు పుణ్యమా అని ఆ మధ్య రిజర్వేషన్ల రగడ రేగినపుడు అనేక ఛలోక్తులు, వ్యంగ్య విమర్శలు వచ్చాయి. వాటిలో క్రికెట్టు రిజర్వేషన్లు కూడా ఒకటి. ఆ డిమాండు నిజంగానే చేసి, అథవలే గారు ఆ వ్యంగ్యకారులను వ్వె వ్వె వ్వె అని వెక్కిరించబూనారు. శభాష్ రాందాస్!!

ఇక రెండోది.. ఇక్కడ హీరో మరో రాందాస్. తెలుగు కాంగ్రెసు నాయకులకు వెలిగించకుండానే బీడీతో వాతలు పెట్టాడు. బీడి కట్టల మీద పుర్రె గుర్తు గురించి సానుకూల స్పందన వస్తుందని ఆశించి, కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రాందాసు దగ్గరికి విలేకరులను తీసుకుని వెళ్ళారట పనబాక లక్ష్మి, గిరీష్ సంఘీ, సర్వే సత్యనారాయణ మొదలైన వారు. అక్కడ అన్బుమణి రాందాసు కత్తి రాందాసై పోయి, పుర్రె గుర్తు ఉండి తీరుతుందని వాళ్ళ మాడు పగిలేలా విలేకరులకు చెప్పాడట. (అవును మరి, ఏఐఐఎమ్మెస్ వ్యవహారంలో తెలుగు వాడైన రాజగోపాలుతో పెట్టుకుని రాందాసుకు మాడు పగల్లేదూ మరి! ఆ కసి వీళ్ళ మీద తీర్చుకున్నట్టున్నాడు.)

దానితో బిత్తరపోయిన మనవాళ్ళు, విలేకరులను హడావుడిగా పనబాక లక్ష్మి ఆఫీసుకు తీసుకుపోయి అక్కడో సమావేశం పెట్టారట. బీడిలు సిగరెట్లంత ప్రమాదకరం కాదని వాళ్ళు విలేకరులకు చెప్పబోయేసరికి, అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి, అబ్బెబ్బే అదేంకాదు అన్నీ చెడే, పొగాకు ఎక్కడైనా పొగాకే అని ఎదురు తిరిగారట. వీళ్ళ మాయమాటలను తేటతెల్లం చేసేలా ఆమె ఇంకా చెప్పబోతూంటే ఇంక ఆపమంటూ మల్లు రవి ఆవిడకు దణ్ణం కూడా పెట్టాడట!

మన ఆసిగాళ్ళు (హాస్యగాళ్ళు) ఢిల్లీలో కూచ్చుని చేసే నిర్వాకాలు ఇవి.

23, నవంబర్ 2006, గురువారం

ప్చ్..

2 కామెంట్‌లు
ఏంటో ఈ రాజకీయులు..
"చెప్పింది చెయ్యకపోతే మమ్మల్ని కొట్టండి, చంపండి" అంటారు..
కానీ ఎప్పుడు చూసినా చుట్టూ పోలీసులూ, భద్రతాను!
మరి కొట్టేదెట్లా, చంపేదెట్లా!?
ఏంటో ఈ రాజకీయులు.. వాళ్ళ పని వాళ్ళు చెయ్యరు, మన పని మనల్ని చెయ్యనివ్వరు!

20, నవంబర్ 2006, సోమవారం

బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం

11 కామెంట్‌లు
మన ఎన్నికలలో మామూలు విషయాలకు కూడా కొత్త అర్థాలు వస్తూంటాయి. ఏ ప్రాముఖ్యతా లేని మామూలు విషయాలను మన రాజకీయులు పెద్దవి చేసి ప్రజల సానుభూతిని, తద్వారా ఓట్లను కొల్లగొట్టే ఆలోచనలు చేస్తుంటారు. కరీంనగరు, బొబ్బిలి ఎన్నికల్లో కూడా ఇలాంటి రెండు విషయాలు పైకి తేలాయి.

కరీంనగరు ఎన్నికకు వస్తే... వెంటనే గ్రహించేసి ఉంటారు - బీడీల గురించి అని. ఈ ప్రాంతంలో బీడీ ఆకు (తునికాకు) ఏరుకుని బీడీలు చుట్టి అమ్ముకునే కార్మికులు ఎక్కువ. బీడీ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరికగా బీడీ కట్టపై పుర్రె బొమ్మను ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయోజనం శూన్యమైనా, మనకీ నిర్ణయంలో తప్పైతే ఏమీ కనబడదు. (మీక్కనబడితే ఏమిటో వ్యాఖ్యలో రాయగలరు.)

మన ముఖ్యమంత్రి కరీంనగరు పర్యటనకు వెళ్ళినపుడు దీని ప్రస్తావన తెచ్చి, కేసీయారు కార్మిక మంత్రిగా ఉంటూ కూడా దీన్ని ఆపలేదు, అసలు దీనికి ఆయనే కారణం అంటూ విమర్శించి, బీడీని ఎన్నికలలో ప్రచారాంశం చేసేసాడు. అందుకు కేసీయారు ఊరుకుంటాడా!? మీరే దీనికి కారణం, మీ మంత్రి పనబాక లక్ష్మియే దీనికి కారణం అంటూ ఎదురుదాడి చేసాడు. ఇక ఒకరి తరువాత ఒకరు రంగంలోకి దిగి యథాశక్తి తిట్టుకోడం మొదలుపెట్టారు. పాపం బీడీ కార్మికులు అప్పటిదాకా దాన్ని పట్టించుకున్నారో లేదో గానీ ఆ తరువాత మాత్రం ప్రచారానికొచ్చిన రాజకీయులను ప్రశ్నించడం మొదలెట్టారు. ఇదెలా తయారయిందంటే కేంద్రం చేసిన ఈ నిర్ణయం తప్పని చివరకు కాంగ్రెసు, తెరాస కూడా అంటున్నాయి. వెచ్చగా తాగుదామని బీడీ వెలిగించుకుంటే, అది చకచకా కాలి, చూసుకునే లోగానే మొదలంటా కాలి వేళ్ళను చుర్రుమనిపించినట్లయింది, కాంగ్రెసు, తెరాస పరిస్థితి. అప్పనంగా బీడీ దొరికింది గదాని, తెదేపా కూడా బీడీ తాగడానికి ఉత్సాహపడుతోంది.

కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం తప్పని స్వయంగా అదే పార్టీకి చెందిన (అందునా కాంగ్రెసు పార్టీ) ముఖ్యమంత్రే బహిరంగంగా అన్న ఘటన, స్వయంగా ఆ కేంద్ర మంత్రివర్గంలోనే సభ్యురాలైన మంత్రి కూడా అన్న ఘటన మనమెప్పుడు చూసాం? ఈ బీడీ వార్తలు చదూకోడానికి సరదాగా ఉన్నాయి. పనబాక లక్ష్మి అప్పజెప్పిన ఓ డైలాగు మాత్రం ఈ నాటకానికంతటికీ హైలైటు.. నాలాంటి దళితనేతపై దొర చేస్తున్న అహంకార పూరిత విమర్శ అంటూ కేసీయార్ విమర్శ గురించి ఆమె వాపోయింది. సానుభూతి కోసం వాడే ఈ డైలాగు ఎవరుబడితే వారు తెగ వాడడంతో మరీ అరిగి, చిరిగి పోయింది.

ఇక బొబ్బిలిలో.. వోక్సు వాగను ఇక రానట్లే నంటూ ఈనాడులో వార్త రావడం బొత్స సత్యనారాయణకు కాస్త తలనెప్పి అయింది. వోక్సు రానందుకు కాదు.. ఎవరో తెలీని వాడికి డబ్బులిచ్చారు కదా -అందుకు, జర్మనీకి తన తమ్ముడిని తీసుకెళ్ళాడు కదా -అందుకు, మరిప్పుడేమో బొబ్బిలిలో నిలబెట్టింది స్వయానా తన భార్యనే కదా - అందుకు, మొత్తం తన వాళ్ళతోటే జిల్లా రాజకీయాలను నింపేస్తున్నాడనీ, అందరూ కలిసి దోచుకుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తారు కదా- అందుకు. ఈ వ్యవహారంలో బొత్స సత్యనారాయణ గారి పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించి ఎన్నికలలో లాభం పొందాలని తెదేపా భావిస్తుంటే బొత్స దాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ఎత్తెత్తాడు. ఈనాడులో ఆ వార్త రాగానే ఆ పేపరుపై దాడికి దిగి, తన భాషను, తన యాసను గేలి చేస్తూ రాసింది, ఇది ఆ ప్రాంత ప్రజలను వారి యాసను అవమానించడమే నంటూ ప్రాంతీయ సెంటిమెంటును గిల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

గాల్లోంచి శివలింగాలను సృష్టించే వాళ్ళు కొందరైతే ఆ గాలి కూడా లేని శూన్యంలోంచి కూడా ఎన్నికల ప్రచారాంశాలను సృష్టించగలరు మనవాళ్ళు. మనమీ ఐటీలు, ఐఐటీల ద్వారా ప్రపంచంలో వెలుగులోకి రాకముందు, పాశ్చాత్య దేశాల్లో భారతదేశమంటే పాములాడించేవాళ్ళే మదిలో మెదిలే వారంట.. ఆయా దేశాల్లో కూడా రాజకీయులు కొద్దో గొప్పో మనవాళ్ళ స్థాయిలోనే ఉంటారు కాబట్టి గానీ, లేకపోతే పాములాళ్ళ స్థానాన్ని వీళ్ళెప్పుడో ఆక్రమించేవాళ్ళు.

19, నవంబర్ 2006, ఆదివారం

వోక్సూ పోనాదండి

2 కామెంట్‌లు
ఇక తేలిపోయింది. వోక్సువాగను పోయింది. వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీకిచ్చిన 11 కోట్లూ పోయాయి.

రాష్ట్రానికి అప్రదిష్ట మిగిలింది, బొత్స సత్యనారాయణ మిగిలాడు. ఆయనకు మంత్రి పదవి మిగిలింది. తమ్ముడితో కలిసి ఆయన చేసిన జర్మనీ పర్యటన మిగిలింది. ఆయనకి ఇంకా ఏమేం మిగిలాయో తెలీదు. ఆ 11 కోట్లూ ప్రభుత్వం ఎవరికిచ్చిందో గానీ, ఐపూ అజా లేవు.

ఈ వోక్సు వాళ్ళ పద్ధతేమి బాగాలేదు. కర్మాగారం పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చుట్టూ తిప్పుకుని చివరికి మొహం చాటేసారు. కొందరు అధికారులు, అనధికారులు, మంత్రులు, అమంత్రులు వ్యవహారాన్ని సరిగా నిర్వహించలేదు గానీ మొత్తమ్మీద రాష్ట్రం దీనికోసం ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నమ్మకం లేని కంపెనీల కోసం రాష్ట్రాలు తమలో తాము పోటీ పడితే వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీలకు దూరంగా ఉంటే మంచిదేమో!

అయితే ఇక్కడో చిక్కుంది. ఇలాంటి వ్యవహారాలు లేకపోతే తమ్ముళ్ళనీ, బామ్మర్దులనీ విదేశాలకు పంపడం కుదరదు. పైగా 11 కోట్లు ఎవరికో ఇచ్చేసి, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట అని అడిగే అవకాశమూ ఉండదు.

సొమ్ములు పోనాయండి, వోక్సూ పోనాదండి!

17, నవంబర్ 2006, శుక్రవారం

గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం

3 కామెంట్‌లు
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలదే రాజ్యం అయిపోయింది. అక్కడ హీరో మేరునగధీరుడు. మిగతా వారంతా పిపీలికాలే.. చివరకు వాళ్ళకు తిండి పెట్టే నిర్మాతతో సహా! ఈ విషయంపై ఓ పెద్దమనిషి నోరు విప్పాడు. తెలుగు సినిమా దిగ్గజమూ, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతా అయిన గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏదో టీవీకి చెప్పిన మాటలను దట్స్ తెలుగు వెబ్సైట్లో పెట్టారు. దాన్ని ఇక్కడ చూడొచ్చు: http://thatstelugu.oneindia.in/cinema/avi/spb-on-telugu-heroes.html

బాలు చేసిన కొన్ని వ్యాఖ్యలు: "నిర్మాత తర్వాతే ఎవ్వరైనా అనే స్ప­ృహ పోయిందిప్పుడు. సినిమా కేవలం హీరోల మాధ్యమమే కాదు. ఒక లైటుబాయ్ లేకపోయినా ఆ రోజు షూటింగ్ నడవదు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుంది. కేవలం తమ వల్లనే సినిమాలు ఆడుతున్నాయి అని ఈ హీరోలు అనుకుంటే అది భ్రమే అవుతుంది."

బాలు ఇంకా ఇలా అన్నారు: "అక్షరం ముక్క రాయలేని వారు సైతం రచయితలు అయిపోతున్నారు. ఉచ్చారణ లేనివాళ్లు నటులవుతున్నారు. భాష తెలియని వారు, పరభాషా నటీనటులు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేస్తున్నారు. సరిగమలు రానివారు సంగీత దర్శకులైపోతున్నారు. శ్రుతి శుద్ధి లేనివారు గాయకులవుతున్నారు.''

తామేం చెయ్యాలో తెలియని వారేం కాదు మన నిర్మాతలు; చెయ్యరంతే! డబ్బింగు సినిమాలను నిషేధిస్తేనో, సినిమా ఎలా ఉన్నా చూసి చావాల్సిందేనని నిర్బంధిస్తేనో సినిమాలు ఆడవు. మంచి సినిమాలు తీసేందుకు మంచి రచయితలు, దర్శకులు, సాంకేతికులు, కళాకారులు కావాలి.. స్టారులు, రత్నాలు, సామ్రాట్టులూ కాదు. మన నిర్మాతలు ఎప్పుడు ఆచరిస్తారో!


శభాష్ బాలూ! హిపోక్రసీకి నెలవైన సినీపరిశ్రమలో ఈ మాత్రం మాట్టాడ్డమంటే ఓ రకంగా సాహసమే!

16, నవంబర్ 2006, గురువారం

అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా...

7 కామెంట్‌లు
జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో కావాలని, మంచి ప్రణాళికాబద్ధంగా చేసినట్లుగా ఉంటాయి. కొన్ని సంతోషంతో గుండె ఝల్లుమనిపిస్తాయి, మరికొన్ని చెంప ఛెళ్ళుమనిపిస్తాయి. ఈ రెండో రకం యాదృచ్ఛికాలు బహు ప్రమాదకరమైనవి. ఏదో కాకతాళీయంగా జరిగాయిలే అని అనుకోకపోతే నిదరపట్టదు మనకు..

నా బ్లాగులోదే ఒక ఉదాహరణ రాస్తానిక్కడ..

"తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు" అనే నా గత జాబుకు కొన్ని స్పందనలు వచ్చాయి. వాటిలో మొదటి రెంటినీ చూద్దాం..
మొదటిది..
"చాలా బాగా వ్రాశారు, ఈ రచనతో కనకదుర్గ గారు మూర్ఖత్వానికి ఒక ఉదాహరణ అయ్యారు. అయినా ఆంధ్రజ్యోతి సంపాదకులు యధవలు కాబట్టె ఇలాంటి మూర్ఖుల రచనలు ప్రచురిస్తున్నారు."

ఇక రెండో వ్యాఖ్య చూడండి.

"అంధ్ర జ్యోతికి పంపండి. ఈ ప్రతిస్పందనను తప్పక అచ్చేసుకొంటారు." :-((

ఈ రెండు వ్యాఖ్యల్నీ ఒక్కసారే చూసాను. మొదటిది చూసాక సహజంగానే సమ్మగా అనిపించింది. రెండోది చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ రెండు స్పందనల మధ్య తేడా కేవలం రెండే నిమిషాలు కాబట్టి అవి కాకతాళీయంగా రాసిన వ్యాఖ్యలేనన్న విషయం అర్థమై, ఉపశమనం కలిగింది.

అందుకే నిదురపోగలిగాను రాత్రి.

14, నవంబర్ 2006, మంగళవారం

తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు

16 కామెంట్‌లు
ఆంధ్రజ్యోతిలో కనకదుర్గ దంటు గారు రాసిన వ్యాసం చదివి నేనీ స్పందనను రాస్తున్నాను. ఆ వ్యాసంలో ఆమె చాలా అవాస్తవాలను రాసుకు పోయారు. తెలుగు అనే మాట తెలంగాణ వాళ్ళదనీ, ఆంధ్ర ప్రాంతం వారికి దానితో అసలు సంబంధమే లేదనీ ఆవిడ వాదించారు. ఇంత పరమ మూర్ఖపు వాదనను చదివాక నా స్పందనను రాయకుండా ఉండ లేకపోతున్నాను. ఇక ఆంధ్ర అనేమాటను ఆమె కోస్తా, రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వాడారు. నా దృష్టిలో అది తప్పైనా, వాదన కోసం నేనూ అదే వాడాను.

11, నవంబర్ 2006, శనివారం

తెలుగు సినిమాలను ఆడించేందుకు కొన్ని చిట్కాలు

2 కామెంట్‌లు
డబ్బింగు సినిమాలు తియ్యకూడదట! తెలుగు సినిమా నిర్మాతలు ఆంక్షలు పెడుతున్నారు. పాపం వీళ్ళు తీసే అద్భుత చిత్ర రాజాలు దిక్కు లేకుండా పోతున్నాయట! మీరొప్పుకోరేమో గానీ నేను మాత్రం వాళ్ళతో ఏకీభవిస్తాను. ఎందుకంటే మురికి వెధవలైనా, గబ్బు కొడుతున్నా మనవాళ్ళన్నాక మనం వాటేసుకోవాలి మరి. మనమే వద్దనుకుంటే అనాధలై పోరూ పాపం!

అంచేత తెలుగు సినిమా నిర్మాతలూ! తెలుగు జనం మీ ముష్టి సినిమాలు తప్ప మరోటి చూసే అవకాశమే లేకుండా చెయ్యడానికి నేను మరికొన్ని ఉపాయాలు చెబుతాను, హాయిగా కాపీ కొట్టుకోండి. (మీకలవాటేగా!) డబ్బింగు నిషేధం డిమాండు కూడా కాపీయే కదా - కన్నడిగులు పరభాషా సినిమాలు వద్దని ఒకప్పుడు గోల చేసారు, దాన్నే కాపీ కొట్టి, మరింత ముందుకు తీసుకుపోతున్నారు, మీరు. భేషో! ఇక నా అవిడియాలు..

  1. ఈ తమిళ, మలయాళ సినిమాల వాళ్ళని "మీరిలా మంచి సినిమాలు తీస్తే కుదరదు, మాలా అణాకానీ సినిమాలే తియ్యాల"ని డిమాండు చెయ్యండి. లేకపోతే తగువేసుకోండి. తప్పేంలేదు, మన ప్రయోజనాలు మనకు ముఖ్యంగానీ, ఎవ్వడేమనుకుంటే మనకెందుకు?
  2. ప్రతి తెలుగు వాడూ కనీసం వారానికో తెలుగు సినిమా చూసి తీరాలని డిమాండు చెయ్యండి.
  3. ఎవరైనా "తీరిక లేని పనుల్లో ఉన్నాను", లేక "సినిమా చూసి తలనెప్పి తెచ్చుకోలేను, వదిలెయ్యండ"ని సిగ్గువిడిచి బతిమాలుకున్నా, వదలొద్దు. అలాంటి వారి కోసం రోడ్ల కూడళ్ళ వద్ద చందా డబ్బాలుపెట్టండి.. టిక్కెట్టు డబ్బులు అందులో వేసిపోతారు. తీరిగ్గా అది మీరంతా పంచుకోవచ్చు. తప్పేం లేదు.., వినాయకచవితి చందాల దందా లాంటిదే ఇదీను.
కొంత మంది ఉచిత సలహాలు పారేస్తా ఉంటారు.. "మీరూ మంచి సినిమాలు తియ్యొచ్చు కదా" అని, అదేదో తేలికయినట్లు. అలాంటివేమీ పట్టించుకోకండి. అయినా మంచి మంచి సినిమాలనే కదా మీరు కాపీ కొడుతున్నది? కాకపోతే మన ఫార్ములాలోకి మారుస్తున్నారు, అంతే. అవి జనానికి నచ్చకపోతే మీరేం చేస్తారు?

మనలో మనమాట! కొందరు రంధ్రాన్వేషకులుంటారు.. మీరు తీసే సినిమాల్లో కూడా హీరోయినూ, విలనూ (కొండొకచో హీరో కూడా) తెలుగు రాని వాళ్ళేగా. వాళ్ళ కోసం డబ్బింగు చెప్పిస్తున్నారు, మరి ఈ లెక్కన మీవీ సగం డబ్బింగు సినిమాలే కదా అని అడగొచ్చు. మీరలాంటివేమీ పట్టించుకోవద్దు. మంచి పనులు చేసుకునేవాళ్ళకి అడ్డంకులు ఎక్కడైనా ఉంటాయి, వెనకాడకూడదు!

రామోజీరావు x రాజశేఖరరెడ్డి

7 కామెంట్‌లు
ఈనాడుపై వ్యతిరేకతను ముఖ్యమంత్రి ఓ మెట్టు పైకెక్కించారు. ఈ సారి తన అనుంగు అనుచరులను రంగంలోకి దింపి పత్రిక ఆయువుపట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు. ఈ దాడి వెనుక అసలు కారణం లీలగా కాదు, స్పష్టంగానే తెలుస్తూ ఉంది. తమపై వస్తున్న విమర్శలకు జవాబివ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు వాళ్ళేనాడో నిర్ణయించేసుకున్నారు, అమలూ జరుపుతున్నారు. విమర్శించేవాళ్ళ నోరు మూయించడమే వాళ్ళ లక్ష్యం. తమవాళ్ళే విమర్శిస్తే క్రమశిక్షణా రాహిత్యం అంటారు. తెలుగుదేశం విమర్శిస్తే.. ఏం మీరేమన్నా తక్కువ తిన్నారా అని అంటారు. పత్రికలు విమర్శిస్తే.. కక్ష, పక్షపాతం, అసహనం, ఇలాంటివి అంటగడతారు. ఈనాడు-మార్గదర్శిది సరికొత్త అంకం. ఇందులో ఎవరి పాత్ర ఎంత..

ముందుగా మార్గదర్శి: దీన్ని ప్రతిదాడిగా భావించక ప్రజా ప్రయోజనాలను ఆశించి సదుద్దేశంతోటే చేసారనుకుంటే, ఈ ఆరోపణల్లో మనం గ్రహించాల్సిన విషయాలు కొన్నున్నాయి.
  1. మార్గదర్శి ఫైనాన్సు నష్టాల్లో ఉందని వాళ్ళే చెబుతున్నారు.. అయితే ప్రజల డబ్బుకు భరోసా ఏమిటి? నాదీ పూచీ అని రామోజీరావు అంటే సరిపోదు, ఆ అప్పులు తీర్చగలిగినంత ఆస్తి (నెట్‌వర్తు) తనకుందని ఆయన చూపించాలి. అది ఇంకా చెయ్యలేదు.
  2. ఇక, అసలాయన జనం దగ్గర అప్పులు తీసుకోవచ్చా, లేదా అనే విషయం - ఇది రిజర్వు బ్యాంకే తేల్చాలి.
  3. సర్వసాధారణంగా తలెత్తే సందేహం.. అసలే లోపమూ లేకపోతే కాంగ్రెసు వాళ్ళు ఇంత యాగీ చెయ్యరు, నిప్పు లేందే పొగ రాదు కదా. ఈ సందేహాన్ని పటాపంచలు చెయ్యవలసిన బాధ్యత మార్గదర్శిదే.

కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి, ఆయన అంతేవాసులు:
  1. తమ అక్రమాల లీలల గురించి, ప్రాజెక్టుల అవినీతి గురించి, భూభోజనాల గురించి ఈనాడులో వస్తున్న విమర్శలను తట్టుకోలేక, పత్రికను కట్టడి చెయ్యడంలో భాగమే ఈ దాడి అని తెలిసిపోతూనే ఉంది. విమర్శలను ఎదుర్కోవడానికి సరైన మార్గం తప్పులు చెయ్యకపోవడమే. అయితే తప్పులు చెయ్యకుండా ఉండడం వీళ్ళ వల్ల కాదని మరోసారి తెలియజెప్పారు.
  2. ముఖ్యమంత్రి అసహనానికి ఇది మరో సూచిక. విమర్శించే పత్రికల పట్ల కూడా ప్రతిపక్షాల పట్ల వ్యవహరించినట్లే ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. నేనా పత్రికను (ఆంధ్రజ్యోతి) అసలు చదవనే చదవనని అలిగిన వ్యక్తి ఆయన. తనవారిని కాపాడుకునేందుకు (ఉదా:సూరి), కానివారిని కాలరాచేందుకు (ఉదా:కోట్ల విజయభాస్కరరెడ్డి వర్గం) ఏ స్థాయికైనా వెళ్ళగల వ్యక్తి. ఈ వ్యవహారం మొత్తంలో ఆయన చెయ్యి లేదంటే నమ్మశక్యం కాదు.
  3. అవినీతిని వాసన పసిగట్టే కుక్కలు మరి రాంగురోడ్డు విషయంలోను, కాందిశీకుల భూమి విషయంలోను, ఘటకేసర్ భూమి విషయంలోను మొరగలేదేంటి? భూభోక్తలు బిస్కట్లేసారా? లేక, భూభోజనాల బంతిలో తమకూ కాసిని ఎంగిలి విస్తర్లు దొరికాయా?
  4. రాంగురోడ్డుపైన, ఘటకేసరు ట్రస్టు స్థలంలో ఇంటిపైన, కాందిశీకుల భూములపైన, ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి పైన, ఇంటి ముందు స్థలాన్ని కాజేసిన వైనంపైనా ఈనాడు తమపై విమర్శలు చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల ఆస్తుల రక్షణకు నడుం కట్టేవారేనా వీళ్ళు?
రామోజీరావుపై ఆరోపణలు చేసే అత్యుత్సాహంలో వీళ్ళో సంగతిని పక్కన పెట్టారు - ప్రజలు వీళ్ళ ఆరోపణల్ని నమ్మి, డబ్బు వెనక్కిమ్మంటూ అడిగితే ఏం జరుగుతుంది? తీసుకున్న డబ్బులను పెట్టుబడులుగా పెడతారు కాబట్టి, ఆ డబ్బులను ఇప్పటికిప్పుడు వెనక్కిచ్చియ్యాలంటే ఎంత గొప్ప సంస్థకైనా సాధ్యం కాదు. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని తెలిస్తే ప్రజలు మరింత ఎగబడతారు, తమ డబ్బుల కోసం. అప్పుడు ప్రజల్లో కల్లోలం రేగదా? వీళ్ళాశించింది అదేనా?

మార్గదర్శి ప్రజల దగ్గరి నుండి డబ్బులు సేకరించకూడని పక్షంలో ఇన్నాళ్ళూ నియంత్రణ సంస్థలు ఏంచేస్తున్నట్లు?

ఏదేమైనా, స్వార్థ రాజకీయులు ఆడుతున్న ఈ నాటకంలో ప్రజలు బలి కాకుండా ఉండాలని కోరుకుందాం.

హరికథలో పిట్టకథల్లాగా ఈ జాబులో రెండు పిట్ట జాబులు:

మార్గదర్శి మీద రాజకీయుల దాడి ఇది మొదటిది కాదు. గతంలో నాదెండ్ల భాస్కరరావనే పెద్దమనిషి (నెల రాజు), రామారావును ముఖ్యమంత్రిగా పడదోయక మునుపు ఆయన మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉండేవాడు. (అప్పట్లో ఆయన కోపైలట్ లెండి, రామారావేమో పైలట్! ఆ సంగతీ భాస్కరరావే చెప్పుకున్నాడు.) ఆయన మార్గదర్శి చిట్‌ఫండు పై శాసనసభలో దుమారం లేపి కొన్నాళ్ళు హడావుడి చేసాడు. అయితే అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు చిట్‌ఫండు, ఇప్పుడేమో ఫైనాన్సు! అప్పుడు కోపైలట్టు.., ఇప్పుడేమో పైలట్టు, ఎయిర్‌హోస్టెస్సులు, స్టీవార్డులూ!

ఇక రామోజీరావు కూడా తక్కువవాడేం కాదు. ఆయనకు శత్రువులు కొల్లలుగా ఉన్నట్లున్నారు! (పత్రికాధిపతికి తప్పదేమో!!) రామారావు రాకముందు కాంగ్రెసు హయాంలోనే శాసనమండలి లో (అప్పట్లో ఉండేది! పెద్దలసభ అని గౌరవంగా అనేవారు, సభ్యులు 'చిన్న'వాళ్ళైనా) జరిగిన ఒక 'చర్చ' గురించి "పెద్దల సభలో గలభా" అని ఈనాడులో శీర్షిక పెట్టి రాసారు. గలభా అనేమాట పెద్దలకు చిన్నతనంగా అనిపించి ఆయన్ను మందలించేందుకు, అరెస్టు చేసి సభకు తెమ్మని పోలీసు కమిషనరును పంపారు. (ఆ కమిషనరు మరెవరో కాదు, మొన్నటి తెదే ప్రభుత్వంలో మంత్రిగా చేసిన విజయరామారావట!) రామోజీరావు ముందే బెయిలు తెచ్చుకున్నాడు. ఆ తరువాత, ఆ శీర్షికలో తప్పేమీ లేదని తీర్పు వచ్చింది. మొత్తమ్మీద మండలి బోనెక్కలేదు ఆయన.

అవీ పిట్టకథలు! శ్రీమద్రమారమణ గోవిందో.. హారి!

5, నవంబర్ 2006, ఆదివారం

నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే!

3 కామెంట్‌లు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సముద్రాలయ్యాయి. ఇప్పుడు కురిసినంత వాన ఈ మధ్య కాలంలో కురవలేదని అంటున్నారు. తుపానుల చరిత్రలో 1977 తుపాను ఓ మైలురాయి. ఆనాడు కూడా ఇంత వాన లేదని మా నాన్న అన్నారు. పొలాలెలాగూ మునిగిపోయాయి, ప్రజల జీవన పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. పల్లపు ప్రాంతాల్లో జనం శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రజలకు సరైన ఆహారం, గొడ్లకు మేతా దొరకని పరిస్థితి. దుర్భరమనిపించే పరిస్థితులు. కోస్తాలో తుపానుల గురించి గుర్నాం సింగ్ భల్లా గారి బ్లాగు చూడండి.

తుపానుల్లో జరిగే తక్షణ నష్టాన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా, అ తరువాత జరిగే నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వానిది గణనీయమైన పాత్ర. రోగాలు రాకుండా చర్యలు తీసుకోవడం, సాధారణ పరిస్థితి వచ్చేవరకు బాధితులకు బస, ఆహారం, గొడ్లకు మేత అందించడం మొదలైనవి సరిగా చేస్తే ఈ నష్టాన్ని అరికట్టవచ్చు. ఈ పనులు సరిగా జరగడం లేదని పేపర్లలో ఆరోపణలు మొదలయ్యాయి.

మామూలుగానే రాజకీయాలు కూడా మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలు బహిష్కరించైనా న్యాయం చేస్తామని బాబు అంటే (సమావేశాలను బహిష్కరించడమంటే బాగా పనిచేసినట్లని ఈయన అనుకుంటున్నాడు), ఆయన రాజకీయం చేస్తున్నాడని కాంగ్రెసు విసురు. శాసనసభలోనే ఉండి నెత్తీ నోరూ కొట్టుకుని గోలపెట్టినా దిక్కులేదు, మరి సమావేశాలు బహిష్కరిస్తే న్యాయం ఎలా జరుగుతుంది బాబూ?

3, నవంబర్ 2006, శుక్రవారం

కొత్త వెస్టిండియనులు, అదే పాత ఇండియనులు

0 కామెంట్‌లు
క్రికెట్టులో మనవాళ్ళు, విండీసు వాళ్ళు ఒకే రకంగా అనిపిస్తారు, నాకు. ప్రొఫెషనలిజము లేదు... అయితే ఉద్వేగ భరితంగా ఉంటారు లేదంటే నిర్వేదంగా ఆడతారు. ఉత్సాహంలో ఉంటే ఎంతటి వాణ్ణైనా కొట్టేస్తారు. (మన కామెంటేటర్ల పడికట్టు పదాల్లో దీని పేరు "తమదైన రోజున") లేదో.. బుర్కినాఫాసో చేతిలో కూడా ఓడిపోతారు. అందులకును ఇందులకును వారు సమర్థులే! ప్రొఫెషనలిజము కొలబద్ద మీద అత్యున్నతంగా ఆస్ట్రేలియా, న్యూజీలాండు ఉంటే అట్టడుగున విండీసు, ఇండీసు ఉంటారు. ఈ ఏటి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనవాళ్ళు తుచ తప్పకుండా తమపద్ధతిలోనే వెళ్ళారు గానీ, విండీసు మాత్రం కాస్త పద్ధతి మార్చినట్లుగా అనిపిస్తోంది.

ఏదేమైనా నాకు ఇండీసు, విండీసే అభిమాన జట్లు!

1, నవంబర్ 2006, బుధవారం

సోయం బాపూరావు అనగా రాజా జయచంద్ర

0 కామెంట్‌లు
గత నవంబరులో తెరాసలో మొదటి తిరుగుబాటు జరిగినపుడు, అసంతుష్టుల జట్టులో మొదట సోయం బాపూరావు కూడా ఉన్నారు. అయితే తరువాత మాట మార్చి, మిగతా వారికి షాకిచ్చి, అసంతుష్టులపై పెద్ద పెద్ద ఆరోపణలు చేసారు. వాళ్ళు ముఖ్యమంత్రితో కుమ్మక్కయ్యారని, కేవీపీ రామచంద్రరావు నుండి డబ్బులు తీసుకున్నారని, తనకూ ఇవ్వజూపారని ఇలా బోలెడన్ని ఆరోపణలు చేసారు. వికీపీడియాలో ఈ పేజీలో నవంబరు విభాగంలో ఈయనగారి ఆరోపణలు చూడొచ్చు.

ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటుదారు అవతారమెత్తారు! అసలేం జరుగుతోంది? అప్పుడు కేవీపీ ఇచ్చిన డబ్బులు చాలక వెనక్కి వెళ్ళారా? లేక తెరాస మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటే తిరిగి వెనక్కి వెళ్ళారా? లేక ఇప్పుడు కాంగ్రెసు మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటే మళ్ళీ తిరుగుబాటు పాటందుకున్నారా?

ఆనాడు నారాయణరావు పటేల్, మందడి వంటి వారిని అప్రదిష్ట పాల్జేసేందుకు చేసిన కుట్రగానీ కాదుగదా, ఈయన ఆరోపణలు?

ఇలాంటి జయచంద్రులతో అందరూ జాగ్రత్తగా ఉండాలి - తెరాస అయినా కాంగ్రెసైనా! మనం మాత్రం మొత్తం రాజకీయులందరితోటీ జాగ్రత్తగా ఉండాలి.

తెలుగుతల్లి

6 కామెంట్‌లు
పేరు కోసం, పదవి కోసం
అడ్డదారిన వచ్చిపడే
కలిమి కోసం బలిమి కోసం
తమ స్వార్థ యజ్ఞపు హోమగుండంలో
తల్లినైనా సమిధ లాగా వ్రేల్చగలిగిన
కుటిల జీవుల, రాజకీయుల గెలుపు కోసం
జరుగుతున్న ఈ బందును నిరసిస్తున్నా

జనం కోసం, బతుకు కోసం
నిజాయితీగా ఉద్యమించే వారి కోసం నిరీక్షిస్తున్నా

ఈ మదోన్మాదుల, పదవోన్మత్తుల
కొంగ జపాలు, నక్కజిత్తులు
తేటతెల్లమయ్యే రోజు కోసం,
వీళ్ళ బతుకులు నడిబజార్లో బట్టబయలయ్యే రోజుకోసం,
నడమంత్రపు సిరి కోసం అమ్మనైనా తిట్టగలిగిన
వీళ్ళ నోళ్ళు పడిపొయ్యే రోజు కోసం
నిరీక్షిస్తున్నా

మెరుపును చూపించి దీపంగా నమ్మించి,
ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా

వేరు కుంపటి ఉపయోగపడేది కాకున్నా,
అడిగే హక్కు మీకుంది. కానీ..
అందుకోసం అమ్మను తిట్టడం ఘోరపాపం

తల్లిని నిందించిన మీ పాపం ఊరక పోదు
అది మిమ్మల్ని కట్టి కుడిపే రోజు రాకపోదు

------

తెలుగు తల్లికి వందనం
తెలుగు జాతికి జయం
తెలుగు నేలకు శుభం

సంబంధిత టపాలు