31, జనవరి 2007, బుధవారం

ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు!

0 కామెంట్‌లు
ఆంధ్రజ్యోతి లో జనవరి 31 న ఓ వ్యాసం వచ్చింది. ప్రభుత్వ బడుల గురించి లోక్‌సత్తా నాయకుడు వర్మ రాసిన వ్యాసమిది. పైనున్న శీర్షిక పేరు కూడా ఆయన పెట్టిందే. ప్రభుత్వ బడుల గురించిన గణాంకాలను రాసారీ వ్యాసంలో. అందులోంచి ఒక్క విషయాన్ని నేనిక్కడ రాస్తాను. "రాష్ట్రంలో 20 శాతం ఉపాధ్యా యులు తక్కువగా ఉన్నారు. అదనంగా 54, 730 మంది ఉపా ధ్యాయుల అవసరం ఉందని 'కాగ్‌' నివేదిక పేర్కొంది. వీరికి బదులుగా 46,544 మంది విద్యా వాలంటీర్లు నెలకు 1000 రూపాయల వేతనంపై బోధనా విధులు నిర్వర్తిస్తున్నారు. " వెయ్యి రూపాయల జీతంతో బడి పంతుళ్ళట.. హవ్వ!

ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు చదివేది ఈ బడులలోనే! ఈ వర్గాల పట్ల ప్రభుత్వ ఆపేక్ష ఈ స్థాయిలో ఉంది. అందరికీ చదువు, సరైన చదువు చెప్పించే విషయంలో మన ప్రభుత్వాలకేమాత్రం ఆసక్తి ఉందో ఈ గణాంకాలు చెబుతాయి. ప్రస్తుత ప్రభుత్వం సంగతి మాత్రమే కాదు, వరసగా అన్నిటి తీరూ అంతే!

బడులూ, పంతుళ్ళు, భవనాలు, సదుపాయాల విషయంలో ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉంది. ఓపక్క ఇంత అధ్వాన్నంగా పనిచేస్తూ, ఎడాపెడా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతూ ఉంటే వాటి వలన ఆశించిన ఉపయోగం కలుగుతుందా?

ఈ చేతకానితనానికి తోడు, ఇప్పుడు ప్రభుత్వం, ప్రైవేటు వాళ్ళతో కలిసి కాన్సెప్టు బళ్ళేవో పెడతుందట. ఈ సంకర బడులు వద్దని పెద్దలు చెబుతున్నారు.

ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు - ఎంత చక్కటి మాట!

29, జనవరి 2007, సోమవారం

తెలుగు సినిమా - 75 ఏళ్ళ పండుగ

5 కామెంట్‌లు
మొదటి తెలుగు సినిమా నిర్మించి 75 ఏళ్ళయిన సందర్భంగా పడుగ చేసారు. బాగానే చేసారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన పండుగలో మూడోనాడు వాళ్ళలో వాళ్ళకి ఉన్న విభేదాలు వికటాట్టహాసం చేసాయి.

పండుగలో కొన్ని విశేషాలు:

కాలనాళిక:
మరో పాతికేళ్ళ తరువాత, తెలుగు సినిమా ఎలా ఉండబోతోందన్నది ఎవరి ఊహకు తగినట్లుగా వాళ్ళు ఓ కాగితంపై రాసి ఓ పెట్టెలో వేస్తారు. అలా అందరూ రాసాక, ఆ పెట్టెకు సీలేసి, పాతికేళ్ళ తరువాత, అంటే తెలుగు సినిమా వందేళ్ళ పండుగ రోజున తీస్తారు. ఆనాటి పరిస్థితిని ఇప్పటి వాళ్ళు ఎంతవరకు ఊహించగలిగారు అనేదాన్ని అంచనా వేస్తారన్నమాట. చక్కటి ఆలోచన! ఈ కాలనాళికను ఓ పదిహేను రోజుల పాటు చాంబరులో ఉంచి సినిమా వాళ్ళందరి ఊహలను సేకరించి ఆపై పదిలపరుస్తారు.

సన్మానాలు: పాత తరం నటులను సన్మానించే కార్యక్రమం. నిర్మలమ్మ, అంజలీదేవి, కాంతారావు వంటి వారిని గౌరవించడం సముచితంగా ఉంది. ఆ జాబితాలో ఉండాల్సిన వారు కొందరు కనిపించలేదు, ఎంచేతో? రావి కొండలరావును మిస్సయ్యారు. (లేక నేను మిస్సయ్యానా?)

వేదిక నిర్వాహకులు: మూడోరోజు కార్యక్రమాన్ని రాజేంద్రప్రసాదు సరిగ్గా నిర్వహించలేదు. సన్మానం జరిగేదొకరికైతే ఈయన చెప్పేదింకొకరి పేరు. మధ్యలో అక్కడక్కడా వెకిలి చేష్టలు కూడా జోడించి వీలయినంతగా చెడగొట్టాడు. చప్పట్లు కొట్టమంటూ బతిమిలాట్టం ఈయనకో అలవాటులా ఉంది.

ఆటాపాటా: వెకిలి పాటలని కాస్త తగ్గించి మంచి పాటలను మరిన్ని కూర్చాల్సింది.

హుందాతనం: - అనగా జయసుధ! తనకు సన్మానం జరిగాక మాట్లాడమంటే ఆమె మాట్లాడింది మూడే మాటలు. నన్ను పరిచయం చేసిన కృష్ణ, విజయనిర్మలలకు, దర్శకులు దాసరి, రాఘవేంద్రరావులకు, తోటి నటీనటులు, దర్శకులు, సాంకేతికులు అందరికీ నా ధన్యవాదాలు.- ఇంతే! కొందరు మాట్లాడిన సోది విన్న తరువాత ఇది చాలా హాయిగా అనిపించింది.

మెరుపులు:
  • పద్మనాభం పాడిన పాట. పాట విడిగా విని తరువాత వ్యక్తిని చూస్తే "పాడిన వ్యక్తి ఇంత ముసలివారా" అని అనుకోక మానరు. చాలా చక్కగా పాడారు.
  • నిర్మలమ్మ చక్కగా మాట్లాడింది.
  • సునీల్ చేసిన మైము. చక్కగా చేసాడు.
  • తలకు మాసిన సన్మానం స్కిట్: ఇందులో గుండు హనుమంతరావు హావభావాలు బాగున్నాయి.
  • సుమ కబుర్లు: ప్రేక్షకుల్లో కూర్చున్న సినిమా వాళ్ళతో మాట్లాడుతూ సుమ కొన్ని మంచి కబుర్లు చెప్పించింది.
ఆశాభంగం: హీరోల పాట. పాటా బాలేదు, చిత్రీకరణా బాలేదు. తెలుగు సినిమా చరిత్రను పాటలో పొదుగుతారనుకున్నాను. బహుశా ఎక్కువ ఊహించడం వలన అలా అనిపించేదేమో! తరువాత మీరు చూడబోయే హీరోలందరి పాట ఎంతో అద్భుతంగా వచ్చింది అని కె.ఎస్.రామారావు అన్నపుడే నేను అనుమానించాను. అదే అయింది. సినిమా వాళ్ళకే ప్రత్యేకించిన ఈ డైలాగుతో జాగ్రత్తగా ఉండాలి.

(యాంటీ) క్లైమాక్సు: తెలుగు సినిమా ప్రముఖులను, లెజెండ్లను సన్మానించే కార్యక్రమాన్ని గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, పరిశీలనాత్మక కార్యక్రమంగా మార్చేసారు మన తెర వేల్పులు. అసలు లెజండు, సెలెబ్రిటీ అనగానేమి అంటూ అర్థాలు అడగడం మొదలు పెట్టి ప్రేక్షకులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసారు. ఎంతో ఉద్వేగాన్ని అభినయించారు. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆపై కాలనాళికలో శాలువాలు, జ్ఞాపికలనూ వేసి మొత్తం నాటకాన్నంతటినీ రక్తి కట్టించారు. మొత్తమ్మీద సరదాగా సంతోషకరంగా జరగాల్సిన కార్యక్రమంలో మెలోడ్రామాను చొప్పించి, కార్యక్రమాన్ని తమ సినిమాల స్థాయికి దిగజార్చారు.

పంపిణీదారు: మాటీవీ బాగానే డబ్బులు చేసుకుని ఉండాలి. దురదృష్టవశాత్తూ ప్రకటనల మధ్య అప్పుడప్పుడు కార్యక్రమాన్ని చూపించాల్సి వచ్చింది గానీ లేకపోతే డబ్బుతో దిబ్బేసుకు పోయేవారే!

పండుగ డైలాగు: "ఇంత పెద్ద ఏర్పాట్లలో కొన్ని లోపాలు దొర్లడం సహజం" (చట్టం తనపని తాను చేసుకు పోతుంది అనే డైలాగు పదే పదే గుర్తొచ్చింది.)

24, జనవరి 2007, బుధవారం

కార్పొరేటు చిల్లర కొట్లు

5 కామెంట్‌లు
దేశంలో చిల్లర కొట్ల విప్లవం వస్తూంది. రిలయన్సులూ, టాటాలు చిల్లర కొట్లు పెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా సూపరు బజార్లే! కూరగాయలను కూడా వదలడం లేదు. ఇలా కార్పొరేటు చిల్లర కొట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, సాధారణ కొట్లు తాళాలేసుకునే పరిస్థితికి వస్తాయేమోననిపిస్తోంది.

కార్పొరేటు కొట్లలో ధరలు తక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే మొదలు కాబట్టి అలా ఉండొచ్చు. కానీ అవి తామరతంపరగా పెరిగిపోయి, సన్నకారు దుకాణాలు మూలన పడ్డాక, అప్పుడు ఈ కార్పొరేట్లు తమ అసలు రంగును బయట పెడితే మన పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాన్నే అదుపు చెయ్యగల సంస్థలవి. మనం ఎదుర్కోగలమా!? సిమెంటు రేట్లు తగ్గిపోయినపుడు కంపెనీలన్నీ కలిసి ఉత్పత్తి తగ్గించి రేట్లను పెంచాయలాగే!

ఈ కార్పొరేటు చిల్లరకొట్లు మనలనెక్కడికి తీసుకెళతాయో!! టోకు దుకాణాలకు మాత్రమే కార్పొరేట్లను పరిమితం చేసి, చిల్లర రంగంలోకి వాళ్ళను అనుమతించకపోతే మంచిదనిపిస్తోంది.

23, జనవరి 2007, మంగళవారం

బ్రౌను ఫోటో

3 కామెంట్‌లు
వేమనను వెలికితీసిన బ్రౌను దొర ఫోటోను భూమన్ ("శ్వేత" ప్రాజెక్టు డైరెక్టరు) వెలికితీసారు. ఈనాడులో ఈ వార్త చూడండి. కానీ అది బ్రౌను ఫోటో కాదని కొందరంటున్నారు. ఆంధ్రజ్యోతి పాఠకులొకరు రాసిన ఈ ఉత్తరం చూడండి. ఈ లింకుకు త్వరలోనే కాలదోషం పడుతుందనే ఉద్దేశ్యంతో ఆ ఉత్తరాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

"నా పేరు బి. సురేష్‌బాబు. తమిళనాడులోని నాదపట్టినమ్‌ జిల్లా, తిరుక్కడయూర్‌లోని పిపిఎన్‌ పవర్‌ జెనరేటింగ్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌ (మెటీరియల్స్‌)గా పనిచేస్తున్నాను. సి.పి.బ్రౌన్‌ ఫొటోకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన వార్తకు స్పం దనగా ఇది రాస్తున్నాను. ఆ ఫొటో సి.పి. బ్రౌన్‌ది కానేకాదు. ఫొటోలో ఎడమవైపు కూర్చుని ఉన్న వ్యక్తి మా ముత్తాత చెంగల్‌రావుగారు. ఆయన 1965లో తన 85వ ఏట మరణించారు. ఫొటోలో కనిపిస్తున్నదానిని బట్టి అప్పటికి ఆయన వయసు దాదాపుగా 55 సంవత్సరాలు ఉండవచ్చును. అంటే, ఈ ఫొటో 1935-40 మధ్యకాలంలో తీసినది అయి ఉండాలి. సర్‌ సి.పి. బ్రౌన్‌ 1855లోనే భారతదేశంనుంచి వెళ్ళిపోయి 1884లో కన్నుమూశారు.
ఆ విధంగా చూస్తే, సి.పి.బ్రౌన్‌ భారతదేశంలో ఉన్న కాలంలో మా ముత్తాత పుట్టనేలేదన్నమాట. రెవిన్యూ, భూమి సర్వేల నిమిత్తం యెల్లుట్ల గ్రామంలోని మా ఇంటికీ, మా బంధువుల ఇళ్ళకూ బ్రిటిష్‌ అధికారులు ఎంతోమం ది వచ్చిపోతుండేవారని మా గ్రామస్తులు ఎప్పుడూ చెబుతుండేవారు. ఈ ఫొటోలోని వ్యక్తి అటువంటి ఏదో పని నిమిత్తం వచ్చిన ఎవరో బ్రిటిష్‌ అధికారి కావచ్చును. అంతేకానీ, ఎట్టిపరిస్థితుల్లో నూ బ్రౌన్‌ కాదు. చెంగల్‌రావుగారి కుమార్తె, నా అమ్మమ్మ ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఆమె ఈ విషయాన్ని మరిం తగా నిర్ధారించగలరు."
కాలం గడిచే కొద్దీ ఇప్పటి వాళ్ళ ఫోటోలు కూడా అలాగే మరుగునపడిపోతాయేమో! మనకో ఫోటో భోషాణం ఉంటే బాగుంటుంది. కావలసిన ఫోటోను స్వయంగా వెతుక్కుని చూసేలా - వికీపీడియాలోలాగా - ఉంటే రాబోయే తరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

22, జనవరి 2007, సోమవారం

సాయిబాబా - తెలంగాణా

7 కామెంట్‌లు
"..ఈ విధంగా దేశాన్ని ముక్కలు చెయ్యడం మహాపాపం. నేను ఏ రాష్ట్రం, ప్రాంతం గురించి మాట్లాడడం లేదు. నాకు అలాంటి భేదాల్లేవు.." - చెన్నై సభలో సాయిబాబా.

సత్యసాయిబాబాకు రాష్ట్ర ప్రాంత భేదాల్లేవట. భారతదేశమొక్కటే ప్రధానమైనదట. దేవుడికి మానవాళి అంతా ఒక్కటే కదా, దేశ భేదాలుంటాయా? విశ్వం గురించి మాట్లాడాలసిన దేవుడు, దేశ రాజకీయాల గురించి మాట్లాడ్డమేమిటో?

వృద్ధాప్యం వలన ఆయన ప్రసంగంలో స్పష్టత లోపించిందట; ఈనాడంటోంది.

ఆర్టీసీకి కొత్త రంగులు

1 కామెంట్‌లు
ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట, ఈనాడులో వార్త వచ్చింది. పల్లెటూళ్ళకు తిరిగే బస్సుల పేరు "పల్లె వెలుగు" - చక్కగుంది, పేరు. ఏసీ బస్సుల పేరు మాత్రం మేఘదూత్! సంస్కృతపదం, అందునా హలంతంగా రాస్తే గొప్పగా ఉంటుందనుకున్నారు కాబోలు. ఎందుకు పెట్టినా ఆ పేరు మాత్రం బాలేదు; మేఘదూత అని ఉండాలి, లేదా మరో అచ్చతెలుగు పేరయినా పెట్టాలని ఈ జీవుడి కోరిక.

కొత్త సౌకర్యాలు ఆర్టీసీకి మరింత ఆదాయాన్ని, లాభాలను తెచ్చిపెట్టాలని, ఆర్టీసీ బస్సు ప్రైవేటు బస్సులను దాటేసి, ఉసీగా ముందుకు దూసుకుపోవాలని ఆశిస్తున్నాను.

సంబంధిత టపాలు