11, నవంబర్ 2006, శనివారం

రామోజీరావు x రాజశేఖరరెడ్డి

ఈనాడుపై వ్యతిరేకతను ముఖ్యమంత్రి ఓ మెట్టు పైకెక్కించారు. ఈ సారి తన అనుంగు అనుచరులను రంగంలోకి దింపి పత్రిక ఆయువుపట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు. ఈ దాడి వెనుక అసలు కారణం లీలగా కాదు, స్పష్టంగానే తెలుస్తూ ఉంది. తమపై వస్తున్న విమర్శలకు జవాబివ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు వాళ్ళేనాడో నిర్ణయించేసుకున్నారు, అమలూ జరుపుతున్నారు. విమర్శించేవాళ్ళ నోరు మూయించడమే వాళ్ళ లక్ష్యం. తమవాళ్ళే విమర్శిస్తే క్రమశిక్షణా రాహిత్యం అంటారు. తెలుగుదేశం విమర్శిస్తే.. ఏం మీరేమన్నా తక్కువ తిన్నారా అని అంటారు. పత్రికలు విమర్శిస్తే.. కక్ష, పక్షపాతం, అసహనం, ఇలాంటివి అంటగడతారు. ఈనాడు-మార్గదర్శిది సరికొత్త అంకం. ఇందులో ఎవరి పాత్ర ఎంత..

ముందుగా మార్గదర్శి: దీన్ని ప్రతిదాడిగా భావించక ప్రజా ప్రయోజనాలను ఆశించి సదుద్దేశంతోటే చేసారనుకుంటే, ఈ ఆరోపణల్లో మనం గ్రహించాల్సిన విషయాలు కొన్నున్నాయి.
  1. మార్గదర్శి ఫైనాన్సు నష్టాల్లో ఉందని వాళ్ళే చెబుతున్నారు.. అయితే ప్రజల డబ్బుకు భరోసా ఏమిటి? నాదీ పూచీ అని రామోజీరావు అంటే సరిపోదు, ఆ అప్పులు తీర్చగలిగినంత ఆస్తి (నెట్‌వర్తు) తనకుందని ఆయన చూపించాలి. అది ఇంకా చెయ్యలేదు.
  2. ఇక, అసలాయన జనం దగ్గర అప్పులు తీసుకోవచ్చా, లేదా అనే విషయం - ఇది రిజర్వు బ్యాంకే తేల్చాలి.
  3. సర్వసాధారణంగా తలెత్తే సందేహం.. అసలే లోపమూ లేకపోతే కాంగ్రెసు వాళ్ళు ఇంత యాగీ చెయ్యరు, నిప్పు లేందే పొగ రాదు కదా. ఈ సందేహాన్ని పటాపంచలు చెయ్యవలసిన బాధ్యత మార్గదర్శిదే.

కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి, ఆయన అంతేవాసులు:
  1. తమ అక్రమాల లీలల గురించి, ప్రాజెక్టుల అవినీతి గురించి, భూభోజనాల గురించి ఈనాడులో వస్తున్న విమర్శలను తట్టుకోలేక, పత్రికను కట్టడి చెయ్యడంలో భాగమే ఈ దాడి అని తెలిసిపోతూనే ఉంది. విమర్శలను ఎదుర్కోవడానికి సరైన మార్గం తప్పులు చెయ్యకపోవడమే. అయితే తప్పులు చెయ్యకుండా ఉండడం వీళ్ళ వల్ల కాదని మరోసారి తెలియజెప్పారు.
  2. ముఖ్యమంత్రి అసహనానికి ఇది మరో సూచిక. విమర్శించే పత్రికల పట్ల కూడా ప్రతిపక్షాల పట్ల వ్యవహరించినట్లే ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. నేనా పత్రికను (ఆంధ్రజ్యోతి) అసలు చదవనే చదవనని అలిగిన వ్యక్తి ఆయన. తనవారిని కాపాడుకునేందుకు (ఉదా:సూరి), కానివారిని కాలరాచేందుకు (ఉదా:కోట్ల విజయభాస్కరరెడ్డి వర్గం) ఏ స్థాయికైనా వెళ్ళగల వ్యక్తి. ఈ వ్యవహారం మొత్తంలో ఆయన చెయ్యి లేదంటే నమ్మశక్యం కాదు.
  3. అవినీతిని వాసన పసిగట్టే కుక్కలు మరి రాంగురోడ్డు విషయంలోను, కాందిశీకుల భూమి విషయంలోను, ఘటకేసర్ భూమి విషయంలోను మొరగలేదేంటి? భూభోక్తలు బిస్కట్లేసారా? లేక, భూభోజనాల బంతిలో తమకూ కాసిని ఎంగిలి విస్తర్లు దొరికాయా?
  4. రాంగురోడ్డుపైన, ఘటకేసరు ట్రస్టు స్థలంలో ఇంటిపైన, కాందిశీకుల భూములపైన, ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి పైన, ఇంటి ముందు స్థలాన్ని కాజేసిన వైనంపైనా ఈనాడు తమపై విమర్శలు చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల ఆస్తుల రక్షణకు నడుం కట్టేవారేనా వీళ్ళు?
రామోజీరావుపై ఆరోపణలు చేసే అత్యుత్సాహంలో వీళ్ళో సంగతిని పక్కన పెట్టారు - ప్రజలు వీళ్ళ ఆరోపణల్ని నమ్మి, డబ్బు వెనక్కిమ్మంటూ అడిగితే ఏం జరుగుతుంది? తీసుకున్న డబ్బులను పెట్టుబడులుగా పెడతారు కాబట్టి, ఆ డబ్బులను ఇప్పటికిప్పుడు వెనక్కిచ్చియ్యాలంటే ఎంత గొప్ప సంస్థకైనా సాధ్యం కాదు. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని తెలిస్తే ప్రజలు మరింత ఎగబడతారు, తమ డబ్బుల కోసం. అప్పుడు ప్రజల్లో కల్లోలం రేగదా? వీళ్ళాశించింది అదేనా?

మార్గదర్శి ప్రజల దగ్గరి నుండి డబ్బులు సేకరించకూడని పక్షంలో ఇన్నాళ్ళూ నియంత్రణ సంస్థలు ఏంచేస్తున్నట్లు?

ఏదేమైనా, స్వార్థ రాజకీయులు ఆడుతున్న ఈ నాటకంలో ప్రజలు బలి కాకుండా ఉండాలని కోరుకుందాం.

హరికథలో పిట్టకథల్లాగా ఈ జాబులో రెండు పిట్ట జాబులు:

మార్గదర్శి మీద రాజకీయుల దాడి ఇది మొదటిది కాదు. గతంలో నాదెండ్ల భాస్కరరావనే పెద్దమనిషి (నెల రాజు), రామారావును ముఖ్యమంత్రిగా పడదోయక మునుపు ఆయన మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉండేవాడు. (అప్పట్లో ఆయన కోపైలట్ లెండి, రామారావేమో పైలట్! ఆ సంగతీ భాస్కరరావే చెప్పుకున్నాడు.) ఆయన మార్గదర్శి చిట్‌ఫండు పై శాసనసభలో దుమారం లేపి కొన్నాళ్ళు హడావుడి చేసాడు. అయితే అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు చిట్‌ఫండు, ఇప్పుడేమో ఫైనాన్సు! అప్పుడు కోపైలట్టు.., ఇప్పుడేమో పైలట్టు, ఎయిర్‌హోస్టెస్సులు, స్టీవార్డులూ!

ఇక రామోజీరావు కూడా తక్కువవాడేం కాదు. ఆయనకు శత్రువులు కొల్లలుగా ఉన్నట్లున్నారు! (పత్రికాధిపతికి తప్పదేమో!!) రామారావు రాకముందు కాంగ్రెసు హయాంలోనే శాసనమండలి లో (అప్పట్లో ఉండేది! పెద్దలసభ అని గౌరవంగా అనేవారు, సభ్యులు 'చిన్న'వాళ్ళైనా) జరిగిన ఒక 'చర్చ' గురించి "పెద్దల సభలో గలభా" అని ఈనాడులో శీర్షిక పెట్టి రాసారు. గలభా అనేమాట పెద్దలకు చిన్నతనంగా అనిపించి ఆయన్ను మందలించేందుకు, అరెస్టు చేసి సభకు తెమ్మని పోలీసు కమిషనరును పంపారు. (ఆ కమిషనరు మరెవరో కాదు, మొన్నటి తెదే ప్రభుత్వంలో మంత్రిగా చేసిన విజయరామారావట!) రామోజీరావు ముందే బెయిలు తెచ్చుకున్నాడు. ఆ తరువాత, ఆ శీర్షికలో తప్పేమీ లేదని తీర్పు వచ్చింది. మొత్తమ్మీద మండలి బోనెక్కలేదు ఆయన.

అవీ పిట్టకథలు! శ్రీమద్రమారమణ గోవిందో.. హారి!

7 కామెంట్‌లు:

  1. "అంతేవాసులు" మొదటి సారి తెలుసుకున్నా..:-) దీని అర్ధం గురువు గారు అన్న ప్రతీ దానికీ అంతే అంతే అనే వందిమాగధులనే కదండీ అర్ధం.?

    రిప్లయితొలగించండి
  2. అంతేవాసులు అనేమాటకు సుధాకరు చెప్పిన అర్థం అదిరింది. :D :D

    ఇక చదువరిగారి జాబు ఎప్పటిలాగే ...అద్భుతమ్!

    రిప్లయితొలగించండి
  3. రాజమహేంద్రవరం సభలో ఎవరో నినాదాలిస్తుంటే, కాంగ్రెస్ కర్యకర్తలు కంగారుపడుతుంటే, ఉండవల్లి వాళ్ళతో 'మన వాళ్ళే. ఏం కంగారు పడకండి ' అని చెప్తున్నాడు. ఉండవల్లి వెనుక ఎవరున్నారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఇంత జరిగినా మార్గదర్శి పై మదుపుదారుల విశ్వాసం ఏమీ తగ్గలేదు. ఒక Depositor తో Police complaint ఇప్పించటం కథలో కొత్త మలుపు.

    రిప్లయితొలగించండి
  4. చదువరి గారు అద్భుతంగా రాశారండి..

    రిప్లయితొలగించండి
  5. తెలుగు పదాల వాడుక బాగుంది కానీ చదువరి అన్న పేరు మాత్రం సార్థకం కాదేమో! ఒక్క పత్రిక (తెలుగులో) మాత్రమే చదువుతున్నత్లున్నది. ఆ పత్రిక దాని అనుంగు TV ఛానెలేగాక మిగిలిన వారినికూడా కొంచెం దయచూసి మీ అభిప్రాయం నిస్పాక్షికంగా చేయండి.

    మీ కోసం కొన్ని లింకులు...

    http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2006/nov/12edit3

    http://www.andhrabhoomi.net/weakpoint.html (This one is good for a week)

    రిప్లయితొలగించండి
  6. Anonymous గారూ, మీరన్నది నిజం.. నేను ఒక పత్రికే చదివాను, ఇతర పత్రికలను చదవలేదు. ఓ.. తెగ చదివేస్తానని ఆ పేరు పెట్టుకోలేదు లెండి. అయినా ముసుగేసుకుని అజ్ఞాతంగా, దొంగచాటుగా రాయడం కంటే ఏదో ఒక పేరెట్టుకుని రాయడం నయం కదా! ఇప్పుడే మీరిచ్చిన లింకులను చదివాను. థాంక్స్! చదివిన తరువాత నేను రాసినది ఏమైనా మార్చాలా అని ఆలోచించాను.. ఏం కనపడలేదు. ఏమేం మార్చాలో సూచించండి.. అయితే అజ్ఞాతంగా కాక మీరెవరో పేరుచెప్పి మరీ రాయండి. ఇకపోతే, నా తెలుగు పదాల గురించిన మీ వెటకారం గ్రహించాను. దాని గురించి రాసేదేమీ లేదు. ఒకవేళ నా జాబు మీక్కష్టం కలిగిస్తే అది తెలియక చేసినదే అని గ్రహించగలరు.

    రిప్లయితొలగించండి
  7. అయినా నిష్పక్షపాతంగా రాయడానికి ఇది వికిపీడియా కాదాయె, పక్షపాతంగా రాయడానికి పత్రిక కాదాయె. చదువరి బ్లాగు...ఆయన అభిప్రాయమంతే..అయ్యా గుంపులో గోవిందయ్యా మీరూ ఒక బ్లాగులో మీ అభిప్రాయాలు గుప్పిస్తే చదివి తరిస్తాము. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉండకూడదనికాదు.. విషయం ఈనాడు గురించికదా మరి ఇక్కడ మీ ఉక్రోషం ఎక్కడో చూపిస్తున్నట్టున్నారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు