15, సెప్టెంబర్ 2006, శుక్రవారం

నక్సలైట్లు, రాకెట్లు, పౌరహక్కుల సంఘాలు

తపంచాలు, తుపాకులు, మిషను గన్లు దాటేసి, ఇపుడు రాకెట్లూ, వాటి లాంచర్ల వరకు వచ్చారు, నక్సలైట్లు. పోలీసుల కూంబింగులు, దాడులు సరైనవేనని రుజువు చేస్తోంది ఈ ఆయుధాల సేకరణ. ఈ రాకెట్టును చాలా దూరంనుండి ప్రయోగించవచ్చు. 20 దాకా ప్రాణాలను తీయవచ్చు.

పౌరహక్కుల నాయకులు ఇప్పుడేమంటారో? ఎన్‌కౌంటర్లను ఖండించడం తప్పుగాదు. నక్సలైట్లు పోలీసులను చంపేసినపుడు గొంతు పెగలకపోవడం మాత్రం తప్పే! జనహననం కోసం రాకెట్లు, లాంచర్లు పోగు చేసుకునే వాళ్లను ఏం చెయ్యాలో వీళ్ళిపుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి పారేస్తున్నారని గోల చేస్తున్నారు.. మర తుపాకి పట్టుకు తిరిగేవాణ్ణి పట్టుకోవడానికి, సంకెళ్ళు ఊపుకుంటూ వెళ్తారా? వెళ్ళినా.., 'దా నన్ను బంధించు' అంటూ సంకెళ్ళ కోసం చేతులు చాపుతాడా? కాల్చి అవతల పారేస్తాడు! వాణ్ణి ఎదుర్కొనేందుకు మర తుపాకే కావాలి. తుపాకులున్నది కాల్చేందుకే! ముల్లును ముల్లు తోటే తీయాలి.

నక్సలైట్లు పోలీసులనే కాక, ఎంతో మంది మామూలు పౌరులను కూడా ఇంటి దగ్గరనుండి పట్టుకుపోయి, హింసించి, కాల్చి చంపారు- ఇన్‌ఫార్మర్లనో, కోవర్టులనో, మరో పేరుతోటో. మరి అలా పట్టుకుని చంపడం రైటా? పోలీసులను మాటేసి, మైనేసి చంపుతున్నారు కదా, అది ఒప్పేనా? ఇవి జరిగినపుడు నోరు విప్పని వాళ్ళు ఎన్‌కౌంటరు అనగానే మాత్రం గోల చేసేస్తారు. పోలీసులు అసలు తప్పే చేయరని ఎవరూ అనరు, కానీ తప్పు రెండువైపులా జరుగుతున్నపుడు ఒకర్నే నిందించడం ఏమిటి?

3 కామెంట్‌లు:

  1. మన పౌరహక్కుల సంఘాలకు పోలీసులు అంటే పౌరుల కింద లెక్క కాదు. అసలు నక్సలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళేమి చేస్తున్నరో వారికి తెలియదు. మన పోలీసులకి అస్సలు వారి ఉద్యోగ కర్తవ్యం తెలియదు. మధ్యలో బాగా లాభపడుతున్నది, శుభ్రంగా వున్నది రాజకీయ నాయకులే..

    రిప్లయితొలగించండి
  2. అవును సుధాకర్ గారన్నది నిజం, కొండపల్లి సీతారామయ్య తోనే గంగలో కలిసిపోయాయి వాళ్ల సిద్ధాంతాలు. సిద్ధాంతాల కోసం బ్రతకాల్సిన వాళ్లు కేవలము హంతకులు, కొండ రౌడీలయ్యారు. అల్‌ఖైదాకు నక్షలైటు నాయకులకు పెద్ద తేడా లేదు. ఒకరు బయటి నుండి ఇంకొకరు లోపలినుండి దాడి చేస్తున్నారంతే.

    రిప్లయితొలగించండి
  3. ప్రస్తుత నక్సలైట్ల హింసాత్మక ప్రవృత్తి చూస్తే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయాలు కలగడం తప్పుకాదు. ఈ నక్సలైట్ల, పోలీసుల యుద్దం రెందు పరస్పర విరోధుల మద్య జరుగుతున్నదే కానీ సిద్దాంతాల మద్య కాదు.
    "తుపాకీతోనే రాజ్యాధికారం" అనేది తుప్పుపట్టిన మధ్యయుగాల నినాదం. దాన్నిప్పటికీ నమ్మడం బుర్రలేనితనం.
    అసలు నన్నడిగితే రాంజ్యాంగాన్ని గౌరవిస్తూనే లంచగొండితనం, అవినీతి, అనైతికత లాంటిమీద వీళ్ళ తుపాకులు ఎక్కుపెడితే వీళ్ళకు ప్రజల్లో పలుకుబడీ పెరుగుతుంది, రాజ్యాభివృద్ది జరుగుతుంది, కాదుకూడదంటే రేపెప్పుడో పాలస్తీనాలో హమాస్‌లా ఎన్నికల్లో నిలబడితే గెలవనూ వచ్చు. ఇలాంటి సాద్యమయ్యే బంగారం లాంటి రాచబాటను వదిలేసి ఈ ముళ్ళబాట ఎందుకు ఎంచుకుంటారో వీళ్ళు. ఒక్క చిరంజీవి సినిమా చూసే ప్రజలు అంతగా ప్రభావితులయ్యారు అంటే నిజంగా నక్సలైట్లు ఆ విధంగా సమాజానికి పట్టిన చీడను వదిలించపూనుకుంటే వారికి అడ్డెవరు?
    (కాట్రాంక్టర్ల దగ్గర చందాలు వసూలు చేసేబదులు, నాణ్యతలేకుండా నిర్మిస్తే పాతరేస్తాం అంటే నాణ్యత ఎంత పెరిగేది!)
    --ప్రసాద్
    http://charasala.wordpress.com

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు