18, ఆగస్టు 2011, గురువారం

మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..

అడ్డెడ్డె...

అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా?


అవినీతి పట్ల ప్రజల్లో ఉన్న క్రోధానికి అన్నా హజారే ప్రతీక. అలాంటి వ్యక్తిని ’నిలువెల్లా అవినీతిపరుడ’ని నిందించి, ఆయన తలపెట్టిన ఆందోళనకు అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి, ఆయన్ని తీసుకెళ్ళి రాజాలూ, కల్మాడీలూ ఉండే తీహారు జైల్లో పెట్టి,  ఆందోళన హింసాత్మకం కావచ్చునన్న ఆలోచనలు చేసి,.. ఇన్ని చేస్తే  ప్రజలకు ఆగ్రహం కలగదూ..! అందుకే దేశవ్యాప్తంగా వేలు లక్షల సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చారు.

ఇదంతా ఎందుకు చేసారయ్యా అంటే వాళ్ళిచ్చిన వివరణ -  ఢిల్లీ పోలీసులు శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆ ఆంక్షలు విధించారు తప్ప మేం చేసింది కాదు. ఈ ప్రభుత్వపు తెలివితక్కువతనానికి పరాకాష్ఠ ఇది.

ప్రజాగ్రహాన్ని చూసాక, ప్రభుత్వం దిగొచ్చి, విడుదల చేస్తాం బైటికి రావయ్యా బాబూ అంటే.. ఠాఠ్, నేన్రాను. నా షరతులకు అంగీకరిస్తేనే వస్తాను అని భీష్మించుక్కూచ్చున్నాడా భీష్ముడు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అవీ ఒప్పుకుంటారనుకుంటాను.

ఇవ్వాళ రెండు సభల్లోనూ మన్మోహన్ ఈ విషయంపై ప్రకటన చేసాడు. జరమొచ్చిన మనిషిలాగా ఉన్నాడు. ఆయన ప్రసంగం ఎంత పేలవంగా ఎంత బేలగా ఉందో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం అంత పదునుగా ఉంది.

ఈ ప్రభుత్వ నిర్వాకంపై ఇవ్వాళ లోక్ సభలో ఒకాయన చేసిన వ్యాఖ్య ఆకట్టుకుంది:
ఒకడేదో తప్పు చేసి దొరికిపోయాడు. న్యాయాధికారి అతడికి రెండు రకాల శిక్షలు చెప్పి నీకేది కావాలో ఎంచుకో అని అడిగాడు - ఒకటి వంద కొరడా దెబ్బలు, రెండోది వంద ఉల్లిపాయలు తినడం. కొరడా దెబ్బలు తినలేం, ఉల్లిపాయలు తిందాంలే అనుకుని అదే అడిగాడు. రెండు ఉల్లిపాయలు తినగానే తెలిసొచ్చింది అది కష్టమని. ఇదొద్దుగానీ కొరడా దెబ్బలే ఇప్పించండి అని అడిగాడు. సరేనన్నాడు న్యాయాధికారి. కొరడా దెబ్బలు కూడా రెండు తినగానే భరించలేక, బాబోయ్, నాకు ఉల్లిపాయలే ఇప్పించండి అని వేడుకున్నాడు. ఇలా చేసి మొత్తం వంద ఉల్లిపాయలూ వంద కొరడా దెబ్బలూ - రెండూ తిన్నాడు. ఈ ప్రభుత్వం వ్యవహారం కూడా అలాగే ఉంది అని ఆయన విమర్శించాడు.

4 కామెంట్‌లు:

  1. అవమానకరమైన తిరోగమనం, అదీ దాడి ప్రారంభించిన 12గంటల్లోనే! ఆ ఆందోళన వెనుక వున్న ప్రజాబలాన్ని అంచనా వేయడంలో కేంద్ర నిఘా సంస్థలు ఎంత దారుణగా విఫలమయ్యాయో, ఇక వీళ్ళు టెర్రరిస్టుల వ్యూహాలను ఏమాత్రం అంచనావేయగలరో అర్థమవుతోంది. 3రోజులతో పోయేదానికి, అంతకన్నా పెద్ద మైదానంలో, 14రోజులు చేతులు, మొహమూ కాల్చుకుని అనుమతి ఇచ్చుకోవాల్సి వచ్చింది. తమ పరిధిలో లేదని చెప్పి తప్పిచుకోలేకపోయిన చిదంబరం ఆ పోస్ట్‌కు ఏమాత్రం తగడని తేలిపోయింది.

    రిప్లయితొలగించండి
  2. ఒక అన్నా హజారే విషయమేనా గత రెండేళ్ళ గా ఇదే పని లో ఉన్నారు కదండీ :((((

    రిప్లయితొలగించండి
  3. నిజంగానే అతను రాహుల్ గాంధీకి పదవి అంటగట్టే త్రోవలో ఆలోచిస్తున్నాడేమో !

    రిప్లయితొలగించండి
  4. భుజం పట్టి నడిపించే అమ్మ తోడులేక , పాపం ఎటు నడవాలో తెలీక తత్తర పడ్డారేమో అయ్యవారు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు