20, మార్చి 2011, ఆదివారం

ఇదిగో.. ఆ చిరంజీవిని ఢిల్లీకి రమ్మనమని కబురెట్టమని కబురెట్టవోయ్

రాబోయే రోజుల్లో  మనం చూడబోయే వార్తల్లో ఈ కిందిదో దీని లాంటిదో ఉండొచ్చని నా ఊహ.
------------------------------------
"చిరంజీవి గారూ ఒక్ఖసారి ఢిల్లీకి వచ్చిపోరూ.. ప్లీజ్!" - అధిష్ఠానం

హైదరాబాదు, రేపటి వార్త 

ప్రముఖ కాంగ్రెసు నాయకుడు చిరంజీవిని వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానుడు కబురు పెట్టించారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. అదృష్టం కలిసొస్తే, ఆయన మేడమ్మను కూడా కలవొచ్చని తెలుస్తోంది.

ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ’ఎందుకో చెప్పలేదు, సాయంత్రానికల్లా ఢిల్లీ వచ్చి పటేలు గారిని కలవమని ఆయన పియ్యే గారి ప్యూను గారు ఫోను చేసారు. అందుకే హడావుడిగా బైల్దేరి పోతున్నాను. వస్తానండి, మళ్ళీ ఆల్సెమైపోద్దేమో..’ అని చెబుతూండగా, పక్కనే ఉన్న మరొక కాంగ్రెసు నేత సి రామచంద్రయ్య గారు మైకు లాక్కుని, ’లేదు లేదు, కారణం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 294 శాసనసభ స్థానాలను, 42 లోక్ సభ స్థానాలనూ  కైవసం చేసుకోడం అనే బృహత్తర బాధ్యతను చిరంజీవి గారి భుజాల మీద పెట్టేందుకు గాను ఢిల్లీకి రమ్మని మేడమ్ గారే స్వయంగా ఫోను చేసి తెలుగులో బతిమాలారు. పాపం చిరంజీవి గారికి ఒప్పుకోక తప్పలేదు. అందుకే వెళ్తున్నారు.’ అని చెప్పారు. ఆ వెంటనే చిరంజీవి గారు కూడా ’అవునవును, రామచంద్రయ్య గారు చెప్పిందే అసలు నిజం, ఇదంతా జరిగిందని నేను మర్చిపోయాను.’ అని చెప్పారు. మళ్ళీ ఆయనే "నేను ప్రత్యేకించి చెప్పకపోయినా, ఎందుకు పిలిచారనేది నా అభిమానులకు తెలిసే ఉంటుంది. వాళ్ళ సంగతి మీకూ తెలుసుగదా" అని కూడా అంటూ ’అవును కదా?’ అన్నట్టు సైగ చేస్తూ రెండు చేతులు బార్లా చాపి, బొటనవేళ్ళు పైకెత్తి చూపించారు.

చిరంజీవి గారి చివరి వ్యాఖ్య వినగానే విలేఖరుల వెనక నిలబడి ఉన్న మెగాభిమానులు చప్పట్లు ఈలల్తో సమావేశ మందిరాన్ని దద్దరిల్ల జేసారు. పూలు, రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేసారు. కాస్సేపు హాలంతా పండగ వాతావరణం అలుముకుంది.

9 కామెంట్‌లు:

  1. ఇలా అయితే కమ్మ రాజ్యం, రెడ్డి రాజ్యం పోయి, కపురాజ్యం వస్తుందన్న మాట.

    రిప్లయితొలగించండి
  2. ఈ సారి పచ్చ జెండా పార్టి అధికారం లోకి రాలేక పోతే వారి పరిస్థితి తమిళనాడులో వై.గో. లాగా తయారౌతుంది. చంద్రబాబు గారు వాస్తవ పరిస్థితిని సరిగా అంచనా వేసుకొనట్లు లేదు. ఆయన యునివర్సిటి లో విద్యార్ధి నాయకుడిలా పార్టిని నడుపుతున్నారు. ఒక మంచి ఇంట్లెక్త్యూల్ ఆపార్టి కోర్ కమీటీ లో లేడు. ఉన్న వారు అంతా ఈయన తీసుకొన్న నిర్ణయానికి తలలు ఊపేవారే. ఈయన మీద ఆధారపడేవారే. చీటీకి మాటికి నాగం గొడవ దానిని సర్ది చెప్పటానికి మిగతా నాయకులు. ఆయన సమయం దానితో సరి పోతున్నాది. రెండవ తరం నాయకుల లేమి స్పష్టం గా ఆపార్టీలో కనిపిస్తున్నాది. యై.యస్. కి అవసరమైనపుడు కేంద్రంలో ఉండవల్లి లా చంద్రబాబు గారికి అవసరమైనపుడు గట్టిగా నిలచి మద్దతు ఇవ్వటానికి ఎవరు ఉన్నారు? ఎంత సేపటికి అందరు తెలంగాణా పేరు తో ఆయనను బెదిరించే వారే. ఈయనపని వారిని కూల్ చేయటం తో సరి పోతున్నాది. ఇక తెలంగాణా వరకు వచ్చేది వెలమ రాజ్యం. రెడ్డి రాజ్యం ఎంత వరకు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మటుకు ఆంధ్రాప్రదేశ్ అంతా గందరగోళ రాజ్యం నడుస్తున్నాది. అన్ని ఇకెషన్స్, ఫార్ములాలు మాక్సిమం వాడేయటం, పాలకుల రహస్యాలు(బలాలు బలహీనతలు ) చిన్న పిల్లల వరకు తెలిసి పోవటం వలన ఎవరు ఎవరిని ఎన్నుకొంటారో ఎవరికి తెలియదు. అంతో ఇంతో జగన్ కే అవకాశం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తున్నాది.

    SRI

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ వ్యంగ్యం బావుంది...
    టైటిల్ లోనే సారాంశం అంతా వచ్చేసింది...
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. "చిరంజీవిని రమ్మనమని కబురెట్టమని కబురెట్టవోయ్" అనడంలోనే చిరంజీవి ఎంత కిందిస్థాయి నాయకుడో సూచించేశారు. హా౨ట్సాఫ్ టు యు ఫర్ ద పవర్‌ఫుల్ శార్కాజమ్.

    రిప్లయితొలగించండి
  5. ఈ పోస్ట్ రయనవసరం లేదు. టైటిల్ చాలు. Great Title!

    రిప్లయితొలగించండి
  6. మీ సాయంకాలమైంది పోస్ట్ చదివాను. చాలా పవర్ఫుల్ గా రాశారు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరి దిగజారి పోయాడు.

    రిప్లయితొలగించండి
  7. కాంగ్రెస్లో చేరి చిరంజీవి చిరుజీవై పోయాడు. మీరు అతడిని మరుగుజ్జు చేసారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు