25, అక్టోబర్ 2008, శనివారం

ఇక వోటరు నమోదు కొన్ని నొక్కుల్లో


ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఈ విషయమ్మీద ఈనాడులో వచ్చిన వార్త చూడండి. ఆ వార్త సంక్షిప్తంగా ఇది:

ఇక నుంచి ఏ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లో ఉండే ఓటు హక్కును నమోదు చేయించుకోవచ్చు. రాష్ట్రంలో ఈ-నమోదు ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. గత వారం రోజులుగా ఈ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు అమలులోకి తెచ్చారు. దీనికి విపరీతమైన స్పందన వస్తోందని ఆయన చెబుతున్నారు. 
ఈ-నమోదు చేసుకోవాలంటే ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఉన్న ఈ-రిజిస్ట్రేషన్ ఫారాన్ని పూర్తి చేసి, రెండు ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. ఈ దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిశీలన చేస్తుంది. అర్హులని తేలితే వారికి నెల రోజుల్లో ఓటు హక్కును కల్పిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లోనే ఈ-నమోదుకు మంచి స్పందన రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
అలాగే.. 
  • హైదరాబాద్‌లో వచ్చే నెల 5నుంచి 212 పోస్టాఫీసుల్లో ఓటరు నమోదు ఫారాలను పెట్టి అక్కడే దరఖాస్తు పెట్టెలు (డ్రాప్ బాక్సులు) ఏర్పాటు చేస్తున్నారు. ఫారం పూర్తి చేసి రెండు ఫొటోలను జత చేసి డ్రాప్ బాక్సుల్లో పడవేస్తే నెలరోజుల్లో వారికి ఓటు హక్కును కల్పిస్తారు. 
  • జంటనగరాల్లోని ప్రధానమైన షాపింప్ బజార్ల‌లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ శనివారం నుంచి దరఖాస్తు పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. 
  • వచ్చే నెల అయిదో తేదీ నుంచి హైదరాబాద్‌లోని 48 ఈ-సేవా కేంద్రాల్లో కూడా ఓటరు నమోదు ప్రక్రియ మొదలవుతుంది. 
  • రాష్ట్ర వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో శాశ్వత ఓటర్ల నమోదు కేంద్రాల(డీపీఎస్ సెంటర్లు) ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 
రండి, నమోదు చేసుకోండి అంటూ ఇన్ని ఏర్పాట్లు చేసాక కూడా నమోదు చేసుకోకుండా ఉంటామా!? 

జై ఎన్నికల సంఘం! 


--------------------------------------------------------------------

పోతే.. ఈనాడులో ఆ వార్త చూసాక, తప్పుల్లేకుండా వెబ్బు లింకులివ్వడం ఈనాడుకు ఇంకా అలవాటు కాలేదని అర్థమైంది. 
  • వాళ్ళిచ్చిన లింకు ఇది: ceoandhra.govt.in దానికి హైపరులింకు లేదు.. దాన్ని నొక్కితే సైటుకు పోదు. కాపీ చేసుకుని అడ్రసు బారులో పెట్టుకోవాల్సిందే -అదేదో ఈమెయిల్లో లాగా!
  • అసలు లింకు ఇది:http://ceo.ap.gov.in/ (మీ పేరు వోటరు జాబితాలో ఉందో లేదో చూసుకోడానికి ఈ లింకు ఉపయోగపడుతుంది) లేదా http://ceoandhra.nic.in/. చూసారుగా.. వెబ్బు అడ్రసు తప్పు! కాపీ చేసుకుని అడ్రసుబారులో పెట్టుకున్నా మన డబ్బా దాటి ఎక్కడికీ పోదది! (govt.in అట -ఇంకా నయం government. in అనలేదు.)
విశేషమేంటంటే ప్రింటులో లింకును బానే ఇచ్చారు. వెబ్బులోనే ఈ తప్పులు!

ప్చ్!

5 కామెంట్‌లు:

  1. చాల్లెండి, సంబడం!
    మూడు నెలల క్రితం చెప్పారు, ఆ సుబ్బారావు గారు,జాలంలో నమోదు చేసుకోంది, మీ ఇంటికి వచ్చి మా అధికారులు ఇస్తారు అని. ఇప్పటి దాకా, అతి గతి లేదు.
    ఇక తంతే తపేళా శాఖ ఒకటి దొరికింది వీరికి. చూద్దాం ఏమ్ చేస్తారో!
    ఒకవేళ, మా వీధిలో, జాలంలో నమోదు చేసుకున్న ఏ ఒక్ఖరికైనా, ఇంటికి వచ్చి ఇస్తే, జడ కొసేసుకుని తిరుగుతా, ఇదే ప్రతిజ్ఞ!

    రిప్లయితొలగించండి
  2. ఇప్పటికైనా ఈ-వోటు గురించి ప్రభుత్వం ఒక ప్రయత్నం మొదలైనందుకు సంతోషిద్దాము. అయితే కంప్యూటర్లు మన పేర్ల ఫోనెటిక్స్ ని, స్పెల్లింగులను సరిగ్గా గుర్తించలేవు, వెతకలేవు. కాబట్టి ప్రతీ వ్యక్తికీ బహుళార్ధ సాధక ఏకాంకిత గుర్తింపు నెంబర్లని కేటాయించి, ఓటింగ్ తో సహా అన్ని సందర్భాలకి ఉపయోగపడేట్లు చేయాలి.

    సమాచారము తెలియజేసినందుకు ధన్యవాదములు.
    నావోటు నమోదు అయ్యిందో లేదోనని అనుమానం ఉండేది. ఎమ్మర్వో కార్యాలయానికి వెళ్ళాలనుకొన్నాను కానీ తీరలేదు. సైటులో వెతికాను. దొరికింది.

    రిప్లయితొలగించండి
  3. ఇది నిజంగా సవ్యంగా జరుగుందని నేను నమ్మను. జరిగితే నాకు ఉన్నదే చిన్న జడ కాబట్టి కోసేసుకోలేను గానీ ఇంకేదైనా ప్రతిజ్ఞ ఆలోచిస్తానుండండి!

    రిప్లయితొలగించండి
  4. మొత్తానికి మన వ్యవస్థలో కొన్ని మంచి కదలికలు వస్తున్నాయి. సీతారాంరెడ్డిగారు చెప్పినట్లు ప్రతి మనిషికీ ఒక గుర్తింపుసంఖ్య వుంటే చాలా ఇబ్బందులు తొలగుతాయని, చాలా పనులు సులభమౌతాయని నా అభిప్రాయం కూడా.

    రిప్లయితొలగించండి
  5. ఓటు కాదు కాని జడ పాపం ఏం చేసిందో? ఆయిన సంసారం లొ సరిగమలు మాత్రమే ఉండవండి ఇలాటివి కూడ ఉంటాయి మరి.చెప్పానుగా జడ మీద కోపం లేదండి రాలేదనె ఉక్రోషం వ్యవస్థ లో కదిలిక మొదలైనప్పుడైన మనం అందుకోవాలి మరే!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు