ఈ బ్లాగు భారత ప్రామాణిక సమయాన్ని అనుసరిస్తుంది

Sep 15, 2007

మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?

ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో లాగా అభివృద్ధి జరగడం లేదట. ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ సంగతి తేల్చేందుకు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి చూద్దామని సవాలు కూడా చేసాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని చంద్రబాబును ఆహ్వానించాడు కూడా.

మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది. కానీ అంతకంటే ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను. ఈమధ్య ఈ జనాలు ఓబులాపురం చూసొచ్చారు. సింగడు అద్దంకి వెళ్ళొచ్చాడు అన్నట్టు.. వీళ్ళూ వెళ్ళారు, వచ్చారు. తెదేపా 'ఏమీ బాలేదు' అని అంది.. ఏంబాలేదో, ఎందుకు బాలేదో
చెప్పలేకపోయింది, మామూలుగానే! మిగతావాళ్ళు 'ఏంలేదు అంతా బానే ఉంది' అంటూ జేజేలు కొట్టొచ్చారు. ఆ మాత్రపు ముష్టి పని కోసం ఈ నాయకులంతా పాంట్లు ఎగలాక్కోని ఓబులాపురం దాకా పొయ్యొచ్చారు. అవునులే జీవితంలో మరో రకంగా 'గాలి'మిషను (హెలికాప్టరు) ఎక్కగలిగే వాళ్ళా!? 'గాలి' అబ్బాయి వీళ్ళని చూసి ముష్టి వెధవలని అనుకొని నవ్వుకొని ఉంటాడు. హై. లో కూచ్చుని గనులు లీజుకెలా ఇచ్చారో పరిశీలిస్తే ఇక్కడే తెలిసిపోయేది ఆ లీజు భాగోతం; కోర్టుకు తెలిసిపోలా!!?

వీళ్ళింత చేతకాని వాళ్ళని తెలిసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దాం వస్తారా అని చిటికెలేస్తున్నాడు. అసలు మన గొప్ప తెలుసుకొనేందుకు ఎక్కడికన్నా పొయ్యి రావాలా, అనేది నా సందేహం.

ముఖ్యమంత్రీ.. అక్కడికెళ్ళి ఏంచేస్తారు?

  • ప్రజల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇంత నిష్పూచీగా ఉండే ప్రభుత్వం మరోటుందేమో చూసొస్తారా?
  • కోర్టులు మీ ప్రభుత్వాన్ని తిట్టినట్టు ఇంకెవరినైనా తిట్టారో లేదో తెలుసుకుంటారా?
  • తరాల తరబడి ప్రభుత్వ భూములను కాజేసి, వాడేసుకొని ఇవ్వాళే తెలుసుకున్నట్టు, ప్రభుత్వానికి అప్పజెప్పినట్టూ నాటకాలాడే పత్తిత్తుల కోసం వెతుకుతారా?
  • రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి లాట్లుగా అమ్మేసే ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉందేమోనని చూసొస్తారా?
  • ఫైళ్ళు చూడకుండానే సంతకాలు పెట్టేసే ముఖ్యమంత్రులు, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిచ్చేసే మంత్రులు ఇంకా ఎక్కడెక్కడున్నారో చూసొస్తారా?
  • నేరస్తులతో చెట్టాపట్టాలేసుకు తిరిగే పాలకుల కోసం వెతుకుతారా?
  • పర్సనల్ కార్యదర్శి నుండి ప్యూను దాకా అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన మరో పేషీ ఎక్కడన్నా ఉందేమోనని చూసొస్తారా?
  • బినామీ పేర్లతో కంపెనీలే పెట్టిపారేసే మంత్రులు ఇంకా ఎక్కడైనా ఉన్నారో లేదో చూసొస్తారా?
  • ఒకదాని తరవాత ఒకటి బాంబులేసినోడెవడో నీకు తెలీదు. గుజరాతులో నేరం జరిగితే, వాళ్ళు, మీ పోలీసుల్లోనే దొంగ వెధవలున్నారంటూ ఇక్కడికొచ్చి మరీ చెప్పి పోయారు. ఈ మాత్రం తెలుసుకొనేందుకు పైరాష్ట్రానికెందుకు పోయి రావడం డబ్బు దండగ కాకపోతే! వాళ్ళే ఇక్కడికొచ్చి చెబుతున్నారు గదా!
  • సబ్ కాంట్రాక్టులు పొందే కుట్రతో, కాంట్రాక్టులు పెద్ద కంపెనీలకు ఇప్పించి, వాటి నుండి పొందిన సబ్ కాట్రాక్టులతో నాసి రకం కట్టుబడులతో రాజకీయులు కోట్లు పోగేస్తున్న వైనం ఇంకా ఎక్కడుందో చూసొస్తారా?
  • కడుతూ ఉండగానే కూలిపోయే వంతెనలు, పైదారులు, కిందారులు దేశంలో ఎక్కడున్నాయో వెతుక్కుంటూ పోతారా?
  • 11 కోట్లు అప్పనంగా ఇచ్చి పారేసి, ఎవడికిచ్చామో కూడా తెలీని పరిస్థితి ఇంకా ఎక్కడైనా ఉందో లేదో చూసొస్తారా?
  • రాజీవు, ఇందిర, సోనియా అంటూ చెక్కభజన చేస్తూ సొంత రాష్ట్రపు నాయకులను విస్మరించే జాతి ఇంకా ఎక్కడైనా ఉందేమోనని చూసొస్తావా?
  • గత సీవీసీ రామచంద్ర సమాల్ ఏమంటున్నారో వినబడిందా? ఇన్నాళ్ళూ ఆయన చెప్పినవన్నీ పెడచెవినబెట్టావు. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు మాకూ వినబడుతున్నాయి. ఆయనిలా అంటున్నాడు..

    "ఆంధ్రప్రదేశ్ భూగర్భాన్ని సముద్రంలోపల, సముద్రం బయట ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు."

    "..అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు."


పై రెండు మాటలూ చాలవా మీ బాగోతాలు తెలిసేందుకు? మీ నిర్వాకాలు ఇట్టా ఏడుస్తున్నాయి. ఈ మాత్రపు బోడి సంగతి తెలుసుకునేందుకు దేశం తిరిగిరావాలా? ఏమక్కరలేదు!! అవినీతి, అక్రమాలు ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల వాళ్ళే ఇక్కడికి వస్తారేమో కనుక్కోండి.. ఆ రకంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

మీ బాగోతాలు బయట పెట్టేంతటి తెలివి ఈ చేతకాని ప్రతిపక్షానికి లేదు. ఉంటే, ఇన్నాళ్ళూ మీ ఆటలిలా సాగేవా?

14 comments:

Dr.Ismail September 15, 2007 11:37:00 AM IST  

సింగడు అద్దంకి వెళ్ళొచ్చాడు అన్నట్టు...బావుంది-మా వైపు ఇలానే మరో సామెత...హుసేనప్ప తాడిమర్రి పోయొచ్చినట్టు:-)

విహారి(KBL) September 15, 2007 11:45:00 AM IST  

సరుకులు,కూరగాయలు,పెట్రొలు,గాస్,రెజిస్ట్రేసన్ చార్జీలు ఇలా ధరల పెరుగుదలలో కుడా గణనీయమైన అభివ్రుద్ధి సాధించారు.

రానారె September 15, 2007 12:24:00 PM IST  

నాయకుల కొడుకులు "సెటిల్మెంట్లు" చేస్తున్నవైనం మాత్రం ఇతర రాష్ట్రాల్లోకంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. కడిగేసే పని పెట్టుకున్నారా? ఐతే చేతినిండా పనే.

అజ్ఞాత,  September 15, 2007 1:07:00 PM IST  

ramudu ledu ramayanam ledu unnadanta ravanudu ravanarajyam
Mari intakanna abhivruddi inkekkada

అజ్ఞాత,  September 15, 2007 4:01:00 PM IST  

వై.ఎస్. బహుషా కరెక్టుగానే చెప్తున్నాడేమో!. కాకపోతే అభివృద్ధిని వారి దృష్టిలో చూడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోకి వచ్చాక, కాంగ్రెస్ నేతలు 9 సంవత్సరాల బాకీ మొత్తం లాగేసుకున్నారు. వారి ఇళ్ళల్లో చూడండి అభివృద్ధే అభివృద్ధి కనిపిస్తుంది. బహుషా తె.దే.పా వారికి దిమ్మదిరిగిపోయేలా చేసారు. రాబోయే ప్రభుత్వాధినేతలకు ఏ స్థాయిలో అవినీతి చేయవచ్చో నేర్పించారు.

Sriram September 15, 2007 5:54:00 PM IST  

మీకున్న జ్ఞాపకశక్తిలో పదో వంతు ఓటర్లకున్నా ఎంత బాగుండేది.అద్భుతం! వేసుకోండి వీరతాళ్ళు.

ప్రవీణ్ గార్లపాటి September 15, 2007 9:02:00 PM IST  

హహహ...
అదే మరి ఎవరూ అడగరని అంత గొప్ప నమ్మకమేమో. అడిగినా అక్కడ కూడా ఏ గూండాయిజమో చేసి ఓ నివేదిక ఇవ్వచ్చనుకున్నాడేమో.

నేనుసైతం September 16, 2007 4:11:00 AM IST  

ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ లెవెల్లో పదవిలో ఉంటే....ఒక్కసారి అలోచిస్తుంటేనే....అమ్మో షష్టిపూర్తి చేసుకున్న స్వతంత్రభారతానికి నిండునూరేళ్ళు నిండేవి.మిగిలిన రాష్ట్రాల వాళ్ళు అద్రుష్టవంతులు,కనీసం లల్లూ, జయలలిత, మాయ, ములయం లాంటి చిన్న,చితక చిల్లర దొంగలనే చూసారు, ఇటువంటి త్రాష్టపు దోపిడిదొంగ పాలనపడలేదు.
-నేనుసైతం

జాబిల్లి September 16, 2007 9:46:00 AM IST  

ఇది దేవుడి పాలన,బరించాలి!!అంతే!

చదువరి September 16, 2007 10:59:00 AM IST  

వ్యాఖ్యానించిన అందరికీ థాంక్స్! అవినీతి అనుపానులు తెలీని నాయకులెవరూ లేరు. ప్రస్తుత ప్రభుత్వం బెంచిమార్కును బాగా పెంచేసింది. అవినీతి ఆరోపణలను ఖండించే అవసరం కూడా లేదని భావిస్తున్నారు. "ఏఁ, నువ్వు చెయ్యలేదా?" అని ఎదురు అడుగుతున్నారు!

అజ్ఞాత,  September 16, 2007 8:15:00 PM IST  

వారెవ్వ! ప్రజలు అన్ని ఇంద్రియాలు మూసుకొని వున్నరని 'దేవుదీ భ్రమ. అది థీరదంకి వెరె రష్త్రలు వెల్లక్కరల,మన ప్రతిపక్షలు సక్రమంగ ఉంతె అతిత్వరలొనె తెలుస్థుంది. దనికి పునదె రమచంద్ర గరి వ్యఖ్యలు! చదువరి మీ రాత అదిరింది.

___ఆరవింద్

Gopi nath September 18, 2007 2:34:00 PM IST  

Devudi sontha paripalana Andhra Pradesh lo Jaruguthunnadi....sakhsatMUKHYA KANTHRI gary chepparu. so devudi paripalana manku ruchi choopisthunnadu. emantaru???

అజ్ఞాత,  September 19, 2007 9:45:00 PM IST  

manaki idi anta telisi voorukotam entavaraku samamjasam. samasya ki tarunopayam manalo enta mandi lancham adigina kanistable ni pora anagalam.

HimaBindu Vejella September 24, 2007 4:40:00 AM IST  

Y.S. mukyamantri avatam anedi thanki life lo vachina modati mariyu akhari avakasam.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనికలు
నా బ్లాగులో అనామక (అజ్ఞాత) వ్యాఖ్యాతలకు స్థానం లేదు. తోటి బ్లాగరుల పేర్లను అనుకరించి వ్యాఖ్యలు రాసేవాళ్ళను నిరోధించడానికి ఈ ఏర్పాటు చేసాను. మీ బ్లాగులో ఈ ఏర్పాటుందా?

సాటి బ్లాగరులపై, వ్యాఖ్యాతలపై వ్యక్తిగత నిందకు పాల్పడేవారి ఐపీ అడ్రసులను, వారికి సంబంధించి నాకు తెలిసిన ఇతర సంగతులను బహిరంగపరుస్తాను.

ఈ మూసను తయారు చేసినవారు అవర్‌బ్లాగ్‌టెంప్లేట్స్.కామ్. శీర్షంలోని బొమ్మను వికీమీడియా కామన్స్ నుండి సేకరించాను.