31, జనవరి 2007, బుధవారం

ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు!

ఆంధ్రజ్యోతి లో జనవరి 31 న ఓ వ్యాసం వచ్చింది. ప్రభుత్వ బడుల గురించి లోక్‌సత్తా నాయకుడు వర్మ రాసిన వ్యాసమిది. పైనున్న శీర్షిక పేరు కూడా ఆయన పెట్టిందే. ప్రభుత్వ బడుల గురించిన గణాంకాలను రాసారీ వ్యాసంలో. అందులోంచి ఒక్క విషయాన్ని నేనిక్కడ రాస్తాను. "రాష్ట్రంలో 20 శాతం ఉపాధ్యా యులు తక్కువగా ఉన్నారు. అదనంగా 54, 730 మంది ఉపా ధ్యాయుల అవసరం ఉందని 'కాగ్‌' నివేదిక పేర్కొంది. వీరికి బదులుగా 46,544 మంది విద్యా వాలంటీర్లు నెలకు 1000 రూపాయల వేతనంపై బోధనా విధులు నిర్వర్తిస్తున్నారు. " వెయ్యి రూపాయల జీతంతో బడి పంతుళ్ళట.. హవ్వ!

ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు చదివేది ఈ బడులలోనే! ఈ వర్గాల పట్ల ప్రభుత్వ ఆపేక్ష ఈ స్థాయిలో ఉంది. అందరికీ చదువు, సరైన చదువు చెప్పించే విషయంలో మన ప్రభుత్వాలకేమాత్రం ఆసక్తి ఉందో ఈ గణాంకాలు చెబుతాయి. ప్రస్తుత ప్రభుత్వం సంగతి మాత్రమే కాదు, వరసగా అన్నిటి తీరూ అంతే!

బడులూ, పంతుళ్ళు, భవనాలు, సదుపాయాల విషయంలో ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉంది. ఓపక్క ఇంత అధ్వాన్నంగా పనిచేస్తూ, ఎడాపెడా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతూ ఉంటే వాటి వలన ఆశించిన ఉపయోగం కలుగుతుందా?

ఈ చేతకానితనానికి తోడు, ఇప్పుడు ప్రభుత్వం, ప్రైవేటు వాళ్ళతో కలిసి కాన్సెప్టు బళ్ళేవో పెడతుందట. ఈ సంకర బడులు వద్దని పెద్దలు చెబుతున్నారు.

ఊరు బడి చెబుతుంది ఏలుబడి తీరు - ఎంత చక్కటి మాట!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు