26, జూన్ 2008, గురువారం

కండకావరం

నిరసన ప్రదర్శనల్లో దిష్టిబొమ్మలకు చెప్పులదండ వెయ్యనిదెవ్వరు? చెప్పుదెబ్బలు కొట్టనిదెవ్వరు? తగలబెట్టనిదెవ్వరు? నోటికొచ్చినట్టు బూతులు తిట్టనిదెవ్వరు?

శవయాత్ర నిర్వహించి, శాస్త్రోక్తంగా దహనకాండ జరిపించడం కూడా చూసామే!

మనకిది చాలా సహజమైపోయింది. సమాజంలో సర్వ సాధారణమైపోయిన వికృత చర్యలివి. ఆంధ్రజ్యోతి పాత్రికేయులు తమపై జరిగిన దాడికి నిరసనగా దాడి జరిపించిన నేత దిష్టిబొమ్మను తగలపెట్టారు. దళితులపై జరిగే అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని ఉపయోగించాల్సినంతటి నేరమట అది. అసలా దాడి చేయించిన వారిపై, దాడులు మళ్ళీ చేస్తాం అని బహిరంగంగా చెప్పిన, చెబుతున్న హింసోన్మాదులపై చర్యలేవీ?

సంఘటనలో పాత్రధారులైన ఈ ఇద్దరిలో ఒకరేమో ఆ రెండు పత్రికల్లో ఒకటి -అంచేత తప్పు వాళ్ళదే -మరో ఆలోచన లేదు. కాబట్టి చర్యలు వాళ్ళ మీదే! దళితులపై అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన చట్టాన్ని, వేరొకరిపై అత్యాచారం చేసేందుకు ఉపయోగించింది ప్రభుత్వం. తననెదిరించినవాడిని వేటాడేందుకు ఎంతకైనా తెగించగలనని మరోసారి నిరూపించాడు ముఠాకోరు.

"తప్పుల మీద తప్పులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఓవర్‌టైము పని చేస్తోంద"ని ఎల్‌కే అద్వానీ కేంద్రప్రభుత్వం గురించి అన్నాడు అప్పుడెప్పుడో. ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయనే ఆత్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రింబవళ్ళు పనిచేసి మరీ తాను చెయ్యదలచిన తప్పుడు పనులను చేసేస్తోంది. ఎన్నికల తరవాత ఇలాంటి అవకాశం రాదని కాబోలు!

12 కామెంట్‌లు:

  1. ఆంధ్రజ్యోతిలో రమణో ఎవరో రాశారు, 'దిష్టిబొమ్మలకీ కులాలుంటాయని ఇప్పుడే తెలిసింది' అని. మంద కృష్ణ తగలబెట్టిన దిష్టిబొమ్మల మాటేమిటి? వాళ్లు జ్యోతి ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మ తగలబెట్టినప్పుడు ఆయన అగ్రకులపోడు కాబట్టి ఏ చట్టమూ ఆయన్నాదుకోలేకపోయింది కాబోలు!

    రిప్లయితొలగించండి
  2. ఐనా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఆ కథనంలో ఈయనగారి పేరు ఎక్కడా లేకపోయినా వీరికి కోపం వచ్చిందంటేనే అర్థం అవుతోంది కదా…

    రిప్లయితొలగించండి
  3. ఇదంతా నాటకమని బూటకమని సామాన్య జనులకు తెలుసని పోలీసులకు ప్రభుత్వానికి తెలీదంటారా! చెప్పుల దండలు వేయించుకున్న దిష్టిబొమ్మలు కూడా ఉన్నాయి ! రాధాకృష్ణ దిష్టి బొమ్మ సంగతేంటి మరి?

    ఈ సంఘటన్ని అడ్డం పెట్టుకుని మరిన్ని అత్యాచారాలతో దళితులు పేట్రేగితే వారి నుంచి మిగతావారిని కాపాడేదెలా? అసలు కృష్ణ మాదిగని అరెస్టు చేయకపోవడం పెద్ద ఆశ్చర్యం! ఫాక్షనిజం ఇంత పచ్చిగా సిగ్గులేకుండా ఉంటుందన్నమాట.

    రిప్లయితొలగించండి
  4. వాళ్ళని అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలున్నాయని చెబుతున్న సమావేశంలో ఆయన ఎంత నవ్వులు చిందిస్తూ ఉన్నారో.. అది చూస్తుంటే సినిమల్లో క్రూరమైన విలన్లు నవ్వే నవ్వులాగా ఉంది.. కోపం నరం తెగిపోయింది, తండ్రిని చంపిన వాళ్ళని క్షమించాను అని నోటితో చెబితే సరిపోదు, అది చేతల్లో ఉండాలి.. చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి అనేదానికి ఈయన సోదాహరణ.... దానికి తోడు కొడుకు కూడా దానికి వంతపాడడం ఒకటి.. ఫ్యాక్షనిస్టులని సినిమాల్లో చూసిన నిజంలో ఇలా ఉండవేమో అనుకునేదాన్ని.. నిజమే అంతకి వెయ్యిరెట్లు మూర్ఖంగా ప్రవర్తిస్తారని ఇప్పుడే తెలిసింది...

    రిప్లయితొలగించండి
  5. అబ్రకదబ్ర, బాగా చెప్పారు. దిష్టిబొమ్మకు కులాన్ని తగిలించి కేసు పెట్టారు. వ్యక్తులను వాళ్ళ కులం పేరుపెట్టి నేరుగా, విలేకరుల ముందే తిట్టినా అడిగేవాడు లేడు అతణ్ణి; అందులో తప్పేమీ లేదు కాబోలు!

    రిప్లయితొలగించండి
  6. రవీంద్ర, ఆ వార్తలో పేర్లు రాయలేదు అన్నది ఒక్కటి తప్పితే ఆ నేతలెవరో అందరికీ తెలిసిపోయేలా నేరుగానే ఎత్తిచూపించింది.

    సుజాత, ఫ్యాక్షనిజానికి తెలిసిందొకటే -వేట. ఫ్యాక్షనిస్టుకు తెలిసిందొకటే -తనకనుకూలంగా ఉంటే గౌరునైనా రక్షించుకోవాలి, వ్యతిరేకంగా ఉంటే గోరునైనా వదలకూడదు.

    మేధ, సినిమా విలనీకి కొత్త మలుపు నివ్వగలడు. మన దర్శకులు కాపీ కొట్టేందుకు ఒక కొత్త మేనరిజం. :)

    రిప్లయితొలగించండి
  7. Sc,st harassment కేసు అనేదాన్ని హాస్యాస్పదం చేసేసారు అనిపించింది.
    నిన్న లైవ్ షో లొ చూసాను వాళ్ళ సమాధానాలు, ఒక మాట వాళ్ళనంటే అది హెరాస్ మెంటు కిందకొస్తుందట, అదే మాట వాళ్ళు ఇతర వర్గాల వారినంటే మాత్రం తప్పుకాదట. పైగా అగ్రవర్ణాల వారంతా మాశత్రువులు వాళ్ళ పై యుద్దం చేస్తున్నాం శత్రువుని మెత్తగా తిడతామా నీచంగానే తిడతాం అని ఎలుగెత్తి మరీ చెప్పారు. ఇంకో గమ్మతైన వాఖ్య కూడా.. జేపీ ఐ ఏ ఎస్ అవడానికి కారణం అతని పేపర్లు దిద్దిన వాడు అగ్రకులస్తుడవటమేనట!!!

    రిప్లయితొలగించండి
  8. నాకు చాలా చాలా భయమేస్తుంది. ఈ పోస్టులు, కామెంట్స్ చదివి మంద కృష్ణ కేసు వేస్తాడు sory.. వేస్తారు. పోలిసులు అర్థ రాత్రి వచ్చి (పగలు వారికి తీరిక ఉండదు) అందర్నీ బొక్కలో వేసేస్తారేమో అని. ముందుగానే bail papers రెడీ చేసుకుంటే మంచిదేమో??

    రిప్లయితొలగించండి
  9. మాదిగ వారు తమ నాయకుడుగా, వీడిని ఎలా భరిస్తున్నారా అని అనిపిస్తుంది.
    నాకు ఇప్పటికి అర్ధం కానిదేమిటి అంటె, తన పేరులొనే, మాదిగ అని పెట్టుకున్నడు, మరి మాదిగా అని పిలిస్తే, తప్పు అంటాడు. ఇంతకీ తనను మాదిగా అని పిలవాలా వద్దా?
    తనే తన కులాన్ని తక్కువ చేస్తున్నాడు అని అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  10. ఇదొక రాజకీయ నాటకం అని అందరూ అంగీకరుస్తున్నారు. దీని తెరవెనుక ఉండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, తన సొంత అజెండాతో ఇవి చేయిస్తున్నాడన్నది జగమెరిగిన సత్యం.దీనిలో ఒక పావుగా మాత్రమే మిగిలిన మందకృష్ణ మాదిగ నాయకత్వం యొక్క ఔచిత్యం, ఎప్పుడో ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు జరిగిన పరిణామాలు దానికి పరాకాష్ట మాత్రమే.

    చట్టాన్ని కృష్ణ వక్రీకరించి భాష్యం చెబితే,చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేసిందేమిటి? ఇక్కడ తప్పు ఇద్దరిదీ అయినా, పూర్తి బాధ్యతమాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానిదే.

    ఇప్పటి వరకూ ఏ నాయకత్వం లేని మాదిగలు మందకృష్ణలో ఒక ఆశని చూశారు. ఇప్పుడు తన తలతిక్క వేషాలు చూసిన తర్వాత, మరో alternative ని వెతుక్కుంటారని నా నమ్మకం.


    ఇక ఈ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని దళితులు పేట్రేగి పోతారు అన్న అంచనా, చాలా లోపభూయిష్టమైనది.ఎవరో ఒకరు చట్టాన్ని కక్షసాధింపుకు వాడుకున్నారని పూర్తి చట్టమే తప్పు అన్న ప్రాతిపదిక కూడా పునరాలోచింపదగ్గదే. ఒక మహిళ అత్తమామలపై, అబద్దపు కట్నం కేసు పెట్టిందని, Dowry act ను పక్కకి తప్పిద్దామా? ఒక అమ్మాయి తప్పుడు రేప్ కేసు బనాయించిందని,women atrocities act ని మార్చేద్దామా? లేక ఈ సాకుతో అందరు మహిళలూ పేట్రేగిపోతారని ఒక నిర్ణయానికొద్దామా?

    మన ఆవేశాల్ని కాస్త అదుపులో పెట్టుకుని ఆలోచిద్దాం! ఈ రాజకీయ, సామాజిక, చట్ట సంక్షోభం నుండీ కొంత నేర్చుకుని ఒక మెరుగైన సమాజంకోసం గొంతు కలుపుదాం!

    రిప్లయితొలగించండి
  11. కత్తి మహేశ్ కుమార్: మీరన్న దానితో ఏకీభవిస్తున్నాను. యుక్తాయుక్త వివేచన లేకుండా ఆ చట్టాన్ని వాడిన ప్రభుత్వానిదే తప్పు!

    అత్యాచార నిరోధక చట్టంలో మరొక అంశాన్ని చేరుస్తూ ఆ చట్టాన్ని మరింత అర్థవంతంగా చెయ్యాలి - ఒక వ్యక్తిని కులం పేరుపెట్టి (అది ఏ కులమైనా) విమర్శిస్తే, విమర్శించినవారిని - వారిది ఏ కులమైనా సరే - శిక్షార్హులను చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
  12. Andhra Jyoti is not so blameless.The newspaper seems to believe that there are no limits to the freedom of the press.And of late it has been recklessly publishing all kinds of baseless and senational "news " apparently to boost its circulation.The target is not Dr.Rajasekhara Reddi alone.Just consioder the series of reports it is publishing attacking and denigrating America where people are allegedly starving and crying "annamo Ramachandra! ".This kind of cheap rubbish only debases the paper and makes it vulnerable to attacks.Kuldip Nayar has given the right advice to Andhra Jyoti.If they have a fight with Rajasekhara Reddi they should leave the paper and join politics.It is the same with Krishna Madiga.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు