4, నవంబర్ 2011, శుక్రవారం

సీబీఐ ని విచారించిన జగన్ !

ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు.

’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ, ఫలానా జీవో ప్రకారం ఆ భూములను ధారాదత్తం చేసారనీ అంచేత చంద్రబాబును కూడా విచారించాలనీ సీబీఐకి చెప్పాను’, అని పత్రికల వాళ్ళకు చెప్పాడు. ఆ జీవో కాపీలను కూడా పత్రికల వాళ్లకు ప్రదర్శించాడు.  ఇకనైనా చంద్రబాబును గుడ్డిగా సమర్ధించే ఎల్లో పత్రికలు బుద్ధి తెచ్చుకుని నిజాలు రాస్తారని ఆశిస్తున్నాను. అని కూడా అన్నాడు.

అక్కడికి, తన ఎల్లో పత్రిక అచ్చు నిజాలే రాస్తున్నట్టూ, తానేదో నిజాలు తప్ప మరోటి చెప్పని వాడైనట్టూ! సరే.. ఇతడూ, ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు చెప్పే ఈ చవకబారు మాటలు మనకు కొత్తేం కాదనుకోండి. (ఆ రాధాకృష్ణ ఈమధ్య ఇతణ్ణి ఎడాపెడా ఏకేస్తూ పరమ చవకబారు భాషలో రాసిన, చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి)..  అతడు చెప్పిన జీవో సంగతి చూద్దాం. నాకు తెలిసినంతలో అది కూడా కొత్త సంగతి కాదు. ఆ మధ్య ఆ జీవో సంగతి వార్తల కెక్కింది. దానిమీద వివిధ పార్టీలవాళ్ళు ఆరోపణలు చేసుకున్నారు కూడాను. మామూలు జనానిక్కూడా తెలిసిన సంగతి సీబీఐకి తెలవకుండా ఉంటదా!!!
 
చంద్రబాబునాయుడే ఓబులాపురం భూములను అప్పగించాడన్న సంగతి సీబీఐకి నేను చెప్పాను, బాబును పట్టుకుపొమ్మని కూడా చెప్పానన్న సంగతిని అతడు ఎలా చెప్పాడంటే.. సీబీఐ నన్ను విచారించడం కాదు, నేనే సీబీఐని విచారించాను అనే లెవెల్లో చెప్పాడు. అసలు లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలవదు. ఎవరూ చూళ్ళేదు. సీబీఐ యేమో ఎవరికీ చెప్పదు. ఇక జగను ఏం చెప్పినా చెల్లుద్ది. అయితే..

అసలు జగన్ను ’సాక్షిగా’ ఎందుకు పిలిపిస్తారు? సబిత’మ్మ’ను సాక్షిగా విచారించారంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో ఆమె గనుల మంత్రి కాబట్టి సాక్షిగా ఆమెకు తెలిసిన సంగతుల గురించి ఆరా తీయడానికి విచారించవచ్చు. కానీ గాలి మైనింగు వ్యవహారానికీ ఇతడికీ ఏ సక్రమ సంబంధముందని ఇతడిని సాక్షిగా పిలిపిస్తారు? సబితమ్మను విచారిస్తే, ’ఏం జరిగింది, నీకు తెలిసిన సంగతి చెప్పు’ అని అడుగుతారు. జగన్ను విచారిస్తే, ఏం జరిగిందని అడిగే ముందు అసలు నీకు గాలితో సంబంధం ’ఎందుకుంది’? అని అడుగుతారు. అంచేత నన్ను సాక్షిగా పిలిచారు అని చెప్పడం కేవలం చెప్పుకోవడం గానే కనిపిస్తోంది.

అసలింతకీ ప్రపంచానికంతటికీ తెలిసిన సంగతిని కొత్తగా తాను బైటపెట్టానని జగను చెప్పుకోవడమేంటీ? నాకైతే కింది కారణాలు కనిపిస్తున్నాయి..
  • ఓబులాపురం కేసులో అతణ్ణి విచారించడంతో అతడికి గాలితో అనుబంధం ఉందని వెల్లడైంది. గాలితో ఏ సంబంధమూ లేదని గతంలో చెప్పుకోబోయిన జగనుకు ఇది ఇబ్బందే. అదే సంగతిని పత్రికలు, టీవీలూ చెప్పడంతో దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని తనను సాక్షిగా మాత్రమే విచారించారని చెప్పుకున్నాడు. 
  • తన మీద పడిన చెడుగాలి ప్రభావాన్ని తాను ఎలాగూ తొలగించుకోలేడు. ప్రజల దృష్టిలో దాని తీవ్రతను తగ్గించుకోవడం అతడి తక్షణావసరం. అందుకు గాను, చంద్రబాబును కూడా ఇందులోకి లాగితే విషయం పలుచనౌతుంది.
  • తనను సమర్ధించుకోవాల్సిన తన పార్టీ నాయకులకు చంద్రబాబుపై చేసిన ఆరోపణ ఒక చక్కటి ఆయుధంగా పనికొస్తుంది. 
  • సీబీఐ చంద్రబాబును కూడా విచారిస్తే జగనుపై దృష్టి మరింత పలుచనౌతుంది. అసలు దొంగ చంద్రబాబే అని చెప్పొచ్చు కూడా. ఒకవేళ విచారించకపోతే.., ’సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది; అంటే దానర్థం కాంగ్రెసు, తెదేపాలు లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్నట్టే’ అని ఆరోపించొచ్చు.
జగను ఆరోపణల్లో నాకు కనిపిస్తున్నది ఇదే!

3 కామెంట్‌లు:

  1. I am not arguing with the matter

    but

    please keep up the analyzing style

    really good

    ?!

    http://endukoemo.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. తండ్రి అడుగుజాడల్లో నడిచే ముద్దులతనయుడు,జగన్ కు తెలిసిన విద్యలు రెండు.ఎదురుదాడి చేయడం,అబధ్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజం లాగా భ్రమ కలిగించడం.అతను చేస్తున్నదదే,ఇందులో కొత్త విషయం ఏముంది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు