28, జూన్ 2008, శనివారం

దేశం తలపట్టుకుంది

13 కామెంట్‌లు
నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. 'చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం' అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు.

26, జూన్ 2008, గురువారం

కండకావరం

12 కామెంట్‌లు
నిరసన ప్రదర్శనల్లో దిష్టిబొమ్మలకు చెప్పులదండ వెయ్యనిదెవ్వరు? చెప్పుదెబ్బలు కొట్టనిదెవ్వరు? తగలబెట్టనిదెవ్వరు? నోటికొచ్చినట్టు బూతులు తిట్టనిదెవ్వరు?

శవయాత్ర నిర్వహించి, శాస్త్రోక్తంగా దహనకాండ జరిపించడం కూడా చూసామే!

మనకిది చాలా సహజమైపోయింది. సమాజంలో సర్వ సాధారణమైపోయిన వికృత చర్యలివి. ఆంధ్రజ్యోతి పాత్రికేయులు తమపై జరిగిన దాడికి నిరసనగా దాడి జరిపించిన నేత దిష్టిబొమ్మను తగలపెట్టారు. దళితులపై జరిగే అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని ఉపయోగించాల్సినంతటి నేరమట అది. అసలా దాడి చేయించిన వారిపై, దాడులు మళ్ళీ చేస్తాం అని బహిరంగంగా చెప్పిన, చెబుతున్న హింసోన్మాదులపై చర్యలేవీ?

సంఘటనలో పాత్రధారులైన ఈ ఇద్దరిలో ఒకరేమో ఆ రెండు పత్రికల్లో ఒకటి -అంచేత తప్పు వాళ్ళదే -మరో ఆలోచన లేదు. కాబట్టి చర్యలు వాళ్ళ మీదే! దళితులపై అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన చట్టాన్ని, వేరొకరిపై అత్యాచారం చేసేందుకు ఉపయోగించింది ప్రభుత్వం. తననెదిరించినవాడిని వేటాడేందుకు ఎంతకైనా తెగించగలనని మరోసారి నిరూపించాడు ముఠాకోరు.

"తప్పుల మీద తప్పులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఓవర్‌టైము పని చేస్తోంద"ని ఎల్‌కే అద్వానీ కేంద్రప్రభుత్వం గురించి అన్నాడు అప్పుడెప్పుడో. ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయనే ఆత్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రింబవళ్ళు పనిచేసి మరీ తాను చెయ్యదలచిన తప్పుడు పనులను చేసేస్తోంది. ఎన్నికల తరవాత ఇలాంటి అవకాశం రాదని కాబోలు!

23, జూన్ 2008, సోమవారం

తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది

17 కామెంట్‌లు
దేవేందర్ గౌడ్ రాజీనామా చేసాడు. తెలుగుదేశానికి దెబ్బ తగిలినట్టే! (దీన్ని పార్టీ చీలిక అనొచ్చా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో తెలియవచ్చు) అయితే, అంతకంటే పెద్ద దెబ్బ తెరాసకు తగలొచ్చు.

ఇక గౌడ్ ఏంచేస్తాడు? ఏదైనా పార్టీలో చేరొచ్చు. లేదా తానే ఒక పార్టీని పెట్టొచ్చు.

ఏ విధంగా చూసినా గౌడ్ తెరాసతో చేరే ప్రసక్తి లేదు. కేసీయారు నియంతృత్వం సంగతి తెలిసీ గౌడ్ ఆయనతో చేతులు కలపడు. ఇప్పటికే కేసీయారు కాస్త నీరసపడ్డాడు. తెరాస ప్రభ తగ్గింది. ప్రజల్లో కేసీయారు పట్ల వ్యతిరేకత మొన్న బయటపడింది. వేరే ఏదైనా పార్టీలో చేరతాడేమోగానీ.. తెరాసలో మాత్రం చేరడు. అందులో చేరి కోపైలట్‌గా ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు. రాజకీయంగా, వ్యక్తిగత ప్రతిష్ట పరంగా కేసీయారు కంటే గౌడ్ బలవంతుడు. పైగా కులవంతుడు కూడాను -బీసీ నాయకుడిగా ఆయన మంచి స్థానంలో ఉన్నాడు. తెరాసపై ప్రజలకున్న అసంతృప్తి గౌడ్‌కు బాగా లాభిస్తుంది. కాంగ్రెసు, బీజేపీలతో చేరడు.పుట్టబోయే పార్టీలో చేరే అవకాశమూ తక్కువేననిపిస్తోంది. కాంగ్రెసు, తెరాస అసమ్మతివాదులకు గౌడ్ పార్టీ ఆశ్రయమివ్వవచ్చు. ఆ విధంగా కాంగ్రెసుకూ దెబ్బే!

ఇవన్నీ కాకపోతే తానే స్వంతంగా పార్టీ పెట్టొచ్చు -(తెలంగాణా దేశం?). ఏదేమైనా ఇక తెలంగాణా అంశాన్ని గౌడ్ ప్రభావితం చేస్తాడు. తెరాసది ఇక రెండో స్థానమే! తెలంగాణాకు అనుకూలంగా ఏర్పడిన మంచి పరిణామం ఇది.

17, జూన్ 2008, మంగళవారం

లోకలు వార్మింగు

22 కామెంట్‌లు
కొత్తపాళీ గారు అదిలించడంతో గ్లోబలు వార్మింగు పట్ల నేనూ కాస్త హడావుడి పడదామని త్వరపడ్డాను. నిజం చెప్పొద్దూ.. ఈ దీపాలార్పడంలో (ప్రతిపదార్థంలోనే తీసుకోండి సుమా!) నాకంత నమ్మకం లేదండీ. కానీ ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిసాక, ఇలా అవగాహన కలిగించడం కోసం నేనూ ఏదైనా చెయ్యాలని తలపోసాను. పోసాక, ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాను. కున్నాక, పని మొదలెట్టాను. ఇక్కడో ముక్క చెప్పాలి:

13, జూన్ 2008, శుక్రవారం

దశావతారం

11 కామెంట్‌లు
ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? "పది అవతారం" !!!

8, జూన్ 2008, ఆదివారం

మేటి దివిటీలు - 2

8 కామెంట్‌లు
బాపు
బామ్మ (బాపు బొమ్మ) గురించి తెలీని తెలుగువారుండరు. మన మేటి చిత్రకారుడు బాపు. మన మేటి సినిమా దర్శకుడు బాపు. మేటి కార్టూనిస్టు బాపు. మేటి రామభక్తుడు బాపు. మేటి దివిటీల్లో బాపు ఒకడు.

స్నేహానికి మేటి ప్రతీకల్లో బాపు ఒకడు. బాపు, రమణల స్నేహం జగద్విదితం. వీరిద్దరి స్నేహాన్ని పురస్కరించుకుని వీరిని ద్వంద్వ సమాసమని ప్రేమగా పిలుచుకుంటాం. ఆ
ద్వంద్వ సమాసాన్ని ఇక్కడ విడదీసిన పాపం నాదే! బాపు తన సినిమాలకు గాను అనేక మంది సాంకేతికులతో కలిసి పనిచేసాడట. ఒక్క మాటలు కుట్టే పనికి మాత్రం రమణను తప్పించుకోలేకపోయాడు. "ఆ సంకెళ్ళకూ జై" అంటూ స్వయంగా ముళ్ళపూడి వెంకట రమణ చెప్పిన మాటే అది. రచనలోని గొప్పదనాన్ని తన బొమ్మలతో బాపు మింగేస్తాడని రావిశాస్త్రి వాపోయాడట.

బాపు బొమ్మల గురించి చెప్పిన మాటల్లో చిరస్మరణీయమైనది మరొకటుంది..
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో పద్యాభిషేకం చేసాడు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఆ చేతిరాత ఒక ఫాంటై అలరిస్తోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆ మేటి దివిటీకి నా హారతి..
బాపు గీసిన బొమ్మ
చూసినంతనె బ్రహ్మ
కండ్ల మెరిసెను చెమ్మ
తెలుగు బిడ్డా!
ఎనిమిది కళ్ళు చెమ్మగిల్లిన కారణం..
మహిమలున్నను చెంత
మలచలేనని సుంత
ఈర్ష్య తోడను కొంత
ఓ తెలుగు బిడ్డా!
ఈర్ష్యతోనట! కానీ ఆ కారణం కొంతే.. మరి మిగతా కారణమేంటో...
అం..త బాపును కూడ
తానె చేసినవాడ
ననెడి గర్వము తోడ
తెలుగు బిడ్డా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఆ మహానుభావుడికి, ఆ సత్తిరాజు లక్ష్మీనారాయణకు, ఆ బాపుకు పద్మ పురస్కారాన్ని ప్రదానం చేసే అవకాశాన్ని, తద్వారా తమ్ము తాము గౌరవించుకునే అవకాశాన్నీ పొందలేని అజ్ఞానులపై నాకు సానుభూతి కలుగుతోంది.

ప్రజల గుండెల్లో పటం కట్టుకుని ఉన్నవాడికి ఏ పురస్కారాలూ అవసరం లేదులే!

సంబంధిత టపాలు