26, ఫిబ్రవరి 2007, సోమవారం

దొంగ సాధ్వులు, సాధువులు

4 కామెంట్‌లు
అవీ-ఇవీ లో సిగ్గు! సిగ్గు!! జాబుకు నా స్పందన ఇది. తమకు మాయలున్నాయనీ, మంత్రాలున్నాయని, మహిమలున్నాయని, దేవుణ్ణో, దేవతననో చెప్పుకునే సాధ్వీమణులు, సాధువులు ఎక్కువైపోయారు. ఆధ్యాత్మికతను వ్యాపారం చేసేసిన క్షుద్రదేవుళ్ళు, దేవతలు వీళ్ళు. తమ ప్రభను, లేని ప్రతిభను వ్యాప్తి చేసుకోవడం కోసం పత్రికల్లోను, టీవీల్లోనూ అడ్వర్టైజుమెంట్లు ఇస్తూ ఉన్నారు కూడాను. వ్యాపారాభివృద్ధికి ప్రకటనలు ఓ ముఖ్యమార్గం కదా! ఇలాంటి దొంగ సన్నాసుల కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తిన జల్లుకునే వారున్నంత కాలం అమ్మలూ బాబాలు విరాజిల్లుతూనే ఉంటారు. ఇలాగ జాతి గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే తెలివితక్కువ పనులు చేస్తూనే ఉంటారు. తమ మానాభిమానాలను ఎవరి కాళ్ళ దగ్గరైనా పరవొచ్చు, కాళ్ళ కిందైనా పరచొచ్చు.. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ జాతి గౌరవ చిహ్నాలను ఇలా కించపరుస్తారా?

చాలా సందర్భాల్లో ప్రజల అమాయకత్వమే దొంగ సాధువులను నమ్మేందుకు కారణం. నమ్మకమే దీనికి పునాది. ఆ మాయలు, మహిమలూ లేవని తేలితే ఇలాంటివి జరగవు. దానికో మార్గముంది. మాయలూ మంత్రాలు వచ్చని చెప్పుకునే వారిని వాటిని నిరూపించమనాలి. అలా నిరూపించిన వాళ్ళకు ఆ మహిమలను ప్రాక్టీసు చేసుకునే లైసెన్సులు ఇవ్వాలి. ఎంబీబియ్యెస్ ప్యాసైన వాళ్ళకు సర్టిఫికేటు ఇచ్చి, ప్రాక్టీసుకు అనుమతి పత్రం ఇచ్చినట్టుగానన్నమాట. ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోవచ్చు. అలాంటపుడు మరో మార్గముంది..

ఈ దొంగ సాధ్వులను, సాధువులను గుంజక్కట్టేసి, చర్నాకోలతో.. "నాకు మాయలూ, మంత్రాలేమీ తెలీదు బాబోయ్, నేనో దొంగను" అనే దాకా, "ఈ గుబురు జుట్టు తీసేసి, గుండు చేయించుకుంటాను" అని అనేదాకా.. "మహిమలున్నాయన్నావు కదా, ఏదీ నిన్ను నీవు రక్షించుకో" అంటూ..

25, ఫిబ్రవరి 2007, ఆదివారం

మండలి ఎన్నికల కథా కమామీషు

5 కామెంట్‌లు
మరో నెలలో శాసనమండలి ఏర్పడబోతోంది. మండలి చదువుకున్నవారి కోసం. శాసనసభలాగా కాకుండా, సమాజంలోని కొన్ని ప్రత్యేక వర్గాలకు కేటాయింపులున్నాయిక్కడ . పట్టభద్రులకు, పంతుళ్ళకు, స్థానిక సంస్థలకు, శాసనసభకు కొన్ని స్థానాలను ప్రత్యేకించారు. ఇవికాక, గవర్నరు నామినేటు చేసేవి కొన్నుంటాయి. మన మండలిలో మొత్తం స్థానాలు 90 కాగా,

  • పట్టభద్రులకు 8 స్థానాలు,
  • పంతుళ్ళకు 8,
  • స్థానిక సంస్థల ప్రతినిధులకు 31,
  • శాసనసభ్యుల ప్రతినిధులకు 31
కేటాయించారు. ఈ నాలుగు వర్గాలకు చెందిన స్థానాలకు సభ్యులను ఆయా వర్గాలకు చెందిన వోటర్లే ఎన్నుకుంటారు. అంటే, మండలి సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేకించినదన్నమాట. అంచేత మామూలుగా అమలయ్యే రిజర్వేషన్లు ఇక్కడ అమలు చెయ్యరు. మండలిలోని మిగిలిన 12 స్థానాలకు సభ్యులను గవర్నరు ఎంపిక (నామినేటు) చేస్తారు.

శాసనమండలి సభ్యుల కాలపరిమితి ఆరేళ్ళు. అయితే ఆరేళ్ళకోసారి సభ్యులందరి పదవీకాలం ముగిసి సభ రద్దైపోయి (శాసనసభలాగా) ఎన్నికలు జరిగి కొత్త సభ ఏర్పడడం లాంటి పద్ధతి లేదిక్కడ. ఉన్న సభ్యుల్లో మూడోవంతు మంది రెండేళ్ళకో సారి రిటైరౌతారు. వారి స్థానాల్లో కొత్తవారిని ఎన్నుకుంటారు. అంచేత మండలి ఎన్నటికీ రద్దైపోదు, రామారావు చేసినట్లు శాశ్వతంగా రద్దు చేస్తే తప్ప.

అంతా బాగానే ఉంది.. మరి, ఇప్పుడు ఎన్నిక /ఎంపిక కాబోయే 90 మందీ కూడా ఒక్కసారే పదవి లోకి వస్తున్నారు కదా, మొదటి రెండేళ్ళకు, రెండో రెండేళ్ళకు విరమణ చేసేదెవరు? దాని కోసం లాటరీ తీస్తారట, మొదటి గుంపులో ఇంటికెళ్ళేదెవరు, రెండో బాచ్చిలోని వారెవరు, పూర్తి కాలం ఉండేదెవరు అనేది లాటరీ వేసి తేలుస్తారన్నమాట.

మిగతా ఎన్నికల లాగా ఈ ఎన్నికల బాలెటు కాగితాల్లో గుర్తులుండవు. వోట్లెసే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా! వోటెయ్యడమంటే ముద్ర గుద్దడం కాదు, మనకు నచ్చిన వారి పేరు పక్కన 1 అని అంకె వెయ్యాలి. మీకు ఒకడి కంటే ఎక్కువ మంది నచ్చారనుకోండి, మిగతా ఎన్నికలలో మనకా అవకాశం లేకున్నా, ఇక్కడ ఒకడి కంటే ఎక్కువ మందికి వోటేసే అవకాశం ఉంది. మీకు నచ్చిన వాళ్ళకు ర్యాంకులిచ్చుకుంటూ పోవచ్చు. ఒక ర్యాంకు ఒక్కడికే ఇవ్వాలి సుమా! అలాగే ఒక్కరికి ఒక ర్యాంకే ఇవ్వాలి. వోటేసేటప్పుడు ఏం చెయ్యొచ్చో, ఏమేం చెయ్యకూడదో ఇక్కడ చూడొచ్చు.

అన్నట్టు మండలి ఎన్నికల్లో వోట్ల లెక్కింపు విభిన్నంగా ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో సమీప అభ్యర్థి కంటే ఒక్క వోటు ఎక్కువ వచ్చినా గెలిచినట్లే. కానీ మండలి ఎన్నికల్లో కనీసం సగం వోట్ల కంటే ఒకటి ఎక్కువ వస్తేనే గెలిచినట్లు. అలా ఎవరికీ రాకపోతే..? లేదులెండి, ఆ భయమక్కరలేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టరు గానీ, మళ్ళీ లెక్కిస్తారు. ఈసారి అతి తక్కువ వోట్లు వచ్చినవారిని లెక్కింపులోంచి తొలగించి వారి వోట్లను మిగతావారికి బదిలీ చేస్తారు. ఈ లెక్కింపు వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ పీడీఎఫ్ ను చూడండి.

---------------------------

మండలి ఎన్నికల్లో నాకు తెలిసిన ఇద్దరు అభ్యర్థుల గురించి ఇక్కడ రాయాలి. వీళ్ళిద్దరూ "హైదరాబాదు, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగరు" నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇద్దరూ పట్టభద్రుల వర్గం తరపున పోటీలో ఉన్నారు. ఒకరు కె.నాగేశ్వర్, మరొకరు లక్ష్మయ్య. వీరిద్దరూ నాకు పరిచయస్తులు గాని, చుట్టాలు గానీ కాదు. కేవలం టీవీలోను, పేపర్ల ద్వారాను నాకు తెలిసింది ఇక్కడ రాస్తున్నాను. ముందు "మరొకరు" గురించి చెప్పి, ఆ తరువాత "ఒకరు" గురించి రాస్తాను.

లక్ష్మయ్యకు రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ శాఖలో ఉద్యోగం - ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఉండొచ్చు బహుశా. ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కూడా. సుమారు ఓ యేడాది కిందట టీవీలో మాట్లాడుతూ ఉద్యోగులు లంచం తీసుకోవడం తప్పు కాదన్నట్లుగా మాట్లాడాడు. నా గత జాబుల్లో ఒకదానిలో దాని గురించి రాసాను కూడా. అప్పుడు నాకీ వ్యక్తి పేరు గుర్తు లేదు, ఇప్పుడు ఆయన ఫోటో చూడగానే గుర్తుకొచ్చాడు. ఇప్పుడు మండలికి వెళ్తాడట! సభలో ప్రశ్న అడిగేందుకు లంచం తీసుకోడంలో తప్పు లేదంటాడేమో, ఒకవేళ గెలిస్తే.

ఇక కె.నాగేశ్వర్.. ఈయన ఉస్మానియాలో జర్నలిజం ప్రొఫెసరు. ప్రస్తుతం ప్రతి శనివారం ఈనాడు ప్రతిభలో రాస్తూ ఉంటాడు. ఒకప్పుడు టీవీల్లో పొద్దుట పూట వార్తల విశ్లేషణలో దాదాపు రోజూ కనిపించేవాడు. ఆయన విశ్లేషణ చూస్తూ, అసలీయనకు తెలీని విషయమే లేనట్లుందే అని అనుకునేవాణ్ణి. గణాంకాలు పంటి కిందే ఉండేవి. విశ్లేషణ కూడా నిష్పాక్షికంగా ఉండేది. ఈసారి మన వోట్లు సద్వినియోగం చేసుకోవచ్చు లాగుంది.

మండలి ఎన్నికల్లో నాకు వోటుంది. మరి, మీకో? మీకు వోటుందో లేదో తెలుసుకునేందుకు ఎన్నికల అధికారి వెబ్ సైటులోని ఈ లింకుకు వెళ్ళండి.

20, ఫిబ్రవరి 2007, మంగళవారం

తప్పటడుగులు

17 కామెంట్‌లు
చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా!

5, ఫిబ్రవరి 2007, సోమవారం

సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు - రాజకీయులు

6 కామెంట్‌లు
రాజకీయుల పేకాట, ప్రజల జీవితాలతో చెలగాటం. ఒక దృష్టాంతమిది.
















పై ఫోటోలు రెంటినీ ఈనాడు నుండి సేకరించాను.
మొదటి దాన్లో ఏం జరుగుతుందో చూసారుగా. పేకాటాడుతున్నారు ఈ నేతలు -నడిరోడ్డున ! వాహనాలేమీ కదలనీయకుండా దిగ్బంధనం చేసారు. ఈనాడులో వార్త చూడండి.
ఇక రెండో ఫోటో: అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్ళే తొందర్లో ఉన్న వీరిని పై రకం రాజకీయులు, వారి అంతేవాసులు అడ్డుకుంటే.. నిస్సహాయంగా విలపిస్తున్న దృశ్యం! ఈనాడులో వార్త .

ఇలా రోడ్డును ఆక్రమించి ప్రజల్ని కదలా మెదలనీయక చేసే సైంధవులు ఎక్కువైపోయారీ రోజుల్లో. రాజకీయులు ప్రజలను హింసించడం బాగా పెరిగిపోయింది. ప్రశాంత వాతావరణం లేకుండా చేస్తున్నారు. ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వలేదని, ఎదటి వాడికి ఇచ్చారని ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న అల్లరి చూస్తూనే ఉన్నాం. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెంప మీద లాగి ఒక్కటిచ్చాడట ఒకడు (భలే, భలే!!).

ఆ మధ్య శంషాబాదు లోని ఒక స్థలాన్ని అమ్మమంటూ ఆ స్థలం యజమానిని బెదిరించి కిడ్నాపు చెయ్యబూనిన ఒక ఎమ్మెల్యే నిర్వాకాన్ని టీవీలో చూసాం. కానీ ఆ తర్వాత ఇక ఆ సంఘటన ప్రస్తావనే రాలేదంటే దానికి కారణం అర్థం చేసుకోలేనంత పిల్లకాయలమేం కాదు మనం.

గతంలో ఓ అధికారిని చెంప మీద కొట్టిన కేసులో వేణుగోపాలాచారికి కోర్టు శిక్ష కూడ విధించింది, ఈ మధ్య.

తెలంగాణా అంశంపై హద్దులు మీరి మాట్లాడ్డం అందరికీ పరిపాటి అయిపోయింది. లగడపాటి రాజగోపాల్, సర్వే సత్యనారాయణలు తిట్టుకోడం చూసాం. హైదరాబాదులో తిరగలేవని ఒకరంటే, ఏంచేస్తావో చూస్తానని మరొకరు. చివరికి అది తోపులాట దాకా పోతే.., రాజగోపాలు రోడ్డు మీద కూచ్చుని ట్రాఫిక్కును అడ్డగించాడు. తిట్టుకునేది వీళ్ళు, కష్టాలు మాత్రం మనకు!!

రాయలసీమకు వస్తే తిరిగిపోవని పీజేయార్ ను ఆయన పార్టీ నాయకులే బెదిరించడం విన్నాం.

మెదక్ లోనే ఐఐటీ పెట్టాలంటూ నిరాహారదీక్ష చేసిన తెరాస అసమ్మతి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. "తెరాస నాయకత్వానికి దమ్ముంటే బాసరలోనే ఐఐటీ పెట్టాలన్న మాటను ఇక్కడి కొచ్చి చెప్పమనండి" అంటూ సవాలు చేసాడు. అలా చెబితే బహుశా తన అనుయాయుల చేత కొట్టించేవాడు కామోసు!

నాలుగైదు రోజుల కిందట విజయనగరం జిల్లాపరిషత్తు సమావేశంలో అధ్యక్ష స్థానం పైకి మంచి నీళ్ళ సీసాను విసిరేసిన కళావెంకటరావు ఫోటోను యాక్షను సహితంగా ఈనాడులో చూసాం. (ఆయన గారి మనవడో మనవరాలో "అదేంటి తాతా, అది తప్పు కదా?" అని అడిగుంటే ఏమని సమాధానం చెప్పేవాడో మరి!!?)

ఈ రాజకీయుల వలన మనకు ప్రయోజనమేమో గానీ, నష్టాలు మాత్రం బోలెడున్నాయి. మనుషులను, మనసులను విడగొట్టడంలో ముత్యాలముగ్గు రావుగోపాలరావు వీళ్ళకు చాలడు. బూతులు తిట్టుకోడం, చట్టసభల్లో తిట్టుకోడాలు, కొట్టుకోడాలు.. ఇవన్నీ చూస్తే శిశుపాలుడు కూడా వీళ్ళ ముందు బలాదూరే అని అనిపిస్తుంది! మనం వీళ్ళ తప్పులను ఎన్నిటిని క్షమించాలో!?

(రాజకీయుల దుష్ప్రవర్తనలపై గతంలో నే రాసిన జాబు - ఏమిటీ ధోరణి కూడా చూడండి.)

4, ఫిబ్రవరి 2007, ఆదివారం

మానవత!

5 కామెంట్‌లు
ముక్కు పెరిగిపోయిన బాలుడి గురించి ఈనాడులో చదివి మనసు చివుక్కుమంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, అన్ని ఖర్చులూ భరించి వైద్యం చేయించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వపు మానవీయ కోణమిది.

ఈనాడులో ఇస్కాన్ వారి అక్షయపాత్ర కార్యక్రమం గురించి చదివాను. ఎంతో సంతోషం కలిగింది. చాలా ఉదాత్తమైన కార్యక్రమం. ఇస్కాన్ నిర్వహిస్తున్న బృహత్తర యజ్ఞమిది.

రాష్ట్ర ప్రభుత్వానికీ, ఇస్కాన్ కూ అభినందనలు!

సంబంధిత టపాలు