21, జులై 2006, శుక్రవారం

నెట్లో తెలుగు వ్యాప్తి

3 కామెంట్‌లు
నెట్లో తెలుగు వ్యాప్తికై మనమేం చెయ్యాలి.

ఈ విషయం పాతదే! నెట్లోనూ, నోట్లోను కూడా బాగా నానింది. బ్లాగరుల సమావేశాల్లో ఈ విషయం అనేక సార్లు చర్చకు వచ్చింది. అనేక సూచనలొచ్చాయి. ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు గాను కింద నే రాసిన ఆరు మార్గాలు కొత్తవేం కాదు. గతంలో ఎందరో చెప్పినవే! మరోసారి బ్లాగరులు జూలై 23న హై.లో కలుస్తున్న వేళ.. చర్విత చర్వణమిది.

18, జులై 2006, మంగళవారం

ఏమిటీ తెలివితక్కువతనం!

0 కామెంట్‌లు
కేంద్ర ప్రభుత్వం బ్లాగ్‌స్పాటులోని 22 వెబ్‌సైట్లనో, 22 పేజీల వెబ్‌సైట్ల జాబితానో నిరోధించిందట! అయ్యెస్పీలేమో మొత్తం బ్లాగ్‌స్పాటుకే స్పాటు పెట్టారు.

అయినా ఇదేం చపలత్వం. ఆ సైట్లలో ఉన్న సమాచారం జనానికి చేరకూడదనుకుంటే ఇదా దానికి మార్గం? ఇప్పుడు ఆ వెబ్‌సైట్లేంటొ వెతుక్కుని మరీ చూస్తాం కదా! వాటికి లేనిపోని ప్రచారం కల్పించినట్లే కదా! ఇప్పుడేమయింది? ప్రపంచంలో మనం తప్ప అందరూ ఆ సైట్లను చూస్తారు. ఆ తప్పుడురాతలను (ఒకవేళ అవి తప్పుడు రాతలైతే) చదువుతారు. చదివి ఓహో అలాగా అనుకుంటారు. మనం చదివితే వాటిని సమర్ధవంతంగా ఖండించవచ్చు. చదివే అవకాశమే లేకుండా చేస్తిరి! మరి ఆ రాతలను ఖండించేదెవరు? మనం చదవకపోతే మనకే కదా నష్టం.

ఇదంతా ఒక ఎత్తు. ఇక ఇప్పుడు ప్రపంచంలోని ప్రతీ అణాకాణీ వెధవా మనకు సలహాలు ఇవ్వడం మొదలెడతాడు... "భారత్‌లో ఆలోచించే హక్కు లేదు, మాట్లాడే హక్కూ, రాసే హక్కూ లేవు, మెదళ్ళకు తాళాలేస్తున్నారు" అంటూ. మనల్ని మనం ఎన్నైనా తిట్టుకోవచ్చు, పైవాడికి ఆ అవకాశమిస్తే ఎట్లా?

(నాకో అనుమానం.. అధిష్ఠాన దేవుళ్ళు, దేవతల గురించి నిజాలు రాసిన సైట్లు గానీ కావుగదా ఇవి!)

17, జులై 2006, సోమవారం

దుర్వార్తలు, దుష్టులు, దుష్కీర్తి, ఆశావహ ధోరణి

0 కామెంట్‌లు
ఇన్ని దుర్వార్తలు ఇంత తక్కువ సమయంలో ఈ మధ్యకాలంలో వినలేదనుకుంటాను.

అగ్ని-3, జీఎస్సెల్వీ ల వైఫల్యాలు.: ఇవి వైఫల్యాలేనా!? కానే కాదు. అద్దరి చేరాలంటే బోలెడు అవాంతరాలు.. సుడులుంటాయి, ముడులుంటాయి, వాలుగా వెళ్ళడమే కాదు, ఎదురీదాలి కూడాను. గమ్యం మీద దృష్టి ఉన్నవాడికి, గమ్యం ఎలా చేరాలో తెలిసినవాడికి ఇవి వైఫల్యాలు కావు, పాఠాలే. నిచ్చెన మెట్లే! ఎడిసను బల్బు కనిపెట్టే ముందు 2 వేల సార్లు విఫలమయ్యాడట. 'వైఫల్యాలా? ఎవరామాటన్నది? బల్బును కనిపెట్టే ప్రక్రియలో 2000 మెట్లున్నాయి, అంతే!' అన్నాడట! అగ్నీ, జీఎస్సెల్వీలు నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యం చేరే రోజు ఎంతో దూరంలో లేదు. అవి సమర్ధుల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి దిగులేం పడనక్ల్కరలేదు.

కానీ మన ఎన్నికల ప్రహసనాలు, రాజకీయుల పిల్లిగంతులూ, పిల్లచేష్టలు, చేతివాటాలూ చూస్తూ దిగులు పడకుండా ఉండగలమా!?

ఎన్నికల కాలుష్యంలో మరింత మురికి: నిన్న తెదే టిక్కెట్టుపై ఎన్నికయ్యారు, ఇవ్వాళ కాంగ్రెసుతో చెయ్యి కలిపారు. జిల్లాను బాగు చేసే సత్తా కాంగ్రెసుకే ఉంది.., అంచేతే రంగు మార్చాం అని మంత్రి రఘువీraaరెడ్డికి చెప్పారట, ఆయనకి ఎంతో సంతోషం వేసిందట! అనంతపురం జెడ్పీ ఎన్నికలో జరిగిన నాటకమిది. మంత్రులే పాత్రధారులీ నాటకంలో!

ఇక, వేలంపాటలు.. ఎక్కడెక్కడ ఎవెరెవరు ఎంతెంతకు పాట పాడుతున్నారనేది వివరంగా పేపర్లలో వస్తోంది. ఈ ఎన్నికలూ, వోటర్ల జాబితాలూ, వాటిలో అవకతవకలు, రిగ్గింగులు ఇవన్నీ అవసరమా అని ఆలోచించి మనవాళ్ళు భలే పద్ధతి కనిపెట్టారు. ఇక ఎన్నికల సంఘం అవసరమే ఉండదు. "ఈసీ గారూ! దేశంకోసమో, ప్రజాస్వామ్యం కోసమో కాకపోయినా, కనీసం ఈసీ అనేదాన్ని ఉంచడం కోసమన్నా ఈ దురాచారాన్ని నిర్మూలించండి."

రాజకీయ దిగజారుడులో కొత్త లోతులు: కేకే, నరేంద్రల కౌగిలింత ఫోటో చూసారా? ఎంతాశ్చర్యం! నిన్నటి దాకా బజార్లో బండబూతులు తిట్టుకుని ఇవ్వాళ వాటేసుకోవడం చూస్తుంటే వీళ్ళి చెప్పే దేన్నీ పట్టించుకోనక్కర్లేదని తెలుస్తోంది.

వెరపు లేని అవినీతి: అవినీతి మనకెంత మామూలైపోయిందంటే.. ఇదివరలో ఎవరినైనా అవినీతి పరుడనో, లంచగొండి అనో నిందిస్తే వెంటనే ఖండించేవారు. నానా యాగీ చేసేవారు. నిజమో అబద్ధమో తరువాతి సంగతి.. ముందా ఆరోపణను ఖండించి పారేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. మీరింత తిన్నారని ప్రతిపక్ష నాయకులంటే.. ఏ మీరు తినలేదా అని పాలకులంటున్నారు. అంతే కానీ ఖండించడం లేదు. పైపై కబుర్లలో కూడా మనల్ని లెక్క చేసే స్థాయిని దాటేసారన్నమాట.

ఆ మధ్య రెవిన్యూ అధికారుల సంఘ నాయకుడు ఒక పత్రికా సమావేశం పెట్టి ఇలా అన్నాడు.. మంత్రులూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలు పర్యటనకు వచ్చినపుడు వారికీ, వారి వెంట ఉండేవారికీ.. సౌకర్యాల ఏర్పాటుకు మాకు బోలెడన్ని ఖర్చులవుతాయి. అన్నీ మేమే చూసుకోవాలి. దాని గురించి మాకు ప్రభుత్వం డబ్బులివ్వదు. కాబట్టి మాకు లంచం తీసుకోక తప్పదు. (ఆ మనిషి పేరు నాకు గుర్తు లేదు కానీ మీసాలూ గట్రా.. మనిషి గుర్తున్నాడు.) ఎంత తెంపరితనమో చూడండి. (అయితే ఆయన చెప్పేదాన్లో కొంత నిజమూ లేకపోలేదు.. నాగార్జున సాగరు వెళ్ళిన మంత్రి షబ్బీరు, చేపల కూర వండలేదని కోప్పడ్డారట.. 'అంత పెద్ద చెరువు పెట్టుకుని కూడా చేపల కూర వండకపోతే ఎలా' అని!)

200 ఎకరాల భూమి - మనందరిదీ అది - ఓ అధికారి అప్పనంగా ఎవడికో రాసిచ్చేసాడు. పైగా కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నాడు. తనకిన్నాళ్ళు తిండి పెట్టిన ప్రజలకు చివరి వెన్నుపోటు పొడిచాడు, అది తెలుస్తూనే ఉంది. ఘోరమేమిటంటే.. తాను దళితుణ్ణి కాబట్టి తనపై నిందలు వేస్తున్నారు అని అంటున్నాడట. బురదలో దొర్లి, ఆ గబ్బును, కుళ్ళును కులగోత్రాల మాటున దాచాలని చూస్తున్నాడు! డబ్బులు తీసుకుని ఆటకు పోటు పొడిచిన అజరు భాయి కూడా ఇలాగే అన్నాడు అప్పట్లో.. 'నేను మైనారిటీ వాణ్ణని నాపై వివక్ష చూపించారు' అని.

మాటేసి, కాటేసిన టెర్రరిస్టులు: 200 మందిని పొట్టన బెట్టుకున్నారు. వాళ్ళను కిరాతకులనీ, ద్రోహులనీ తిట్లూ శాపనార్థాలూ పెడుతూ కూర్చుంటేనో, పక్కోడు టెర్రరిజాన్ని మనకు ఎగుమతి చేస్తున్నాడని వాపోతేనో పని జరగదు. మన దేశంలో వాళ్ళు యథేచ్ఛగా ఎలా తిరగ గలుగుతున్నారు? వారికి ఆశ్రయం ఎలా దొరుకుతోంది? బాంబులు పేల్చీ, బీభత్సం సృష్టించీ, వాళ్ళు హాయిగా దేశం వదలిపెట్టి ఎలా వెళ్ళగలుగుతున్నారు? (ముంబైలో బాంబులు పేలాక, విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు పోలీసులు. అయినా సరే, పేలుళ్ళ కారకుడొకడు విదేశాలకు పారిపోయాడట ఆ రాత్రి! ఇదెలా సాధ్యం!?)

పడగనీడన బతుకుతున్నాం, మనం. దాని బుస వినిపిస్తూనే ఉంది. మనం పోసే పాలు తాగుతూనే, పక్కవాడి పాంబుర్రకు తలడిస్తోంది. వాడికోసం మనల్ని మళ్ళీ మళ్ళీ కాటేస్తోంది. పాకిస్తానుతో చేతులుకలిపి, మనల్ని చంపే కుట్ర చేసే నజీరులు, వజీరులూ, ముజీబులు, ఔరంగజేబులు మన హైదరాబాదులోనే ఉన్నారట. ఔనుమరి, మనూరంత వీలు వాళ్ళకి మరెక్కడ దొరుకుతుంది? పోలీసులు కూడా వెళ్ళడానికి వెనకాడే స్థలాలున్నాయి వాళ్ళు దాక్కోడానికి, కాదు.. బహిరంగంగా తిరగడానికి. వాళ్ళే ఇబ్బందులు పడతారోనని మనం ప్రత్యేక సదుపాయాలు కూడా ఇస్తామాయె.

మన రాజకీయుల్లో ఉన్న దుష్టుల్నీ, దొగల్నీ, నేరస్తుల్నీ ఏరేస్తే మొదటిది తప్ప మిగతా దుర్వార్తలేవీ వినే అవసరం మనకుండదు. అనుకున్నా.. మీరామాట అంటారని.. "అలా అయితే మనకసలు రాజకీయులే మిగలరు కదా" అని అంటున్నారు, ఔనా? దానికి సమాధానం వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి వస్తుందేమో చూద్దాం.

5, జులై 2006, బుధవారం

విజేతలూ, విజితా!

1 కామెంట్‌లు
నిజానికి స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం సాధించిన సీట్లు పెద్ద చెప్పుకోదగ్గవి కావు. కాంగ్రెసు వాళ్ళు అంటున్నట్లుగా.. సంబరాలు చేసుకునేటంత గొప్ప ఫలితాలేమీ తెదేపాకు రాలేదు. కానీ సీట్లకు మించి, నైతిక స్థైర్యాన్ని దేశం సాధించింది. ఆత్మ విశ్వాసాన్ని తిరిగి పొందింది. అయితే దీనికోసం ప్రత్యేకించి ఆ పార్టీ ఏమీ చెయ్యలేదు. ఒక రకంగా ప్రజలే ఆ పార్టీని తట్టి లేపారు. కాంగ్రెసుకిది కలవరపాటు కలిగించేదే! ప్రాప్తకాలజ్ఞత ఉన్న కాంగ్రెసువారెవరైనా ఒకసారి పరిస్థితిని సమీక్షించవలసిన తరుణమిది.

కాంగ్రెసు చేసిన తప్పేంటి? స్వాతిశయము, అతివిశ్వాసం వలన కాంగ్రెసు దెబ్బతిందని కొందరన్నారు. కాని అది వాస్తవం కాకపోవచ్చేమో! తన బలాన్ని ఎక్కువ చేసి, ఎదరి బలాన్ని తూలనాడటం అనేది యుద్ధనీతి. అందులో తప్పులేదు. నిజానికి కాంగ్రెసు, ఓ లక్ష్యాన్ని జయప్రదంగా సాధించింది. తెదేపాను ఓడించడం బయటి లక్ష్యం కాగా, తెరాసను బలహీనపరచడం అనేది కాంగ్రెసు నాయకుడి సమాంతర లక్ష్యం. బహుశ అది ఊహించినదానికంటే బాగానే నెరవేరింది. ఎటొచ్చీ తెదే లాభపడింది. అయితే 65% స్థానాలు సాధించి కాంగ్రెసు పైచేయిగానే ఉంది.

చులాగ్గా కాంగ్రెసు కక్ష్య నుండి బయటపడి తెదేతో చెయ్యి కలిపిన సీపీఎం లాభపడినట్లే ఉంది. రాఘవులు గారి పొత్తులు చూస్తుంటే వాలెన్స్ ఎలెక్ట్రాన్లు గుర్తుకొస్తున్నాయి. ఏదేమైనా కొత్త స్నేహం ఎన్నాళ్ళు సాగుతుందో!? ఈ స్నేహం ప్రస్తుతానికే.. ముందు ముందు ఏమవుతుందో చెప్పలేమని ఇవ్వాళ చెప్పనే చెప్పారాయన!

సీపీఐ.. కాంగ్రెసుతో పొత్తుతో వీళ్ళూ లాభపడినట్లే! నల్గొండ జిల్లా పరిషత్తు తమకివ్వమని అడుగుతారట. సీపీఎంతోటీ, తెరాసతోటీ సంబంధాలు చెడిన నేపథ్యంలో కాంగ్రెసు వీరిని సంతోషపెట్టేందుకు గాను సరేననవచ్చేమో!

తెరాస -ఈ ఎన్నికల్లో అందరూ విజేతలే. ఒక్క తెరాస మాత్రమే విజిత. మేము అధర్మ విజితులమంటున్నారు వారు, ఓటమిపై భలే వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని చూద్దాం..
  1. ఎబ్బే.. మేమసలు ఈ ఎన్నికల్ని పట్టించుకోనే లేదు. అందుకే మా నాయకులు కనీసం ప్రచారం కూడా చెయ్యలేదు. ఇవెట్లా పోయినా మాకేం కాదు. మా లక్ష్యమల్లా తెలంగాణే! (అలాంటపుడు అసలు పోటీ చెయ్యడం ఎందుకో!)
  2. మేడమ్మీద మాకు విశ్వాసం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెసుతో చెయ్యి కలిపి మిత్రధర్మాన్ని పాటిస్తే తెలంగాణా ఇస్తుందని మా ఆశ. అందుకే మాకు తక్కువ సీట్లిచ్చినా మాట్లాడకుండా ఊరుకున్నాం. (ఇలా మాట్లాడితేనే చిరాకొచ్చి ప్రజలీ తీర్పునిచ్చారు!)
  3. మాకు ఇచ్చిన కాసిని సీట్లలో కూడా కాంగ్రెసు తిరుగుబాటుదారులు పోటీ చేసి మాకు వెన్నుపోటు పొడిచారు. అందుకే ఓడిపోయాం. (మరి అసలు పొత్తనేదే లేకుండా ఐదేళ్ళ కిందటి ఎన్నికల్లో 80 పైచిలుకు స్థానాలు గెలిచారు కదా, మరిప్పుడు 30 కూడా గెలవలేక పోయారెందుకో!)
  4. పై మూడిటినీ మించినది నరేంద్ర ఉవాచ.. తెదే బలం పుంజుకోవడం తెలంగాణ సాధన లక్ష్యానికి మంచిదేనట. తెదే బలపడుతోందనే బూచి చూపి సోనియాను బెదరగొట్టి తెలంగాణా సాధిస్తారట!
ఇక బీజేపీ -ఎన్నికలలో ఎంత దారుణమైన ఫలితం వచ్చినా ఏమాత్రం నష్టపోని పార్టీ ఇది. ఈసారి తెలంగాణా నినాదం పనిచెయ్యలేదు.. ఇకపై ఏంచేస్తారో చూడాలి.

3, జులై 2006, సోమవారం

లోక్‌సత్తా రాజకీయ ప్రణాళికలు

0 కామెంట్‌లు
లోక్‌సత్తా రాజకీయ పార్టీ స్థాపించనుంది. నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత కు సంబంధించిన వారి చర్చా పత్రాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ పత్రం చివర్లో ఉన్న కొన్ని వాక్యాలు..

-ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో,
-ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో,
-ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో,
-ఎక్కడైతే అసమర్థ పాలన, ప్రజల ఉదాసీనత రాజ్యమేలుతుందో,
-ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా కూడా పట్టించుకోకుండా తమకు కావల్సిన వాటా కోసం ప్రజలు అర్రులు చాస్తుంటారో

అక్కడ..

"వ్యవస్థకు సంబంధించిన పునస్సమీక్షకు సమయం ఆసన్నమైందని అర్థం"

అప్పుడు
తమ గురించి - తమకు సంబంధించిన వారి గురించి
తమ చుట్టూరా ఉన్నవారి గురించి - తమ కార్యకలాపాలకు సంబంధించి
అక్కడి పౌరులు అంతర్ముఖులు కావాలి

-క్లిట్‌గార్డ్, ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త.

సంబంధిత టపాలు